ఏ రాష్ట్రంలోనైనా, ఏ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ రాష్ట్రంపై తనదైన ముద్ర ఉండాలని ప్రతి ముఖ్యమంత్రి కోరుకుంటారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరుకోవడం కూడా సహజం. కానీ, తనదైన ముద్ర అంటే మెట్రో రైలు రూట్ మార్చడం, గోడలకు రంగులు మార్చడం, పేర్లు మార్చడం కాదు. రాష్ట్ర ప్రజలకు, రాష్ర్టానికి మేలు చేయడం ద్వారా బలమైన ముద్ర వేయాలి.
‘తెలంగాణ’, ‘రైతుబంధు’ పేర్లను గుర్తుచేస్తే చాలు వెంటనే ప్రజలకు కేసీఆర్ గుర్తుకువస్తారు. రెండు రూపాయలకు కిలో బియ్యం అంటే చాలు ప్రజల కండ్లముందు ఎన్టీఆర్ మెదులుతారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ అంటే చాలు ప్రజలకు వైఎస్సార్ గుర్తుకువస్తారు. ఆయా అంశాల్లో వారు వేసిన బలమైన ముద్ర వల్ల వారి పేరు చెప్పగానే అవి గుర్తుకువస్తాయి. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారం చేసి ఏడు వారాలు పూర్తయింది. అందుకే రేవంత్రెడ్డి కూడా తనకు లభించిన అవకాశాన్ని ప్రజలకు మేలు చేయడం ద్వారా బలమైన ముద్ర వేయడానికి ఉపయోగించుకోవాలి.
1983లో ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేసిన పథకం రెండు రూపాయలకు కిలో బియ్యం. ఈ పథకం ప్రజలపై బలమైన ముద్ర వేసింది. ఇదిలా ఉంటే మండల వ్యవస్థ పాలనను ప్రజలకు దగ్గర చేసింది. 1989 ఎన్నికల ప్రచారంలో మండల వ్యవస్థను రద్దు చేస్తామని కాంగ్రెస్ బలంగా ప్రచారం చేసింది. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో టీడీపీని కాంగ్రెస్ ఓడించి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో మండల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన చెన్నారెడ్డి ప్రభుత్వం మండల వ్యవస్థను రద్దు చేయలేదు. తాలూకాలు ఉన్నప్పుడు ఎంతో ఇబ్బందిగా ఉండేది, మండల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత తమ గ్రామానికి ప్రభుత్వం చేరువైందనే భావన ప్రజల్లో బలంగా ఏర్పడింది. సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల సమస్యలు తలెత్తి ఉండవచ్చు కానీ, మండల వ్యవస్థ రద్దుచేయడం సాధ్యం కాదని చెన్నారెడ్డి గ్రహించి దాన్ని కొనసాగించారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, మండల వ్యవస్థ ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేయడమనేది ఎన్టీఆర్ వేసిన బలమైన ముద్ర.
చంద్రబాబు రెండు రూపాయల బియ్యం నాలుగు రూపాయలుచేసినా, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రెండు రూపాయల బియ్యాన్ని ఉచితం చేసినా ధరల్లో మార్పు తప్ప పథకం మాత్రం కొనసాగింది. ఎందుకంటే నేటికీ అది ఎంతో కొంత ప్రజలకు మేలు చేసే పథకం.
ఎన్టీఆర్ను దించి అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు ఎన్టీఆర్ పేరును చెరిపేయడానికి తీవ్రంగానే కృషిచేసి రెండు రూపాయలకు కిలో బియ్యం ధర పెంచారు. కానీ, ఎన్టీఆర్ పేరును మాత్రం చెరిపేయలేకపోయారు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఆయన పేరును మాయం చేయాల్సిన అవసరం లేకుండాపోయింది. అదేవిధంగా వైఎస్సార్ పేరును సైతం బాబు చెరిపివేయలేకపోయారు. 2004 ఎన్నికల్లో వైఎస్సార్ ఉచిత విద్యుత్తు హామీ ఇస్తే, టీడీపీ ప్రచారంలో చంద్రబాబు మాత్రం ఉచిత విద్యుత్తు అమలుచేస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవలసిందే అని ప్రచారం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఓడిపోయి ఆరు నెలలు కూడా కాకముందే మేము కూడా ఉచిత విద్యుత్తు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. 2014లో ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఉచిత విద్యుత్తు అమలుచేశారు.
ఆరోగ్యశ్రీ, 108 అనగానే వైఎస్సార్ గుర్తుకు వస్తారు. అంతమాత్రాన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వీటిని రద్దు చేయలేదు. పైగా శాసనసభలోనే ఈ పథకాలు వైఎస్సార్ మొదలుపెట్టారని, ఆ విషయాన్నీ నిండు సభలోనే చెప్తున్నట్టు చెప్పారు. ఈ పథకాల వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా? లేదా అనే దానికి ప్రాధాన్యం ఉండాలి కానీ, దాన్ని ఎవరు ప్రారంభించారు? ఎవరికి పేరు వస్తుందని కాదు. ఔషధ నగరి వల్ల వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఇలాంటి వాటి విషయంలో మరింత మందికి ఉపాధి లభించేట్టు చూడాలి కానీ, దెబ్బతీయడం వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు.
