గోతికాడి నక్కలు నమ్మకాన్ని వధించాలనుకుంటున్నాయి. నరంలేని నాలుకలు గందరగోళం రాజెయ్యాలని తెగ ఆరాటపడుతున్నాయి. ఎనిమిదేండ్లుగా ప్రతి మలుపులోనూ కిరికిరి పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కేసీఆర్ ప్రతి అడుగులో మోకాలడ్డం పెట్టాలని, ప్రతిఫలించిన అభివృద్ధిపై అడ్డ గీతలు గియ్యాలని మానసిక మరుగుజ్జులు మూకదాడులకు దిగుతూనే ఉన్నారు. తెలంగాణ పోరుకు తరిమిన నొప్పులను నయం చేయడానికి కేసీఆర్ పడ్డ కష్టం కాకి అరుపులకు అలవాటుపడ్డవారికి ఎన్నటికీ అర్థం కావు. అందుకే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కోసం దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నా,24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రూ.36 వేల 179 కోట్లు పెట్టుబడి పెట్టి వెలుగులు పంచుతున్నా కబోదులు విషం కక్కుతూనే ఉన్నారు.
ఎనిమిదేండ్లలో 65 లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా 58 వేల కోట్లు పెట్టుబడి సహాయం అందించి సాగును సంపదగా మలిచినా, సంస్కార హీనులు సన్నాయి నొక్కులు మానడం లేదు. కాళేశ్వరం, మల్లన్నసాగర్లతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులకు పునాదులు మొదలు పెట్టినప్పటినుంచే మోసగాళ్ల గాయిగత్తర వేషాలు చూశాం. మిషన్ కాకతీయతో చెరువులకు జీవం పోస్తుంటే, ఊపిరి ఆగిపోయినట్టు ఊగిపోయిన ఉన్మాదులను గమనించి ఈసడించుకున్నాం. చివరికి కంటివెలుగు లాంటి మానవీయ పథకంపైనా పైశాచిక విమర్శలు చేయడం మాననివారిని ఏమనాలి?
మాతా, శిశువుల మరణాలను గణనీయంగా తగ్గించిన కేసీఆర్ కిట్లోనూ వేలు పెట్టి గెలకాలనుకునే ఉన్మాదం, తరాల వివక్షకు వేలాడిన వర్గాలకు విముక్తి బాటలు వేస్తున్న దళితబంధుపైనా పసలేని విమర్శలు చేస్తూనే ఉన్నారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందించినా నచ్చని నీచ మనస్తత్వాలను చూస్తూనే ఉన్నాం. రాష్ట్రంలో సకల రంగాల్లో సాకారమైన ప్రగతిని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు ప్రశంసిస్తున్నా, పచ్చకామెర్ల వ్యాధిగ్రస్థులైన విపక్ష నేతలు మాత్రం గుర్తించలేకపోతున్నారు. ఆది నుంచి ఏ మంచి జరగినా మొరగడమే పనిగా మారిపోయారు. ప్రగతిని కానని, పొరపాట్లను మాత్రమే పట్టుకొని వేలాడేవారు తెలంగాణపై పగబట్టిన వాళ్లవుతారు కానీ ప్రేమించే నేతలుగా ఎదగగలరా?
ఇప్పుడు కూడా టీఎస్పీఎస్సీలో ఇద్దరు దురాశపరులు చేసిన తప్పిదాన్ని ప్రభుత్వానికి ఆపాదించి, వికృతానందం పొందుతున్నారు. తరాలపాటు తెలంగాణ తల ఎత్తుకొని నిలవాలనే తలంపుతో నిరంతరం శ్రమిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు నష్టం కలిగే పనులు చేస్తుందా..? ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అవకతవకలు పునరావృతం కావొద్దనే ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, జనార్ధన్రెడ్డి లాంటి వారిని టీఎస్పీఎస్సీ చైర్మన్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. భావితరాల నుదిటిరాతను మార్చే కేంద్రాలుగా గురుకులాలను తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ వాటి సంఖ్యను భారీగా పెంచటంతోపాటు సుదీర్ఘకాలం కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను కొనసాగించారు. తన హయాంలో వేలాది గురుకుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీని పారదర్శకంగా చేశానని చెప్పుకొంటున్న ప్రవీణ్కుమార్ ఎవరి ప్రోత్సాహంతో భర్తీచేయగలిగాడో తెలంగాణ సమాజానికి తెలియదా? సీఎం కేసీఆర్ ఆశీర్వాదం లేకుంటే అసలు సుదీర్ఘకాలం గురుకులాల కార్యదర్శిగా కొనసాగేవాడా? పలు రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన 1 లక్షా 33 వేలకు పైగా కొలువుల్లో, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాల ఉద్యోగస్థుల ఆత్మగౌరవం దెబ్బతినేలా, గతంలో నూ అన్నింటా అవకతవకలు జరిగాయని అర్థంలేని ఆరోపణలు విపక్షాలు చేయవచ్చు నా? కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్న లక్షకు పైగా ఉద్యోగస్థుల కుటుంబాలు ఈ దారుణ విమర్శలు విని ఎంత ఆవేదన చెందుతుంటాయో అర్థం చేసుకోలేని అవివేకులే కదా అడ్డంగా మాట్లాడేది!
