PM Modi | అక్టోబర్ 1న పాలమూరుకు రానున్న ప్రధాని వ్యవహార తీరు చూస్తుంటే పాలమూరును కూడా మేమే పూర్తిచేశామని చెప్పుకొంటాడేమోననే అనుమానం కలుగుక మానదు. అయితే ఇక్కడ ఓ విషయాన్ని ప్రస్తావించుకోవాలి. 2014 మహబూబ్నగర్ ఎన్నికల ప్రచార సభకు విచ్చేసిన అప్పటి ప్రధాని అభ్యర్థి, ప్రస్తుత దేశ ప్రధాని మోదీ స్వయంగా బహిరంగసభలో అధికారంలోకి వచ్చాక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి పదేండ్లు పూర్తికావస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మోదీ దానిగురించి మాట్లాడిన దాఖలాల్లేవు. కేంద్రంతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తామని ధైర్యంగా ప్రకటించి పూర్తిచేశారు.
అనేకమార్లు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు జాతీయహోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కేసులు వేస్తే, తెలంగాణ బీజేపీ నాయకులు కనీసం తమ అధిష్ఠానాన్ని జాతీయహోదా ఇవ్వమని కోరకపోవడం గమనార్హం. రాష్ట్ర ఏర్పాటు జరిగేటప్పటికి నాటి యూపీఏ తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. తర్వాత వచ్చిన మోదీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. కనీసం విడిపోయిన రాష్ర్టాల మధ్య నీటి పంపకాల కోసం దశాబ్దాల కాలం తీసుకున్నందుకు సిగ్గు పడాలి. రెండు రాష్ర్టాల మధ్య తగువులను రాజకీయంగా వాడుకోజూస్తున్న ఈ రెండు జాతీయ పార్టీలను చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారు.
పాలమూరు పార్లమెంటుకు ఎంపీ అయినందుకు, పాలమూరు ఎంపీగా రాష్ర్టాన్ని సాధించినందుకు, తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయినందుకు ఈరోజు కేసీఆర్ పాలమూరు ప్రజల కన్నీళ్లను తుడిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల ఊపిరైన గాలికి, తాగేనీళ్లకు, చేసే భోజనానికి భరోసా ఇచ్చేందుకే వ్యవసాయాన్ని కేసీఆర్ ఇన్ని రూపాల్లో ఆదుకుంటున్నారు. దానిలో భాగమే రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, 100 శాతం పంటల కొనుగోళ్లు, అందుబాటులో సాగునీళ్లు, విత్తనాలు, ఎరువులు, పల్లె ప్రకృతి వనాలు, హరితహారం.
పాలమూరులో మనుష్యులే కాదు, పక్షులు కూడా వలసపోయాయి. పశు సంపద కబేళాలకు తరలిపోయింది. మా ఇసుక నగరం నిర్మాణాలకు పనికొచ్చింది. మా కలప కట్టడాలకు పనికొచ్చింది. మనుషులే కాదు గణేశుడి నిమజ్జనాల కోసం కూడా శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లకు వలసవెళ్లాం. కలే తాగామో, గంజే తాగామో అవి దొరకనప్పుడు కన్నీళ్లే తాగామో ఆ దేవునికెరుక. సారవంతమైన భూములున్నా, చెమట ధారపోసే శక్తి ఉన్నా.. సాగు నీరులేక, వానలు కురవక, పంటలు పండక వలస మార్గమే బతుకు దెరువుకు దిక్కయింది. తలాపున కృష్ణమ్మ పారుతున్నా ఒక ఎకరం పారింది తెలువదు. అన్ని నీళ్లు మమ్మల్ని వెక్కిరించుకుంటూ కిందకే తరలిపోయాయి. ఇదేం అన్యాయమని అడిగితే మీరు పైన ఉన్నారు. మీ ఖర్మ అన్నవారే తప్ప అయ్యో పాపం అన్న నాథుడు లేడు. అపహస్యాలు, అవహేళనలకు అంతే లేదు.
