విద్యుత్తు రంగంలో స్వయం సమృద్ధి రాష్ర్టాభివృద్ధికి తోడ్పడుతున్నది. సమాజంలో అత్యంత బలహీన వర్గాలను ఆదుకునేందుకు రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, అమ్మ ఒడి (కేసీఆర్ కిట్), కల్యాణలక్ష్మి, కంటివెలుగు, వృద్ధాప్య పింఛన్లు, ధరణి పోర్టల్ వంటి ఎన్నో పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్నది. తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టిన దార్శనికుడు, పాలనాదక్షుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అరువై ఏండ్ల పాటు అభివృద్ధి కుంటుపడి తెలంగాణ అత్యంత దయనీయ స్థితిలో ఉండేది. సొంత రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి, పోరాడి తెలంగాణను సాధించిన వీరుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ఉద్యమకాలంలో తెలంగాణలోని ప్రతి గ్రామా న్ని సందర్శించి, అక్కడి ప్రజల జీవన విధానాలను, వాళ్ల ఆర్థిక స్థితిగతులను, అర్థం చేసుకొన్నారు. తెలంగాణ సాధన తర్వాత గ్రామీణ ప్రాంతాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించా రు. అప్పట్లో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు సరిగా ఉండకపోయేది. ఎప్పుడో అర్ధరాత్రి ఏ రెండు గంటలకో కరెంటు వచ్చేది. ఆ రాత్రి రైతులు పొలాల దగ్గరికి వెళ్లి మోటర్లు వేసి, పంటకు నీళ్లు పారించేవాళ్లు. వ్యవసాయాన్నే నమ్ముకొని బతికే రైతులు కరెంటు లేక చాలా ఇబ్బందులకు గురయ్యేవారు. సమైక్య పాలనలో మన నీరు, మన బొగ్గును ఇతర ప్రాంతాలకు తరలించి విద్యుత్తు ప్రాజెక్టులను నిర్మించారు. దీంతో తెలంగాణలో డిమాండ్కు తగ్గ విద్యుదుత్పత్తి చేసే సబ్స్టేషన్లు, విద్యుత్తు లైన్ల నిర్మాణం జరగలేదు.
అరకొరగా, ఎప్పుడో కానీ ఒక గంట లేదా రెండు గంటలు వచ్చిపోయే కరెంటు మూలంగా మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. దీంతో పంటలు పండక గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండేది. విద్యుత్ కోతలతో అటు పరిశ్రమలు మూతపడి ఎంతోమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. చాలా మంది నగరాలకు వలస వెళ్లారు.
అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్తు రంగాన్ని తొమ్మిదేండ్ల పాలనలో ప్రగతి బాటలో పరుగులు తీయించారు ముఖ్యమంత్రి కేసీఆర్. రూ.97,321 కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను పటిష్టపరిచారు. విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 18,567 మెగావాట్లకు పెంచారు. థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని 5,156 మెగావాట్లకు, సోలార్ విద్యుత్తు ఉత్పత్తిని 5,273 మెగావాట్లకు పెంచారు.
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన కాకతీయ విద్యుత్తు పవర్ స్టేషన్, లోయర్ జూరాల, పులిచింతల జల విద్యుత్తు కేంద్రాలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసింది. కేటీపీఎస్ 7వ దశ 800 మెగావాట్ల క్రిటికల్ థర్మల్ స్టేషన్ను రికార్డు స్థాయిలో కేవలం 48 నెలల్లోనే పూర్తిచేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. అలాగే రూ.34,400 కోట్లతో నల్గొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి విద్యుత్తు పవర్ ప్లాంట్ నిర్మాణం పను లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి మొదటి ప్లాంట్లో ఉత్పత్తి మొదలవుతుంది. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టు ద్వారా పది వేల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. అన్నిరంగాల్లో నిరంతర విద్యుత్తు సరఫరాకు అత్యంత ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించి రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ను అభివృద్ధి చేసి, దేశంలోనే నాణ్యమైన విద్యుత్తు సరఫరా వ్యవస్థ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది.
ఇటువంటి వ్యవస్థ ఉండటం వల్ల ప్రస్తుతం అవసరం ఉన్న 15.497 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి డిమాండ్ను కూడా రాష్ట్రం తట్టుకుంటుంది. నేషనల్ పవర్ గ్రిడ్ లెక్కల ప్రకారం దేశంలో నాణ్యమైన విద్యుత్తు ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమైన విద్యుత్తు రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం పటిష్ఠపరిచింది. అభివృద్ధి చెందిన దేశాలు విద్య, వైద్యం విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తాయో అలాగే తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగాల అభివృద్ధి విషయంలో అంతే శ్రద్ధ వహించింది.
తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అద్భుతంగా అభివృద్ధి చెందింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా ఐటీ ఎగుమతులు 36 శాతానికి పెరిగాయి. ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు 16 శాతం పెరిగాయి. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ, ప్రజా సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ సమర్థవంతం గా పని చేస్తున్నారనడంలో సందేహం లేదు.
(వ్యాసకర్త: సీనియర్ కన్సల్టెంట్, కరీంనగర్)
డాక్టర్ బీఎన్ రావు
98668 34717