Telangana | తెలంగాణలో గత నెల రోజులుగా రాజకీయ పార్టీలన్నీ రైతు ఆత్మహత్యలపైన రాజకీయం చేస్తున్నాయి. భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేద’ని మాట్లాడటం హాస్యాస్పదం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఇవి రైతు ఆత్మహత్యలు కావనడం రైతుల చావులను అవమానించినట్టేనని తెలంగాణ సమాజం అనుకుంటున్నది.
గతంలో కూడా ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కొందరు కేంద్ర మంత్రులు కూడా రైతు ఆత్మహత్యలను అవహేళన చేస్తూ మాట్లాడిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలున్నాయన్న అప్పటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు లేవనడం రైతుల పట్ల నాయకులకు, ప్రభుత్వానికి చిన్న చూపు ఉన్నట్టు లెక్క! ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి అబద్ధాలు మాట్లాడటం మంచిది కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రభుత్వంలోకి వచ్చినంక ఇంకొక మాట… ఈ రెండు నాలుకల ధోరణి సరైనది కాదు.
సిద్దిపేట జిల్లా తొగుట మండలం వరదరాజుపల్లి గ్రామానికి చెందిన కంతుల పాపయ్య తనకున్న ఆరెకరాల వ్యవసాయ భూమిలో గత 13 ఏండ్లుగా మూడు బోర్లు వేసుకొని రెండు పంటలు పండించుకుంటున్నాడు. రెండు బోర్లు ఎండిపోవడంతో టమాట పంట ఎండిపోతున్నదని, ఆ పంటను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 5న వరుసగా 600 ఫీట్ల చొప్పున నాలుగు బోర్లు తవ్వించాడు. ఇందుకోసం రూ. 3,85,000 లు ఖర్చు కాగా చుక్క నీళ్లు పడకపోవడంతో అప్పులపాలయ్యాడు. దీంతో పాపయ్య దిక్కుతోచని స్థితిలో పడ్డాడు.
కామారెడ్డి జిల్లాకు చెందిన దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన బొబ్బిలి దుర్గయ్య అనే దళిత రైతు తనకున్న రెండెకరాల భూమిలో రెండు బోర్లు ఎండిపోయాయి. దీంతో జనవరి 20న నాలుగు బోర్లు వేయించాడు. అయినా చుక్క నీరు రాకపోవడంతో ఉన్న పంట ఎండిపోవడం, అప్పుల పాలు కావడంతో వేరే మార్గం లేక దిక్కుతోచని స్థితిలో దుర్గయ్య 2024, జనవరి 28న ఆత్మహత్య చేసుకున్నాడు. పైవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
అటు ప్రతిపక్షమైనా, ఇటు ప్రభుత్వమైనా రైతుల బతుకులకు భరోసానిచ్చే విధంగా మాటలు మాట్లాడాలే తప్ప, ఆత్మహత్యలకు పాల్పడే మాటలు మాట్లాడటం మంచిది కాదు. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు మారినంత మాత్రాన రైతుల ఆత్మహత్యలు ఆగవు. భారతదేశం వ్యవసాయక దేశం నూటికి 65 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయినా స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటిన ఇప్పటికీ దేశంలో ఒక వ్యవసాయ విధానం అంటూ లేకపోవడం చాలా దురదృష్టం. వ్యవసాయ విధానం లేకపోవడంతో దేశవ్యాప్తంగా 1995 నుంచి 2022 వరకు సుమారు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు ఎన్సీఆర్బీ నివేదికలు తెలుపుతున్నాయి.
పైన ఉన్న గణాంకాలు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కన్నా బీఆర్ఎస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గినట్టు స్పష్టం అవుతున్నది. కానీ ఈయేడు యాసంగి పంట ప్రతి గ్రామంలో సుమారు 20 శాతం పంటలు ఎండిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర రైతాంగం మళ్లీ పదేండ్ల తర్వాత పంటలు ఎండిపోతుండటంతో వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పులు చేసి బోర్లు వేస్తున్నారు.
బోర్లల్లోనూ నీళ్లు పడకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పదేండ్ల తర్వాత బోరు బండ్లు తెలంగాణలో రాత్రి, పగలు పంట పొలాల్లో కనిపిస్తున్నాయి. పదేండ్ల తర్వాత మోటర్ వైండింగ్ షాపులు తెరుచుకుంటున్నాయి. తెలంగాణలో కరువు ఘంటికలు మోగుతున్నాయనడానికి ఇవి సూచికలు. ఈ కరువు కాంగ్రెస్ తెచ్చిన కరువా? ప్రకృతి తెచ్చిన కరువా? అనేది పక్కనపెట్టి ఇప్పుడు రైతాంగానికి బతుకుపై భరోసా కల్పించాలి. ప్రస్తుతం రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన ప్రధాన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
డిసెంబర్ 9న రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకర్లు రైతులను డిఫాల్టర్స్గా చూపిస్తూ నోటీసులు పంపిస్తున్న సంగతి మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. నీటి కరువు ఒక వైపు, అప్పుల భారం ఒకవైపు, ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు… వెరసి రైతును కుంగదీస్తూనే ఉన్నాయి. దీంతో భవిష్యత్తు మీద భరోసా లేక అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా రెండు లక్షల రుణమాఫీ వెంటనే అమలుచేసి నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. పండిన ప్రతి గింజను మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ ఇవ్వాలి. ఇప్పటికైనా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జీవో ఎంఎస్ నెంబర్ 194 ప్రకారం ప్రతి కుటుంబానికి రూ.6 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి రైతాంగం విజ్ఞప్తి చేస్తున్నది.
ఈ కరువు పరిస్థితులను చూస్తుంటే భవిష్యత్తులో రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ, పౌర సమాజంపైన ఉన్నది. రైతన్నలారా… ఎవరు కూడా అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు.. మీకు తెలంగాణ సమాజం అండగా ఉన్నది.
(వ్యాసకర్త: సామాజిక కార్యకర్త)
పులి రాజు
99083 83567