సంఘ్ పరివార్ సుదీర్ఘ ప్రస్థానంలో మూడవది అయిన మోదీ మాడల్ ముగింపు దశలోకి ప్రవేశిస్తున్నది. ఆర్ఎస్ఎస్ 1925లో ఏర్పడినప్పటి నుంచి వాజపేయి ప్రధానమంత్రిత్వ కాలం (1998-2004) ముందు వరకు గలది మొదటిదశ. ఆయన కాలం పరివార్కు రెండవ దశ కావడమే గాక, దేశంలో పరివార్ శక్తుల పాలనకు మొదటి మాడల్ అయింది. తర్వాత పదేండ్లకు (2014) మోదీ పరిపాలనా రూపంలో మూడవ దశ రెండవ మాడల్గా అవతరించింది. అది ఇక అంతరిస్తున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సంఘ్ పరివార్కు ఒక నిర్దిష్టమైన, బలమైన సైద్ధాంతిక పునాది ఉన్నది. ఈ దేశంలో సాధారణ రూపంలో గల సుదీర్ఘ సంస్కృతితోపాటు, 20వ శతాబ్ద ఆరంభ కాలంలో ఉండిన రాజకీయ పరిస్థితులు ఆ పునాదిని సృష్టించాయి. సంస్థ నాయకత్వం సుమారు రెండున్నర దశాబ్దాలపాటు తమకు రాజకీయాలతో పని లేదని, భావజాల వ్యాప్తి ద్వారా హిందూ సమాజాన్ని ఒకటి చేయగలమని చెప్తూ పోయింది. 1947లో స్వాతంత్య్రానంతరం మేధోమథనాల ఫలితంగా మొదట 1951లో జనసంఘ్ పేరిట రాజకీయ పార్టీ ఏర్పడి, తర్వాత 1980లో బీజేపీగా రూపాంతరం చెందింది. 1951-80 మధ్య రాజకీయాలలో వ్యవహరించిన తీరు, అందులోని మంచిచెడులు, పరివార్ సిద్ధాంతాలకు కట్టుబడినది ఎంత, కానిదెంత, పార్టీపై పరివార్ నియంత్రణ ఏమిటి, పడిన రాజీలేమిటి, ఆ కాలమంతా ఒక రాజకీయ సాధనంగా పరివార్ లక్ష్యాలను ముందుకు తీసుకుపోయింది ఎంత అనేదంతా ఒక సవివరమైన చర్చ. అది ఇక్కడ అప్రస్తుతం. ఒకమాట మాత్రం చెప్పుకోవాలి. ఒకవైపు నుంచి పరివార్ సైద్ధాంతిక నియంత్రణలు, మరొకవైపు నుంచి రాజకీయ నాయకత్వాల వ్యవహరణలు కొద్దిపాటి సర్దుబాట్లు, రాజీలతో అంతా సజావుగానే ముందుకు సాగాయి.
1980లో బీజేపీ ఏర్పడటానికి ముందు రెండేండ్లలోని జనతా పార్టీ ప్రభుత్వ కాలం (1977-79), ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ కాలం (1989-90) పరివార్ ఆలోచనలలో, రాజకీయ నాయకత్వపు ఆలోచనలలో కూడా గణనీయ మార్పును తెచ్చాయి. ఆ రెండు ప్రభుత్వాలలో భాగస్వాములు కావడం అందుకు కారణం. అంతకుముందు కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారాన్ని నెరపినప్పటికీ ఇవి రెండు కేంద్రస్థాయి అధికారాలయ్యాయి. ఆ స్థాయి అధికారమంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. కేవలం అధికారమనే రూపంలోనే కాదు. అధికారాన్ని ఉపయోగించుకుని పరివార్ సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోవచ్చుననే ఆలోచనలు జనసంఘ్ స్థాపన కాలం నుంచే ఉండగా, తొలిదశలో రాష్ర్టాలకు పరిమితమై ఉండిన ఆ వ్యూహం ఇప్పుడు జాతీయస్థాయికి చేరింది. జనతా పార్టీ, నేషనల్ ఫ్రంట్ భంగపాట్ల దరిమిలా, స్వయంగానే అధికారానికి రావాలన్న పట్టుదల పెరిగింది. అది రాజకీయ నాయకత్వంలో, పరివార్ నాయకత్వంలో కూడా కనిపించింది.
