‘సంజయా, నేను అంధుడను. నాకు చూపు లేదు. యుద్ధభూమిలో ఏమి జరుగుతున్నదో వివరంగా నాకు చెప్పు. చాల ఆతృతగా, ఆందోళనగా ఉంది’ పాపం అంధరాజు ధృతరాష్ర్టుడికి చూపు లేకపోయినా నమ్మకస్థుడైన సంజయుడు తాను చూసింది చూసినట్టు చెప్పసాగాడు. అది ద్వాపర యుగం. కొందరు అధర్మపరులైనా, ధర్మాత్ములు కూడా చాలామందే ఉండేవారు.
ఇది కలియుగం. పైగా గత తొమ్మిదేండ్లుగా భారతీయులకు కలియుగంలోని ద్వితీయ పాదం వచ్చినట్టే ఉంది. అసహాయుల జీవితాలు దుర్భరమవుతూ, అన్యాయాలు అక్రమాలు చేసేవాళ్లు ప్రపంచ కుబేరులవుతున్నారు. వారంతట వారే పైకి ఎగబాకితే ఎవరికీ అభ్యంతరం లేదు; కానీ నిష్పక్ష పాలన సాగించవలసిన పాలకులు వారి కాపు కాసి, సహాయం చేస్తుంటేనే భరించ లేకుండా ఉంది.
భారతీయ జనతా పార్టీ ఘనత ఇంకోటి కూడా ఉటంకించారు గౌరవ ప్రధానమంత్రి. లక్షల మంది మహిళలకు గ్యాస్ పొయ్యిలు, కనెక్షన్లు ఇచ్చామని. కానీ, రూ.410 ఉన్న గ్యాస్ సిలిండరు రూ.1200 అయ్యేటప్పటికి వాటిని ఇంటి బయట పెట్టి, కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నారు వేలాది మంది మహిళలు. కట్టెల పొయ్యి వంట చేత కాని, ఉద్యోగాలు చేస్తున్న వనితలు కేంద్రాన్ని తిట్టుకుంటూ గ్యాస్ వాడుతున్నారు.
ఇంతకీ తల్లిని చంపి తీసిన ఈ పిల్ల తెలంగాణ రాష్ట్రంలో కలియుగ పాలకుడు ఏమని సెలవిచ్చాడో విశ్లేషిద్దాం. ఈనాటి ప్రధానమంత్రి భాషణలో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. తెలంగాణకి ఎన్నో చేసిన, చేస్తున్న కేంద్రప్రభుత్వం ఇప్పుడున్న హైవేలని రెండింతలయేట్టు అభివృద్ధి చేస్తున్నాం అన్నది మొదటి అంశం. ఒకావిడ పక్కింటావిడని అడిగిందట. ‘నువ్వు చేసే అతి గొప్ప పని గురించి చెప్పు’ అని. దానికి ఆవిడ ‘నాకు ఇద్దరు పిల్లలు. వాళ్ళకి రోజూ రెండుపూటలా అన్నం వొండి పెడుతున్నా. నాకంటే గొప్పవాళ్ళెవరు?’ అని ఎదురు ప్రశ్న కూడా వేసిందట గర్వంగా చూస్తూ. ప్రశ్న అడిగిన ఆవిడ నిర్ఘాంతపోయింది. పిల్లలకి అన్నం పెట్టడం తల్లి ‘బాధ్యత కదా’ అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. సరిగ్గా ఇలాగే తమ బాధ్యతే అయిన నాలుగు హైవేలని నిర్మిస్తున్నామని తొమ్మిదేళ్లు పాలించిన ప్రధానమంత్రి చెప్పటం ఎంత హాస్యాస్పదం! ప్రగతిని తెలంగాణ ముఖ్యమంత్రిలాగా పరుగు పెట్టించి ఉంటే ఈ పాటికి దేశంలో అన్ని హైవేల నిర్మాణం పూర్తయ్యేదే కదా!
