ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భారీ వర్షాలు, వరదల వల్ల తెలంగాణ భూభాగంలోని భద్రాచలం పరిసరాల్లోని గోదావరి తీర ప్రాంతంలో పెను విధ్వంసం జరుగనున్నది. ఈ వాస్తవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం గ్రహించాలి.
దిగువన డ్యామ్ నిర్మాణంతో కాఫర్ డ్యామ్, స్పిల్ వే వల్ల బ్యాక్ వాటర్ (నదిలో స్థిరంగా ఉండే నీళ్లు) చుట్టుముడుతాయి. ముంపు మండలాల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారే ప్రమాదం ఉన్నది. వరదలు వస్తే 30 రోజులపాటు జనావాసాలు జలమయమై తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, చేయడానికి పనిలేక ప్రజలు ఇబ్బందులు పడుతారు. అటువంటి కీలకమైన ముంపు సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రాంత ప్రజల శ్రేయస్సు, రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముంపు నివారణ చర్యలు చేపట్టకపోగా నిమ్మకు నీరెత్తినట్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి. గతంలో అనేకసార్లు తెలంగాణ ఆత్మగల దార్శనికుడు కేసీఆర్ సమర్థ నాయకత్వంలో క్యాబినెట్ మంత్రిగా పోలవరం ముంపు సమస్యపై పెద్దఎత్తున తెలంగాణ పక్షాన వాదించాను. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ముంపు నుంచి తెలంగాణవాసులకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేసినా కేంద్రం పట్టించుకోలేదు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముంపు సమస్య పరిష్కారానికి చొరవ చూపకుండా ప్రజల ప్రయోజనాల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ సోయి లేకుండా వ్యవహరిస్తున్నది.
2022లో భద్రాచలం వద్ద 71.3 అడుగుల ఎత్తులో వచ్చిన వరద 22 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహంగా నమోదైంది. పోలవరం పూర్తిస్థాయి నీటిమట్టం 45.72 మీటర్లు కాగా భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కూడా సరిగ్గా 45.72 మీటర్లు. అంటే పోలవరం నిండితే భద్రాచలం ఎప్పుడూ ముంపు ప్రమాదంలోనే ఉంటుందని భావించాలి. భద్రాచలం వద్ద గోదావరి నది లోతైన బెడ్ లెవల్ 26 మీటర్లు బ్యాక్వాటర్ ప్రభావం వల్ల భద్రాచలంలో ఎప్పుడూ 13.15 మీటర్ల నుంచి 17.72 మీటర్ల మేర నీరు నిల్వ ఉంటుంది. ఇది నిత్యం తీవ్రమైన సమస్యగా మారుతున్నది. 900 ఎకరాల్లో నష్ట ప్రభావం కూడా ఉంటుంది. 2021లో పోలవరం కాఫర్డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత 2022లో వచ్చిన వరదల్లో బ్యాక్వాటర్ కారణంగా భద్రాచలంతో పాటు పరిసరాలు విలవిల్లాడాయి 40 శాతం భద్రాచలం పట్టణం జలమయమై, బాధితులు దీనావస్థలో రోడ్డున పడ్డారు. వరద బాధితులను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నది.
అప్పట్లో 22 లక్షల క్యూసెక్కుల వరదకే ఇంత నష్టం జరిగితే..ప్రాజెక్టు డిజైన్ ప్రకారం భవిష్యత్తులో 36 లక్షల నుంచి 50 లక్షల సెక్యూల వరద వస్తే ఊహించని విధంగా ప్రాణ, ఆస్తి నష్టంతో పూర్తిగా మునిగిపోయే ప్రమాదం పొంచిఉన్నది. పలు అధ్యయనాల ప్రకారం 36 గ్రామాల పరిధిలోని 184 చదరపు కిలోమీటర్ల మేర ముంపు ప్రభావం పడుతుందని తెలుస్తున్నది. కేవలం గ్రామాలే కాకుండా ఈ ప్రాంతంలోని భారీ పరిశ్రమలకు కూడా బ్యాక్వాటర్ ముప్పు పొంచి ఉన్నది. దాదాపు ఐదువేల కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఐటీసీ పేపర్బోర్డ్, హెవీ వాటర్ ప్లాంట్, దుమ్ముగూడెం జలవిద్యుత్తు ప్రాజెక్టులకు ఈ బ్యాక్వాటర్ వల్ల తీవ్ర ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రికి ఘనమైన ప్రాశస్త్యం ఉన్నది. అలాంటి రామాలయానికి కూడా పోలవరం ముంపు ముప్పు తప్పదు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పోలవరం ప్రాజెక్టు ద్వారా సంభవించే ముంపు ముప్పును నివారించేందుకు చర్యలు చేపట్టాలి. పునరావాస ప్యాకేజీ అమలు చేయాలి.
గోదావరి వరద తట్టుకునేందుకు కరకట్టలు కట్టాలి. ఇప్పటికే ఉన్న వాటి కరకట్టల ఎత్తును పెంచాలి. వర్షాకాలంలో స్లూయీస్ల దగ్గర వరద నీరు ప్రవహించదు కనుక ఆ సమయంలో మోటర్ల ద్వారా నీటిని తోడేయాలి. లోతట్టు ప్రాంత ప్రజలను మెరక ప్రాంతానికి తరలించి కాలనీలు నిర్మించాలి.
ఎక్కువగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. రహదారులపై ప్రవహించే వాగుల మీద చప్టాలు నిర్మించాలి. వంతెనలు ఏర్పాటు చేయాలి. అవసరమైన చోట రోడ్ల ఎత్తు పెంచాలి. తక్షణ చర్యలతో పాటు మౌలిక సదుపాయాల రక్షణ, ప్రజల భద్రత, పర్యావరణ, సాంకేతిక చర్యలు, పరిశ్రమలు, వారసత్వ ప్రాంతాల రక్షణ, విధానపరమైన చర్యలు వంటి పలు కీలక అంశాలపై దృష్టి సారించాలి. తెలంగాణ ప్రజల రక్షణకు, వారి శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన ఆవశ్యకత ప్రభుత్వాలపై ఉన్నది. ముంపు నుంచి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా బాధ్యతాయుతంగా పనిచేయాలని బీఆర్ఎస్ తరఫున, ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మానవజాతిని కాపాడటం, భవిష్యత్తరాలకు మనం ఇచ్చే భద్రత. అదే అందరికీ శ్రీరామరక్ష.
– (వ్యాసకర్త: రవాణా శాఖ మాజీ మంత్రి)
పువ్వాడ అజయ్ కుమార్