ఆరెస్సెస్… రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు సంక్షిప్త రూపమైన ఈ పేరు దాదాపు వందేండ్లుగా దేశ ప్రజలకు సుపరిచితం. ఖాకీ నిక్కర్, చేతిలో కర్ర, రోజూ శాఖ, కాషాయ ధ్వజం, ప్రత్యేక గీతం తదితర అనేక ప్రత్యేకతలతో ఏర్పాటైన ఆరెస్సెస్ అంటే హిందువుల్లోని ఒక వర్గానికి ప్రత్యేక అభిమానం. స్వయం సేవకులు హిందూ మతం కోసం పాటుపడతారని, దేశభక్తితో మెలగుతారని, సేవాభావంతో వ్యవహరిస్తారని, నీతి నిజాయితీ కలిగి ఉంటారని! ఇక వారి క్రమశిక్షణ, అంకితభావం తటస్థులను, ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటుంది. ఇదంతా ఒకప్పటి మాట.
దాదాపు వందేండ్ల చరిత్ర కలిగిన (స్థాపితం 1925 సెప్టెంబర్ 27) ఆరెస్సెస్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయిందా? అంతర్మథనంలో పడిపోయిందా? అది అనుకున్నది ఒకటైతే, మరొకటి జరుగుతున్నదా? ఇటీవల తెలంగాణలో వెలుగుచూసిన ఎమ్మెల్యేల బేరసారాలు, దానిపై పోలీసుల విచారణ, నేను ఆరెస్సెస్ వ్యక్తిని అని చెప్పుకొన్న స్వామి రామచంద్రభారతి అడ్డంగా దొరికిపోవడం, ఆయన కాల్డేటాలో అనేకమంది ఆరెస్సెస్ ప్రముఖుల పేర్లు బయటకు వస్తుండటం ఇవన్నీ చూసి ఆరెస్సెస్ సంప్రదాయ సభ్యుల, అభిమానుల గుండెల్లో బడబానలం రగులుతున్నది. మాటలు పైకి పెగలకున్నా, మౌనంగా అందరూ ఒకే బాధను పంచుకుంటున్నారు.
ఆరెస్సెస్ ఎంతగా ఆకర్షణ కలిగించేదో, అంతగా వివాదాల్లోనూ ఉండేది. మొట్టమొదటిసారిగా అది ఎదుర్కొన్న పెద్ద సవాలు మహాత్మా గాంధీ హత్య తర్వాత. అప్పుడది ప్రభుత్వం చేత నిషేధానికి గురైంది. వీరి ప్రసంగాలు మతోన్మాద గరళంతో నిండి ఉన్నాయనీ, దాని పర్యవసానంగా అమూల్యమైన మహాత్ముడి జీవితం బలైందని అంటూ ఆరెస్సెస్ను నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ నిషేధించారు. దీంతో పటేల్ను ఆరెస్సెస్ అధినేత గోల్వాల్కర్ కలసి నిషేధం ఎత్తివేతకు చాలా ప్రయత్నాలు చేశారు. భారత్ను లౌకికరాజ్యంగా అంగీకరిస్తామని, జాతీ య పతాకాన్ని ఆమోదిస్తామని, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తామని ఆరెస్సెస్ అప్పు డు హామీ ఇచ్చింది. దీంతో రహస్య విధానాలు లేకుండా ప్రజాస్వామిక, సాంస్కృతిక సంస్థగా పనిచేయడానికి ఆరెస్సెస్ను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలా సెకండ్ లైఫ్ పొందిన ఆరెస్సెస్, అనేక అనుబంధ విభాగాలను ఏర్పాటుచేసుకొని కార్యక్రమాలు మొదలుపెట్టింది.
