Upasana | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుండగా, మెగా అభిమానుల్లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విజయోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన స్వయంగా అభిమానులతో కలిసి సెలబ్రేషన్స్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్లోని మెగాస్టార్ చిరంజీవి నివాసం వద్ద మెగా అభిమానులు భారీ ఎత్తున చేరుకుని ‘పెద్ది’ విజయాన్ని సంబరంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ఉపాసన అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన చిన్నారులకు స్వయంగా కేక్ తినిపిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఉపాసన అభిమానులతో ఎంతో ఆప్యాయంగా మెలగడం అక్కడి వారిని ఆకట్టుకుంది.
సెలబ్రేషన్స్ సందర్భంగా అభిమానులు భారీగా బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు మహిళా అభిమానులు ఉపాసనకు దిష్టి తీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మెగా అభిమానులు వాటిని విస్తృతంగా షేర్ చేస్తూ ‘పెద్ది’ విజయాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సినిమా ప్రీమియర్ షో సందర్భంగా కూడా ఉపాసన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బుధవారం రాత్రి హైదరాబాద్లోని మూసాపేట్ శ్రీరాములు థియేటర్లో జరిగిన ప్రీమియర్ షోకు ఆమె తన తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. అభిమానుల మధ్య కూర్చొని సినిమా వీక్షించిన ఉపాసన, రామ్ చరణ్ ఎంట్రీ సీన్ వచ్చిన సమయంలో ప్రేక్షకులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు.
ప్రత్యేకంగా క్రికెట్ గ్రౌండ్ నేపథ్యంలో వచ్చే రామ్ చరణ్ మాస్ ఎంట్రీ సీన్కు థియేటర్ మొత్తం ఈలలు, కేకలతో మార్మోగిపోయింది. ఆ సమయంలో ఉపాసన కూడా గాల్లోకి పేపర్లు ఎగరేస్తూ అభిమానులతో కలిసి హర్షం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచాయి. ఉపాసనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. మరోవైపు ‘పెద్ది’ సినిమా ప్రభావం దేశ సరిహద్దులు దాటి విదేశాలకు కూడా చేరింది. రామ్ చరణ్కు జపాన్లో ఉన్న అభిమానుల ప్రేమ మరోసారి చర్చనీయాంశమైంది. కొందరు జపనీస్ అభిమానులు ప్రత్యేకంగా ఉద్యోగాలకు సెలవులు పెట్టుకుని భారతదేశానికి వచ్చి ‘పెద్ది’ సినిమా చూశారు. హైదరాబాద్లోని సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్లలో ప్రీమియర్ షోలు వీక్షిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ‘పెద్ది’ కోసం దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చు చేసి ఇండియాకు వచ్చామని తెలిపారు. కేవలం ఒక షోతో సరిపెట్టకుండా దాదాపు 10 షోలు చూసిన తర్వాతే తిరిగి జపాన్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నామని చెప్పారు. రామ్ చరణ్పై తమకున్న అభిమానాన్ని చూసి స్థానిక అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
#UpasanaKonidela Garu celebrates the blockbuster success of #PEDDI with the fans of Mega Power Star @AlwaysRamCharan. The celebrations continue as the film wins hearts everywhere! 🔥💥❤️@upasanakonidela #BlockbusterPEDDI pic.twitter.com/9s6YPeVpMR
— YJR (@yjrambabu) June 4, 2026