ఇదీ ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల నిర్లక్ష్యం, నిరాదరణ, ఇక్కడి నాయకుల బాధ్యతారాహిత్యం, వెన్నెముక లేని తనం మూలంగా పాలమూరు ప్రజల దుస్థితి. భాషాప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రా, హైదరాబాద్ రాష్ట్రం కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కొన్ని ప్రాంతాలు కర్ణాటకకు వెళ్లిపోవడంతో నిజాం రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులు అటకెక్కాయి. పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయం చూసి చలించిన బచావత్ ట్రిబ్యునల్ ఇక్కడ ఏ నాయకుడు కూడా అడగడం లేదు. అయినా ఇక్కడి ప్రజల పరిస్థితిని చూసి తామే స్వయంగా 20 టీఎంసీల నీటిని కేటాయిస్తూ పాలమూరుకు సాగునీరు వచ్చేలా ఒక ప్రాజెక్టు నిర్మించాలని అనుమతి ఇచ్చారు. దీన్నిబట్టి ఇక్కడి నాయకులు ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. కాలక్రమంలో 50 టీఎంసీల సామర్థ్యంతో జూరాల ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించారు. దాన్ని తొమ్మిది టీఎంసీలకు కుదించి నిర్మిస్తే నేడు దాని సామర్థ్యం 6 టీఎంసీలకు పడిపోయింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన ప్రీతిసూధన్ వెళ్తూ వెళ్తూ ‘ఈ జిల్లా ప్రజలు చాలా మంచివాళ్లు. ఇక్కడ ఉన్న నాయకులు ఎన్నడూ నా వద్ద ఈ జిల్లా ప్రజల కష్టాలు ప్రస్తావించలేదు’ అని చెప్పడం ఇక్కడి నాయకుల తీరుకు, ప్రజల అమాయకత్వానికి ప్రతీక.
1955, డిసెంబర్ 10న భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు భారతదేశ 3వ ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా 1967లో కుడి, ఎడమ కాలవలోనికి నీరు విడుదలైంది. నాగార్జునసాగర్ నిర్మాణంలో రోజుకు 45 వేల మంది కూలీలు పన్నెండేండ్ల పాటు శ్రమించారు. వారిలో 10 వేల మంది ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రజలంతా నల్లగొండ, పాలమూరు బిడ్డలే. 1963 జూలైలో అప్పటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేసిన శ్రీశైలం ప్రాజెక్టు డ్యాం నిర్మాణం క్రస్టుగేట్లతో సహా 1984, డిసెంబరు నాటికి పూర్తయింది. దీని నిర్మాణంలోనూ అనేకమంది పాలమూరు బిడ్డల త్యాగం ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో నల్లరేగడి భూములున్న 67 గ్రామాలు, 42,203 ఎకరాలు నీట మునిగిపోయాయి. 12 వేల స్వయంపోషక కుటుంబాలు తమ సర్వస్వం కోల్పోయాయి. సకల వనరులున్న గ్రామాలు సర్వస్వం కోల్పోయినా ఏ ఒక్క ప్రభుత్వమూ 60 ఏండ్లలో పట్టించుకోలేదు. రాయలసీమ మీదుగా మద్రాస్ వరకు తెలుగు గంగ పేరుతో, పోతిరెడ్డిపాడు పేరుతో నీళ్లు తీసుకెళ్తే ఒక్కరూ ప్రశ్నించలేదు. 1985లో మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేలు, వైఎస్ హయాంలో మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్లే అయినా పాలమూరుకు నీళ్ల గురించి మాట్లాడిన దాఖలాలు కనిపించవు.