ఆరెస్సెస్ ప్రత్యక్ష రాజకీయాలకు వెళ్ళలేదు, కానీ వీహెచ్పీ, భారతీయ కిసాన్ సంఘ్, భారతీయ మజ్దూర్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్ వంటి దాదాపు 20-22 అనుబంధ సంఘాల ద్వారా దేశమంతా విస్తరించింది. ఇప్పుడున్న బీజేపీని ఆరెస్సెస్కు రాజకీయ విభాగంగా, పొలిటికల్ ఫేస్గా భావించవచ్చు. మొదట్లో ఆరెస్సెస్ తన రాజకీయ విభాగంగా భారతీయ జన సంఘ్ను ఏర్పాటుచేసుకున్నది. ఆ భారతీయ జన సంఘ్ 1970 దశకంలో జనతా పార్టీలో విలీనమైంది. జనతా పార్టీలో ఉంటూ ఆరెస్సెస్తో సంబంధాలు కలిగి ఉండకూడదనే ఒత్తిడి వచ్చినప్పుడు, జనసంఘ్ సభ్యులు బయటకువచ్చి బీజేపీగా ఏర్పడ్డారే తప్ప, ఆరెస్సెస్తో సంబంధాలను తెంచుకోలేదు. ఇదీ ఆరెస్సెస్, బీజేపీ మధ్య ఉన్న అనుబంధం. ఆరెస్సెస్ ఏ అనుబంధ సంఘాన్ని ఏర్పాటు చేసినా, అది దాని సిద్ధాంతాలను తు.చ. తప్పకుండా పాటించాల్సిందే. ఆరెస్సెస్ తాను ఏర్పాటుచేసిన ఇతర అనుబంధ సంఘాల్లో నాయకులను తయారు చేసి, వారిని బీజేపీలోకి పంపేది.
ఉదాహరణకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) బీజేపీ విద్యార్థి విభాగం అని కొందరు అనుకుంటారు. కానీ ఆర్ఎస్ఎస్ వారే ఏబీవీపీని నియంత్రిస్తారు. బీజేపీకి నేరుగా సంబంధం ఉండదు. ఇలాంటి సంఘాల ద్వారా బీజేపీకి సుశిక్షితులైన నాయకులు అందివచ్చేవారు. దాంతోపాటే, వారికి ఆరెస్సెస్ అంటే భయమూ, భక్తి రెండూ ఉండేవి. ఆరెస్సెస్కు కోపం తెప్పిస్తే తమ పదవులు ఊడిపోతాయని, పరువు పోతుందన్న జంకు బీజేపీ నేతల్లో ఉండేది. ప్రధానమంత్రి మొదలుకొని, ముఖ్యమంత్రి, మంత్రుల దాకా ఎవరూ ఆరెస్సెస్ మాటను దాటే సాహసం చేసేవారు కాదు. ఒక రాజకీయపార్టీగా బీజేపీ నేతల ధీమా అంతా ఆరెస్సెస్ మీదే. అద్వానీ రథయాత్ర విజయవంతమైందన్నా, కరసేవ సాగిందన్నా, బీజేపీ విస్తరించిందన్నా, ఎన్నికల్లో గెలిచిందన్నా ఆరెస్సెస్ చలువే. బీజేపీ నాయకులు ఏ పదవులు చేపట్టినా ఆరెస్సెస్కు విధేయంగా ఉండేవారు. ఆరెస్సెస్ గీసిన గీత దాటకపోయేవారు.
దాని ఆగ్రహానికి గురైతే తమ రాజకీయ భవిష్యత్తు శూన్యమైనట్టేనని భావించేవారు. కాబోయే ప్రధానిగా గుర్తింపు పొందిన అద్వానీ పాకిస్థాన్ పర్యటనలో జిన్నాపై వ్యక్తంచేసిన ఒక అభిప్రాయం, ఆరెస్సెస్కు అభ్యంతరకరంగా తోచింది. దీంతో అంతటి బలమైన నాయకుడిని రాజకీయ అంధకారం ఆవరించింది. ఇదీ ఒకప్పుడు బీజేపీపై ఆరెస్సెస్ పట్టు. బలమైన సంస్థ తమను వెనుక నుంచి గమనిస్తూ ఉంటుందనే భయం వల్లే బీజేపీ ఒకప్పుడు కొంతలో కొంత మంచిపేరు సాధించుకోగలిగింది. బీజేపీ ఆంతరంగిక వైరుధ్యాలను కూడా ఆర్ఎస్ఎస్ వారే సమన్వయం చేసేవారు. నాయకుల మధ్య విభేదాలకు పరిష్కారం నాగ్పూర్లో లభించేది. ఇలా ఒకప్పుడు ఆరెస్సెస్, బీజేపీ అంటే తల్లీబిడ్డల పేగుబంధం అనుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది.
