‘బీజేపీ తిరోగమన పాలనను చూస్తూ ఊరుకోదు- ఇండియా రియాక్ట్స్’ అన్న కేసీఆర్ మాటను కర్ణాటక రుజువు చేసింది. కన్నడ ప్రజలు దేశానికి ఒక వినూత్న సందేశాన్నిచ్చారు. ఉదాహరణకు.. ‘వరుణ దేవా.. మా పంటలను, ఇళ్ళను విధ్వంసం చేసే తుపానును తప్పించి, ఎంత పెద్ద వర్షాన్నైనా కురిపించు భరిస్తామనే అన్నదాతల్లా’, ‘ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన బీజేపీని ప్రతిఘటించే ఏ పార్టీకైనా మద్దతిస్తామనే వామపక్ష పార్టీల్లా’.. కన్నడ ప్రజలు కూడా చుక్కలను చూపించే ధరలతో ప్రజలకు, దాడులతో పార్టీలకు కునుకు లేకుండా చేస్తున్న తిరోగమన బీజేపీని తిరస్కరిద్దాం, దాన్ని ఢీకొనే మరే పార్టీనైనా స్వాగతిద్దామంటూ’ దేశానికి సరికొత్త సందేశాన్ని అందించారు.
మోదీ ప్రభుత్వం మామూలుగా ఎన్నికలు నిర్వహించి ఉంటే, బహుశా కన్నడ ప్రజలు ఇంత తీవ్రంగా స్పందించి ఉండేవారు కాదేమో? కానీ 40 శాతం కమీషన్ బురదలో పొర్లాడుతున్న బొమ్మై ప్రభుత్వం వైపు, కోట్లాది నోట్లతో పట్టుబడ్డ బీజేపీ మంత్రి వైపు, అంతర్జాతీయ అవినీతిపరునిగా అప్రఖ్యాతిపాలైన అదానీ వైపు గానీ కన్నెత్తి చూడని మోదీ ప్రభుత్వం తీరు వారిని ఆలోచింపజేసింది. ‘కాంగ్రెస్ వాళ్లు అవినీతిపరులన్న అపఖ్యాతిని ప్రజల్లో వ్యాపింపజేయాలని, దర్యాప్తు సంస్థల దాడులతో ఊపిరాడకుండా చేసి, ఎన్నికల ప్రచారంలో వాళ్లు పూర్తిగా నిమగ్నం కాలేని స్థితిని కల్పించాలని బీజేపీ యత్నించటాన్ని కూడా ప్రజలు హర్షించలేదు. అంతేకాదు, రాహుల్గాంధీ జోడోయాత్ర ఇమేజ్ను చెరిపేసేందుకని అతనిపై కేసు బనాయించి, శిక్షించింది కేంద్రం.
కుట్రపూరిత బీజేపీ ఆంతర్యాన్ని గ్రహించి కర్ణాటక కాంగ్రెస్కు ఉత్తర, దక్షిణ ధ్రువాల వంటి శివకుమార్, సిద్ధరామయ్యలు ప్రజలముందుకొచ్చారు. ‘మేం చేయీ చేయీ కలిపి నడుస్తాం, బీజేపీని మట్టిగరిపిస్తా’మంటూ ప్రజలకు భరోసా కల్పించారు. దీంతో తటస్థ ఓటర్లు కూడ ధైర్యంగా కాంగ్రెస్ వైపు మొగ్గారు. ఉదాహరణకు ఎన్నికలకు రెండ్రోజులు ముందుగా, బీజేపీ మద్దతుదార్లయిన లింగాయత్లు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించటం అందుకొక నిదర్శనం.
‘నేనే కింగ్. మాకు అధికారాన్నప్పగిస్తే,
బీజేపీకైనా, కాంగ్రెస్కైనా మద్దతిస్తామంటూ అవకాశవాదాన్ని చాటుకున్నాడు కుమారస్వామి గౌడ, కానీ తరాలుగా అతనికి మద్దతిస్తున్న ఒక్కలిగలు తదితరులు కూడ బీజేపీని ఓడించాలన్న కసితో ఉన్నారు. అందుకే, కుమారస్వామి జేడీఎస్ను తిరస్కరించి కాంగ్రెస్కు ఓటేశారు. కుమారస్వామి కుమారుడు సినీ హీరో నిఖిల్ గౌడ ఓటమి అందుకొక నిద్శనం.
ఈ ఎన్నికల సందర్భంగా బీజేపీ పట్ల ఆగ్రహంతో కన్నడ యువతీ యువకులు ‘ఈ మత విద్వేష బీజేపీని ఢీకొనగల కాంగ్రెస్, కమ్యూనిస్టు, జాతీయ, ప్రాంతీయ పార్టీలలో దేనినైనా గెలిపించుకోవాలన్న మనలాంటి ఆలోచన దేశ ప్రజలందరిలో జ్వలిస్తే ఎంత బాగుంటుందో కదా’ అనుకున్నారట. ఆవేశంలో ఉన్నా అర్థవంతంగానే ఆలోచిస్తున్నారు వాళ్ళని విశ్లేషకులంటున్నారు.
