తెలంగాణలో ముస్లిం జనాభా దాదాపు 12.5 శాతంగా ఉన్నది. హైదరాబాద్లో ప్రత్యేకించి పాతబస్తీలో ముస్లింలు
ఎక్కువగా ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న ముస్లింలు పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో నిర్ణయాత్మక
పాత్ర పోషిస్తున్నారు. సాధారణంగా ముస్లింలు మొదటినుంచి తెలంగాణ రాష్ట్ర వాదనకు అనుకూలురు. ఇదే రీతిలో తెలంగాణ ఏర్పడిన నాటినుంచి కేసీఆర్ వెంటే నడుస్తున్నారు. పాతబస్తీ ప్రాంతం మజ్లిస్ పార్టీకి కంచుకోట అనేది తెలిసిందే. మజ్లిస్తో హోరాహోరీ తలపడిన చరిత్ర టీఆర్ఎస్ది. పలు స్థానాల్లో మజ్లిస్ తర్వాత ఎక్కువ ఓట్లు టీఆర్ఎస్కే రావడం గమనార్హం.
ఇక తెలంగాణ వ్యాప్తంగా మైనారిటీ ఓటర్లు మొదటినుంచి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్)వైపే ఉన్నారు.
ఈ మధ్యకాలంలో ముస్లింలు కాంగ్రెస్ వైపు మొగ్గారనే తప్పుడు ప్రచారం సాగుతున్నది. ఈ ప్రచారానికి ఎటువంటి ఆధారాల్లేవు. కానీ, ప్రచారాన్ని కొన్ని శక్తులు కావాలని సాగిస్తున్నాయి. బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ చేతకానితనాన్ని దేశవ్యాప్తంగా ముస్లింలు గమనిస్తున్నారు. జాతీయ స్థాయిలో చూస్తే బీజేపీకి కాంగ్రెస్కు మధ్య పోరాటం సాగుతున్నట్టు కనిపిస్తున్నది. కానీ, వాస్తవానికి బీజేపీని ఢీకొనే స్థాయిలో కాంగ్రెస్ లేదు. పశ్చిమబెంగాల్, తెలంగాణ తదితర అనేక రాష్ర్టాలలో ప్రాంతీయ పార్టీలే బీజేపీకి అడ్డుకట్ట వేస్తున్నాయి. మత విద్వేషాలు లేకుండా సామరస్య పాలన ప్రాంతీయ పార్టీలు ఉంటేనే సాధ్యపడుతుందనే అవగాహన ముస్లింలకు ఉన్నది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ మొదలైన రాష్ర్టాలలో బీజేపీకి, కాంగ్రెస్కు మధ్య పోటీ ఉన్నది.
ఈ రాష్ర్టాలలో మత విద్వేషాలను ఈసడించుకునే లౌకికశక్తులు కాంగ్రెస్ బలంగా ఉండాలని కోరుకుంటున్న మాట నిజం. కానీ, ఈ రాష్ర్టాలలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని గట్టిగా ఎదిరించడం లేదు. ఆ పార్టీ నేత రాహుల్గాంధీ కూడా మోదీకి ధీటుగా వ్యవహరించడం లేదు. గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ర్టాలలో బీజేపీ వ్యతిరేకత కొద్దీ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించినా, ఆ విజయాలను స్థిరపరచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విఫలమవుతున్నది. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్నిపక్షాలను కూడగట్టడంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విఫలమైంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ముస్లింల, లౌకికవాదుల మద్దతును కూడగట్టుకోలేకపోతున్నది. ఈ నేపథ్యంలో ముస్లింలు కాంగ్రెస్ వైపు మొగ్గడమనేది జరిగే పనికాదు. అది నమ్మశక్యమైన వాదన కాదు.
