ఎందరో ఆధ్యాత్మిక మహా పురుషులు, సామాజిక, రాజకీయ స్ంకరణోద్యమాల యోధానుయోధులు, మేధావుల నిలయమైన మహారాష్ట్ర, నూతన నినాదాన్ని ఎందుకెత్తుకున్నది? స్పష్టాతి స్పష్టంగా, దేశం దిక్కులన్నింటికీ చేరేలా ‘దేశ్ కీ నేత కైసే హో- కేసీఆర్ జేసేహో’ (దేశ నాయకుడు ఎలా ఉండాలి- కేసీఆర్ లా ఉండాలి) అంటూ వేన, వేల మరాఠీ గొంతుకలు శబ్దభాస్వరాలై పిడికిలెత్తి, నినాదాల జాతరగా మారడం వెనుక ఎన్నో సత్యాలున్నాయి. ‘ఎన్నికలు, కూటములు, ఎత్తుగడ’ అనే మూడు సూత్రాలను మాత్రమే నమ్ముకున్న రెండు జాతీయపార్టీలు, పదే పదే వాటి మాయామోహంలో పడిపోయే కొన్ని ప్రాంతీయ పార్టీల నాయకులు, వారి రాష్ర్టాల్లోని ప్రజారాశుల ఆకాంక్షలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతూనే ఉన్నారు.
అనివార్యత పేరుతో దశాబ్దాలుగా దేశాన్ని దారి తప్పించిన నాయకత్వాలనే మళ్లీ, మళ్లీ ముందేసుకుంటున్న రాజకీయపార్టీలు, మహారాష్ట్ర జనం ఇస్తున్న సందేశాన్ని అర్థం చేసుకోవాలి. మూస ధోరణులు, గొర్రెదాటు నడవడికలకు అలవాటుపడిన రాజకీయ శిబిరం నుంచి ఇలాంటివి అవగాహన చేసుకునే నైజాన్ని ఆశించగలమా? కానీ వినగలిగితే, అనేక చారిత్రక పరిణామాలను మోసిన మహారాష్ట్ర, మనస్సును హత్తుకున్న నినాదం ఎన్నో పాఠాలు అర్థం చేయిస్తుంది.
మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది వివిధ పార్టీల నాయకులు, సంస్థల బాధ్యులు బీఆర్ఎస్ కార్యాలయాన్ని వెతుక్కుంటూ ఎందుకొస్తున్నారు? నాందేడ్తో పాటు ఆ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన గులాబీ పార్టీ సభలకు జనం కదం తొక్కుతున్నారెందుకు? నిన్న, ఈ రోజు పండరీపూర్ రుక్మిణీ దేవాలయానికి, తుల్జాపూర్ భవానీ మాతా దర్శనానికి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులతో కలిసివెళ్లిన కేసీఆర్కు పూలు జల్లుతూ, గులాబీ జెండాలు ఊపుతూ, అడుగడుగునా మహారాష్ట్ర మహిళాలోకం సైతం మంగళహారతులు పడుతుండటం వెనుక లక్షల కుటుంబాల ఆకాంక్షలున్నాయి.
ఏడున్నర దశాబ్దాలుగా చూపుడు వేలు నిండా సిరా బొట్లు పొడిపించుకున్నా నెరవేరని ఆశలు, ఆశయాలే నేడు మరాఠీ బిడ్డలకు గులాబీ బాటను చూపిస్తున్నాయి. నిజానికి మరాఠీ ప్రజారాశులు చూడని, పాల్గొనని రాజకీయ సామాజిక, పరిణామమే లేదు. పూలే, అంబేద్కర్ లాంటి సమతా మూర్తులు, సాయిబాబా, వసంత్ గాడ్గే బాబా లాంటి ఆధ్యాత్మిక సేవా సారథులు, శివాజీ లాంటి చరిత్ర నుదుటిన మెరిసే యోధులు ఎందరో జన్మించిన నేల మహారాష్ట్ర. మహాకాంతార (పెద్ద అడవులు) అనే పదం నుంచి మహారాష్ట్ర అనే పేరును సంతరించుకున్నది. వైశాల్యంలో మూడు, జనాభాలో రెండో స్థానంలో నిలిచిన ఈ రాష్ట్రం, దేశ రాజకీయ చరిత్రలో అనేక కీలక పరిణామాలకు కేంద్రంగా నిలిచింది. అశోకుడి మగధ సామ్రాజ్యం నుంచి రాష్ట్రకూటుల దాకా, ఢిల్లీ సుల్తానుల నుంచి మరా ఠా, పేష్వాల నాయకత్వాల వరకు స్వాతంత్య్రానికి పూర్వ మే అనేక చారిత్రక పరిణామాలకు మహారాష్ట్ర నిలయం.