ఇప్పుడు సంప్రదాయ వాదులు, అతివాదులుగా ఆరెస్సెస్ చీలిపోతున్నది. విలువల శిఖరంపై నుంచి జారిపోతున్నది. దీనికి కారణం ఆరెస్సెస్ కంటే బీజేపీ పెద్దగా పెరగడం. ఒకప్పుడు సర్ సంఘ్ చాలక్లుగా పనిచేసిన రజ్జూభయ్యా, సుదర్శన్ తదితరులు స్థాయి చాలా పెద్దది. అప్పుడు బీజేపీలో వాజపేయి, అద్వానీ లాంటి వాళ్లున్నా, వారికి స్వతంత్ర వ్యక్తిత్వం ఉండేది. దీనివల్ల బీజేపీ అగ్రనేతలు నాగ్పూర్ మాటను గౌరవించేవారు. నాగ్పూర్ పెద్దలు బీజేపీ నాయకులను గౌరవించేవారు. కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న మోదీ, ఢిల్లీలో ఉండి చక్రం తిప్పి, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా, గుజరాత్ ముఖ్యమంత్రి కాగలిగారు. కాలక్రమేణా వాజపేయిని వృద్ధాప్యం ఆవరించి అంపశయ్యపైకి చేరడం, అద్వానీ ఆరెస్సెస్ ఆగ్రహానికి గురికావడం (ఇందులోనూ మోదీ పాత్ర ఉందంటారు)తో, ఇక బీజేపీ అధికారంలోకి రావాలంటే తాను తప్ప మరో మార్గం లేదని మోదీ నమ్మించగలిగాడు. మోదీ కూడా ఒకప్పుడు పూర్తికాలపు ప్రచారక్ కావడంతో ఆరెస్సెస్ ఆయన్ను నమ్మి సంఘ్ పరివార్ ఆయనకు స్వేచ్ఛనిచ్చింది. మోదీ అసలే ప్రచారక్.
ఆరెస్సెస్ బలాలు, బలహీనతలు, లోగుట్లు అన్నీ ఆయనకు తెలుసు. దీంతో ఆయన సంఘ్ పెద్దలు ఊహించినదానికన్నా వేగంగా, సంఘ్ పరివారంపై హోల్డ్ సంపాదించగలిగారు. ఇదివరకు బీజేపీ- ఆరెస్సెస్ మధ్య సంధానకర్తగా వ్యవహరించిన మోహన్భగవత్కు, గతంలో ఉన్న సర్సంఘ్ చాలక్లంత స్టేచర్ లేదనీ, అది కూడా మోదీ దూసుకుపోవడానికి ఒక కారణమనే అభిప్రాయాలూ ఉన్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, ఇంకా బీజేపీ జాతీయ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కూడా కాకముందే మోదీ హైదరాబాద్లో నవ భారత యువభేరి అని ఒక సభ పెట్టారు. ఒక బీజేపీ ముఖ్యమంత్రి ఇలా మరో రాష్ట్రంలో సభ పెట్టడం సంఘ్ పరివార్ సిస్టమ్లో అంతకుముందెన్నడూ జరగలేదు. ఆరెస్సెస్ శక్తియుక్తులు ఏమిటో బాగా తెలిసిన మోదీ, దూకుడుగా వెళ్లి, దాన్ని బీజేపీకి బీ టీమ్గా మార్చే స్థాయికి చేరుకున్నారు. ఆరెస్సెస్ బలహీనతలు మోదీకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవంటారు. ఆరెస్సెస్ టాప్- 3 మోహన్ భగవత్, భయ్యాజీ జోషి, దత్తాత్రేయ హోసబలే మధ్య, త్రిముఖ యుద్ధం వెనుక కూడా మోదీ తంత్రమే ఉందని సంఘ్లో జనాంతికంగా అనుకుంటూ ఉంటారు.
