తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అనేక అంశాల్లో దేశంలోని అన్ని రాష్ర్టాలకంటే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది! ముఖ్యంగా తెలంగాణను దేశానికి ధాన్యాగారంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విజయం సాధించారు. నీటి ప్రాజెక్టులు, 46 వేలకు పైగా చెరువులను అభివృద్ధి చేసి నిత్యం నిండుకుండలా ఉండేవిధంగా తీర్చిదిద్దారు.
ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో కరువు కాటకాలతో, బీటలు వారిన నేలలు దర్శనమిస్తుండేవి. తెలంగాణలో సూర్యచంద్రులపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేసేవారు. ముఖ్యంగా బావుల కింద, చెరువుల కింద, బోర్లతో వ్యవసాయం సాగేది. అలాంటి తెలంగాణ నేడు పచ్చని పంట పొలాలతో, ధాన్యపు రాసులతో కళకళలాడుతున్నది. ఎక్కడ చూసినా గుంట భూమి ఖాళీ లేకుండా పచ్చదనంతో దర్శనమిస్తున్నది. దీనికి ప్రధాన కారణం పాలకుడు వ్యవసాయదారుడే కావడం. మన రాష్ట్రంలో 55 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. 1.43 కోట్ల హెక్టార్లలో భూమి సాగవుతున్నది. ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయయోగ్య భూమిగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది.
దేశ జనాభాలో దాదాపు 60 శాతం మందికి వ్యవసాయం ప్రధాన జీవనాధారం. ఇంత పెద్ద మొత్తంలో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తు న్న చిన్నకారు రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గిట్టుబాటు ధర లేకపోవడం గమనార్హం. ఇది చాలదన్నట్టు 2021లో కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చింది. దానికి వ్యతిరేకంగా ఏడాదిపాటు రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. సుమారు 750 మంది రైతుల ఆత్మ బలిదానంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. చివరికి మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించడం కొసమెరుపు.
తెలంగాణలో వ్యవసాయరంగానికి పెద్దపీట వేయడమే కాకుండా 24 గంటల ఉచిత కరెంటు, ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందించడంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నది. అదే క్రమంలో దేశంలో నే రైతులను ఏకతాటి పైకి తీసుకువచ్చి ఒక ఆదర్శవంతమైన రైతు రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. భారత రాష్ట్ర సమితి ఏర్పాటుతో ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అంటూ అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం పెంచడం, భూగర్భ జలాల పెంపుదల కోసం అనేక ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. మిషన్ కాకతీయ పేరుతో చెరువులకు మరమ్మతులు చేసి పూడికలు తీసి నీటి నిల్వను పెంచడానికి చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. బీడుపడ్డ వ్యవసాయ భూములు సస్యశ్యామలమై రైతులు రెండు పంటలు పండిస్తున్నారు.
తెలంగాణలో 117 శాతం సాగు వృద్ధి జరిగింది. 2014-15 ఏడాదిలో 62.48 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు కాగా, 2020-21 నాటికి అది 1.35 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే 72.52 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ఏకంగా రూ.1.61 లక్షల కోట్లు ఖర్చుచేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తు న్నాయి.
మిషన్ కాకతీయ పథకం ద్వారా రూ.5.349 కోట్లతో రాష్ట్రంలోని చెరువులన్నింటిని ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి చేసింది. గతంలో చెరువులు పూడికతో నిండిపోయి చెరువులో నీటి నిల్వ లేక వ్యవసాయ బావుల్లో నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండేది.
ఇదే కాకుండా పాలమూరు, రంగారెడ్డి దేవాదుల ప్రాజెక్టు పనులు చరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలో మరో 16 లక్షల ఎకరాల భూమి సాగు యోగ్యమవుతుంది.
తెలంగాణ ప్రభుత్వం చెరువులను, కుంటలను బాగుచేసి 8.93 టీఎంసీల నీటిని నిల్వ చేసి 15.05 లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించింది. రూ. 3,850 కోట్లతో 1200 చెక్ డ్యామ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించింది. ఇందులో ఇప్పటికే 638 డ్యామ్ల నిర్మాణం పూర్తయినట్లు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. మిగతా 562 పనులు పూర్తికానున్న దశలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మైక్రో ఇరిగేషన్ ప్రణాళిక కింద 20.35 లక్షల ఎకరాలు సాగవుతున్నది. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం, విస్తారమైన వర్షాలు, హరితహారం వంటి బృహత్తర కార్యక్రమాల ద్వారా తెలంగా ణ రాష్ట్రం హరితవనంగా మారింది. తద్వారా భూగర్భ జలమట్టం 4.14 మీటర్లు పైకి పెరిగింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, నాణ్యమైన కరెంటు, రైతుబంధు సాయం అందించడంలో ప్రభుత్వం విజయవంతమైంది.
ఏదేమైనా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఈ దశలోనే భారతదేశానికి ఒక దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించనున్నది. కష్టపడే మనస్తత్వం, ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు నిరంతరం పాటుపడే వ్యక్తి కేసీఆర్. ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైన రైతు రాజ్యం నిర్మాణం కోసం బీఆర్ఎస్తో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజయం సాధించాలని యావత్ తెలంగాణ కోరుకుంటున్నది.
(వ్యాసకర్త : పౌర సంబంధాల అధికారి, కేయూ)
-డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి
98495 77610