ఆ సమయంలో దేశంలో రాజకీయ శూన్యత, అభివృద్ధిపరంగా, సామాజికంగా ప్రజల నిరాశలన్నవి ఆవరించి ఉన్నాయి. రాజకీయంగా కాంగ్రెస్ విఫలమై ఉన్నది. అందుకు ప్రత్యామ్నాయం కాగలమంటూ వచ్చిన జనతా పార్టీ, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు నిలువలేకపోయాయి. ఇంకొక స్థాయిలో ఆర్థిక, అభివృద్ధి రంగాలు అస్తవ్యస్తం కాసాగాయి. సరిగా ఆ శూన్యం నుంచి ఒక కొత్త ఆశగా వాజ్పేయి ప్రభుత్వం (1998-2004) ఆవిర్భవించింది.
వాజపేయి, ఆద్వానీ వంటి దిగ్గజాల నాయకత్వాన సమస్యల పరిష్కారానికి, అభ్యున్నతికి చాలా ఆశలు కల్పించింది. ఆ విధంగా, పరివార్ కుటుంబం నుంచి జాతీయ స్థాయిలో మొదటి పరిపాలనా మాడల్ ప్రజల ముందుకు వచ్చింది. వాజ్పేయి, అద్వానీ ప్రతిష్ట, సమర్థతలు సుప్రసిద్ధమైనవి గనుక, అందుకు అనుగుణంగా పరిపాలన జనరంజకంగా సాగినాకొద్దీ, ఆ స్థితిని అనువుగా చేసుకుంటూ, నేటుగా చాటుగా కూడా తమ దీర్ఘకాలిక లక్ష్యాలను ముందుకు తీసుకుపోగలమని సంఘ్ పరివార్ ఆశించింది. అందుకు కేంద్రంలో తమ పాలన సుస్థిరం, దీర్ఘకాలికం కావటం అవసరం గనుక, ఆ ప్రయోజనం కోసమని సైద్ధాంతికంగా అంతకుముందు లేనంత రాజీలకు సైతం సిద్ధపడింది. సిద్ధాంతానికి ఎక్కువ కట్టుబడతారనే పేరున్న అద్వానీని నియంత్రిస్తూ, కొంత తక్కువ కట్టుబడతారనే పేరుగల పేజ్పేయికి వెసులుబాట్లు కల్పించింది. ఆర్థిక విధానాలలోనూ స్వదేశీకి కొంత చిన్న పీట వేసి, విదేశీకి, భారీ వ్యాపార సంస్థలకు పెద్ద పీట వేసి సరిపెట్టుకుంది. పరివార్ లక్ష్యాలు సైద్ధాంతికంగా కొంత ముందుకు సాగాయి కూడా.
మొత్తం మీద ఆ విధంగా మొదటి మాడల్ రూపుతీసుకుంది. అది ముందుకు సాగడంపైన మూడు ప్రభావాలు కనిపించాయి. ఒకటి, స్వభావరీత్యా వాజ్పేయి కొంత ఉదారవాది, ప్రగతిశీలుడు కావటం. రెండు, ప్రభుత్వం నిలిచేందుకు పలు ఇతర పార్టీలపై ఆధారపడవలసి రావడం. మూడు, ఆర్థిక సంస్కరణలు అమలుకు రావటం అప్పటికే (1991 నుంచి) జరిగిపోయినందున వాటికి కట్టుబడక తప్పనిస్థితి. అయినప్పటికీ తాము దేశం కోసం చాలా చేశామని ఆ ప్రభుత్వం, సంఘ్ పరివార్ కూడా చాలా నమ్మాయి. 2004 ఎన్నికలలో ఇండియా షైనింగ్ పేరిట ఉధృతమైన ప్రచారాన్ని నడిపాయి. రాజకీయంగా బీజేపీ, సామాజిక స్థాయిలో పరివార్. కానీ, ఎన్నికల ఫలితాలు వెలువడేసరికి, ఆ మొదటి మాడల్ను ప్రజలు తిరస్కరించినట్టు తేలింది.
