BJP | దేశంలో బీజేపీ బలం చెక్కుచెదరలేదా? కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ శత్రుదుర్భేద్యంగానే ఉన్నదా? ముఖాముఖి తలపడే రాష్ర్టాల్లో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్కు లేనట్టేనా? వివిధ రాష్ర్టాల్లోని ప్రాంతీయ శక్తులు కూడా ఇక కమలదళం ముందు తలవంచక తప్పదా? తెలంగాణ లాంటి దక్షిణాది రాష్ర్టాల్లోనూ కమలం వికసిస్తున్నదా? కేంద్రంలో ప్రధాని మోదీకి హ్యాట్రిక్ విజయం ఖాయమైనట్టేనా? బీజేపీ కేంద్రంలో మరే ఇతర పార్టీల సహకారం లేకుండానే, సొంత మెజారిటీతోనే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా?
భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు ఎన్నికైన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించబోతున్నారా? తాజాగా జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి సందేహాలు ఎందుకన్న ప్రశ్న కలగడం సహజం. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఫలితాలతో బీజేపీలో కదనోత్సాహం తొణికిసలాడుతున్నది.
ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ మీద సెటైర్లు పేల్చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడంతో పాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లోనూ కాంగ్రెస్ను గద్దె దించి, అధికారంలోకి రావడం, తెలంగాణ అసెంబ్లీలోనూ తన సంఖ్యా బలాన్ని 8 స్థానాలకు పెంచుకోవడం నిస్సందేహంగా బీజేపీ శ్రేణులను ఉత్సాహపరిచే అంశమే. అయినా, ఆయా రాష్ర్టాల ఫలితాలను సావధానంగా విశ్లేషించుకుంటే ఆ పార్టీకి కొన్ని ప్రమాద హెచ్చరికలూ కనిపిస్తున్నాయి.
మరో ఆరు నెలల్లో లోక్సభ ఎన్నికలున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనాయకత్వం సర్వశక్తులు ఒడ్డింది. ఆ మూడు రాష్ర్టాల ఎన్నికలను ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తానే స్వయంగా అక్కడి ప్రత్యర్థులతో పోటీ పడుతున్నట్టుగా ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకత్వం ప్రాధాన్యాన్ని తగ్గించి, తన చుట్టూనే ఎన్నికల ప్రచారాన్ని కేంద్రీకరించారు. ఆయా రాష్ర్టాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరినీ ప్రొజెక్ట్ చేయలేదు. పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దింపారు. పార్టీ జాతీయ నాయకత్వం మొత్తం ఆ మూడు రాష్ర్టాలపై దృష్టి కేంద్రీకరించి పనిచేసింది. ఇంతచేసినా ఆ మూడు రాష్ర్టాల్లో బీజేపీ పొందిందేమిటి? పోగొట్టుకున్నదేమిటి? 2019 లోక్సభ ఎన్నికలతో పోల్చుకుంటే ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడిందా? రానున్న లోక్సభ ఎన్నికల్లో అదనంగా పొందగలిగేదేమిటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
లోక్సభ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న లోక్సభకు 2019 ఏప్రిల్, మే నెలల్లో ఏడు విడుతలుగా పోలింగ్ జరిగింది. ఈ సారి కూడా ఇంచుమించు అదేవిధంగా పోలింగ్ జరిగే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఇప్పటి మాదిరిగానే లోక్సభ ఎన్నికల కంటే ఐదారు నెలలు ముందుగానే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో వాటిని సెమీ ఫైనల్స్గా భావించారు. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ మాత్రం వాటిని సెమీఫైనల్స్గా పరిగణించడానికి నిరాకరించింది. నాడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించడమే అందుకు కారణం. ఆనాటి ఫలితాలను చూసుకొని కాంగ్రెస్ మురిసిపోయింది. మళ్లీ కేంద్రంలో తమకు మంచి రోజులొస్తున్నాయని కాంగ్రెస్ నేతలు కలలుగన్నారు.
ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం పడిపోతుందని, మళ్లీ తమ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశపడ్డారు. కానీ, 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు భారీ షాక్ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చిన ఆ మూడు రాష్ర్టాల్లోనూ ఆరు నెలలకే కాంగ్రెస్ చతికిలపడింది. మూడు రాష్ర్టాల్లో కలిపి మూడు ఎంపీ సీట్లను గెలుచుకోవడమే కాంగ్రెస్కు గగనమైపోయింది. రాజస్థాన్లో కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదు. మధ్యప్రదేశ్లో ఒకటి, ఛత్తీస్గఢ్లో రెండు ఎంపీ సీట్లు మాత్రమే దక్కాయి. ఆరు నెలల్లోనే ఎంత మార్పు?! 2019 లోక్సభ ఎన్నికల్లో ఆ మూడు రాష్ర్టాలను బీజేపీ క్లీన్స్వీప్ చేయడమే కాకుండా తెలంగాణలోనూ అనూహ్యంగా నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకొని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు కూడా అప్పటి మాదిరిగానే ఆయా రాష్ర్టాల ఓటర్ల మూడ్ మారితే బీజేపీ పరిస్థితి ఏమిటన్నది మరో ఆసక్తికర ప్రశ్న.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, కాంగ్రెస్ పునాదులను పెకిలించలేకపోయింది. ఆ రెండు పార్టీల ఓటు షేర్లో స్వల్ప తేడా మాత్రమే ఉన్నది. మధ్యప్రదేశ్లో ఆ రెండు పార్టీలు సాధించిన ఓట్లలో దాదాపు 8 శాతం వ్యత్యాసం ఉన్నప్పటికీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో
2-4 శాతమే తేడా ఉండటం విస్మరించలేనిది.
