హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తేతెలంగాణ): సీఎం రేవంత్రెడ్డికి, తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, ఇద్దరి మధ్య మంచి సఖ్యతే ఉన్నదని, దొంగచాటున ఫిర్యాదులు చేసుకొనే అవకాశం కాంగ్రెస్లో లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఏమున్నా ముఖంపైనే మాట్లాడుకుంటామని, బయట జరుగుతున్న అన్ని విషయాలను చర్చించుకుంటామని తెలిపారు. రేవంత్రెడ్డి.. తమ పార్టీ ముఖ్యమంత్రి అని, ఆయన, తాను రోజూ ఫోన్లో మాట్లాడుకుంటామని, బుధవారం కూడా మాట్లాడుకున్నామని చెప్పారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాటలు నీటి మూటలని, తన ముందు బీజేపీ ఎంపీ అర్వింద్, కేంద్ర మంత్రి బండి సంజయ్ పిల్లలని పేర్కొన్నారు. కో-ఆర్డినేషన్ కమిటీలో కీలక చర్చ జరిగిందని, అంతా బహిరంగంగాగానే మాట్లాడుకున్నామని చెప్పారు. కో-ఆర్డినేషన్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశమని, ఫొటోలో చూస్తే సీడబ్లూసీ ప్రత్యేక ఆహ్వానితుడి హోదాలో పాల్గొన్న వంశీచంద్రెడ్డి మధ్యలో కూర్చున్నట్టు అనిపిస్తున్నదని, ప్రొటోకాల్ ప్రకారం మీనాక్షీ నటరాజన్ సమీక్ష నిర్వహించారని తెలిపారు. మాజీ మంత్రి హరీశ్రావును తాను కించపరచలేదని, ఆయనపై తప్పుడు ప్రచారం చేయలేదని తెలిపారు. హరీశ్రావు లీగల్ నోటీసులకు భయపడమని, న్యాయస్థానంలోనే కొట్లాడుతామని చెప్పారు.