ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న మన రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. గతంలో దేశ ప్రధాని ఒక రాష్ట్ర పర్యటనకు వస్తున్నారంటే ఆ రాష్ట్ర ప్రజల్లో, ప్రజాప్రతినిధుల్లో ఎన్నో ఆశలు చిగురించేవి. ప్రధాని రాష్ర్టానికి ఏం వరాల జల్లు కురిపిస్తారోనని. కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక అలాంటి ఆశలన్నీ అడుగంటిపోయాయి. వరాలు కురిపించే మాట దేవుడెరుగు, బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ర్టాల్లో ఏకంగా నిప్పులు కురిపించడమే ఆయనకు తెలుసు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాటిస్తున్న ఈ సంప్రదాయాన్ని ఈ నెల 8 నాటి పర్యటనలో సైతం కొనసాగిస్తారా? లేక గత ప్రధానుల మాదిరిగా, తన స్టయిల్కు భిన్నంగా ఏమైనా వరాలు కురిపిస్తారో వేచిచూడాలి.
ఏ రాష్ట్రమైన కావచ్చు ముఖ్యమంత్రి తమ జిల్లాల్లో పర్యటిస్తున్నారంటే పార్టీలకతీతంగా ఆ జిల్లాలోని ప్రజాప్రతినిధులు అందరూ సంబురపడుతారు. ప్రజలూ సంతోషిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనతో తమ జిల్లాకు ఏదైనా మేలు జరుగుతుందని ఆశిస్తారు. ముఖ్యమంత్రు లు కూడా తాము జిల్లాకు వెళ్లేముందే ఆ జిల్లాకు సంబంధించిన ప్రధానమైన సమస్యలేమిటి? అక్కడి ప్రజాప్రతినిధులు తన నుంచి ఏం ఆశిస్తున్నారు? వాటిని ఎంతవరకు నెరవేర్చే అవకాశం ఉన్నదని అధికారులను నుంచి పూర్తి సమాచారం తీసుకుంటారు. ప్రభుత్వానికి సాధ్యమైనంత వర కు అక్కడి పెండింగ్ సమస్యలో, ఇతర అభివృద్ధి కార్యక్రమాలో ప్రకటిస్తారు.
అదేవిధంగా ప్రధాని తమ రాష్ర్టానికి వస్తున్నారంటే ఆయా రాష్ర్టాలు కూడా కేంద్రంపై, ప్రధాని పై ఎన్నో ఆశలు పెట్టుకొంటాయి. తమ రాష్ర్టానికి సంబంధించి పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, రాష్ర్టానికి ఏదో మేలు చేస్తారని ఆశిస్తారు. గతంలో ప్రధాని రాష్ర్టాల్లో పర్యటిస్తే ఇలా గే ఉండేది. కానీ నరేంద్ర మోదీ ఈ విధానానికి స్వస్తిపలికి చాలాకాలమైంది. గుజరాత్ మినహా మరే రాష్ట్రంపై ప్రధాని కరుణ కనిపించడం లేదు. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ర్టాలనైతే ఏకం గా శత్రురాజ్యల్లా కేంద్రం భావిస్తున్నది.
ప్రపంచంపై అమెరికా తన పెత్తనాన్ని ప్రదర్శిస్తూ తనకు నచ్చని దేశాలపై ఆంక్షలు విధిస్తుం ది. ఆయా దేశాలను దారిలోకి తెచ్చుకోవడానికి, అమెరికా అలా చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. కానీ మోదీ ప్రభుత్వం శత్రు దేశాల పట్ల ఉదారంగానే ఉన్నా, బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ర్టాలను మాత్రం సహించలేకపోతున్నది. అమెరికా ఆంక్షలతో దేశాలను కట్టడి చేస్తే, మోదీ ప్రభు త్వం గవర్నర్లు, ఈడీ, సీబీఐ వంటి వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నది. ఆర్థికంగా ఆంక్షలు, నిధుల కేటాయింపులో వివక్ష ద్వారా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ర్టాలను తమ అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నది. వీలైతే శాసనసభ్యుల కొనుగోలు, లేదా ఏక్నాథ్ షిండేలను తయారుచేయ డం ద్వారా బీజేపీ ఒక్కో రాష్ర్టాన్ని జయిస్తూ పోతున్నది. ఒక్క తెలంగాణ అనే కాదు బీజేపీయేతర ప్ర భుత్వాలున్న అన్ని రాష్ర్టాల్లోనూ బీజేపీది ఇదే తీరు.