ఎన్నికల ఫలితాలు తెలిశాక చెట్టుకింద సమావేశమైన గ్రామీణ కన్నడ పెద్దలు తమ ఆనందాన్ని పంచుకుంటున్న సందర్భంలో ఒక వృద్ధ రైతన్న మాటలివి. ‘నాకు మాత్రం కాంగ్రెస్ గెలిచింది అన్న మాట కన్నా, బీజేపీ ఓడింది అన్న మాటే గొప్ప ఆనందాన్నిస్తుంది. ఎంతగానంటే, మండుటెండలో చెమటలు కక్కుతూ పనిచేశాక, ఇంటికెళ్లి చన్నీటి స్నానం జేసి, ఫ్యాను కింద కూర్చున్నంత హాయిగా ఉందిరా’ అని అన్నాడు ఆ వృద్ధరైతు. ‘వహ్వా ఏం చెప్పావన్నా’ అంటూ చప్పట్లు, పకపకా నవ్వులతో ఆయన్ను బలపరిచారు తక్కిన రైతులు.
కర్ణాటక ఎన్నికల్లో జరిగిన ఇంకో ఆదర్శనీయ సంఘటన. ‘ప్రజాస్వామ్య పౌర సమాజ పరిరక్షణార్థం శ్రమిస్తున్న వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, లాయర్, డాక్టర్ వగైరా పలురంగాల మేధావులు, కవులు, కళాకారులు వేలాది మంది సిద్ధాంత విభేదాలకతీతంగా సమైక్యమయ్యారు. చర్చోపచర్చల అనంతరం ఎన్నికలకు ఆరు నెలల ముందునుంచే వివిధ బృందాలుగా రాష్ట్రమంతటా పర్యటించారు.
‘మేలుకో కర్ణాటకా’ (ఎడ్డురే కర్ణాటకా) అన్న నినాదంతో, ‘దయచేసి మత విద్వేష రాజకీయాలకు మద్దతివ్వకండి’ అన్న ప్రబోధంతో ప్రచారం చేశారు. ముఖ్యంగా వందకుపైగా సంక్లిష్ట నియోజకవర్గాలకు వెళ్లారు. గెలవకపోగా, బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చగలరని భావిస్తున్న 45 మంది స్వతంత్ర అభ్యర్థులకు నచ్చజెప్పి, పోటీ నుంచి విరమింపజేశారు. అలా బీజేపీ ఓటమికి విశేషంగా శ్రమించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల్లోని ప్రజాసంఘాలు, అభ్యుదయ కవులు, కళాకారులు, వివిధ రంగాల మేధావులందరికీ చక్కని కర్తవ్యబోధ ఇది. ‘సంఘటితంగా పోరాడితే, తిరోగమన బీజేపీ ప్రభుత్వాన్ని దించేయటం సాధ్యమే’నని దేశ ప్రజలకు స్ఫూర్తిదాయక సందేశాన్నందించారు కన్నడ ప్రజలు.
దీన్నిబట్టి దేశ ప్రజల తక్షణ ఆకాంక్ష ‘మత విద్వేష రాజకీయాల బీజేపీ ఓటమే’కానీ ‘కాంగ్రెస్ గెలుపు’ కాదన్న వాస్తవాన్ని గ్రహించాలి కాంగ్రెస్. ‘బీజేపీ గుత్త పెట్టుబడిదారీ విధానాన్ని పెంపొందిస్తున్నది. ఇది దేశానికి ప్రమాదకర’మని ఆయా సభల్లో ప్రసంగించారు రాహుల్ గాంధీ. నిజంగా ఆ ప్రమాదాన్ని గుర్తిస్తే మాటల్లో కాదు, తన విధానాలను మార్పు చేసుకోవాలి కాంగ్రెస్. బీజేపీ కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు భిన్నంగా, కార్మిక, కర్షక, సామాన్య ప్రజా సంక్షేమ విధానాలను మ్యానిఫెస్టో ద్వారా ప్రకటించి దేశ ప్రజలకు భరోసా కలిగించాలి కాంగ్రెస్.
‘మత విద్వేష, కార్పొరేట్ బీజేపీ ముక్త్ భారత్’ లక్ష్యం దిశగా కృషి చేయాలని, ఆ దిశగా ప్రయత్నిస్తే అది సాధ్య మేనని కర్ణాటక తీర్పు వెల్లడించింది. భారతదేశం ఎన్నటికీ నియంతృత్వాన్ని సహించదు. నాడు దేశంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న ఇందిరాగాంధీకే గుణపాఠం నేర్పించిన ఘనమైన చరిత్ర మన దేశానికి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెబుతున్నట్లుగా, ఇండియా రియాక్ట్స్. అది ముమ్మాటికీ సత్యం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
-పాతూరి వేంకటేశ్వరరావు
98490 81889