‘20 ఏండ్ల తర్వాత కేటీఆర్ భారత దేశానికి ప్రధాని అయితే ఆశ్చర్యపోకండి. ఇంత స్పష్టమైన ముందుచూపు, భావవ్యక్తీకరణ ఉన్న యువ రాజకీయ నాయకుడిని నేను ఇప్పటి వరకూ చూడలేదు’- గత ఏడాది మే నెలలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్ను చూసి ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ ఆశా జడేజా మోత్వానీ వ్యక్తం చేసిన అభిప్రాయమిది. ఆ వ్యాఖ్యలో ఇసుమంత అతిశయోక్తి కూడా లేదని మరోమారు దావోస్ సదస్సే రుజువు చేయటం విశేషం. గత ఏడాది ఇదే సదస్సులో తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి అవి రూ.21,000 కోట్లకు పెరిగాయి. అంటే ఐదింతలకుపైగా. ఈ పెట్టుబడుల వెల్లువ వెనుక ఉన్న సూత్రధారి అప్పుడూ, ఇప్పుడూ మంత్రి కేటీఆరే. విదేశాల్లోని ప్రసిద్ధ కంపెనీల ప్రతినిధులకు తెలంగాణలో ఉన్న అవకాశాల గురించి అరటి పండు ఒలిచి పెట్టినట్లు చెప్పే ఆయన భాషాపటిమ, విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, స్పష్టత, సాంకేతిక అంశాలపైన సాధికారత.. ఇవన్నీ దావోస్లో తెలంగాణ కీర్తి పతాకం రెపరెపలాడటానికి కారణమయ్యాయి.
ప్రపంచమంతటా ఆర్థికమాంద్యం భయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. అనేక కంపెనీలు ఉద్యోగులను భారీ ఎత్తున తొలగిస్తున్నాయి. ఇటువంటి సమయంలో, తెలంగాణలో వేల కోట్ల పెట్టుబడులు పెడతామని బహుళజాతి సంస్థలు ప్రకటించటం రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు లభిస్తున్న సమున్నత గౌరవం. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్ వినూత్నమైన పారిశ్రామిక విధానంగా మన్ననలు అందుకున్నది. దీనికితోడు నిరంతర, నాణ్యమైన విద్యుత్తు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహం, రాయితీలు, శాంతిభద్రతలు, స్థిరమైన ప్రభుత్వం వంటివి తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాయి. మంత్రి కేటీఆర్ విదేశాల్లోనే కాదు, స్వదేశంలోనూ ఆయన పలు కంపెనీలను రాష్ర్టానికి తీసుకురావటానికి ఎంతో కసరత్తు చేస్తున్నారు.
రెండేండ్ల క్రితం కిటెక్స్ అనే కంపెనీ కేరళ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించగానే కేటీఆర్ ఆ కంపెనీతో సంప్రదింపులు జరిపి తెలంగాణలో తమ యూనిట్ను నెలకొల్పటానికి ఒప్పించారు. ఏపీకి చెందిన ప్రసిద్ధ బ్యాటరీ కంపెనీ అమరరాజా బ్యాటరీస్ తెలంగాణలో రూ.9,500 కోట్ల భారీ పెట్టుబడి పెట్టటానికి ముందుకొచ్చింది. మారుతున్న ప్రపంచాన్ని అంతే వేగంగా అందిపుచ్చుకోవటానికి కేటీఆర్ వినూత్నమైన ఆలోచనలను అమలు చేశారు. టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, టాస్క్ వంటివన్నీ ఆయన మదిలో పుట్టినవే. ఈ విధంగా ఈ ఎనిమిదేండ్లలో రూ.3.5 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 22.5 లక్షల ఉద్యోగావకాశాలు పుట్టుకొచ్చాయి. ట్విట్టర్లో అత్యంత ప్రభావం చూపే వ్యక్తుల్లో కేటీఆర్కు ప్రపంచంలోనే 12వ స్థానం లభించింది. ఈ విధంగా, తెలంగాణ జైత్రయాత్ర.. కేటీఆర్ విజయయాత్ర కలిసి నడుస్తున్నాయి.