కర్ణాటక ఎన్నికలలో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన మాట నిజం. అక్కడ బీజేపీ అవినీతి, విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పార్టీలకతీతంగా అన్ని శక్తులూ ఏకమయ్యాయి. దీంతో కాంగ్రెస్ విజయం సాధ్యమైంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ కన్నా, స్థానిక నాయకుల శ్రమ ఎక్కువగా ఉన్నది. కానీ, తెలంగాణలో పరిస్థితి వేరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల విధానాలను ప్రజలు మొదటినుంచి వ్యతిరేకిస్తున్నారు. ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నాయకులు ప్రజల పక్షాన నిలబడి పోరాడలేదు. తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్ల అనేకమంది యువకులు బలిదానాలు చేసుకున్నారు. దీనంతటికి బాధ్యత కాంగ్రెస్దే. తెలంగాణను ఆంధ్రాలో కలిపింది, ఇంతకాలం ప్రజల మనోభావాలను దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీయే. అందువల్ల హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఎవరైనా సరే, మతాలకతీతంగా కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మత కలహాలు సృష్టించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదే.
ముస్లింలు బీఆర్ఎస్కు ఓటు వేయరనడానికి ఒక్క కారణం కూడా చూపలేం. కానీ, బీఆర్ఎస్కే ఓటు వేస్తారనడానికి అనేక కారణాలు చూపవచ్చు. ఇందులో మొదటిది- భద్రత. కేసీఆర్ పాలనలో ముస్లింలు భద్రంగా ఉన్నారు. కేసీఆర్ మత విద్వేషాలకు తావులేని విధంగా పాలిస్తున్నారు. రెండవది సంక్షేమ పథకాలు. కేసీఆర్ పేద జన బాంధవుడు. మతాలు వేరైనా పేదలంతా ఒక్కటే. అందరూ కోరుకునేది సంక్షేమమే.
ఇంటింటికీ మంచినీరు, సాగునీరుతో పాటు అన్ని పథకాల వల్ల మతాలకతీతంగా అందరూ లబ్ధి పొందుతున్నారు. కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ వంటి పథకాలు పేదలను ఆదుకుంటున్నాయి. ముస్లింలలో ఎంతో ఊరట కలిగిస్తున్నాయి. అన్ని బలహీన వర్గాల మాదిరిగానే, ముస్లింలకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకులాలను ఏర్పాటుచేయడం గొప్ప విషయం.
మైనారిటీల కోసం ఏర్పాటుచేసిన 204 గురుకులాల్లో లక్షలాది మంది బాలబాలికలు కార్పొరేట్ స్కూళ్లలో లభించే నాణ్యమైన విద్యను పొందుతున్నారు. ఇది దీర్ఘకాలికంగా ముస్లిం సమాజంలో విప్లవాత్మక మార్పునకు దారితీస్తుంది. బీసీ బంధులో భాగంగా కూడా ముస్లిం పేదలు లబ్ధి పొందుతున్నారు. అందుకే ముస్లింలు కేసీఆర్ పట్ల గౌరవం, అభిమానం చూపుతున్నారు. ఇటువంటి మహా నాయకుడు మనకు లభించడం అదృష్టంగాభావిస్తున్నారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే మతాలకతీతంగా అందరం ఒక్కతాటిపై నిలబడాల్సిందే. ఈ కోణంలో చూస్తే తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేది ఒక్క కేసీఆర్ మాత్రమే. మన రాష్ట్ర వాటా నీళ్లు కావాలన్నా, ప్రాజెక్టులు కట్టాలన్నా, కేంద్రాన్ని ఎదిరించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా అది కేసీఆర్కే సాధ్యం. అందువల్ల మతాలకతీతంగా అన్నివర్గాల ప్రజలు కేసీఆర్కు అండగా నిలబడాలి.
తెలంగాణ సంస్కృతి గొప్పది. తెలంగాణలో గంగా జమున తెహజీబ్ ఉన్నదని మహాత్మాగాంధీ ప్రశంసించారు. మొదటినుంచి భిన్నవర్గాల ప్రజల మధ్య సౌహార్ద సంబంధాలున్నాయి. ఈ ఐక్యత తెలంగాణకు అవసరం. అందువల్ల ముస్లింలు, అన్ని మతాల ప్రజలు కేసీఆర్కు అండగా నిలబడాలి. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తప్ప మరొకరు కృషిచేయలేరని గ్రహించాలి.
ముస్లింలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు తప్ప మరే పార్టీ వైపు మొగ్గడం లేదు. ఈ అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటారు. గోల్కొండ కోటపై మళ్లీ కేసీఆర్ జెండా ఎగురవేస్తారు.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు)