మహాభారతంలోని వీరులందరిలో బలవంతుడైన భీముడు ఓసారి హనుమంతుడి తోకను కూడా కదిలించలేకపోయాడు. ఇది తెలిసిన ఏ చిన్నపిల్లాడైనా సరే టకీమని చెప్పేస్తాడు ‘భీముడి కంటే హనుమంతుడు గొప్పవాడు, బలవంతుడు’ అని. అలాగే ఏ రంగంలోనైనా ఒక విజయం సాధించినవాడి కంటే తాను గొప్పవాడినని అనిపించుకోవాలని తాపత్రయపడేవారు చేయాల్సిన పని ఏమిటంటే.. ఆ మనిషి కంటే ఎక్కువగా సాధించి చూపటం. అంతేకానీ, ఆ మనిషి సాధించిన విజయాలను చిన్నవిగా చేయాలనుకోవడం, నామరూపాలు లేకుండా నిర్మూలించాలనుకోవడం తెలివి తక్కువ పని అవుతుంది. అంతేకాకుండా అదెంతో కష్టతరమైనది, సమయం వృథా చేసేది కూడా.
Telangana | తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల ప్రస్తుత తీరు ప్రజలను అలజడికి గురిచేస్తున్నది. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కేసీఆర్ సాధించిన విజయాలు అనేకం. ఆయన వాటిని ఎలా సాధించారో గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. నకారాత్మకంగా ఎవరికంటేనో గొప్పవాడినైపోవాలన్న ఆలోచన పెట్టుకోకుండా, తనకు ముందరి నాయకులు చేసిన పనిని, సాధించిన విజయాలను విశ్లేషించుకొని, వారికంటే విజయవంతంగా తన పథాన్ని తీర్చిదిద్దుకున్నారు కేసీఆర్. అవేమిటో ఓసారి చూద్దాం. ముఖ్యంగా ఎవరికైనా, ఏ పనిలోనైనా విజయం సిద్ధించాలంటే ఆ మనిషి కంటే పనికి సంబంధించిన విజయమే ప్రజలకు కనిపించాలి. ఆ పనిలోని చిత్తశుద్ధి ముఖ్యం కాని ఆ మనిషి కనిపించటం కాదు.
తెలంగాణ సిద్ధించి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక కేసీఆర్ మొదటగా ఆలోచించినది వాతావరణ శుద్ధి గురించి. అందుకే సుందర్లాల్ బహుగుణ చేసిన చిప్కో ఉద్యమంలాగా హరితహారం కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కేసీఆర్. మనుషుల ఆరోగ్యానికి, ఆనందానికి వాతావరణ కాలుష్యం అడ్డురాకుండా కొన్ని కోట్ల మొక్కలు నాటించారు. దాన్ని ఒక ఉద్యమంలా నడిపించారు. గాంధీ మహాత్ముడి స్వాతంత్య్ర సమరంలాగా దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు పూర్తిగా అహింసా మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్. మరో అహింసావాది దక్షిణాఫ్రికా నాయకుడు నెల్సన్ మండేలాలాగా ప్రత్యేక రాష్ట్రం సాధించి, వలస పాలకుల చెర నుంచి రక్షించారు. మానవ మనుగడకు అతిముఖ్యమైన తాగునీటిని మిషన్ భగీరథ ద్వారా, సాగునీటిని మిషన్ కాకతీయ ద్వారా సాధించారు. తద్వారా రాష్ట్రంలో నికర జలాలను నిల్వ చేశారు. భూగర్భ జలాలు పెరిగేటట్టు చేశారు. రాజస్థాన్లోని ఎడారిలో నీటిని నిలిపి పంటలు పండించిన వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ నుంచి కూడా ప్రశంసలు పొందారు. మనదేశానికి స్వాతంత్య్రం రాకముందు కావేరి, గోదావరి నదులపై ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాంతాలను కరువు, అతివృష్టి నుంచి కాపాడిన సర్ ఆర్థర్ కాటన్ను ఇప్పటికీ దేవుడిలా కొలుస్తారు
ఆయా ప్రాంతాల ప్రజలు. వలస పాలనలో నెర్రెలుబారిన తెలంగాణలో కేవలం తొమ్మిదిన్నరేండ్లలో జలాశయాల నిర్మాణం చేపట్టి, పూర్తి చేశారు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ వంటి భారీ నిర్మాణాలను రికార్డు సమయంలో పూర్తిచేసి తెలంగాణను అన్నపూర్ణను చేశారు. అత్యధిక పంట దిగుబడులు సాధించటానికి మార్గం సుగమం చేశారు.