కాంగ్రెస్ కూటమి పదేండ్లు (2004-2014) పాలించి విఫలమైన వెనుక, మోదీ నాయకత్వాన పరివార్ నుంచి రెండవ మాడల్ పాలన ముందుకొచ్చింది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండిన (2001-14) కాలంలో పాలించిన తీరు గురించి గుజరాత్ మాడల్ అనే ప్రచారాన్ని 2014 ఎన్నికలలో దేశవ్యాప్తంగా హోరెత్తించారు. ఆయన అక్కడ అద్భుతమైన అభివృద్ధి సాధించారని, అవినీతిని పూర్తిగా అరికట్టారని, ఉద్యోగ ఉపాధులు బాగా కల్పించారని, అన్నివర్గాల ప్రజ లు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని, ప్రభుత్వ యంత్రాంగం ఎంతో సమర్థవంతంగా పని చేస్తున్నదని వగైరా. ఆయన ప్రధాని అయితే అదే తరహా మాడల్ను దేశవ్యాప్తం చేస్తారని అన్నారు.
అదీగాక ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించడం, విదేశాల్లోని నల్లధనాన్ని తిరిగి తెచ్చి ప్రతి కుటుంబానికీ రూ.15 లక్షలు ఇవ్వడం వంటి కండ్లు మిరుమిట్లు గొలిపే వాగ్దానాలు చేశారు. అప్పటి ప్రచారపు హోరులో, తన పదేండ్ల వైఫల్యాలకు సంజాయిషీలు ఇచ్చుకోవడంతో సతమతమవుతుండిన కాంగ్రెస్ గానీ, వారితో అధికారం పంచుకుని ఆ వైఫల్యాలలో భాగం ఉన్న ఇతర పార్టీలు గానీ, ఆ గుజరాత్ మాడల్ నిజస్వరూపం ఏమిటో పరిశీలించి, ప్రజలకు తెలియజెప్పలేకపోయాయి.
అంతా ముగిసిపోయిన తర్వాత ఆ మాడల్ ఏమిటో క్రమంగా తెలిసిరావడం మొదలైంది. గుజరాత్ మాడల్ అన్నది ధనిక వర్గాలకు మాత్రమే ఉపయోగపడి, సామాన్యులను ఉన్నచోటనే ఉంచివేసిందన్న వాస్తవాలు క్రమంగా బయటకు రాసాగాయి. మరొకవైపు, ఎన్నికల్లో ఇచ్చిన భారీ హామీలు అమలు కాకపోగా, అవి ఎన్నికల కోసం ఇచ్చినవి మాత్రమేనని స్వయంగా అగ్రనాయకులే ప్రకటిస్తుండటంతో భ్రమలు తొలగేందుకు, గుజరాత్ మాడల్ ఏమిటో, మోదీ పరిపాలనా సమర్థత ఏమిటో అర్థమయ్యేందుకు ఒక ఆరంభమన్నది మొదటి పాలనలోనే జరిగిపోయింది. పరిస్థితులు అదే విధంగా కొనసాగితే బీజేపీ 2019 నాటి మరుసటి ఎన్నికల్లో ఓడి ఉండేది.
కానీ అట్లా జరుగలేదు. ఎందువల్ల? వాజపేయి-ఆద్వానీ ద్వయానికి, మోదీ-అమిత్షా ద్వయానికి చాలా తేడా ఉన్నది. వారు ప్రజాస్వామికవాదులు కాగా, వీరికి ఆ లక్షణాలు లేవు. వారికి సిద్ధాంతమన్నది సైద్ధాంతిక ఆశయాల కోసం కాగా, వీరికి అధికారం కోసం అది ఒక సాధనం మాత్రమే. వారు సూత్రబద్ధమైన యుద్ధం సాగించేవారు కాగా, వీరికి అటువంటి నియమాలేవీ సరిపడవు. వారిలో మానవత్వ లక్షణాలు ఉండగా వీరికి ఆ మాట పట్లనే ద్వేషం. వారు అధికారం కోసం రాజ్యాంగ వ్యవస్థలను గానీ, నీతి నియమాలను గానీ ఎన్నడూ వదలుకొనకపోగా, వీరు వాటిని ధ్వంసం చేయని సందర్భం కనిపించదు.
ఇదే క్రమంలో తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు మతవిద్వేషాలను పరాకాష్టకు తీసుకుపోయారు. హిందూ మతం నుంచి హిందూత్వను వేరుచేసి, మతతత్వాన్ని అడుగడుగునా రెచ్చగొట్టారు. తమ మాడల్ బండారం బయటపడుతున్నట్టు 2024 ఎన్నికలలో సీట్లు తగ్గడంతో రుజువుకాగా, ఎన్నికల కమిషన్ను దుర్వినియోగపరచి ఓటర్ జాబితా మార్పులు మొదలుపెట్టి, ఇప్పుడు నియోజకవర్గ పునర్విభజనల పేర కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగపరచటం అడ్డులేకుండా సాగుతున్నది. ప్రతిపక్షాలను రకరకాలుగా చీల్చుతూ సమాజంలోని అసమ్మతిని అణచివేస్తున్నారు. తమకిక ఎదురులేదనే అహంకారాన్ని పెంచుకుంటున్నారు.
పరివార్ భావజాలాన్ని గానీ, పార్టీ అధికారాన్ని గానీ పెంపొందించుకోవటం సవ్యమైన మార్గాల్లో జరిగితే అది ప్రజల ఇష్టమని భావించవచ్చు. కానీ మోదీ మాడల్లో జరుగుతున్నది ఇవేవీ కావు. దేశ అభివృద్ధి సూచీలు అన్నీ ఈ 12 ఏండ్ల కాలంలో పడిపోతూ వస్తున్నాయి. యువజనులు, సాధారణ ప్రజలు కూడా మోదీ మాడల్ అనే పేరిట చలామణీ అయిన కృత్రిమ మాడల్ పట్ల ఎంతగా భ్రమలు కోల్పోతున్నారో 2019 ఎన్నికల్లో సీట్లు తగ్గినప్పుడు మొదట వెల్లడి కాగా, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ సందర్భం బీజేపీకి, పరివార్కు గుండె దడ పుట్టించేటట్టు ప్రకటించింది. ఇది ఇక కోలుకునేటట్టు కనిపించడంలేదు.
మొత్తం మీద ఆ విధంగా మొదటి మాడల్ రూపుతీసుకుంది. అది ముందుకు సాగడంపైన మూడు ప్రభావాలు కనిపించాయి. ఒకటి, స్వభావరీత్యా వాజ్పేయి కొంత ఉదారవాది, ప్రగతిశీలుడు కావటం. రెండు, ప్రభుత్వం నిలిచేందుకు పలు ఇతర పార్టీలపై ఆధారపడవలసి రావడం. మూడు, ఆర్థిక సంస్కరణలు అమలుకు రావటం అప్పటికే (1991 నుంచి) జరిగిపోయినందున వాటికి కట్టుబడక తప్పనిస్థితి.
– టంకశాల అశోక్