తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జ్ఞాపకాలను, ముద్రలను తుడిచివేస్తానని శాసనసభలో బాహాటంగా ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి ఏకంగా మేడిగడ్డనే తుడిచివేసే నీచమైన కుట్రకు సిద్ధపడుతున్నట్టు అభిప్రాయానికి రావాల్సి వస్తున్నది. ఎందుకంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తున్నది. అయినా, ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం కనీసం నిపుణుల కమిటీని నియమించకపోవడం శోచనీయం. గత అక్టోబర్ 21 సాయంత్రం మేడిగడ్డ బ్యారేజీలోని 8 బ్లాకుల్లో గల 86 పియర్లలో 7వ బ్లాకులోని 19, 20వ పియర్లు కుంగాయి.
దేశంలోనే అత్యంత వేగంతో వరదలు వచ్చే నదుల్లో మొదటిది గోదావరి నది. గత 500 ఏండ్ల చరిత్రలోనే కాళేశ్వరం వద్ద ఏనాడూ రానంత ఎక్కువ వరద (28.7 లక్షల క్యూసెక్కులు) 2022 వర్షాకాలంలో (జూలై) మేడిగడ్డ వద్ద వచ్చింది. ఈ బ్యారేజీ 28.25 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందనే అంచనాతో నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వం. అంచనాకు మించి వచ్చిన వరదను తట్టుకొని నిలబడ్డ బ్యారేజీ అకస్మాత్తుగా వరదలేని సమయంలో ఎందుకు ప్రమాదానికి గురైందో నిపుణుల పరిశీలన తర్వాతే వెల్లడవుతుంది. దేశంలోని ఆనకట్టల పరిరక్షణ కోసం ఏర్పాటైన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కూడా వారంలోపే హడావుడిగా వచ్చి ఏ పరిశీలన జరుపకుండానే కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిందే తప్ప ప్రమాదం ఎలా జరిగి ఉంటుందో తెలుసుకోవడానికి నిపుణుల కమిటీని నియమించలేదు.
Medigadda Barrage | గత నవంబర్ 30న జరిగిన శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ ఘటనను ఆధారంగా తీసుకొని కేసీఆర్పై నిందలు వేసేందుకే రెండు జాతీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) ప్రయత్నించి సఫలీకృతమైనట్టు గత ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఏప్రిల్, మే నెలలో రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డను అలాగే గాలికి వదిలి మరోసారి కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నాయి ఆ పార్టీలు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా మేడిగడ్డ రిపేర్ల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా అధికారంలో లేని కేసీఆర్పైనే నిందలు వేస్తూ సీఎం రేవంత్రెడ్డి కాలయాపన చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
కాళేశ్వరం ప్రాజెక్టులోనే లక్ష కోట్ల అవినీతి జరిగితే వీటన్నింటిపై ఎవరు వ్యయం చేశారు? ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చింది? రేవంత్రెడ్డివిపచ్చి అబద్ధాలు అని తెలుసుకోవడానికి ఇంతకన్నా స్పష్టత ఇంకేం కావాలి? సాక్షాత్తు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రస్తుత నీటిపారుదల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి లోక్సభలో సమాధానం ఇస్తూ కాళేశ్వరంలో అవినీతి జరగలేదని స్పష్టం చేసిన సంగతి అబద్ధమా?
భారతదేశంలో ఏనాడూ ఏ ఒక్క బ్యారేజీకి లేదా డ్యాంకు ప్రమాదమే జరగనట్టు ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ప్రమాదాల చరిత్రను ఒక్కసారి పరిశీలిద్దాం. తుంగభద్ర డ్యాం నిర్మాణం స్వాతంత్య్రానంతరమే 1947లో మొదలైంది. 1953లో వరద తీవ్రత వల్ల ఈ డ్యాం దెబ్బతిన్నది. అప్పుడు కూడా ప్రతిపక్ష సభ్యులు హైదరాబాద్ శాసనసభలో డిజైన్ లోపమని ఆరోపించగా అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ‘డిజైన్ లోపం కాదని, వరద తీవ్రత వల్లే డ్యాం దెబ్బతిన్నద’ని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన కడెం, సాత్నాల, పాలెం వాగు, మూసీ, గుండ్లవాగు (ములుగు) ఆనకట్టలు వరదకు కొట్టుకుపోయి, దెబ్బతిన్న సంగతి రాష్ట్ర ప్రజలకు గుర్తుండే ఉంటుంది. ఏడాదిన్నర కిందట పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే వరద వల్ల 1.7 కి.మీ. డయాఫ్రం వాల్ కొట్టుకుపోతే కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల నిధులను పునరుద్ధరణ కోసం కేటాయించింది.
పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం కొంతమేరకు కొట్టుకుపోయింది. 2019 వరదల సందర్భంగా కూడా పోలవరం డ్యాం డయాఫ్రం గోడ దెబ్బతిన్నది. రూ.600 కోట్ల అదనపు వ్యయంతో పునరుద్ధరించింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం వద్ద 2022 జూలై 15న వచ్చిన భారీ వరద (102 సంవత్సరాల్లో) మునుపెన్నడూ రానటువంటిది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 12 మందితో నిపుణుల కమిటీని నియమించి పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని ధృవీకరించింది.
అసోం-అరుణాచల్ప్రదేశ్ సరిహద్దులో నిర్మించిన లోయర్ సబన్సిరి జలవిద్యుత్ ప్రాజెక్టు మేడిగడ్డకు ప్రమాదం జరిగిన వారం లోపే అక్టోబర్ 27, 2023న కొండచరియలు విరిగిపడటం వల్ల దెబ్బతిన్నది. దేశంలోని జలవిద్యుత్ ప్రాజెక్టులలో లోయర్ సబన్సిరి ప్రాజెక్టు అతిపెద్దది. దీని ఉత్పాదన సామర్థ్యం 2000 మెగావాట్లు. 500 మెగావాట్ల రెండు ప్లాంట్లు ఈ నెలలోనే ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉన్నది. ఈ దశలో ఈ డ్యాంకు ప్రమాదం జరిగింది.
నర్మదా నదికి ఉపనది అయిన కారమ్ నదిపై నిర్మించిన మధ్యప్రదేశ్లోని భరుద్పురా (కారమ్) డ్యాంలో నీళ్లను నింపిన మొదటి సంవత్సరమే 2022 ఆగస్టులో భారీ సీపేజ్తో దెబ్బతిన్నది. నాలుగేండ్ల కిందటనే ఈ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. రూ.304.44 కోట్ల నష్టం సంభవించింది.
అసోంలోని కొపిలి జలవిద్యుత్ కేంద్రం డ్యాంకు మార్చి 26, 2022లో ప్రమాదం జరిగి ముగ్గురు వ్యక్తులు మరణించారు. 96 మి.మీ. వర్షం కారణంగా వచ్చిన భారీ వరదలు ఈ నష్టానికి కారణమని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా జాంజ్రోలి వద్ద గల మహిమ్-కెల్వడ్యాం జనవరి 8, 2022న ప్రమాదం జరిగి దెబ్బతిన్నది. 3 మీటర్ల పగుళ్లు రావడం వల్ల డ్యాంలోని నీళ్లు లీకై భారీగా బయటికి వచ్చాయి.
సిక్కింలోని అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రమైన (1200 మె.వా.) 60 మీటర్ల చుంగ్తాంగ్ డ్యాం (తీస్తా-3 డ్యాం) 2023 అక్టోబర్ 4న వరదలకు దెబ్బతిన్నది. క్లవుడ్ బరస్ట్ దీనికి కారణమని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం వల్ల తీస్తా నది పక్కనే ఉన్న సింగ్టాం పట్టణం పూర్తిగా మునిగింది. ఒక ఆర్మీ బరాక్ కొట్టుకుపోయి 22 మంది జవాన్లతో సహా 59 మంది గల్లంతయ్యారు. 14 బ్రిడ్జిలు కొట్టుకుపోయి సిక్కిం రాజధాని గాంగ్టక్తో సహా కొన్ని పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు వాహనాలు ఈ వరదలో కొట్టుకుపోయాయి. అటవీశాఖ గెస్ట్హౌజ్తో పాటు పలు ప్రభుత్వాధికారుల నివాస గృహాలు ధ్వంసమయ్యాయి.
