‘నాయకుడంటే నమ్మదగినవాడు. నమ్మించేవాడు కాద’ని చెప్పిన మాటలు యువనేత కేటీఆర్కు అచ్చంగా సరిపోతాయి. ఆయనలో అమితమైన విషయ పరిజ్ఞానం ఉన్నది. భాషపై పట్టు, అద్భుతమైన వాక్చాతుర్యం, పాలనలో జాప్యత లేమి, నిజాయితీ, నిబద్ధత, మానవీయ కోణంతో పాటు వ్యాపారశాస్త్రం, జీవశాస్త్రం, ఐటీ, టెక్నాలజీ.. ఏ అంశమైనా కేటీఆర్ అనర్గళంగా స్పష్టంగా మాట్లాడగలిగే తీరు మంత్రముగ్ధులను చేస్తుంది.
స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో మేధావులు, శిష్టజన వర్గాలను తన విషయ పరిజ్ఞానంతో, వాక్చాతుర్యంతో ఎంతైతే ప్రభావితం చేయగలిగారో మారుమూల సోడాషపల్లి గ్రామంలోనూ సబ్బండవర్ణాలను, అశేష జనబాహుళ్యాన్ని అదేస్థాయిలో ప్రభావితం చేయగలిగారు. స్టాన్ఫర్డ్ అయినా, సోడాషపల్లి అయినా చరిత్రలో నిలిచిపోయే ప్రసంగాలే. యువనాయకుడిగా తనదైన ప్రత్యేకతను ప్రజా హృదయాల్లో చెరగని ముద్రను కేటీఆర్ వేశారు.
‘గొప్ప వ్యక్తి ఎప్పుడూ నాయకత్వాన్ని కోరుకోడు, కానీ ఆ గొప్ప వ్యక్తి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటార’ని ఫ్రాంక్ హెర్బర్ట్ అన్నట్టు కేటీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఇదేదో వారసత్వం, కుటుంబ పాలన అనుకుంటే పొరపాటే. తాజా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా.. ‘యావత్ తెలంగాణ ప్రజలు మా కుటుంబమే’ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు యాదృచ్ఛికంగానో, అతిశయోక్తితోనో చేసినవి కావు. గత ఎనిమిదిన్నరేండ్లుగా తెలంగాణ రాష్ట్ర పురోగతికి, ఆర్థికవ్యవస్థ బలోపేతానికి, ఆయన అహర్నిశల చేసిన కృషి, తెలంగాణ ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత ఆయన మాటల్లోని ఆంతర్యాన్ని, ఆచరణను స్పష్టంగా తెలియజేస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపకల్పన చేస్తుంటే మరోపక్క పారిశ్రామిక ప్రగతి కోసం మంత్రి కేటీఆర్ ప్రణాళికలు రూపొందించారు. నేడు తెలంగాణ అవలంబిస్తున్న పారిశ్రామిక విధానాన్ని ఇతర రాష్ర్టాలతో పాటుగా ప్రపంచదేశాలు కీర్తిస్తున్నాయి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ద్వారా పారిశ్రామిక వాడల అభివృద్ధికి వేగంగా చర్యలు చేపట్టారు. ఆ చర్యల ఫలితంగా అనతికాలంలోనే తెలంగాణలో 56 పారిశ్రామిక వాడలు అభివృద్ధి చెందాయి. పారిశ్రామిక వికేంద్రీకరణలో భాగంగా అన్నిజిల్లాల్లో మరో 70 పారిశ్రామికవాడల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. టీఎస్ఐపాస్ ద్వారా వేగంగా పరిశ్రమలకు అనుమతులిస్తున్నారు. ఈ విధానాల ద్వారా గత ఎనిమిదిన్నరేండ్ల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రం రూ.3.3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగింది. ఐటీ సెక్టార్లో 2014లో 57 వేల కోట్లుగా ఉన్న ఎగుమతులు ఇప్పుడు 220 శాతం వృద్ధితో 1.83 లక్షల కోట్లకు పెరిగాయి. దేశంలోని కాస్మోపాలిటన్ సిటీలను తోసిరాజని బెంగళూరు తర్వాత రెండవ అతిపెద్ద ఐటీ హబ్గా అనతికాలంలోనే హైదరాబాద్ నిలవగలిగింది. దీనివెనుక కేటీఆర్ కృషి ఉన్నది.
కరోనా సమయంలో అనేక బహుళజాతి సంస్థలు చైనా నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న వేళ దేశంలో సరైన పారిశ్రామిక విధానం లేక సతమతమవుతూ ఉంటే, అందివచ్చిన అవకాశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకున్నది. ఆ పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడంలో కేటీఆర్ కృషి అనిర్వచనీయం. పారిశ్రామిక అభివృద్ధితో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24 లక్షల నుంచి రూ.2.78 లక్షలకు వృద్ధి చెందింది. అందుకే 2022లో దావోస్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సు సందర్భంగా యూఎస్ వెంచర్ క్యాపిటలిస్ట్ ‘ఆశా మోత్వాని’ రాబోయే ఇరువై ఏండ్లలో భారత ప్రధాని పదవిని అధిష్ఠించగల అర్హత, సత్తా ఉన్న యువ నాయకుడిగా కేటీఆర్ను అభివర్ణించింది.
చేనేత వస్ర్తాలపై జీఎస్టీ ఎత్తివేయడానికి కేటీఆర్ కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల గతంలో ఉరిసిల్లగా మారిన దుస్థితి. నేతన్నల ఆత్మహత్యలు ఇక మీదట ఉండొద్దని తానే బ్రాండ్ అంబాసిడర్గా ప్రతీ సోమవారం చేనేత దుస్తులు ధరిస్తూ కేటీఆర్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దానికి అనూహ్య స్పందన లభించింది. సిరిసిల్ల నేడు ఒక పారిశ్రామిక ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది.
సమస్య వచ్చిందంటే క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యను పరిశీలించడం, అధ్యయనం చేయడం, సత్వర పరిష్కార మార్గాలను అన్వేషించడం కేటీఆర్కు అలవాటు. గతంలో వరంగల్లో వరదల సందర్భంగా కరోనా మహమ్మారిని సైతం లెక్కచేయక క్షేత్రస్థాయిలో తిరిగి ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఆదేశాలివ్వడమే కాకుండా ప్రజల్లో మనోధైర్యాన్ని నింపారు.
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే కేటీఆర్ అనేక సామాజిక అంశాలపై తనదైన శైలిలో చేసే పోస్టులు నెటిజన్లను ఆలోచింపజేస్తాయి. ప్రపంచంలోనే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను ప్రభావితం చేయగల మొదటి 30 మంది జాబితాలో కేటీఆర్ 12వ స్థానం సాధించగలిగారు. ఈ జాబితాలో స్థానం పొందిన ఇద్దరే ఇద్దరు భారతీయుల్లో కేటీఆర్ మొదటి స్థానంలో ఉండటం ఆయన ఎంత ప్రభావవంతమైన నాయకుడో తెలుస్తున్నది. తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో, తనదైన వినూత్న ఆలోచనలతో యువతను ఒకతాటిపై తీసుకువచ్చి, మానవ వనరులను సమర్థవంతంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దడంలో కేటీఆర్ పాత్ర అత్యంత కీలకమైనది.
(వ్యాసకర్త: వైస్ ఛాన్స్లర్, కేయూ)
ప్రొఫెసర్ తాటికొండ రమేష్