కర్ణాటకకు చెందిన శ్రీకాంతయ్య అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కృషి చేస్తున్న మహనీయుడు. ఆయనలాగే కేసీఆర్ కూడా తన భగీరథ పట్టుతో కొద్దికాలంలోనే మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని అన్ని ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీరు అందించారు. తద్వారా దశాబ్దాలుగా నల్లగొండను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టారు. మహాత్మాగాంధీ గ్రామస్వరాజ్యం భావనను ఆచరించే కేసీఆర్.. పట్టణాల తరహాలో పల్లెలు కూడా ప్రగతి సాధించాలని సంకల్పించారు. మారుమూల తండాలు, గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పల్లెప్రగతి పథకాన్ని తీసుకొచ్చారు. మారుమూల తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు.
వేల గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ధి సాధించేలా చేశారు. అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను ప్రపంచానికి అందించిన నార్మన్ బోర్లాగ్లాగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశారు కేసీఆర్. మద్దతు ధరకే వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసేలా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెట్టుబడి సాయం, రైతులకు పంటల విషయంలో దిశానిర్దేశం.. ఇలా ఆయన దార్శనికత వల్ల ధాన్యం కొనుగోళ్లలో ఒకప్పుడు 14వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు 2వ స్థానానికి ఎదిగింది. తమిళనేత కరుణానిధిలాగా ఎన్నికల్లో ఎక్కువసార్లు గెలిచిన రాజకీయ నాయకుడు కేసీఆర్. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రిగా కూడా పని చేశారాయన. కంటివెలుగు వంటి పథకాలకు శ్రీకారం చుట్టి అందరికీ కంటి పరీక్షలు చేయించారు. అద్దాలు ఇచ్చి, అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయించారు.
పుస్తకాలు బాగా చదివే అలవాటున్న కేసీఆర్కు దేశంలోని, ప్రపంచంలోని రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలపై అవగాహన అత్యద్భుతంగా ఉన్నది. ప్రజలకు ఏ పథకం వల్ల నిజమైన సహాయం అందుతుందన్న విషయం ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. 1954లోనే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన తమిళ నాయకుడు కామరాజ్ నాడార్ బాటలో.. వెయ్యికిపైగా కొత్త పాఠశాలలను ప్రారంభించిన కేసీఆర్ వాటన్నింటిలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. పుష్టికరమైన, నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించారు. కొత్తగా విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా ప్రారంభించారు. దీనివల్ల విద్యార్థుల ఆరోగ్యం, చదువుల్లో వారి సామర్థ్యం పెరిగాయి. ప్రజల ఆధ్యాత్మిక జీవనానికి ఎంతో తోడ్పాటునందించారు కేసీఆర్. ఆలయాలను అభివృద్ధి చేశారు. స్వాతంత్య్రానంతరం పురాతన సోమనాథ్ ఆలయాన్ని సర్దార్ పటేల్ పునరుద్ధరించారు. మరో అడుగు ముందుకు వేసిన కేసీఆర్ వేల గుడుల్లోని పూజారులకు జీతాలు, ధూపదీప నైవేద్యాలకు నిధులను సమకూర్చారు. యాదాద్రి, బాసర, ధర్మపురి, భద్రకాళి వంటి ఆలయాలను ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం పునర్నిర్మించారు.
నిజాం కాలంలో అస్తవ్యస్తంగా ఉన్న పాలన, ఆర్థిక రంగాన్ని అప్పటి ప్రధానమంత్రి సాలార్జంగ్-1 సవరణల ద్వారా చక్కదిద్దారు. ధరణి లాంటి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రికార్డుల్లో సంస్కరణలను చేపట్టారు కేసీఆర్. సకలజనుల సర్వే ద్వారా తెలంగాణలోని కుటుంబాల వివరాలు పాలకులకు అందుబాటులో ఉండేట్టు చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో, కార్పొరేషన్లలో అవినీతిని అంతం చేశారు. ప్రజల పనులు సులభంగా పూర్తయ్యేలా చేశారు. వలస పాలకుల నిర్లక్ష్యంతో నరకాలుగా మారిన దవాఖానలను సమూలంగా మార్చేశారు. అధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లేంతగా వాటిలో వసతులు సమకూర్చారు. మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులకు ప్రసూతి సమయంలో ప్రయాణ వసతి కల్పించారు. రాష్ట్రంలో వైద్యరంగాన్ని మరింతగా పటిష్ఠం చేసేందుకు 21 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించారు.
రాష్ర్టానికి వన్నె తెచ్చే ఎన్నో కట్టడాలు నిర్మించారు కేసీఆర్. నిజాముల కాలంలో ప్యాలెస్లు కట్టుకుంటే.. ప్రజాస్వామ్యంలో ప్రజల సౌకర్యార్థం సచివాలయం, అమరవీరుల స్మారకం, అంబేద్కర్ విగ్రహం, సెంట్రల్ కమాండ్ భవనాలు, సమీకృత కలెక్టరేట్, మెట్రో, ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, వరద నీటిని కట్టడి చేసేందుకు నాలాల వంటి ఎన్నో నిర్మాణాలు చేపట్టారు కేసీఆర్.
బహుభాషా కోవిదుడు, భాషాభిమాని పీవీ నరసింహారావు తెలుగు అకాడమీ వంటివి స్థాపించి భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయనలాగే కేసీఆర్ కూడా సాహితీవేత్త, మాతృభాషా ప్రేమికుడు. అందుకే మాతృభాషను బతికించుకునేందుకు పాఠశాలల్లో తెలుగు తప్పనిసరిగా బోధించాలని నియమం విధించారు. కేసీఆర్ ప్రతి ప్రసంగంలోనూ భాషపై ఆయనకున్న పట్టు మనకు కనిపిస్తూనే ఉంటుంది. ప్రపంచ మహాసభలో (2017) ఆయన చేసిన ప్రసంగం ఒక రాజకీయ నాయకుడి భాషణలాగా లేదు. తలపండిన ఒక తెలుగు ఆచార్యుడిలాగా సాగి శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసింది. తెలుగురాష్ర్టాల్లో బీద ప్రజల సంక్షేమం గురించి మొట్టమొదటగా తపనపడింది ఎన్టీ రామారావు. ఆయన్ను చాలా ఇష్టపడే కేసీఆర్ ఆ స్ఫూర్తితోనే ఎన్నో వినూత్న పథకాలను తీసుకొచ్చారు. నిస్సహాయులైన వృద్ధులు ఆయనలో తమ పెద్దకొడుకుని, దివ్యాంగులు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులు ఆయనలో తమ మేనమామను చూసుకుంటారు. ఇలా పేదలకు ఉపయోగపడే 350కి పైగా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు కేసీఆర్. మేధస్సు, దార్శనికత, ప్రజాభిమానం ఉన్న కేసీఆర్ బెస్ట్ ఇన్నోవేటర్గా రాణించారు. ఆయన ప్రోత్సాహం, ప్రభుత్వం కల్పించిన అనుకూల వాతావరణం కారణంగా కంపెనీలు, పరిశ్రమలు రాష్ర్టానికి వరుసకట్టాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థల స్థాపనతో లక్షల ఉద్యోగాలు వచ్చాయి. టీ-హబ్, వీ-హబ్ సాయంతో ఎంతో మంది యువత స్టార్టప్లు ప్రారంభించారు. పాలకుడు ప్రజాభిమానం ఉన్న దార్శనికుడైతేనే ఇటువంటి ఆవిష్కరణలు సాధ్యమవుతాయి.
పైన చెప్పిన ఒక్కో నాయకుడు ఒక్కొక్క పథకం తెస్తే.. ఇవన్నీ తీసుకొచ్చిన కేసీఆర్ స్థాయి ఏంటో ప్రజలే నిర్ణయించుకోవాలి. ఇటువంటి నాయకుడి పాలనకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేయాలని భావించే ఇతర రాజకీయ నేతలను ఏమనాలో, ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలి.
కనకదుర్గ దంటు
89772 43484