చివరికి ఏం జరిగిందంటే.. స్వయంగా ప్రచారక్నైన తనకు ఆరెస్సెస్ గురించి బాగా తెలుసనీ, ఆరెస్సెస్కు కావాల్సినవి (రామమందిరం, 370 ఆర్టికల్ రద్దు, ఉమ్మడి పౌర స్మృతి వంటివి) తాను చేసి పెడతానని, అయితే తానేం చేసినా ఆరెస్సెస్ ప్రశ్నించకూడదని, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో వేలు పెట్టకూడదని మోదీ షరతు పెట్టినట్టుగా కూడా చెప్తూ ఉంటారు. దీనికి అనుగుణంగానే ఆరెస్సెస్కు పెద్దగా ఇష్టం లేకపోయినా, అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు కాగలిగాడు. అరెస్సెస్కు దగ్గరివారుగా పేరున్న ఉమాభారతి, యోగి ఆదిత్యనాథ్, గడ్కరీ, సురేష్ జోషి ప్రాభవం పార్టీలో తగ్గిపోయింది. స్వయం సేవకుడు ప్రధాని అయ్యాడు కదా అనే ఆత్మ సంతృప్తిలో మునిగిపోయిన ఆరెస్సెస్ చివరికి చేష్టలుడిగి చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేని స్థితిలోకి జారిపోయింది. ఒకవైపు నరేంద్ర మోదీ ప్రాభవం పెరుగుతూ పోగా, మరోవైపు సంఘ్పరివార్ నైతిక ైస్థెర్యం తగ్గుతూ వస్తున్నది.
ప్రచారక్ అయిన మోదీ బీజేపీలో అడుగు పెట్టడం కూడా అరిష్టదాయకంగా మారిందని చాలామంది ఆరెస్సెస్ సీనియర్లు, అభిమానులు ప్రైవేటు మీటింగుల్లో బాధపడుతున్నారు. సంఘ్పరివార్లోని పరిణత నాయకులు చెప్తున్న ప్రకారం ఆరెస్సెస్ ఇప్పుడు రెండుగా విడిపోయింది. 1.సంప్రదాయవాదులు. వీరికి అధికారం ముఖ్యం కాదు, భావజాల ప్రచారం, సిద్ధాంతవ్యాప్తే ప్రధానమని భావించేవారు. 2.అతివాదులు. వీరికి అధికారమే పరమావధి, అదే పార్టీని, సంఘ్ను రక్షిస్తుందని నమ్మేవారు. మోదీ రాకతో మొదటి రకం వాళ్లు తెరమరుగైపోగా, రెండోరకం వాళ్లు విజృంభించారు. ఎజెండా అమలు అనే ఎర వేసిన మోదీ ఆర్ఎస్ఎస్ పెద్దలను నోరు మెదపకుండా కట్టడిచేశారు. సాధారణంగా బీజేపీ ఎన్నడూ వ్యక్తి కేంద్రంగా లేదు. కానీ ఇప్పుడు బీజేపీ నరేంద్రమోదీ కేంద్రంగా మారిపోయింది.
మామూలుగా ప్రచారక్లు పెద్దగా ప్రచారాన్ని కోరుకోరు. కానీ మోదీ ప్రచారాన్ని మాత్రమే నమ్ముకొని వ్యక్తిగత ఆకర్షణ కేంద్రంగా మారిపోయారు. అంతర్గత కుమ్ములాటలో, అనివార్యమైన అచేతనావస్థనో తెల్వదుకానీ సంఘ్ చేతులెత్తేయడంతో మోదీ- అమిత్ షా ద్వయానికి ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ఒకప్పుడు ఆరెస్సెస్ అధినేత, బీజేపీ ప్రధాని కన్నా శక్తిమంతుడు. కానీ మొదటిసారిగా సంఘ్పరివార్లో ఆరెస్సెస్ అధినేత కన్నా, ప్రధాని మోదీ బలోపేతమయ్యారు. ఒకప్పుడు బీజేపీని ఆరెస్సెస్ శాసించేది. కానీ ఇప్పుడు ఆరెస్సెస్నే బీజేపీ శాసిస్తున్నది. ఒకప్పుడు ఆరెస్సెస్ రాజకీయ రూపంగా- పొలిటికల్ ఫేస్గా బీజేపీ ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీ అంగాలలో ఒక అంగంగా ఆరెస్సెస్ మారిపోయే ప్రమాదం తలెత్తింది. ఒకప్పుడు ఆరెస్సెస్ సిద్ధాంతాలను, విలువలను నిలబెట్టే పార్టీ బీజేపీ.
