తెలంగాణలో ఒక సామెత ఉంది. ‘గొర్లు తినెటోడు పోయి బర్లు తినేటోడు వచ్చిండు’ అని. ఇదే కాక, ‘పాతోడే మంచిగ ఉండే’ అనే నానుడి కూడా ఉన్నది. కేంద్రంలో బీజేపీ తొమ్మిదేండ్ల పాలనకు ఈ సామెత, నానుడి నిలువుటద్దాలు. పాత రోజులే నయమని ప్రజలు అనుకుంటున్నారు.
మోదీ 2014లో అధికారం చేపట్టిన వెంటనే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. అటవీ చట్టాలను, భూసేకరణ చట్టాలను కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మార్చారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను ఆర్థికవృద్ధిని కుంగదీశాయి. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టం, రైతు వ్యతిరేక సాగు చట్టాలు, కార్మిక వ్యతిరేక కోడ్స్ను తీసుకొచ్చింది బీజేపీ. స్వాతంత్య్రానంతరం అప్పటి కాంగ్రెస్ పార్టీ పాలకులు వారికున్న భావజాలాన్ని బట్టి మిశ్రమ ఆర్థిక విధానాలను, తదనుగుణ పాలనా నీతిని ప్రవేశ పెట్టారు. భారీ ఉక్కు కర్మాగారాలు, యంత్రనిర్మాణ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. దేశానికి అవి చేసిన మేలు మరువలేనిది. ఈ విధంగా బలపడిన ప్రభుత్వ రంగ సంస్థల భుజాలపై ఎక్కి ప్రైవేటు రంగం పునాదులు వేసుకుంది. 1990 దశకంలో మన దేశ పెట్టుబడి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో అనుసంధానమైంది. దీంతో ప్రజాసంక్షేమం వెనుకంజ వేసింది. బీజేపీ, మోదీ హయాంలో ఇది మరింత అప్రాధాన్యమై పోయింది.
బొగ్గు గనుల నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా, రక్షణ రంగ ఉత్పత్తుల నుంచి ఉక్కు దాకా పలు రంగాల్లో నిబంధనలను కార్పొరేట్లకు అనుకూలంగా మార్చింది. విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరిచింది. ఫలితంగా ఉత్పత్తి, సేవా రంగాలు అన్నీ బహుళజాతి సంస్థలు స్వాధీనం చేసుకోవడానికి మార్గం పడింది. మన దేశంలో శత కోటీశ్వరులుగా ఎదుగుతున్న కార్పొరేట్ వర్గాల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఆర్థిక విధానాలను రూపొందించి అమలు చేస్తున్నది. కార్పొరేట్ పన్నును 35 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానా లక్షల కోట్ల ఆదాయాన్ని నష్టపోయింది. బ్యాంకులకు ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలు తిరిగి చెల్లించని రుణాలను లక్షల కోట్ల మేర రద్దు చేసింది. 2014 సెప్టెంబర్లో మేకిన్ ఇండియా పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. 2022 నాటికి భారత్ను ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, అందుకు అవసరమయ్యే విదేశీ పెట్టుబడిని సమీకరిస్తామని ప్రకటించింది. ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. అయితే తొమ్మిదేండ్లు కావస్తున్నా ఈ పథకం జాడ కనిపించడం లేదు.
ప్రభుత్వ పెట్టుబడులు పెంచి ఇతోధికంగా ఉపాధి అవకాశాలను వృద్ధి చేయాల్సిన సందర్భంలో లాభదాయకమైన ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయించారు. టెలికాం, బొగ్గు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, బ్యాంకులు, బీమా సంస్థలు, విద్యుత్తు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఇనుము ఉక్కు పరిశ్రమలు, గనులు, ఇంధన సంస్థలు మొత్తంగా 250 ఉత్పత్తి విభాగాలను ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. పబ్లిక్ సెక్టార్ రంగాలను విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుతో ఉపాధి అవకాశాలు పెరుగవు. ప్రజల కొనుగోలు శక్తి పెరుగదు. వాటిని పెట్టుబడులుగా మార్చాలి. కానీ, ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడంలో ఏర్పడిన బడ్జెట్ లోటును ఈ సొమ్ము ద్వారా పూడ్చుకొంటున్నది. కాకులను కొట్టి గద్దలకు వేయడమంటే ఇదేనేమో. ప్రైవేటీకరించిన ప్రభుత్వ సంస్థలలో రిజర్వేషన్ సదుపాయాన్ని తొలగించారు. పైగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానం అమలవుతుండడంతో కార్మికులు అభద్రతకు గురవుతున్నారు. ఏడు దశాబ్దాలుగా ప్రజాధనంతో, లక్షలాది మంది శ్రమతో, ఆలోచనలతో నిర్మాణమైన ప్రజా ఆస్తులను అమ్మివేయడం శోచనీయం.
బీజేపీ 2014 ఎన్నికల ప్రణాళికలో సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని పేర్కొన్నారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అసలు నైజం బయట పడింది.అధికారమిస్తే ప్రజాఆస్తులను విక్రయిస్తామని బీజేపీ ఎక్కడా పేర్కొనలేదు. కానీ, ప్రస్తుతం చేస్తున్న పని అదే. జాతి ప్రయోజనాల కొరకు సృష్టించిన ప్రభుత్వ రంగ సంస్థలను, వాటి ఆస్తులను, మౌలిక సదుపాయాలను, ప్రణాళికాబద్ధ విధానాన్ని నిర్మూలిస్తున్నారు. బీజేపీ పాలనలో దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ప్రపంచీకరణ ఆర్థిక సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. ప్రజాఆస్తులను 30 నుంచి 50 ఏండ్ల కాలానికి లీజుకు ఇవ్వడం ద్వారా లక్షల కోట్ల రూపాయలు ఆర్జించడం ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించింది. ఇది సాధారణ ప్రైవేటీకరణ, కార్పొరేట్ పన్ను రాయితీలను మించిపోయింది. సకల దేశ సంపదను గుత్త పెట్టుబడిదారులకు అప్పగించడానికి ప్రభుత్వం పని చేస్తున్నది.
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి సంపాదించిన సొమ్మును ఏ ప్రజాప్రయోజనం కోసం వెచ్చిస్తున్నారనే ప్రశ్నకు కేంద్రం వద్ద సమాధానం లేదు. నష్టాలతో నడుస్తున్నాయనే పేరుతో ఈ సంస్థలను ప్రైవేటు రంగానికి అప్పగించగానే వాటి సామర్థ్యం ఎట్లా పెరుగుతుందో, అవి ఎలా లాభాల బాట పడుతాయో కూడ జవాబు లేని ప్రశ్నే. నష్టాలతో నడిచే సంస్థలను కొనడానికి ప్రైవేట్ రంగం ఎందుకు ముందుకొస్తున్నదన్నది మరొక ప్రశ్న.
ఒక వైపు పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నామని చెబుతూ, అన్నం వండుకోవటానికి అవసరమైన వంట గ్యాస్ ధరను అమాంతంగా ఆకాశానికి ఎత్తుతూనే ఉన్నది. పెట్రోల్ ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నది. ప్యాసింజర్ రైళ్ళను ఎక్స్ప్రెస్లుగా మారుస్తూ, హాల్ట్లను ఎత్తివేస్తూ చార్జీలను పెంచారు. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ పాలనలో సామాన్యుడు బతకడమే గగనం అవుతున్నది.
(వ్యాసకర్త: సింగరేణి మాజీ ఉద్యోగి)
-దండంరాజు రాంచందర్రావు
98495 92958