Telangana | నదిలో న్యాయం కోసం నిప్పుల దారిలో నిన్నంతా నడిచింది తెలంగాణ. ఊరూరా ఉద్యమాలు పండించి, ప్రజారాశులను పోరు దారిలో హోరు జాతరలా మార్చిన నాయకుడు కేసీఆర్. గులాబీ మేఘ గర్జన కాలంలోనే కాదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ సర్కార్ విశ్రమించక, నదిజలాల కోసమే ఒళ్లొంచింది. రెండు జీవనదులపై కాంగ్రెస్, టీడీపీ పాలకులు నిర్మించిన వంచన వంతెనలు, తరలించుకుపోయిన నీటి సిరుల లెక్కలు లోతుగా అర్థం చేసుకున్నాకే హరిహర బ్రహ్మాదులు ఎదురైనా రాష్ట్ర సాధన లక్ష్యం విడిచిపెట్టే ప్రసక్తే లేదని గీత గీసి బరిలోకి దిగిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్.
రెండు దశాబ్దాలకు పైబడి ప్రజల బలంగా, దళంగా నేల హక్కుల కోసం నిలబడి ఎన్నో శక్తులతో హోరాహోరీగా తలపడుతున్న గులాబీ పార్టీకి అధికారం ఊతకర్రే కానీ, అంతిమ పరిష్కారం కోసం ఆరాటపడే ఆదెరువు ఎన్నటికీ కాజాలదు. ఈ నేల నొప్పులకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సాహసోపేత పాలనా చర్యలు తీసుకున్నది. రాష్ట్ర పోరులో ఎలాగైతే నిందలను, శత్రువులనూ పోగేసుకుందో, అధికార పార్టీగా కూడా కేంద్రంతో, పక్క రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడక తప్పలేదు. రాష్ట్ర హక్కుల కోసం ఏ బలవంతుడితో ఘర్షణ ఎదురైనా వెన్ను చూపింది లేదు.
రవ్వంత రాష్ట్ర భవితవ్యం పణంగా పెట్టిందేలేదు. చరిత్ర కొందరికి పోరాటమే కిరీటంగా తొడుగుతుందనడానికి కేసీఆర్కు మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. రాష్ట్ర సాధన కోసం, సాధించుకున్న రాష్ర్టానికి సుస్థిరాభివృద్ధి సాకారం కోసం రెండు దశాబ్దాల పాటు ప్రతి మలుపులో సమరమే శ్వాసగా అడుగులు వేయక తప్పలేదు. సింగరేణి బొగ్గు గనులపై అదానీ వాలకుండా, విద్యుత్తు వ్యవస్థ ప్రైవేట్ పెట్టుబడిదారుల పరమవ్వకుండా, నీటి సిరులు రాష్ట్రం దాటి పోకుండా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారో.
గులాబీ పార్టీ గుండె నిండా తెలంగాణ నేలతల్లే నెలవైన సత్యం మంచిని దీవించే గుణమున్న బుద్ధిజీవులందరికీ తెలిసిందే. తెలంగాణకు నొప్పి కలిగించే చర్యలపైనే చిచ్చరపిడుగులా తిరగబడే సహజ స్వభావం గులాబీ దళానిది. అలాంటిది ఏకంగా రాష్ట్ర భవితవ్యానికి కేంద్ర, రాష్ట్ర సర్కార్లు ముప్పును నిర్మిస్తుంటే కేసీఆర్ సైన్యం కండ్లు మూసుకొని మౌనరాగం ఆలపిస్తుందా? కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేంద్రం ఆధీనంలోని కేఆర్ఎంబీకి అప్పగించడమంటే నీటి హక్కుల కోసం పోరాడి ఒరిగిన అమరులను అవమానించడమే కదా?
నాగేటిసాలల్ల మళ్లీ నాటి బతుకులను తిరిగి తీసుకురావాలనే కుట్రలు పన్నడమే కదా! మొదటి కేఆర్ఎంబీ నీటి వాటా కేటాయింపులే అన్యాయమని, కేఆర్ఎంబీ-2 ద్వారా 50:50 కేటాయింపుల కోసం నిలదీస్తుంటే, నిర్మించుకున్న, నిర్మాణంలో ఉన్న మన జల దేవాలయాలను శాసించే పెత్తందారీ ఎత్తులు సమరశీలి తెలంగాణ సహిస్తుందా? విభజన సమస్యలతో వేధించి, ఏ చేదోడూ అందించక కవ్వించి.. కాళేశ్వరం, పాలమూరుకు హోదా అడిగితే మొండిచెయ్యి చూపించి పదేండ్లు గులాబీ ప్రభుత్వానికి పంటికింద రాయిలా మారింది మోదీ సర్కార్.
ఇప్పుడు మరుగుజ్జు రాష్ట్ర సర్కార్ భుజంపై తుపాకీ పెట్టి, తెలంగాణ నీటి వాటాపై రాబందులా రెక్కలు చాపాలని కుయుక్తులు పన్నుతున్నది. నీటికీ కన్నీటికీ మధ్య దశాబ్దాల పాటు పీకల్లోతులో మునిగి ఎన్నో అవస్థలు పడ్డ తెలంగాణ మళ్లీ హక్కులకు మరొక పెత్తందారీ కాపలా కావాలని కలలోనైనా కోరుకుంటుందా? తెలంగాణ భవితకు గోతులు తవ్వడమంటే కేసీఆర్తో చెలగాటమాడటమే. కేఆర్ఎంబీ సమావేశం మినిట్స్లో నగ్నంగా దొరికిన రేవంత్రెడ్డి సర్కార్, బుకాయింపుల బరితెగింపులకు దిగినా, కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణను నారద సర్కార్కు అప్పగించేందుకు అంగీకరించిందనే సత్యం తేటతెల్లమైపోయింది.
ఈ కాంగ్రెస్, బీజేపీ సర్కార్ల కుట్రే మళ్లీ తెలంగాణ తేనెతుట్టెను కదిలించింది. ఇప్పుడు తెలంగాణ భక్తులకూ, పొలిటికల్ పెత్తందారీ శక్తులకూ పోరు అనివార్యం. కోటి ఎకరాల మాగాణమైన తెలంగాణను, మళ్లీ నీటి కోసం అడుక్కునే భిక్షగత్తెను చేస్తామంటే ఈ పోరాటాల గడ్డపై జన్మించిన ఏ బిడ్డ కూడా సహించడు. ‘పుడితే ఒకటి, చస్తే ఒకటి అందుకొ తెలంగాణ జెండా.. రాజిగో.. మా రాజిగో’ పాటై, పోరై మండి సాధించిన తెలంగాణలో మళ్లీ మిడతల దండు చొరబడితే , తెలంగాణ తిరగబడి తీరుతుంది. అందుకే ‘రాష్ట్ర నలుదిక్కులూ.. నగాదారిలో.. నల్లగొండ చేరుదారిలో’ అంటూ ఈనెల 13న జరుగబోతున్న బీఆర్ఆఎస్ బహిరంగ సభ కోసం సిద్ధమవుతున్నాయి.
టీఆర్ఎస్ ఉద్యమ ప్రథమ వార్షికోత్సవాన్ని 2002 ఏప్రిల్ 27న నల్లగొండలో జన జాతరలా జరుపుకొంది. మళ్లీ 22 ఏండ్ల తర్వాత అదే నల్లగొండలో, ఆనాటి భావోద్వేగంతో రాష్ట్ర హక్కుల కోసం ప్రజా ప్రభంజనమై కదం తొక్కబోతున్నది. కేసీఆర్ పిలుపందుకొని కదులుతున్న తెలంగాణ మళ్లీ దేశానికి తాజా సందేశం ఒకటి పంపించదలుచుకున్నది. ఈ గర్జన దళారులపై ఎంతమాత్రం కానేకాదు, తెలంగాణ హక్కులను గుప్పెట బంధించాలనే ఎత్తులేసే వారందరికీ చాలా స్పష్టంగా ‘ఎన్నటికీ తెలంగాణ అలసిపోదు, అజాగ్రత్తగా అసలే ఉండదు’ అనే సందేశం ఈ సభ ఇస్తుంది. కేసీఆర్ ఉన్నంత కాలం గులాబీ జెండా రెపరెపలను ఆపలేరనడం ఎంత వాస్తవమో, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సకల హక్కులకు రక్షణ దళమై గస్తీ కాస్తూనే ఉంటుందనేది కూడా అంతే చారిత్రక సత్యం.
తెలంగాణ తన సద్దిమూటల్లో హక్కుల పోరాటాన్ని తరాల పాటు సాదుకున్నది. రెండు కన్నుల్లో కృష్ణా, గోదారులను ఇముడ్చుకొని భవితవ్యానికి బాటలు పరుచుకున్నది. ఈ నేల ఎన్నో నినాదాల ఇటుకలు పేర్చుకొని, కేసీఆర్ అనే రక్షణ గోడను నిర్మించుకున్నది. ఎందరో యమకింకరుల్లాంటి నేతలతో తలపడి, బతుకంతా తండ్లాడి, తెలంగాణను తొవ్వనపడేసిన పోరుశిల్పి కేసీఆర్. నేడు మళ్లీ స్వరాష్ట్ర ఆత్మగౌరవం కోసం, హక్కుల రక్షణ కోసం ప్రజారాశుల ఉద్యమ ఉప్పెనగా మారుతున్నారు. కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా, దానిలో తెలంగాణ బతుకుంటుందనే సత్యం జనరాశులందరికీ తెలుసు. తెలంగాణోడి జీవితం కోసం కోస ఎల్లేదాకా విడువక కొట్లాడే కేసీఆర్ వెంట సకలజనులూ కదిలితీరడం ఖాయం. అమృతం కురిసిన రాత్రిలో నిప్పును ఊదేసే నీరుంటుందని సినారె అన్నట్టుగా, కేసీఆర్ తెలంగాణ ముప్పునకు ఎదురెళ్లే పరిష్కారం.
నల్లగొండ సభ తెలంగాణ ఎన్నటికీ తలవంచదు అనే సందేశమై నిలబడుతుంది. అధికారం రావడం, పోవడం రాజకీయ పార్టీకి వన్నె తెచ్చిపెట్టదు అనే అవగాహన బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకూ ఉంది. అందుకే ప్రాంతమే ప్రాణమైన నిత్య ప్రయాణంగా మలుచుకొని ముందడుగేస్తున్నది. ‘మా నీళ్లు మాకేనని మర్లబడ్డ గానమా.. పోరు తెలంగాణమా..’
పద పోదాం.. మన నల్లగొండకు.
వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్
డాక్టర్ ఆంజనేయ గౌడ్