పైన ఉదహరించిన డ్యాం ప్రమాదాలు ఏడాదిలోపు జరిగినవే. మన దేశంలో 6 వేలకు పైగా పెద్ద డ్యాంలున్నాయి. వీటిలో 80 శాతం సుమారు 25 ఏండ్లకు పూర్వం నిర్మించినవి. ఎక్కువ సంఖ్యలో భారీ డ్యాంలున్న దేశాల్లో అమెరికా, చైనా తర్వాత మనది మూడోది. ఏటా అనేక డ్యాంలకు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం భారీ వరదల వల్ల జరుగుతున్నవే. అంచనాలకు మించి వరదలు రావడానికి కారణం క్లవుడ్ బరస్ట్లు, గ్లోబల్ వార్మింగ్తో అతి భారీ వర్షాలు కురవడం.
మన దేశంలో డ్యాం ప్రమాదాల్లో అతిపెద్దది 1979 ఆగస్టు 11న గుజరాత్లోని మోర్బీ వద్ద జరిగిన మచ్చు-2 డ్యాం ప్రమాదమే. ఈ డ్యాం ప్రమాదం భారీ వర్షాలు, వరదల వల్ల జరిగింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో మచ్చు డ్యాం అతి భారీ డ్యాం ప్రమాదంగా నమోదైంది. మచ్చు డ్యాం ప్రమాదంలో వేలాది మంది మరణించారు. అంచనా దొరకలేదు. ఈ డ్యాం 1972లో నిర్మించారు. స్పిల్ వే సామర్థ్యానికి మూడు రెట్లు ఎక్కువ వరద రావడం వల్ల డ్యాం నిర్మించిన ఏడేండ్లకే ఈ ప్రమాదం జరిగింది.
దేశంలోనే అత్యధిక డ్యాంలు ఉన్న మహారాష్ట్రలో సుమారు 500 డ్యాంలలో సీపేజ్, పగుళ్లతో శిథిలావస్థలో ఉన్నాయి. వీటిలో కొన్ని బాగా దెబ్బతిన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే డ్యాం సేఫ్టీ చట్టం 2021 వచ్చింది.
అంచనాలకు మించి వస్తున్న భారీ వరదలే ఈ డ్యాంల ప్రమాదాలకు మొదటి కారణమని పై డ్యాం ప్రమాదాలు స్పష్టం చేస్తున్నాయి. మేడిగడ్డ వద్ద గడిచిన 500 సంవత్సరాల్లో ఎన్నడూ రానంత వరద (28 లక్షల 75 వేల క్యూసెక్కులు) అంటే సుమారు 250 టీఎంసీల నీరు ఒక్కరోజులో మేడిగడ్డ బ్యారేజీ నుంచి దిగువకు అత్యంత వేగంగా ప్రవహించింది. జూలై 15, 2022న వచ్చిన ఈ వరదను మేడిగడ్డ తట్టుకున్నా పియర్స్ అంతర్గతంగా దెబ్బతిని ఉండవచ్చు. మేడిగడ్డను 28,25,000 క్యూసెక్కులకు డిజైన్ చేశారు. డిజైన్ లోపం కాదు, ఎందుకంటే 500 ఏండ్లలో ఏనాడూ 28,25,000 క్యూసెక్కుల వరద మేడిగడ్డ స్థలంలో గోదావరికి రాలేదు.
మేడిగడ్డ పియర్స్ కుంగిన రోజు అంతకుముందు కూడా సుమారు 15 లక్షల క్యూసెక్కుల వరద ఈ బ్యారేజీ నుంచి దిగువకు వెళ్లింది. బ్యారేజీ వద్ద సుమారు 10 టీఎంసీల నీటి నిల్వ అప్పటికే ఉన్నది. ఈ నీటి నిల్వ దాని సామర్థ్యం కన్నా 1/3వ వంతు తక్కువే. మేడిగడ్డ ప్రమాదం గోదావరికి వచ్చిన భారీ వరదల వల్లనే జరిగి ఉంటుందని తేటతెల్లమవుతుంటే జరిగిన ప్రమాదం కేసీఆర్ అవినీతి వల్లనే జరిగిందని సీఎం రేవంత్రెడ్డి పదే పదే
అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు.
కారణాలను నిపుణులు ఎక్కడ వెల్లడిస్తారోనని ఇప్పటిదాకా ఫైల్ను తన పేషీలోతొక్కిపెట్టాడే తప్ప నిపుణుల కమిటీనే వేయలేదు.రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలకోరే కాకుండా జాతీయ నాయకులైన రాహుల్, సోనియాగాంధీలతో కూడా అబద్ధాలు చెప్పించిన ‘ఘనాపాటి’. డిసెంబర్ 2023 వరకు ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగిందని అబద్ధపు ప్రచారాన్ని ఎన్నికల కాలమంతా కొనసాగించాడు. ఈ 93 కోట్ల వ్యయంతో 1531 కి.మీ. ప్రవాహ కాల్వలు, 203 కి.మీ. సొరంగాలు, 98 కి.మీ ప్రెజర్మేన్లు, 22 లిఫ్టులు, 15 రిజర్వాయర్లు (141 టీఎంసీ సామర్థ్యం), 3 బ్యారేజీలు, 91 పంపులు, వీటిలో 139 మె.వా. బాహుబలి పంపులు 14, నిజాంసాగర్, అప్పర్మానేరు, శ్రీరాంసాగర్ రెండు స్టేజీలు, వరద కాల్వ స్థిరీకరణ, భూగర్భంలో సబ్స్టేషన్లతో పాటు బాహుబలి పంపింగ్ స్టేషన్లు మొత్తం 21 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం, 50 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్నసాగర్ వంటి భారీ రిజర్వాయర్ నిర్మాణం, దీనితో పాటు కొండపోచమ్మ సాగర్ ముంపు నిర్వాసితుల పునరావాసం, సుమారు 20 జిల్లాల్లో (వీటిలో ఎక్కువగా వరుస కరువులు వస్తూ ఎలాంటి సాగునీటి వసతులు లేనివి) లక్షలాది ఎకరాల స్థిరీకరణ, మరికొద్ది డబ్బు వ్యయం చేస్తే సాగునీరందే లక్షలాది ఎకరాల ఆయకట్టు, వాగులతో, చెరువులతో అనుసంధానానికి కాల్వలపై వందలాదిగా డిస్ట్రిబ్యూటర్ల, స్లూయిస్ల నిర్మాణం, రీ డిజైనింగ్ వల్ల వదిలివేసిన నిర్మాణాల వ్యయం, వ్యాప్కోస్ (కేంద్ర ప్రభుత్వ సంస్థ)కు సర్వే కోసం చెల్లించిన వ్యయం, అయిన వ్యయం, రేవంత్రెడ్డి మల్లన్నసాగర్పై వేయించిన వందకు పైగా కోర్టు కేసుల్లో న్యాయవాదులకు చెల్లించిన ఫీజు, కోర్టుల ఖర్చులు, అనుమతులు తేవడానికి పలుమార్లు ఢిల్లీలోని జలశక్తి కార్యాలయం, కేంద్ర జలసంఘం చుట్టూ డజన్ల సార్లు తిరగడానికయ్యే ఖర్చులు, వరదల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల నిర్మాణ సమయంలో జరిగిన నష్టాలను పూడ్చుకోవడానికి అదనంగా కాంట్రాక్టర్లకు చెల్లించిన డబ్బు… ఇవన్నీ కలిపి కాళేశ్వరం (ఒరిజినల్) రెండు టీఎంసీల ప్రాజెక్టుపై చేసిన వ్యయం సుమారు 73 వేల కోట్లు మాత్రమే. మరో అదనపు టీఎంసీని (మూడో టీఎంసీ) తరలించడానికి ఇప్పటిదాకా అయిన వ్యయం 20 వేల కోట్లు.