ఆరెస్సెస్ భావజాల వ్యాప్తి బీజేపీ బాధ్యత. కానీ ఇప్పుడు బీజేపీని గెలిపించడమే ఆరెస్సెస్ బాధ్యత అన్నట్టుగ చేశారు మోదీ. బీజేపీకి అధికారం ఉండేలా చూడటం ఆరెస్సెస్ కర్తవ్యమన్న పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవాలి. గతంలో ఆరెస్సెస్ ప్రచారక్లు ఎన్నికలకు దూరంగా ఉండేవారు. కేవలం ప్రజల నాడిని అంచనా వేసి, రాజకీయపార్టీ బాధ్యులకు మార్గదర్శనం చేసేవారంతే. కానీ ఇప్పుడు ప్రచారక్లు ఏకంగా, నేరుగా నియోజకవర్గ ఇన్చార్జులుగా బాధ్యతలు చేపడుతున్నారు. అంతే కాదు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించడా నికి ‘ఏమేం చేయాలో అవన్నీ’ చేస్తున్నారు. దీని పర్యవసానం ఏం జరిగిందంటే అధికారం వల్ల, రాజకీయాల వల్ల బీజేపీకి వచ్చిన అవలక్షణాలన్నీ ఆరెస్సెస్కూ అంటుకున్నాయి. ఇంతకుముందు ఎవరైనా ప్రచారక్లు జిల్లాల పర్యటనలకు వెళ్తే, గుట్టుచప్పుడు కాకుండా తమ మద్దతుదార్లను కలిసివచ్చేవారు. ప్రచారక్ వచ్చివెళ్లింది కూడా ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పటి ప్రచారక్లు సంపన్నుల ఇంటిని మాత్రమే సందర్శిస్తున్నారు.
దానికి ప్రచారాన్నీ కోరుకుంటున్నారు. ధనం, సౌకర్యాలు, విలాసాలు, అవసరాల పట్ల కొత్తతరంలో పెరిగిన మోజు, మోదీ మార్కు ప్రచారసరళిని బతికిస్తున్నది. ఫలితంగా సంప్రదాయవాదులు సంఘ్కు రోజురోజుకూ దూరమవుతుండగా, అంతగా లోతులేని, సిద్ధాంత నిబద్ధత లేని కొత్త తరం లొల్లి ఎక్కువగా వినిపిస్తున్నది. వారి ప్రచార హోరులో నిజమైన స్వయం సేవకులు, సంప్రదాయ సంఘీయులు వేస్తున్న ప్రశ్నలు వినిపించడమే కరువైంది. వీటన్నింటి పర్యవసానంగా ఇప్పుడేం జరుగుతున్నది? ఒకప్పడు బీజేపీని ఆరెస్సెస్ కాపాడుతుందనుకునేవారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ మాత్రమే ఆరెస్సెస్ను కాపాడగలదనే వాదనను సృష్టించి, స్థిరీకరించడంలో మోదీ-షా కూటమి విజయవంతమైంది. అధికారం ముఖ్యం కానీ, అందుకు అనుసరించాల్సిన మార్గం కాదన్న అనైతిక వాదనను కూడా వారు ప్రబలంగా ప్రవేశపెట్టగలిగారు. వీటన్నింటి ఫలితంగా వచ్చిందే హైదరాబాద్ తలవంపుల వ్యవహారం. నేను ఆరెస్సెస్ వాడిని అని చెప్పుకొన్న రామచంద్ర భారతి ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరపడమే కాదు, ప్రధానంగా ఆరెస్సెస్ ప్రచారక్ అయి బీఎల్ సంతోష్ పేరును కూడా బయటపెట్టే సాహసం చేయగలిగారు.
