‘ఇది ఎన్నెన్ని జన్మల అనుబంధమో. లేకపోతే రక్తసంబంధీకులు, చుట్టాలే పట్టించుకోని ఈ రోజుల్లో సొంత మేనమామ లెక్క మా బిడ్డల పెండ్లికి తలా రూ.1,00,116 ఇవ్వటం సామాన్యమైన విషయమా?’.. కల్యాణలక్ష్మి పథకం అండతో కుమార్తెల పెండ్లిళ్లు చేసిన ఓ తండ్రి భావోద్వేగం ఇది. సరిగ్గా దీనికోసమే 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. అది అనుకున్న ఫలితాలను సాధిస్తున్నదని రుజువవుతున్నది. కల్యాణలక్ష్మి కింద రాష్ట్రప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.10 వేల కోట్లు అందజేసింది. 11.62 లక్షల మంది యువతులు లబ్ధి పొందారు. అన్ని లక్షల జంటలు తెలంగాణ సర్కారు దీవెనలతో కొత్త కాపురాలను ప్రారంభించాయి. దేశ చరిత్రలోనే ఇంతటి హృద్యమైన, ఇంత భారీ ఎత్తున విజయం సాధించిన పథకం మరొకటి ఉండదేమో!
2002లో ఒక గిరిజన తండాలో జరిగిన అగ్నిప్రమాదంలో బిడ్డ పెండ్లికి దాచుకున్న సొమ్ము కాలిపోయి తండ్రి కన్నీరుమున్నీరవుతుంటే.. అది చూసి చలించిపోయిన నాటి ఉద్యమ నేత కేసీఆర్ తానే ఆ ఖర్చులు భరించి పెండ్లి జరిపించారు. అప్పటి నుంచి ఆ ఘటనను ఆయన మర్చిపోలేదు. ఏ తండ్రికీ బిడ్డ పెండ్లి భారం కావద్దని భావించారాయన. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తీసుకొచ్చిన అనేక వినూత్న పథకాల్లో కల్యాణలక్ష్మి/ షాదీముబారక్ ఒకటి. తొలుత ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రూ.50,001 చొప్పున సాయం ఇవ్వటంతో ప్రారంభమైన ఈ పథకాన్ని తర్వాత కాలంలో బీసీలకు, ఈబీసీలకూ వర్తింపజేశారు. ఆ సాయాన్ని ఇప్పుడు రూ.1,00,116కు పెంచారు. పేద, కార్మిక, కర్షక కుటుంబాలు, ఇంటి పెద్ద లేని కుటుంబాలు ఎన్నో దీనిద్వారా లబ్ధి పొందాయి. బిడ్డ పెండ్లికి సర్కారే స్వయంగా భరోసాగా నిలబడింది.
కల్యాణలక్ష్మి/ షాదీముబారక్ పథకం సమాజంపై కలిగించిన సానుకూల ప్రభావం కూడా చిన్నది కాదు. బిడ్డలు పెరిగి పెద్దయితే కట్నకానుకలు ఇచ్చి పెండ్లి జరిపించలేము కాబట్టి, చిన్నతనంలోనే ఉన్నంతలో చేసేద్దాం అనే పేద తల్లితండ్రుల ధోరణిలో మార్పు వచ్చింది. దీనివల్ల బాల్యవివాహాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఈ పథకానికి 18 ఏండ్లు నిండిన యువతులే అర్హులు కాబట్టి, ఆ వయస్సు వచ్చిన తర్వాతే పెండ్లిళ్లు జరుపుతున్నారు. కేంద్రప్రభుత్వం, ప్రఖ్యాత స్వచ్ఛందసంస్థలు నిర్వహించిన సర్వేలు ఈ విషయాన్ని వెల్లడించాయి. బాలికలను పాఠశాలలకు పంపించటం పెరిగింది. మన సమాజంలో వివాహాన్ని నమోదు చేయించటం ఇప్పటికీ అరకొరగానే జరుగుతున్నది. కానీ, కల్యాణలక్ష్మి పథకం కింద ప్రతి వివాహాన్ని నమోదు చేస్తారు. దీనివల్ల భార్యకు చట్టపరంగా పలు రక్షణలు లభిస్తాయి. కల్యాణలక్ష్మి పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయతకు, దార్శనికతకు దర్పణంగా నిలుస్తున్నది.