ఇక రెండో విషయం. తెలంగాణకి ఎన్నో ఇచ్చామని చెప్తూ 20 లక్షల మరుగుదొడ్లు కట్టి మనుష్యులని ఉద్ధరించామని చెప్పారు ప్రధానమంత్రి. నిజానికి అవి లేకపోయినా బయటకు వెళ్ళి, ముఖ్యమంత్రి సమకూర్చిన చెరువుల నీళ్ళు మత్తడి లెక్కుతున్నాయి కాబట్టి, శుభ్రంగా కడుక్కుని ఇళ్ళకి రావచ్చు. మరి నిజమైన ప్రగతి కోసం, నవోదయ పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న వేల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారు? 140 కోట్ల భారతీయులకి మరుగుదొడ్లు సమకూర్చిన తర్వాతనా? అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ప్రధాని పీఠంపై ఉన్న వారు విద్యావంతులై ఉండాలని అన్నాడు. లేకపోతే మరుగుదొడ్లు ముఖ్యమనీ, విద్యాలయాలు అవసరం లేదనీ అనుకునే ప్రమాదం ఉంది మరి! భారతీయ
జనతా పార్టీ ఘనత ఇంకోటి కూడా ఉటంకించారు గౌరవ ప్రధానమంత్రి. లక్షల మంది మహిళలకు గ్యాస్ పొయ్యిలు, కనెక్షన్లు ఇచ్చామని. కానీ, రూ.410 ఉన్న గ్యాస్ సిలిండరు రూ.1200 అయ్యేటప్పటికి వాటిని ఇంటి బయట పెట్టి, కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నారు వేలాది మంది మహిళలు. కట్టెల పొయ్యి వంట చేత కాని, ఉద్యోగాలు చేస్తున్న వనితలు కేంద్రాన్ని తిట్టుకుంటూ గ్యాస్ వాడుతున్నారు. మరి ఈ మాట ప్రధాని అన్నపుడు చప్పట్లు కొట్టిన వారికి రాష్ట్ర బీజేపీ నాయకులు ఎంత ముట్టచెప్పారో కనుక్కోవాలి.
ఇక అన్నిటికంటే ముఖ్యమైన అంశం కుటుంబ పాలన వలన తెలంగాణ అభివృద్ధి జరగటం లేదు అని చాలా గట్టిగానే చెప్పారు నరేంద్ర మోదీ. తమను తాము హిందూత్వ అని చెప్పుకొనే వారి ఉద్దేశ్యంలో కుటుంబం అంటే ఏమిటో కానీ, సనాతన ధర్మంలో మాత్రం దానిని ఈ విధంగా నిర్వచించారు. గృహస్థుడి తల్లీ తండ్రి, సంతానం, చుట్టాలు, ఇరుగు పొరుగువారు, స్నేహితులు. వీరందరినీ మించి ఆత్మీయులు పైన చెప్పిన వారయినా కావచ్చు, లేక రక్త సంబంధం లేనివారయినా కావచ్చు. అయితే మన జీవితంలో అందరికీ అనుభవమయేది మాత్రం ఒకలాగే ఉంటుంది. తల్లీ తండ్రి ముసలివారయి కాలం చేస్తారు. కూతురు, కొడుకులు వారి వారి సంసారాల్లో స్థిరపడ్డాక కొద్దిగా దూరమవుతారు. చుట్టాలూ అంతే! ఇరుగు పొరుగు వారు అంతే! స్నేహితుల్లో, తోటి ఉద్యోగస్థులలో, లేక ఏదోరకంగా పరిచయమై దగ్గరయిన వారిలో చివరికి మిగిలేది ఆత్మీయులే. సాధారణంగా వీరు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సంతానం అవడం జరగదు. ఈ మిగిలే ఆత్మీయులకి మనం ఏమి చేయటానికైనా సిద్ధమే. వారూ అంతే. అయితే ఈ బంధం బయటి వారికి అర్థం కాదు ఇప్పుడు మోదీ, అదానీ, అంబానీ ఇంకా కొందరు దేశం విడిచి పారిపోయిన గుజరాతీ కార్పొరేట్ వ్యాపారస్థుల మధ్య ఉన్న బంధం లాగా. ఇది చాల ధృఢమైన బంధం. ప్రపంచమంతా ఎదురు నిలిచినా తెగిపోని బంధం. దీని ముందు కూతురు, కొడుకు, మేనల్లుడు ఎవరైనా నిలువరు.
