ఒక వ్యక్తి అనారోగ్యం పాలై, ఓ డాక్టర్ దగ్గరికి వెళ్లాడు. పరీక్షించిన డాక్టర్ ఆ రోగికి మందు ఇచ్చాడు. ‘ఇది దివ్యౌషధం. నీ రోగం పూర్తిగా నయమైపోతుంది’ అని చెప్పి పంపించాడు. రోజులు గడుస్తున్నా రోగం మానకపోగా తీవ్రమవుతున్నది. రోగి మళ్లీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్లి.. ‘ప్రాణాలు పోయేలా ఉన్నాయి.. మీరిచ్చిన మందు పనిచేయడం లేదు’ అని చెప్పాడు. డాక్టర్ అతడిని తన దగ్గర పనిచేసే జూనియర్ డాక్టర్ దగ్గరికి పంపించాడు. ఆ జూనియర్ డాక్టర్ పేషెంట్ను చూసి ‘ఇన్ని రోజులు వాడిన ఔషధం సరైంది కాదు. అదే మీ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసింది. నేను ఓ అద్భుతమైన మందు తయారుచేశాను. నీ రోగం పూర్తిగా నయమవుతుంది’ అని చెప్పాడు. రోగి నోరెళ్లబెట్టాడు.
పైన మనం చెప్పుకొన్న రోగం పేరు బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీ. పెద్ద డాక్టర్ ప్రధాని నరేంద్ర మోదీ. రోగానికి మొదట వేసిన మందు పెద్ద నోట్ల రద్దు. జూనియర్ డాక్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చిన్న డాక్టర్ వేసిన మందు రూ.2000 నోటు రద్దు. రోగి దేశ ఆర్థికవ్యవస్థ. దూరదృష్టి లేకుండా తీసుకున్న నిర్ణయాలు ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తాయో తెలుసుకోవడానికి ఇది ఓ ఉదాహరణ. తెలిసీ తెలియక ఒకసారి తప్పు చేస్తే.. అది పునరావృతం కాకుండా చూసుకోవాలి. కానీ అది ముమ్మాటికీ తప్పేనని, కోట్లాది మంది ప్రజల నోటికాడి బుక్కపై దెబ్బ వేస్తుందని తెలిసినా పదేపదే అదే నిర్ణయం తీసుకుంటున్నారంటే ఇది కచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పనేనని భావించాల్సి ఉంటుంది. ఇదంతా రూ.2000 రద్దు గురించే. రూ.2 వేల నోటు రద్దుకు ఆర్బీఐ చెప్పిన కారణం నకిలీ కరెన్సీ లేకుండా చేయడం. కానీ 2016లో ఆ నోటును చలామణిలోకి తెచ్చింది కేంద్రంలోని మోదీ సర్కారే.
ఇప్పటి వరకు దేశంలో చలామణిలోకి వచ్చిన కరెన్సీలో అతిపెద్ద డినామినేషన్ ఇదే. దీన్ని తీసుకురావడానికి చెప్పిన కారణం కూడా బ్లాక్ మనీ, ఫేక్ కరెన్సీ నిర్మూలన, ప్రజల నగదు అవసరాలు తీర్చడం. మళ్లీ ఇప్పుడు అదే పేరు చెప్పి.. అదే నోటును వెన క్కి తీసుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో రూ.6.73 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటన్నింటిని ఇప్పుడు వెనక్కి తీసుకొని స్క్రాప్ చేస్తారు. రూ.2 వేల ఒక్కో నోటు తయారీకి రూ.4కు పైగా ఖర్చయింది. 2 వేల నోట్ల మొత్తం కరెన్సీ తయారీకి రూ.1200 కోట్లు ఖర్చయింది. ఇప్పుడు ఆ 1200 కోట్లను బూడిదలో పోస్తున్నారన్నమాట.
రూ.2 వేల నోటు తీసుకురావడం ఆర్థికవ్యవస్థకు మంచిది కాదని ఆర్థికవేత్తలు నాడే హెచ్చరించారు. అయినా మోదీ సర్కారు పట్టించుకోలేదు. పైగా ఇది నల్ల ధనాన్ని, నకిలీ కరెన్సీని అరికడుతుందన్నారు. ‘నాకు 50 రోజుల సమయం ఇవ్వండి.. నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే.. మీరే శిక్ష విధించినా నేను సిద్ధం’ అని స్వయంగా ప్రధాని మోదీ నోట్ల రద్దు తర్వాత భావోద్వేగ ప్రసంగాలు చేశారు. ఓ ప్రధాని తాను పదవిలోకి వచ్చాక వినియోగంలోకి తెచ్చిన కరెన్సీని తానే కేవలం ఆరేండ్ల వ్యవధిలోనే రద్దు చేస్తున్నారంటే తాను పాలకుడిగా విఫలమయ్యానని ఒప్పుకున్నట్టే కదా? నాడైనా.. నేడైనా.. నోట్ల రద్దు వెనుక రాజకీయ దురుద్దేశం తప్ప మరొకటి లేదనేది ఆర్థికవేత్తలు చెప్తున్న మాట.
ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇతర పార్టీల నేతల దగ్గర నగదు నిల్వలుంటే, దాన్ని దెబ్బతీస్తే ఎన్నికల్లో తమ కు ఎంతో కొంత కష్టాలు తగ్గుతాయనేది బీజేపీ ఆలోచన. ఈ లెక్కన చూసినా మోదీ సర్కారు చెప్పిన నోట్ల రద్దు లక్ష్యం నెరవేరనట్టే కదా! అలాంటప్పుడు ఆరేండ్ల కిందట చేసిన నోట్ల రద్దుతో సాధించిందేమిటి? ఇప్పుడు రూ.2 వేల నోటు రద్దుతో సాధించేదేమిటి? ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చి అధః పాతాళంలోకి నెట్టడం తప్ప మరేం జరగలేదు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమ రాజకీయ అవసరాలను కొంతవరకు మాత్రం సాధించుకున్నది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కొన్ని పార్టీలను తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తమ వ్యతిరేక ఓట్లను చీల్చే ఆయుధాలుగా వాటిని వాడుకున్నది. ఈసారి నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశ ప్రధాని స్వయంగా ప్రకటించకుండా ఆర్బీఐ ద్వారా ప్రకటన చేయించడం కూడా బహుశా అందుకేనేమో.
దేశంలో ఎప్పుడు, ఏ కరెన్సీ నోటు జీవితకాలం ముగిసిపోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. అలాగని బ్యాంకులో వేస్తే… నగదు ‘విత్ డ్రా’కు అడ్డగోలు ఆంక్షలు. ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ మీద ప్రజలు నమ్మకం కోల్పోయారు. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటే దేశం అధోఃగతి పాలవుతుంది. దేశం, దేశ ప్రజలు ఏమైపోయినా మాకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. కాబట్టి దేశ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందే. చేసిన తప్పునకు క్షమాపణలు అడగాల్సిందే.
(వ్యాసకర్త: తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్)
-వై.సతీష్ రెడ్డి
96414 66666