అవమానాలు, అవహేళనలు, వివక్ష, నిరాదరణ భరించి, భరించి 2001లో కేసీఆర్ పిలుపునందుకొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అడుగులు వేశాం. జోగులాంబ నుంచి రాజోలి వరకు, కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసింది కేసీఆర్. ఆ పాదయాత్రల ఫలితంగానే తెలంగాణ ప్రాజెక్టుల్లో కదలిక వచ్చింది. కానీ, అది కూడా కేవలం ప్రజలను మభ్యపెట్టడం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి వారి దృష్టిని మళ్లించడం కోసమే తప్పితే ఇక్కడి ప్రజల కష్టాలను తీర్చాలనో, ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలన్న చిత్తశుద్ది ఎన్నడూ ఎక్కడా కనిపించదు.
2001లో కేసీఆర్ తెలంగాణ నినాదం ఎత్తుకోగానే చంద్రబాబు ప్రాజెక్టులకు అరకొర నిధులు విదిల్చి ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనలు మొదలుపెడితే, 2004 ఎన్నికలకు ముందు అధికారం కోసం వైఎస్ రాజశేఖర్రెడ్డి, చంద్రబాబు శంకుస్థాపన చేసిన శిలాఫలకాల వద్ద మొక్కలు నాటి అధికారం ఇస్తే జలయజ్ఞం చేపట్టి సాగునీళ్లు తెస్తానని ఈ ప్రాంత రైతాంగంలో ఆశలు రేపారు. అధికారం చేతికందిన వెంటనే మొక్కుబడిగా తెలంగాణ ప్రాజెక్టులు మొదలుపెట్టి శరవేగంగా రాయలసీమ ప్రాజెక్టులు మూడు షిఫ్టులలో పనిచేయించి పూర్తి చేశాడు. 11 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడును ఆగమేఘాల మీద పనులు చేయించి మరో 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా సామర్థ్యం పెంచారు. తెలంగాణలో వేల ఎకరాల ముంపు తప్ప ఒక్క ఎకరాకు సాగునీరు రాని పులిచింతల ఎత్తిపోతల పథకాన్ని వాయువేగంతో పూర్తిచేశారు. అటు పులిచింతల గురించి గానీ, ఇటు పోతిరెడ్డిపాడు గురించి గానీ నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల ప్రజాప్రతినిధులు నోరెత్తిన పాపాన పోలేదు. పైగా పోతిరెడ్డిపాడును సమర్థిస్తూ వ్యాసాలు రాయడం, మీడియా సమావేశాలు నిర్వహించడం గమనార్హం. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పదని తెలుసు. అందుకని దానికి ముందే ఉమ్మడి రాష్ట్ర నిధులతో ఆంధ్రా, రాయలసీమ ప్రాజెక్టులు పూర్తిచేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తెలంగాణ ప్రాజెక్టుల పనులన్నీ ఎక్కడికక్కడ నిలిపివేయడం జరిగింది. సాక్షాత్తూ శాసనసభలో ‘తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని చెప్పడం గమనార్హం. తెలంగాణ నినాదం రోజురోజుకు బలపడుతుండటంతో ప్రజలను మభ్యపెట్టేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెరమీదికి తెచ్చారు. దానిని ఎలాంటి నీటి లభ్యత లేని జూరాల బ్యాక్ వాటర్ ఆధారంగా నిర్మిస్తామని చెప్పి సర్వేకు ఉత్తర్వులు విడుదల చేశారు. అన్ని అడ్డంకులు దాటుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటును ఒప్పించి కేసీఆర్ సారథ్యాన్ని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం.
ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ఎత్తిపోతల పథకాలన్నీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రంలోనే పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఎత్తిపోతల కాలువల కింద చెరువులు, కుంటలు నింపడం నిషేధం. కాలువలలో రైతులు మోటార్లు వేసుకొని నీటిని తోడుకోవడం నిషేధం. తెలంగాణ రాష్ట్రంలో అలాంటి అడ్డంకులన్నీ రైతుల కష్టం తెలిసిన కేసీఆర్ తొలగించారు. అందుకే నేడు రాష్ట్రంలో చెరువులు, కుంటలు, కళకళలాడుతుండటం మూలంగా జీవవైవిధ్యం ఉట్టిపడుతున్నది. వలసపోయిన మనుషులే కాదు పక్షులు కూడా పల్లెలకు వాపస్ వచ్చినయి. ఒకనాడు శ్మశాన నిశ్శబ్దం ఏలిన పల్లెలు నేడు పక్షుల కిలకిలరావాలు, మనుషుల సంచారంతో కొత్త సొబగులు సంతరించుకున్నాయి.