మోదీ విధానాల వల్ల ఆర్థికరంగం కుదేలైంది. నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయింది. ఆకలి సహా అన్ని సూచీలలోనూ మోదీ ప్రభుత్వం అట్టడుగుకు దిగజారిపోయింది. రూపాయి పతనమైంది. మోదీ ప్రభుత్వం తన వైఫల్యాలను చక్కదిద్దుకునే బదులు ఇతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్నది. ఒక వికృత, అప్రజాస్వామ్య, అవినీతిమయ, రాక్షస, రాజకీయక్రీడను మొదలుపెట్టింది. గమ్యం చేరుకుంటే చాలు, మార్గం ఏదైతేనేం అనే భావనతో పాచికలాట ఆడుతున్నది. ఇప్పుడు మోదీకి ‘రాజధర్మం’ చెప్పేవారెవరూ లేరు. చెప్పాల్సిన ఆరెస్సెస్ తన స్థాయిని తానే తగ్గించుకున్నది. ‘ఈ దేశం ఎదుర్కొంటున్న అన్ని సవాళ్లనూ ఒక్క నాయకుడే పరిష్కరించలేడు. ప్రతి మసీదునూ తవ్వి శివలింగాలు వెతకాల్సిన పని ఏముంది? రోజూ విద్వేష వ్యాఖ్యలు ఎందుకు చేయాలి?’ అంటూ మోహన్ భగవత్ అప్పుడప్పుడూ సణిగినా, ఆర్థికరంగం దెబ్బతింటున్నదని దత్తాత్రేయ హోసబలే ఎప్పుడో ఒకసారి అన్నా మోదీ బీజేపీని లొంగదీసుకోవడానికి అవి చాలవు, చాలడం లేదు.
కారణం మోదీ, రాజకీయ బలం అధికంగా ఉన్న ఉత్తరాది (గుజరాత్)కు చెందిన నాయకుడు కాగా, భగవత్ (మహారాష్ట్ర), హోసబలే (కర్ణాటక)కు చెందినవారు. ఒకప్పటి బీజేపీ నేతలు ఆరెస్సెస్ను పూజించేవారు. ఇప్పుడు ఆరెస్సెస్… బీజేపీని, దాని పాప భారాన్ని తన భుజాలపై మోస్తున్నది. విలువలకు చిరునామాగా నిలిచిన ఆరెస్సెస్ కండ్లముందే ఇన్ని దారుణాలు జరుగుతుంటే, సంఘ్ పెద్దలు ఏం చేస్తున్నారన్న ప్రశ్న జనంలో రేకెత్తుతూనే ఉన్నది. బీజేపీ బురదను మనం అంటించుకోవడం ఎందుకని సంప్రదాయ సంఘీయులు మథనపడుతున్నారు. బీజేపీకి ఆరెస్సెస్ తోకలా మారడమేమిటని ఆందోళనతో అభిమానులు తలబాదుకుంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు, తదనంతర పరిణామాలు, కోర్టులో విచారణలు, న్యాయమూర్తుల వ్యాఖ్యలు, ప్రజలలో వెలువడుతున్న అభిప్రాయాలు వారిని నిశ్చేష్టులను చేస్తున్నాయి. దాదాపు వందేండ్ల చరిత్ర గల ఆరెస్సెస్ ఈ పెండతట్టను మోయడమేమిటని వారు ఆందోళన చెందుతున్నారు. విలువల సంస్థగా చెప్పుకొనే ఆరెస్సెస్ నుంచి వచ్చిన ప్రచారక్ బీఎల్ సంతోష్ ఆరోపణలు వచ్చిన వెంటనే అగ్ని పరీక్షకు సిద్ధం కాకుండా ‘నోటీసులు అందలేదు, ఎన్నికల ప్రచారంలో ఉన్నా’ అనే సాకులు చెప్తూ దాటవేయడం సంప్రదాయ ఆరెస్సెస్ వాదులకు వింతగా కనిపిస్తున్నది. ఈత వచ్చిన వాడు ఈతరాని వాడిని పట్టుకొని మునిగినట్టుగా-బీజేపీని పట్టుకొని ఆరెస్సెస్ పతనమవుతున్నదా? ఇది ఇప్పుడు చర్చించాల్సిన అంశం.