కాళేశ్వరం ప్రాజెక్టులోనే లక్ష కోట్ల అవినీతి జరిగితే వీటన్నింటిపై ఎవరు వ్యయం చేశారు? ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చింది? రేవంత్రెడ్డివి పచ్చి అబద్ధాలు అని తెలుసుకోవడానికి ఇంతకన్నా స్పష్టత ఇంకేం కావాలి? సాక్షాత్తు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రస్తుత నీటిపారుదల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి లోక్సభలో సమాధానం ఇస్తూ కాళేశ్వరంలో అవినీతి జరగలేదని స్పష్టం చేసిన సంగతి అబద్ధమా? కాళేశ్వరం అంచనా వ్యయం రూ.80 వేల కోట్లకు (2016 నాటికి) పెరగడాన్ని, ప్రస్తుతం రూ.1,27,000 కోట్లకు పెరగడాన్ని అవినీతికి ఉదాహరణగా చెప్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ 2007లో ఈ ప్రాజెక్టు వ్యయం రూ.17 వేల కోట్లుగా 19 నెలలకే రూ.38 వేల కోట్లుగా డీపీఆర్లు కేంద్ర జలసంఘానికి పంపించారు. ఎనిమిదేండ్ల తర్వాత ఇది రెట్టింపై 80 వేల కోట్లకు చేరుకుంది. రీ-డిజైనింగ్లో 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్లు, మరో 3 సబ్స్టేషన్లు, 18.75 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, వాటి కోసం కాల్వలు, 14 టీఎంసీలకు బదులు 141 టీఎంసీల రిజర్వాయర్లు, 139 మె.వా.పంపులు, అదనంగా మరో 4 బాహుబలి పంపులు, మూడో టీఎంసీ వ్యయం.. ఇవన్నీ కలిపి 2008 నుంచి 2023 వరకు పెరిగిన వ్యయం రూ.1,27,000 కోట్లయితే ఆశ్చర్యపడాల్సిందేముంది?
కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను తమ అదుపులో పెట్టడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను, సీబీఐ వంటి సంస్థల అధికారాలను దుర్వినియోగం చేస్తున్న నిజం మనకు తెలుసు. నిజంగానే కాళేశ్వరంలో అవినీతి జరిగి ఉంటే గత ఏడెనిమిదేండ్లలో ఈ సంస్థలు ఎందుకు పట్టుకోలేకపోయాయి? కేంద్రంలోని పెద్దలతో కేసీఆర్కు ఉన్న వైరం దేశ ప్రజలందరికీ తెలుసు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాపై గంటల తరబడి మీడియా సమావేశాల్లో పలుమార్లు కేసీఆర్ వాడిన పరుష పదజాలం కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏనాడైనా వాడినారా? మోదీని ఢీకొనే మొనగాడు కేసీఆర్ ఒక్కడే అని దేశమంతా తెలిసినా, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని రేవంత్రెడ్డి ముఠా చేసిన అబద్ధపు ప్రచారాన్ని కొనసాగించే అడ్డదారిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం సుస్పష్టం.