అయితే ఇన్ని విషయాలలో ప్రధానమంత్రి ఒక్క నిజం మాత్రం చెప్పారు. ఎప్పుడైతే కుటుంబ పాలన, పక్షపాత ధోరణి ప్రబలుతాయో అప్పుడు అవినీతి జడలు విప్పి విజృంభిస్తుంది అని! హిండెన్బర్గ్ రిపోర్ట్లో అదేగా వివరించారు. ఎన్ని అక్రమాలు, అన్యాయాలు, అధర్మాలు కేవలం ఆశ్రిత పక్షపాతం వలన జరుగుతాయో 140 కోట్ల మంది భారతీయులు వీక్షిస్తున్నారు.
దాని ఫలితాలు అనుభవిస్తున్నారు కూడా. మరి ఈ ఆత్మీయ బంధం బలీయమైనదని, కుటుంబసభ్యులు, అతి ముఖ్యమైన తల్లికి, భార్యకి కూడా దూరంగా ఉండగలిగిన ఆత్మనిర్భర్ మనిషిని కూడా లొంగదీసుకుంటుందని తేటతెల్లమయింది కదా. ఈ నిజాన్ని ఒప్పుకున్నందుకు మన ప్రధాని అభినందనీయుడు. మరి ఈ ప్రసంగాన్ని ఆసాంతం విన్న తెలంగాణ ప్రజలు ఏం చెయ్యాలి? ఇది చాల ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం ఇది.
2014 నుంచి తెలంగాణలో జరిగిన ప్రగతి… ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, జీతాల పెరుగుదల, సామాన్యుడి అవసరాలైన కరెంట్, స్వేచ్ఛ, భద్రత, వ్యవస్థల పనితీరు, సంక్షేమ పథకాలు, రైతులు, వృద్ధులు, పెళ్ళికూతుళ్ళు, బీద విద్యార్థుల విదేశీ విద్యా స్కాలర్షిప్లు, వైద్య సదుపాయాలు, రాష్ర్టానికి తరలి వచ్చిన లక్షల కోట్ల పెట్టుబడులు- ఇవన్నీ, రాష్ట్ర ప్రభుత్వం ఏమేమి చేసిందో లెక్క వెయ్యండి. విపక్షాలలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి వారి నియోజకవర్గాల్లో ఎన్నికల వాగ్దానాలు ఎన్ని నెరవేర్చారో లెక్క తేల్చండి. ఇంకా మిగతా రాష్ర్టాల్లో – ముఖ్యం గా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో, తెలంగాణలో జరిగిన ప్రగతి జరిగిందా చూడండి. వారు రోజూ చేసే కార్యక్రమాలు – ధర్నాలు, పాదయాత్రలు, నిరసనలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్రశ్నాపత్రాల లీకులు- ఇవన్నీ తెలంగాణ ప్రజలకి మంచి చేస్తాయా, చెడు చేస్తాయా గమనించి, చర్చించండి. కావాలంటే పల్లెల్లో, పట్టణాల్లో బహిరంగ సభలు పెట్టండి. తాడోపేడో తేలిపోతుంది.
ఇంతకు ముందు కూడా ప్రధానమంత్రి ఇట్లాగే వచ్చి సింగరేణిని ప్రైవేటీకరించే యోచనే లేదని చెప్పి, ఢిల్లీకి వెళ్ళిన మర్నాడే నాలుగు బొగ్గు బ్లాకులకి టెండర్లు పిలిచిన సంగతి గుర్తు చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం కేంద్రం అభివృద్ధి చేస్తానంటే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని సెలవిచ్చారు శ్రీ మోదీజీ. ఈ విషయాన్ని మీ మీ ఎమ్మెల్యేలతో చర్చించండి. దాల్ మే కాలా ఎక్కడుందో తెలుస్తుంది. మనకి తెలిసిన సామెతలు గుర్తు చేసుకోండి. పని చెయ్యని వాడు అబద్ధాలు చెప్తాడు. పనిమంతుడు చేసి చూపిస్తాడు. రెండు రోజులు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టును వివరంగా చూసి రండి. ఒక్క మాట మాత్రం నిజం చెప్పారు మోదీ. ఆయన పాలనలో బీద దళారులు లేరు, అందరూ మట్టిగొట్టుకు పోయారు. గొప్ప కార్పొరేట్లే ఉన్నారు. అది నిజమే! జై తెలంగాణ!
-కనకదుర్గ దంటు
89772 43484