మోదీ ప్రధాని అయిన కొత్తలో ఏపీ కొత్త రాజధాని అమరావతి ప్రారంభోత్సవానికి ఏపీ ప్రభు త్వం ఆయనను పిలిచింది. అప్పుడు అధికారం లో ఉన్నది బీజేపీ మిత్రపక్షమైన టీడీపీ. కొత్త రాజధానికి మోదీ పెద్ద ఎత్తున సాయం చేస్తారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా అంతా ఆశించా రు. తెలంగాణ తరపున సహాయం ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అనుకున్నారు. ప్రధాని చేసే సాయం చూసి ఆ తర్వాత తెలంగాణ తరుపున ప్రకటించాలనుకున్నారు. తీరా నరేంద్రమోదీ కొత్త రాజధాని శంకుస్థాపనకు గంగానది నుంచి చెంబెడు నీళ్లు, ఒక తట్టెడు మట్టి తీసుకు వచ్చి ఇచ్చారు. ఒకరి మొఖం ఒకరు చూసుకోవడం అక్కడున్నవారి వంతైంది. ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకున్నా గృహ ప్రవేశానికి వెళ్లిన వారు ఎంతో కొంత నగదు ఇస్తారు. కానీ రాజధాని నిర్మాణానికి ప్రధానిస్థాయి వ్యక్తికి సహాయం చేయడానికి మనసు రాలేదు.
శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు బేరాలాడితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని దేశం ముందు దోషిగా నిలబెట్టిన తెలంగాణకు ప్రధాని ఏదో సహాయం ప్రకటిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. దేశంలో 180 మెడికల్ కాలేజీలు ప్రకటించినా తెలంగాణకు ఒక్కటి ఇవ్వడానికి కూడా మనసు రాలేదు. విభజన చట్టంలోని హామీలను ఆంధ్ర,తెలంగాణలోనూ నెరవేర్చలేదు.ఆంధ్రలోని రాజకీయ పరిస్థితుల వల్ల వారికి జరిగిన అన్యాయాన్ని కూడా వారు ప్రశ్నించడం లేదు.
మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్తగా వరాలిచ్చే మాట దేవుడెరుగు, ఆయన కన్నా ముందున్న ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను సైతం అటకెక్కించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, చివరికి యూపీయే ప్రభుత్వం ఎన్నో ఆశలు కల్పించిన భారీ ప్రాజెక్టు ఐటీఐఆర్ను సైతం మోదీ అటకెక్కించారు. మేం అధికారంలోకి వచ్చాక తెలంగాణకు ఓ భారీ ప్రాజెక్టు ఇచ్చామని చెప్పుకోవడానికి బీజేపీకి ఏమీ లేదు. పైగా తెలంగాణను శత్రుదేశంలా చూస్తూ కక్ష సాధిస్తున్నది.
శాసనసభ్యుల కొనుగోలుకు ప్రయత్నించి బీజే పీ ప్రతినిధులు పట్టుబడిన విషయం దేశ వ్యాప్తం గా సంచలనమైంది. ఆ సంఘటన తర్వాత రాష్ట్రంలో మోదీ పర్యటించి పార్టీ సమావేశంలో ప్రతీకారం తీర్చుకుంటామన్నట్టు బల్లగుద్ది మాట్లాడారు. దేశ చరిత్రలో గతంలో ఏ ప్రధాని కూడా అలా ఓ గల్లీ నాయకుడిలా, ఒక రాష్ట్రంపై ప్రతీకారం తీర్చుకుంటామని మాట్లాడిన సందర్భం లేదు. రాష్ట్రంలో ఒక పార్టీ, కేంద్రంలో మరోపార్టీ అధికారంలో ఉండటం ఇదేం మొదటిసారి కాదు. కానీ రాష్ర్టాల పట్ల ఇంత బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేయడం మాత్రం ఇప్పటి కొత్త రాజకీయం. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఉద్రికత్తతలపైనే ఆధారపడి రాజకీయం చేస్తారా? లేక ‘మేం తెలంగాణకు ఇది చేశాం, మమ్మల్ని గెలిపించండి’ అని చెప్పుకోవడానికైనా ఏమైనా ప్రకటిస్తారా? రాష్ట్రప్రజల ఓట్లను ఆశించే ఏ పార్టీ అయినా రాష్ర్టానికి మేలు జరిగేలా కృషిచేయడం ధర్మం. ఆ ధర్మాన్ని మోదీ పాటిస్తారా? లేదా ‘రాష్ట్ర ప్రభుత్వ సంగతి తేలుస్తాం’ అని విషం కక్కుతారా చూడాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
బుద్దా మురళి
98499 98087