పేష్వాల కాలం నాటికే పటిష్ఠ రెవెన్యూ విధానం, వర్త కం, బ్యాంకింగ్ వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. వ్యవసాయ విస్తరణ, సముద్ర వర్తకం వర్ధిల్లాయి. వీటి ఫలితంగానే బ్రిటిష్ రాజ్యకాలంలో సంఘ సంస్కరణ పోరాటాలు, భారత స్వాతంత్య్ర ఉద్యమాలు మహారాష్ట్ర ప్రాంతంలో ఉధృతంగా సాగాయి. స్వాతంత్య్ర, ఆత్మగౌరవ ఆకాంక్షలకు నెలవైన ఈ బొంబాయి రాష్ట్రం, 1960 మే 1న మహారాష్ట్ర, గుజరాత్లుగా విడిపోయినా, ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరడమే లేదు. గోదావరి కృష్ణా, నర్మదా, తపతి, వైన్ గంగ వంటి నదులున్నా, సారవంతమైన నల్లరేగడి భూములున్నా, ఇక్కడి రైతుల కంటనీరు మాత్రం ఆగడమే లేదు. అనేక రైతాంగ పోరాటాలు, కార్మికోద్యమాలు, పూలే, అంబేద్కర్, కాన్షీరామ్ల త్యాగాలు, దళిత పాంథర్స్ లాంటి వీరోచిత ఉద్యమాలు ఎన్నో జరిగినా, ఇంకా మహారాష్ట్ర, గ్రామాలు న్యాయం కోసం నినదిస్తూనే ఉన్నాయి. ముంబైలోని శివాజీ పార్క్లో సభలెన్ని జరిగినా, సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. కానీ కాలం చూపిన దివిటీలా నేడు మహారాష్ట్రీయులు కేసీఆర్ను చూస్తున్నారు.
గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలను సరిహద్దులుగా కలిగి, నిత్యం అవసరాల రీత్యా, ఆయా రాష్ర్టాల గ్రామాల్లో సంచరించే మహారాష్ట్ర జనం, ఏ రాష్ర్టాల్లో జరుగుతున్నదేమిటో తెలుసుకున్నారు. స్వల్పకాలంలో తెలంగాణలో సాధించిన ప్రగతి, రైతుల కలల పంటలను స్వయంగా చూసి స్ఫూర్తిపొందా రు. శివసేన, ఎన్సీపీ లాంటి రాష్ట్ర పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయపార్టీలు, ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని, రాజకీయ బేరసారాల కేంద్రంగా మాత్రమే వాడేసుకున్నారనే సత్యాన్ని మరాఠీలు అర్థం చేసుకున్నారు.
రాలేగావ్ సిద్ధీని దేశంలోని ఇతర రాష్ర్టాల ప్రజలు తరలివచ్చి అధ్యయనం చేస్తున్నా, అన్నా హజారే స్ఫూర్తిని అందుకొని, రాష్ర్టాన్ని అభివృద్ధి చేయలేని పాలకులను ఈసడించుకుంటున్నారు. మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు, ప్రగతి తదితర అంశాలపై బీడ్ జిల్లా పర్లీ తాలూకా విజయ్ బాలాసాహెబ్ అన్ధలేతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ‘ఢిల్లీ పెద్దల డ్రామాలకు గల్లీల్లో దరువేయడం తప్ప, మా మరాఠీ రాజకీయ నేతలు చేసిందేం లేదంటూ’ ఆవేదన వెలిబుచ్చాడు. ఆవేదన, ప్రగతి కాంక్షనే మహారాష్ట్ర ప్రజలను కేసీఆర్ వెంట నడిపిస్తున్నది.
మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ర్టాల నుంచి వేలాదిగా గులాబీ జెండాను అందుకుంటున్నా రు.విస్తారం తప్ప, సారం లేని పార్టీలను విడిచిపెట్టి, విజనరీ వెంట జమకూడుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు ప్రజారాశుల ఆలోచనలను కొన్ని ప్రాంతీయపార్టీలు పట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. దేశ సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడ్డప్పుడల్లా, అనివార్యత సాకుతో ‘యూపీఏ, ఎన్డీ యే, ఇప్పుడు వీడీఏ’ల పేరుతో లేబుల్ మాత్రమే మార్చి ‘కొత్త సీసాలో పాత సారా’ రాజకీయాలనే మళ్లీ, మళ్లీ మోసుకొస్తున్నాయి. ఈ మూస, మోస రాజకీయ కూటము లు, కొట్టుకొని కూలిపోవడం, గుండెలు బాదుకోవడం తప్ప భారతదేశానికి ఒరగబెట్టేదేమిటి?
విమర్శల హోరుకు ఎదురు నిలవడం, వెక్కిరింతల వాగును ఎగిరిదాటడం, నిప్పుల రహదారిలో నడిచిసాగడం ఉద్యమనేత కేసీఆర్కు కొత్తదేమీ కాదు. నిన్న తెలంగాణకు, నేడు తెలంగాణతో పాటు భారతదేశానికీ, కేసీఆర్ చారిత్రక అవసరం.
(వ్యాసకర్త: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్)
-డాక్టర్ ఆంజనేయ గౌడ్
98853 52242