మేడిగడ్డ బ్యారేజీ, ప్రాణహిత జలాలే తెలంగాణలోని లక్షలాది రైతుల వెతలు తీర్చే, కన్నీళ్లను తొలగించే ఆత్మహత్యలను, ఆకలి చావులను, వలసలను ఆపే జీవధార, ప్రాణధార అని గత నాలుగేండ్లలో రుజువైంది. మేడిగడ్డ బ్యారేజీలోని 85 పియర్లలో సురక్షితంగా ఉన్న మరో ఏడు బ్లాకుల్లోని 74 పియర్లను కూడా రానున్న వర్షాకాలం వరదలకు కొట్టుకుపోయేలా చేసి, కేసీఆర్ అవినీతి వల్లనే నాసిరకాల నిర్మాణాలు కొట్టుకుపోయాయని మరో అబద్ధపు ప్రచారానికి, కేసీఆర్ జ్ఞాపకాలను తొలగించడానికి నీచమైన కుట్రకు తెరదీస్తున్నాడు సీఎం రేవంత్రెడ్డి. ఈ కుట్రలు ఎదుర్కొని మేడిగడ్డను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తెలంగాణలోని లక్షలాది రైతు కుటుంబాలపైనే ఉన్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల డబ్బుతో నిర్మితమైంది. ఇది ప్రజల ఆస్తి. దీన్ని కాపాడాల్సిన బాధ్యతను ప్రజలు ఈ ప్రభుత్వానికిచ్చారు. ప్రభుత్వంలో పార్టీలు, వ్యక్తులు ఐదేండ్లకోసారి మారుతుంటారు. కానీ వారి బాధ్యతలు మారవు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తనను జైల్లో పెట్టాడనే వ్యక్తిగత కక్షతో మేడిగడ్డ బ్యారేజీని నాశనం చేస్తున్నాడు. తెలంగాణ 20 జిల్లాల్లోని వేలాది గ్రామాల్లోని కోటికి పైగా ఉన్న ప్రజల దాహార్తిని, సాగునీటి అవసరాలను తీర్చే ప్రాణహిత జలాలు మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాకు పునరుద్ధరిస్తేనే మళ్లీ మన గ్రామాలకు, ప్రాజెక్టులకు, చెరువులకు, వాగులకు, కాలువలకు, ఇళ్లల్లోని మిషన్ భగీరథ పైపులకు వస్తాయి. వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి మేడిగడ్డను బలిచేయడాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. మేడిగడ్డ బ్యారేజీ లేనప్పుడు తెలంగాణ దుస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తుచేసుకుందాం.
సాగునీటి కోసం తెలంగాణ ప్రజల తండ్లాటకు ఆరు దశాబ్దాలకు పైనే చరిత్ర ఉంది. ఏటా వందల వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా దోసెడు నీళ్ల కోసం కోసెడు (రెండు మైళ్లు), ఆమడదూరం (ఎనిమిది మైళ్లు) నడిచిన దుస్థితి మన తండాల, పల్లెల అక్కాచెల్లెళ్లది. ‘తలాపున పారుతుంది గోదారి.. మన చేను మన చెల్క ఎడారి’ అని తల్లావజ్జల సదాశివుడు పాటతో జనం గొంతు కలిపిండ్లు. ‘గోదారమ్మ తెలంగాణను గొడ్రాలు చేసిందని’ గద్దర్ పాటలతో పల్లె పల్లె తిరిగిండ్లు కళాకారులు. ‘చూడు తెలంగాణ.. ఉత్తరాన గోదారి ఉప్పొంగి ఉరకనేమి.. దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి.. నీళ్లు లేక నోళ్లు తెరిచే బీళ్ళను చూడు.. మా పల్లెలన్నీ బోసిగా తల్లడిల్లుతున్న తల్లి చూడు తెలంగాణ సుక్క నీరు లేనిదాన’ అంటూ అందెశ్రీ పాటలతో అడుగులు వేసిండ్లు. రెండు జీవనదులు కలిసి నిండుగ పారినా.. సమైక్యాంధ్ర సాకులతో తెలంగాణ మారునా? అని ప్రశ్నిస్తూ సబ్బండ వర్గాలు పోరాడి యువతీ యువకుల వందలాది బలిదానాలతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. తెలంగాణది నీళ్ల కోసం కొట్లాట. వేలాది రైతుల బలవన్మరణ శోకాల నుంచి ఉప్పొంగిన ఆవేశం, త్యాగాలతో, పోరాటాలతో తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ వాన చుక్క కోసం మొగులు దిక్కు ఆశతో చూస్తూ, రైతులు దిగులు పడే అవసరం లేకుండా గోదావరి జలాల్లో తెలంగాణకున్న 966 టీఎంసీల నీటితో కోటి ఎకరాలకు నీళ్లందించాలనే తపన కేసీఆర్ ప్రభుత్వానిది. శ్రీరాంసాగర్ ఆయకట్టులో నాటిన వరి మొక్కలకు నీళ్లు కావాలని రైతులు ఆందోళనకు దిగినా నీళ్లివ్వని ఆంధ్రా పాలకులు ధవళేశ్వరం దగ్గర గోదావరి జిల్లాల ఆయకట్టు ఎండుతుందంటే మాత్రం సింగూరు, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, కడెం, తాలిపేరు, కిన్నెరసాని.. ఇలా అన్ని ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీళ్లు వదులుతుంటే రగిలిన గుండెలతో ‘జై తెలంగాణ’ అంటూ కేసీఆర్తో భుజం భుజం కలిపినం.
గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మళ్లించి ఉంటే బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి బతుకులు మనకు ఉండేవా? పనిలేక జీవచ్ఛవాల్లా బతుకలేక వేలాదిమంది ఉత్తర తెలంగాణ యువతీ యువకులు బందూకులు పట్టి అడవిపాలయ్యేవాళ్లా? అన్యాయంగా బూటకపు ఎన్కౌంటర్లలో నేలకొరిగేవాళ్లా?
తెలంగాణ రాకముందు మన బతుకులు పెనం మీద మాడిపోతే తెలంగాణను ఆగం చేసిన అదే కాంగ్రెస్ పాలనల పొయ్యినపడే గడ్డు పరిస్థితి మళ్లీ వచ్చింది. నాలుగైదేండ్లు లక్షలాది ఎకరాల్లో గోదావరి నీళ్లతో పంటలు పండించుకున్నామంటే దానికి కారణం మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎత్తిపోసుకున్న కాళేశ్వరం నీళ్లే. వర్షాకాలంలోపు మేడిగడ్డకు రిపేర్లు చేసి మళ్లీ ఎప్పటివలె నీళ్లిచ్చే ఆలోచన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఉన్నట్లు లేదు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తున్నా రిపేర్ల ఊసే ఎత్తడం లేదు. అన్నారం బ్యారేజీకి ఏమీ నష్టం కాకపోయినా, అన్ని బారేజీలు, డ్యాంలలో సహజంగా వచ్చే ఊట నీళ్లు (సీపేజీ) చూపెట్టి ఏ బ్యారేజీ పనికిరాదని పదేపదే చెప్తున్నాడు. ఇంజినీర్లు, నిపుణులు సాధ్యం కాదని తేల్చిన తుమ్మిడిహెట్టి వద్ద మళ్లీ బ్యారేజీ కట్టి తీరుతామని అసెంబ్లీలోనే చెప్పిండు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ అసాధ్యం: బ్యారేజీకి +148 మీటర్ల ఎత్తులో మహారాష్ట్రతో కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం ఇప్పటికే చేసుకున్నది. అయినా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగకపోవడానికి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో పేర్కొన్న 16.40 లక్షల ఎకరాలకు ఎత్తిపోసేంత నీరు (160 టీఎంసీలు) +148 మీటర్ల ఎత్తులో లభ్యం కాకపోవడం మొదటి కారణం. చాప్రాల్ అభయారణ్యానికి సరిహద్దుగా ప్రాణహిత, వేన్గంగా నదులు ఉండటంతో నిర్మాణ పనులకు, డ్యాంకు అవసరమైన స్థలంపై కేంద్ర పర్యావరణ, వైల్డ్ లైఫ్ శాఖల నుంచి అనుమతి పొందే అవకాశాలు లేకపోవడం రెండో కారణం. తుమ్మిడిహెట్టి వద్ద రెండు నదులు కలిసే స్థలంలో ఎస్కేఈడబ్ల్యూ (స్క్యూ) డిజైన్తో 40 డిగ్రీల కోణంలో బ్యారేజీ నిర్మాణం చేయాల్సి ఉండటం, ఇప్పటివరకు ఇలాంటి నిర్మాణాలు ప్రపంచంలోనే ఎక్కడా లేకపోవడం మూడో కారణం. ఒకవేళ అన్ని ఇబ్బందులకోర్చి తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మించాలన్నా దాని ఖర్చు సుమారు నాలుగు వేల కోట్లకు చేరడం, దానిలో నాలుగోవంతు ఖర్చుతో వార్ధా నదిపై తుమ్మిడిహెట్టికి కేవలం రెండు కిలోమీటర్ల ఎగువన బ్యారేజీని నిర్మించి, గ్రావిటీ కాలువల ద్వారా ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే తవ్విన కాలువలను ఉపయోగించుకుంటూ రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వటం. +148 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి వద్ద నాలుగు మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తేనే తవ్విన కాలువలకు నీరందించడం సాధ్యపడుతుంది. ఇన్ని ఇబ్బందులు, కాలయాపన తర్వాత కూడా ఎత్తిపోయగలిగేది కేవలం 44 టీఎంసీలు మాత్రమే. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా ఆయకట్టు 2 ఎకరాల అవసరాలకే తప్ప వైఎస్సార్ ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ఆయకట్టుకు ఈ నీరు చాలదు. ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాతే కాళేశ్వరం రీ డిజైనింగ్, వార్ధా బ్యారేజీ ప్రతిపాదన కేసీఆర్ ప్రభుత్వం చేసింది.
ప్రాజెక్టుల రీ డిజైనింగ్ గురించి కేసీఆర్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన 31-3- 2016 రోజున రేవంత్రెడ్డి టీడీపీ శాసనసభ్యులు. కాంగ్రెస్తో పాటు టీడీపీ శాసనసభాపక్షం కేసీఆర్ ఇచ్చిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ బహిష్కరించింది. ఆ ప్రజెంటేషన్ చూసి అర్థం చేసుకొని ఉంటే కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఎందుకు అవసరమో తెలిసేది.
మేడిగడ్డ బ్యారేజీని వెంటనే పునరుద్ధరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదే. బ్యారేజీ కుంగడానికి కారణాలను తెలుసుకోవడానికి నిపుణుల కమిటీని వెంటనే ఏర్పాటుచేయాలి. అధికారుల నిర్లక్ష్యం కారణమని వెల్లడైతే బాధ్యులపై చర్య తీసుకోవాలి. నిర్మాణ సంస్థదే లోపం అయితే సంస్థపై చర్యలు తీసుకోవాలి. వర్షాకాలంలోపు పునరుద్ధరణ పనులు పూర్తికాకపోవచ్చునని రాష్ట్ర డ్యాం సేఫ్టీ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ వారన్నదే నిజమైతే ఇతర పియర్స్కు వరదల వల్ల నష్టం సంభవించకుండా దెబ్బతిన్న 7వ బ్లాకు పియర్స్ చుట్టూ నిపుణులు, డ్యాం సేఫ్టీ అధికారుల సూచనల మేరకు కాఫర్ డ్యామ్ నిర్మించి వరదలు తగ్గిన తర్వాత పునరుద్ధరణ పనులు కొనసాగించాలి. ఈ ప్రభుత్వ పెద్దల మాటలు, వ్యవహారశైలి చూస్తే మేడిగడ్డ బ్యారేజీని కాపాడుకోవాలనే ఆలోచన గానీ, ప్రయత్నం గానీ చేస్తున్నట్లు కనిపించడం లేదు. బ్యారేజీ మొత్తం రానున్న వరదలకు కొట్టుకుపోతే ఆ నెపాన్ని కేసీఆర్పై తోయాలనే దురుద్దేశం కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలిసివచ్చే పార్టీలను కలుపుకొని రైతుసంఘాలు, ఇతర ప్రజాసంఘాలు ప్రత్యక్ష పోరాటానికి దిగకపోతే ఈ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించదు. అందుకే తెలంగాణ ఉద్యమ ఫలాలను కాపాడుకోడానికి మరోసారి ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శించాలి.
-వి.ప్రకాశ్
90009 50400
(చైర్మన్, ఇండియన్ పెనిన్సులర్ రివర్ బేసిన్ కౌన్సిల్)