ఛత్తీస్గఢ్లో 11, మధ్యప్రదేశ్లో 29, రాజస్థాన్లో 25 చొప్పున ఈ మూడు రాష్ర్టాల్లో కలిపి మొత్తంగా 65 లోక్సభ స్థానాలున్నాయి. ఇందులో ప్రస్తుతం 61 స్థానాలు బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి. కాంగ్రెస్కు ఉన్నవి మూడంటే మూడే! 2018-19 మాదిరిగానే 2023-24లో కూడా అసెంబ్లీలో ఒక పార్టీకి, లోక్సభలో మరో పార్టీకి అవకాశం ఇద్దామని ఓటర్లు భావిస్తే ఆయా రాష్ర్టాల్లో ఎక్కువగా నష్టపోయేది బీజేపీయే. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని కాంగ్రెస్ కాపాడుకోగలిగినా ఆ మూడు రాష్ర్టాల నుంచి బీజేపీ గెలుచుకోగలిగే ఎంపీ స్థానాల సంఖ్య ఏదో ఒక మేరకు పడిపోతుంది! ఏ కోణంలో చూసినా ఆ మూడు రాష్ర్టాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్ల శాతంలో ఉన్న తేడా బీజేపీకి ప్రమాదకర హెచ్చరికే!
మధ్యప్రదేశ్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన 41.02 ఓట్లతో పోల్చుకుంటే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన 48.76 శాతం ఓట్లు దాదాపు 8 శాతం ఎక్కువ. అయినా, 2019 లోక్సభ ఎన్నికల్లో సాధించిన 58.54 శాతం ఓట్లతో పోల్చుకుంటే దాదాపు 10 శాతం తక్కువన్న విషయాన్ని విస్మరించకూడదు. రాజస్థాన్లోనూ అదే పరిస్థితి. అక్కడ బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 39.5 శాతం ఓట్లు, 2019 లోక్సభ ఎన్నికల్లో 59.07 శాతం ఓట్లు లభించగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 41.7 శాతం ఓట్లు లభించాయి. 2018 కంటే ఓట్ల శాతం పెరిగినా 2019తో పోల్చుకంటే తగ్గడం గమనార్హం.
ఛత్తీస్గఢ్లోనూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అక్కడ బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 32.9 శాతం ఓట్లు, 2019 లోక్సభ ఎన్నికల్లో 51.44 శాతం ఓట్లు లభించాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 46.3 శాతం ఓట్లు దక్కాయి. ఛత్తీస్గఢ్లో బీజేపీ ఓటు షేర్ 2019తో పోల్చుకుంటే దాదాపు 5 శాతం తగ్గడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ను ప్రభావితం చేసే అంశాలకు లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలకు తేడాలు ఉండే మాట వాస్తవమే అయినా ఆ మూడు రాష్ర్టాల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం 40 దాకా ఉండటం చిన్న విషయమేమీ కాదు. ఈ మూడు రాష్ర్టాల్లో ఇండియా కూటమిలోని పార్టీలను కాంగ్రెస్ కలుపుకొని పోలేదని, దానివల్ల కొంత నష్టపోయిందన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల నాటికి ఇండియా కూటమిలోని పార్టీలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కాంగ్రెస్ వ్యవహరిస్తే.. ఎంతో కొంత లాభపడే అవకాశాలూ లేకపోలేదు.
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ సీట్ల సంఖ్య మునుపెన్నడూలేని రీతిలో 8కి పెరిగినప్పటికీ 2019 లోక్సభ ఎన్నికలతో పోల్చుకుంటే ఆ పార్టీ పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదనే చెప్పాలి. ఎందుకంటే 2019లో బీజేపీ 19.65 శాతం ఓట్లు, నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్నది. కానీ, ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 14 లోపే ఉంది. అంతేకాదు, ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా పోటీచేసిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు ఓడిపోవడం దేనికి సంకేతమో బీజేపీ నేతలు విశ్లేషించుకునే తీరు మీదనే తెలంగాణలో ఆ పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
కందిబండ కృష్ణప్రసాద్
91827 77010