ఉస్మానియాతో పాటు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో, గ్రంథాలయాల్లో, కోచింగ్ సెంటర్లలో నిన్నటిదాకా తమతో పాటు పక్క కుర్చీల్లో కూర్చొని కష్టపడి చదివి సంపాదించుకున్న కొలువులకు మలినం పూయాలని ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాల వైఖరి చూసి నిరుద్యోగులకు సైతం అసహ్యమనిపించదా? బీజేపీ, కాంగ్రెస్ల ఏలుబడిలోని గుజరాత్తో సహా దేశంలోని పలు రాష్ర్టాల్లో ఉద్యోగాల భర్తీలో జరిగిన దారుణాల గురించి, పోటీ పరీక్షల ప్రిపరేషన్లో కరెంట్ ఎఫైర్స్ను ప్రధానాంశంగా చదివే యువతరానికి తెలియదనుకుంటున్నారా?
ఆకాశం మీదికి ఉమ్మితే, తిరిగి వారి మొహం మీదే పడుతుందనే నానుడిని, నిప్పుకు చెదలు పట్టించడం ఎవరితరం కాదనే వాస్తవాన్ని, నానా తంటాలు పడుతు న్న వివక్షాలు మరిచిపోయారు. టీఎస్పీఎస్సీలో దొర్లిన తాజా తప్పిదం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరి మనస్సులతో పాటు బుద్ధి జీవులందరినీ కలతపెట్టింది. అందుకే సీఎం కేసీఆర్ సత్వరమే దిద్దుబాటు చర్యలకు ఆదేశించారు. అది గమనించని కబోదులు గతంలో జరిగిన రిక్రూట్మెంట్లనూ రాబందుల్లా పీక్కు తినాలని ప్రయత్నించడం హేయమైన ధోరణికి దర్పణంలా లేదా?
‘నీళ్లు, నిధులు, నియామకాల’ నినాదాన్ని ఎనిమిదేండ్ల స్వల్పకాలంలోనే ప్రజల అనుభవంలోకి తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అద్భుతమైన సచివాలయాన్ని నిర్మించి, అంబేద్కర్ పేరు పెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచింది. అమరుల స్థూపాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని తలమానికంలా నిర్మించి, ఆవిష్కరణకు సిద్ధం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఎన్నో చారిత్రక పాలనాచర్యలకు కేంద్రంగా మారిన తెలంగాణ రాష్ర్టాన్ని గందరగోళంలోకి నెట్టాలని గుప్పెడుమంది వేస్తున్న ఎత్తులను న్యాయాన్యాయాల మధ్య గీతను గుర్తించే నేర్పున్న నవతరం అర్థం చేసుకోవాలి. అరుపులను మాత్రమే నమ్ముకొని, అపాయాలను ఇష్టపడే మరుగుజ్జుల ఆరోపణలను లోతైన దృక్కోణంతో విప్పిచూడాలి. మన రాష్ట్రం దేశానికి దారిదీపంగా మారుతున్న చారిత్రక మలుపులో, ఏమరుపాటుకు లోనుకాకుండా నిండుకుండలా చూపులుండాలి.
దొర్లిన పొరపాటును సరిచేసుకొని, దారిలో దృఢమైన అడుగులు వేసుకుంటూ సాగిపోవాలి. తలసరి ఆదాయంలో, పంటల దిగుబడిలో, పారిశ్రామిక ప్రగతిలో ఇలా ఎన్నింటిలోనో నెగ్గి, నిలబడిన మన తెలంగాణను దేశానికి పెద్ద దిక్కుగా మలిచే మహాపోరులో అందరం కలిసిసాగాలి. విద్వేషాన్ని నమ్ముకున్న ఉన్మాదుల వలలోనో, కుర్చీకోసమే కుయుక్తులు పేనుతున్న కుసంస్కారుల కబంధహస్తాల్లోనో రాష్ట్రం ఎప్పటికీ బోల్తా పడదు.
(వ్యాసకర్త: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్)
-డాక్టర్ ఆంజనేయ గౌడ్
98853 52242