పాలమూరు పార్లమెంటుకు ఎంపీ అయినందుకు, పాలమూరు ఎంపీగా రాష్ర్టాన్ని సాధించినందుకు, తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయినందుకు ఈరోజు కేసీఆర్ పాలమూరు ప్రజల కన్నీళ్లను తుడిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల ఊపిరైన గాలికి, తాగేనీళ్లకు, చేసే భోజనానికి భరోసా ఇచ్చేందుకే వ్యవసాయాన్ని కేసీఆర్ ఇన్ని రూపాల్లో ఆదుకుంటున్నారు. దానిలో భాగమే రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, 100 శాతం పంటల కొనుగోళ్లు, అందుబాటులో సాగునీళ్లు, విత్తనాలు, ఎరువులు, పల్లె ప్రకృతి వనాలు, హరితహారం.
భారత దేశమంటే 5 లక్షల 50 వేల గ్రామాలున్న రాజ్యం. గ్రామసీమలు బాగుంటేనే దేశం బాగుంటుంది. వాకిట్లో సాంపి చల్లేటందుకు, పొయ్యి మీద బియ్యం ఉడికేటందుకు, దూప కొంటే నీళ్లు తాగేటందుకు, పంటల సాగుకు అన్నింటికీ ప్రభుత్వం నీళ్లిస్తున్నది. మానవాళి మనుగడకు నీళ్లే ఆధారం. వెనకటికి రాజు వేటకు వెళ్తే చెట్టెక్కి సమీప ప్రాంతంలో ఎక్కడ చెట్ల మీద కొంగలున్నాయో చూడమని భటులను ఆదేశించేవారు. ఎక్కడ కొంగలు ఉంటే అక్కడ నీళ్లున్నట్లు. ఈ రోజు పాలమూరు జిల్లాలోని ఎత్తం గట్టు ఎక్కి చూస్తే ఎక్కడచూసినా నీళ్లే. రామాయణంలో తల్లిదండ్రుల దూప తీర్చడానికి శ్రవణకుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతాంగం కోసం వందలాది మంది శ్రవణ కుమారులు తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు.
అటు కాళేశ్వరం ఎత్తిపోతల అయినా, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అయినా వీటిని ఎవరూ కలగనలేదు. ఇన్ని వందల మీటర్ల ఎత్తున జలాలు ఎగసిపడతాయంటే ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు వాటిని చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండితే ఒక్కోసారి కాలమైనా, కాకున్నా కడుపు నిండుతుందన్న భరోసా వచ్చింది. ఇంట్లో పిడికెడు బియ్యముంటే ఆ ధైర్యమే వేరు. పొయ్యి కిందకు ఎవరైనా ఇస్తరు. పొయ్యి మీదకు ఎవరిస్తారు? మగ పిల్లోనికి ఎంత భూమున్నా పిల్లనగ్రోవి కాదు. ఆడపిల్లల పెండ్లిండ్లు కూడా కష్టంగా ఉండేది. కష్టాలు తెలిసిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అన్నీ దూరమైనవి. వలస బతుకులు ఆగిపోయినవి. వలసెల్లిన జిల్లాకు దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం వలస వస్తున్నారు. ఎవరైనా వస్తే మేం ఆదరిస్తాం. కృష్ణమ్మ నీళ్లతో మా ఊరి దేవతల పాదాలు కడిగినప్పుడే మా దరిద్రం పోయింది. కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు, రైతులు, ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ నిండునూరేండ్లు చల్లగా ఉండాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు)
-సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి