వాషింగ్టన్, సెప్టెంబర్ 10: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత రాజకీయాలను అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇరాన్ యుద్ధంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ట్రంప్ ..మధ్యంతర ఎన్నికల ముంగిట ప్రజలకు ‘ఉచిత హామీలు’ ప్రకటించారు. ప్రతినిధుల సభ, సెనేట్లకు నవంబర్లో జరిగే ఉప ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులను గెలిపిస్తే అమెరికాలోని వయోజన పౌరులందరికీ 5,000 డాలర్ల(రూ.4.76 లక్షలు) డివిడెండ్ను అందచేస్తానని ట్రంప్ బుధవారం వాగ్దానం చేశారు. ఈ ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్టుగా భావించి రిపబ్లికన్లకు ఓటు వేయాలని డాలస్లో జరిగిన ఓ సదస్సులో ఆయన తన మద్దతుదారులను కోరారు. మనం చాలా బాగా రాణించాం. మన దేశం చాలా డబ్బు సంపాదిస్తున్నది.
కాబట్టే ఈ చెల్లింపు చేస్తున్నాం అని ట్రంప్ చెప్పారు. ఓటర్లకు ఈ వాగ్దానం చేసే హక్కు తనకు మాత్రమే ఉందని ఆయన అన్నారు. విజయవంతమైన కంపెనీలు తమ వాటాదారులకు నగదు పంపిణీ చేసే విధానంతో ఈ చెల్లింపులను ట్రంప్ పోల్చారు. ఈ వాగ్దానాన్ని ఎలా అమలు చేస్తారనే దానిపై ట్రంప్ ఎలాంటి వివరాలు అందించలేదు. కేవలం రిపబ్లికన్లు గెలిస్తే మీరు మాతో గెలిచినట్టే అని మాత్రమే ఆయన పేర్కొన్నారు. వయోజన పౌరులకు ఉద్దేశించిన ఈ చెల్లింపుపై ఉన్న ఏకైక షరతు ఈ చెల్లింపు డబ్బును తప్పనిసరిగా అమెరికాలోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ చెల్లింపును ట్రంప్ డివిడెంట్ అని పిలుస్తారని ఆయన తెలిపారు.
ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమెరికా-ఇరాన్ యుద్ధం ముగింపుపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. నవంబర్లో అమెరికాలో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత యూఎస్-ఇరాన్ యుద్ధం ముగిసే అవకాశం ఉందన్నారు. ఇరాన్ ఇక ఎక్కువ కాలం యుద్ధం కొనసాగించలేదని.. తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయిందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ట్రంప్ హయాంలోని ఇంకో రెండేండ్ల పాటు యుద్ధం కొనసాగుతుందని ఆయనకు అత్యంత సన్నిహితులు ఇద్దరు హెచ్చరిస్తున్నట్టు సమాచారం.