రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ బడులను కేవలం 4 వేలకు కుదించాలని సర్కార్ నిర్ణయించడం రాజకీయంగా మాత్రమే కాదు, నైతికంగానూ తీవ్ర వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తున్నది. విద్యార్థుల నమోదు తగ్గిందని, ప్రతి గ్రామంలో పాఠశాల నిర్వహణ భారంగా మారిందని వాదిస్తున్నది. కానీ విద్య అనేది లాభనష్టాల లెక్కలతో కొలిచే వ్యాపారం కాదు. అది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు, సంక్షేమ రాష్ర్టానికి మూలస్తంభం.
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి చిన్నారికీ నివాస ప్రాంతానికి ఒక కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే పాఠశాలల విలీనం వల్ల వేలాదిమంది చిన్నారులు పక్క గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఐదారేండ్ల వయసు గల చిన్నపిల్లలను ప్రతిరోజూ దూరప్రాంతాలకు పంపడానికి తల్లిదండ్రులు వెనుకాడటం సహజం. దీని ప్రభావం అత్యధికంగా బాలికలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల పిల్లలపైనే పడుతుంది. ఫలితంగా డ్రాపౌట్ల్లు పెరిగి గ్రామీణ అక్షరాస్యతపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్నది. గ్రామంలోని ప్రభుత్వ బడి మూతపడితే సహజంగానే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపుతారు. దీంతో పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. ప్రభుత్వ బడుల కుదింపు నిర్ణయం పరోక్షంగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు మేలుచేసే అవకాశం ఉన్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతున్నది? ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లేమి, నాణ్యమైన బోధన లోపం, ఇంగ్లిష్ మీడియంపై తల్లిదండ్రుల ఆకాంక్ష వంటి మూలకారణాలను పరిష్కరించకుండా పాఠశాలలను మూసివేయడం సమస్యకు పరిష్కారం కానేకాదు. ఈ విలీనం వెనుక మరో ప్రధాన ఉద్దేశం ఉపాధ్యాయుల సర్దుబాటు, భవిష్యత్తులో డీఎస్సీ నియామకాలను తగ్గించడం, జీతభత్యాల భారాన్ని తగ్గించుకోవడమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక తరగతిలో 5060 మంది విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం అసాధ్యం. నాణ్యమైన విద్య అందించడం మరింత కష్టమవుతుంది. ప్రతి గ్రామ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఉపాధి పొందుతున్న పేద మహిళలు ఉద్యోగాలు కోల్పోతారు. గ్రామ పాఠశాలపై స్థానిక సమాజం, తల్లిదండ్రులు, విద్యాకమిటీలు, ప్రజాప్రతినిధులకు ప్రస్తుతం ఉన్న పర్యవేక్షణ పూర్తిగా తగ్గిపోతుంది.
ఇదే అంశంపై ఇటీవల ప్రొఫెసర్ హరగోపాల్, ఆర్థికవేత్త నరసింహారెడ్డి, జస్టిస్ చంద్రకుమార్తోపాటు 125 మంది ప్రముఖ విద్యావేత్తలు, కవులు, మేధావులు, పౌరసమాజ ప్రతినిధులు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదని, సమాజంలోని వివిధ వర్గాల్లో నెలకొన్న ఆందోళనకు ప్రతిబింబమని పాలకులు గుర్తించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. లేకపోతే పేద విద్యార్థులు చదువుకు దూరమవుతారు.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
షేక్ ఫారెజ్ మొహియుద్దీన్ 9666174738