‘హైటెక్ సిటీ’ అంటే చంద్రబాబు పేరు గుర్తుకువస్తుందని తర్వాత అధికారంలోకి వచ్చినవాళ్లు దాన్నేమీ రద్దు చేయలేదు. బాబు హయాంలో కన్నా వైఎస్ హయాంలో ఐటీ ఎగుమతులు ఎక్కువ జరిగాయి. వీరిద్దరి కన్నా కేసీఆర్ హయాంలో ఐటీ ఎగుమతులు ఇంకా ఎక్కువగా జరిగాయి.
హైటెక్ సిటీ అంటే బాబు గుర్తుకువస్తారని వైఎస్ ఐటీరంగాన్ని చిన్నచూపు చూడలేదు. ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కూడా చిన్నచూపు చూడలేదు. ఐటీ రంగంలో మరింత వృద్ధి సాధించేట్టు చర్యలు తీసుకున్నారు. ఔషధనగరి అయినా, మరేదైనా రాష్ర్టానికి మంచి చేసే అంశాలు ఎవరు ప్రారంభించారని చూడకుండా, రాష్ర్టానికి మేలు చేసేది అయితే తప్పకుండా మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. అది పాలకుడి లక్షణం.
అంతేకానీ, ఒక రాజకీయపక్షం ఓడిపోవడానికి, ఇంకో రాజకీయపక్షం గెలువడానికి అనేక కారణాలుంటాయి. ఓడిపోయిన పార్టీ చేసినవి అన్నీ తప్పేనని, గెలిచిన పార్టీ ఏం చేసినా సరైనదేనని భావిస్తే ఆలోచనల్లో అనారోగ్యం ఉన్నట్టే లెక్క. ఇక రేవంత్రెడ్డి విషయానికి వస్తే ‘ధరణి’తో పాటు అన్నింటిని వ్యతిరేకించారు. బీజేపీ పేర్లు మార్చడం ద్వారా ఎంతో కొంత ప్రయోజనం పొందింది. ఆ పేర్ల మార్పు మతానికి సంబంధించిన అంశం కాబట్టి అది సాధ్యమైంది. ధరణితో పాటు, జిల్లాలు, ఔషధ నగరి పేర్ల మార్పు, మెట్రో రూట్ మార్పుపై రేవంత్రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. మెట్రోకు ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకారం చుడితే కేసీఆర్ పాలనాకాలంలో పూర్తయింది. అయినా మెట్రో ప్రాజెక్టును కేసీఆర్ ఖాతాలో చూడటం లేదు. అలాంటిది రూట్ మారిస్తే రేవంత్ ఖాతాలో జమవుతుందా? యాదాద్రి, ఇంటింటికీ మంచినీళ్లు, జిల్లాల ఏర్పాటు, చెరువులకు జలకళ వంటి ఎన్నో అంశాల్లో కేసీఆర్ బలమైన ముద్ర వేశారు. రేవంత్రెడ్డి సైతం తనకు లభించిన అవకాశాన్ని సానుకూలంగా ఉపయోగించుకొని తనదైన ముద్ర వేయాలి కానీ, విధ్వంసం చేయడం సరికాదు.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరుష పదజాలంతో విమర్శలు చేయడం ద్వారా రేవంత్రెడ్డి వార్తల్లో నిలిచారు. సీనియర్లను వెనక్కినెట్టి పాపులారిటీ సంపాదించడంలో ఈ విధానం ఆయనకు ఉపయోగపడి ఉండవచ్చు. రాజకీయంగా ప్రయోజనం కలిగించి ఉండవచ్చు. కానీ, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా అదే భాష ఉపయోగించడం ఏ విధంగా ప్రయోజనం అనుకుంటున్నారో చూడాలి.
ఎంతో మంది సీనియర్లను పక్కనపెట్టి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్రెడ్డికి అవకాశం ఇచ్చింది. ఎన్నికల ఫలితాలు వన్సైడ్గా ఏమీ లేవు. నాలుగు సీట్ల స్వల్ప మెజారిటీ మాత్రమే ఉన్నది. కేవలం ఏడు వారాల పాలన చూసి ప్రభుత్వాన్ని బేరీజు వేయలేం. ఐదేండ్లు పాలించేందుకు ప్రజలు అవకాశం ఇచ్చారు. సర్దుకోవడానికి, ఎక్కడ ఏముందో తెలుసుకోవడానికే కొంత సమయం పడుతుంది. అందులోనూ రేవంత్రెడ్డికి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా లేదు.
కాళ్లు కడిగినప్పుడే కాపురం చేసే తీరు తెలుస్తుంది అన్నట్టు… ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి బాధ్యతతో అడుగులు వేయాలి. పీసీసీ అధ్యక్షుని పాత్ర వేరు, ఆ పాత్రలో మాట్లాడే రాజకీయ భాష వేరు. ముఖ్యమంత్రి బాధ్యత వేరు, ఈ బాధ్యతలో ఉపయోగించాల్సిన భాష వేరు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులపై ఉపయోగించే భాషను అంతర్జాతీయ వేదికలపై ఉపయోగించడం వల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ. అది రేవంత్రెడ్డి గ్రహించి రాష్ట్రంపై తనదైన ముద్ర వేసి రాష్ట్ర ప్రజలకు మేలు కలిగే పాలన సాగించాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
-బుద్దా మురళి
98499 98087