ఆడిన మాట తప్పడం, అబద్ధాలు ప్రచారం చేయడం, నమ్మినవారిని నట్టేట ముంచడమే తమ సంస్కృతి అని కాంగ్రెస్ పార్టీ మరోసారి రుజువు చేస్తున్నది. తాము గెలిచిన రాష్ర్టాల్లో ఒకలా, మిగతా రాష్ర్టాల్లో మరోలా ప్రవర్తిస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నది. దేశంలో ఎక్కడాలేని విధంగా పింఛన్లను అందిస్తున్న తెలంగాణ సర్కార్పై ఆరోపణ చేస్తున్నది.
ఇచ్చినమాట తప్పడం, అధికారం కోసం అర్రులు చాచడం.. అమలు కాని వాగ్దా నాలు చేయడం.. అవి సాధ్యం కాదని తెలిసినా ప్రజలను మభ్యపెట్టడం.. ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావడం.. తద్వారా వాటిని తుంగలో తొక్కడం కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య. ఇటీవల అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో కాంగ్రెస్ ఇదే విధానాన్ని పాటిస్తున్నది. ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ. 4 వేల పింఛన్ అందిస్తామని హామీ ఇచ్చారు. మరి కాంగ్రెస్ పాలిత కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో రూ.4 వేల పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదు. అక్కడ ఇవ్వనిది.. ఇక్కడెట్ల సాధ్యమైతది. అంటే తెలంగాణ ప్రజలు అమాయకులు, ఏది చెప్పినా నమ్ముతరు.. ఓట్లేస్తరు అనే భ్రమల్లో కాంగ్రెస్ నేతలున్నారు. కానీ ఇక్కడి ప్రజలు అమాయ కులేం కాదు. అడ్డగోలు హామీలిస్తే ప్రజలే వారికి తగినరీతిలో బుద్ధి చెప్తారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఇచ్చే పింఛన్తో పది రోజులకు సరిపడా కూరగాయలు రాని పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఒకే తీరుగా పింఛన్ చెల్లించే విధానం అమలు చేయడం లేదు. ఒక్కో చోట ఒక్కో పద్ధతి అమలుచేస్తున్నది. అర్హుల ఎంపికలో సవాలక్ష ఆంక్షలు పెడుతున్నది. నెల సంపాదన రూ.5-6 వేలు దాటితే ధనవంతుల కింద చూపి పింఛన్కు అనర్హలుగా ప్రకటిస్తున్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అక్కడి సర్కారు అమలుచేయలేక ఆపసోపాలు పడుతున్నది. ప్రతి వ్యక్తికి 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తామని ఆశచూపి అధికారంలోకి వచ్చినతర్వాత బియ్యం ఇవ్వలేక మొండిచేయి చూపుతున్నది. ఉమ్మడి ఏపీలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు రూ.200, దివ్యాంగులకు రూ. 500, వితంతువులకు రూ.200లు అందజేశారు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అన్నిరంగాల్లో ముందుకువెళ్తున్నది. బీఆర్ఎస్ సర్కారు వృద్ధులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,116, వితంతువులకు రూ.2,016 అందిస్తున్నది. ఇది కాంగ్రెస్ నాయకులకు కంటగింపుగా మారింది. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు లేనిపోని హామీలు ఇస్తూ మోసగించే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రోజుల తరబడి మేధోమథనం చేశారు. మానవీయ కోణంలో అభాగ్యులకు అండగా నిలువాలని ఆయన సంకల్పించారు.
ఆ లక్ష్యంతోనే ఆసరా పింఛన్ పథకం పురుడుపోసుకున్నది. ప్రస్తుతం ఈ పథకం అభాగ్యులకు భరోసా కల్పిస్తున్నది. తెలంగాణ సర్కారు మాకు అండగా ఉన్నదనే ధైర్యంతో లబ్ధిదారులు జీవిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 11 వర్గా ల ప్రజలకు ఆసరా అందిస్తున్నది.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఎయిడ్స్ రోగులు, చేనేత కార్మికులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ రోగులు, గీత కార్మికులు, వృద్ధ కళాకారులు, బీడీ కార్మికులు పింఛన్ పొందుతున్నారు. కాం గ్రెస్ నాయకులు ప్రకటించక ముందునుంచే సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దివ్యాంగులకు రూ.4 వేల పింఛన్ అందిస్తామని ప్రకటించారు. ఈ నెల నుంచి ఆ హామీ అమలు కానున్నది. ఇలాంటి ఎన్నో పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలుకావడం లేదు. ఆ పార్టీ నాయకులు మాత్రం ఇక్కడి ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారు. అలవికాని హామీలతో మభ్యపెడుతున్నారు. కాంగ్రెస్ శుష్క వాగ్దానాలను నమ్మితే మోసపోతాం. మోసపోతే గోస తప్పదు. తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.
గొట్టిముక్కుల బ్రహ్మచారి
9441884389