2019 పుష్య మాసం… మాన్యులంతా కలిసి మా ఊరొస్తున్నరు. ఎైట్టెనా వాళ్లకో పూట బువ్వ పెట్టాలనుకున్నం. ‘ఏం పెట్టాలే?’ అని మా ఊరి పెద్దలతో సమాలోచన చేస్తున్న. ‘నాటుకోడి కూర’ అన్నడు మా సోదరుడు వీరమల్లు. ‘కేసీఆర్ గొర్లు ఎదిగినయ్.. రెండు పొట్టేళ్లు కొట్టి పెడదాం’ పేర్ల పాపన్న, మెంతబోయిన సింహాద్రి (యాదవులు) సలహా. మంచి ఆలోచనే. పైగా మా ప్రాంత బీడు భూముల్లో పొట్లగడ్డి, మదనకర్ర దొరుకుతుంది. ఆ గడ్డి తిని కండ పట్టిన పోతు మాంసం రుచికరంగా ఉంటుంది. ఇదే ఖాయం చేద్దామనుకున్నం. ఇంతలో బండి అంతయ్య (ముదిరాజులు) కాక వచ్చిండు. ‘నేను మెప్పిస్త. నా మీద గురిపెట్టురి’. అన్నడు. కాక..! తెల్లారితే కార్యం. పెద్దోళ్ల ముచ్చట. ఎటమటమైతే మాటొస్తది ఆతృత.. ఆందోళన కలబోతతో హెచ్చరించిన.
‘నాకొదిలిపెట్టు బిడ్డా.. నువ్వు మిగతా పన్లు జూస్కోపో’ భరోసాగా చెప్పిండు. అంతయ్య కాకకు నాకంటే మా అన్నతోనే బిగు సోపతి. మాట మనిషి. చెరువు అంచుకే ఊరు. అదే రాత్రి అంతయ్య కాక ఇంకొంత మంది పోయి చెరువు తూము మలిపి బురద నీళ్లు పునుకితే.! జల్లి బుట్టెడు నార జెల్లలు, కౌంసెలు ఎల్లినయి. తీసుకొచ్చి పులుసు పెడితే..! అతిథులంతా కడుపు నిండ తిన్నరు. నారజెల్ల పేరు వింటేనే తెలంగాణ పల్లె లొట్ట లేస్తది. ఆంధ్రోళ్ల బొమ్మిడాయిని మించిన రుచి. నా బాల్యంలో చూసిన. మళ్లీ ఇప్పుడు చూస్తున్న. సరిగ్గా 20 గ్రాములు కూడా తూగని చెరువు చేప. 40 ఏండ్ల కిందనే కనుమరుగైంది.
KCR | నీళ్ల మీదనే పల్లె బతుకుందని పోరు తెలంగాణ నడిపిన దళపతే.. వేరు తెలంగాణకు అధిపతి అయ్యిండు. అటెన్క చెరువుల పునరుద్ధరణ ఉద్యమం చేసిండు. 46 వేల చెరువుల పూడిక తీసిండు. కూలిపోయిన మత్తడి గోడ మళ్లీ నిలబెట్టిండు. గోదావరి మీద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. కృష్ణ మీది నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తిలను ఎత్తిపట్టి చెరువుతో సంధానించిండు. చెరువు చుట్టూ జల పెరిగింది. జలం ఇచ్చిన బలంతో పచ్చదనం విచ్చుకున్నది. పచ్చబడ్డ చెట్టు మీద పిట్ట వాలింది. మట్టి మురిసి వానపేగు కదిలింది. ఎండిన తెలంగాణ నిండుకుండగా తొణికిసలాడింది. జీవ వైవిధ్యం ఊపిరి పోసుకున్నది. ఇదో అసాధ్య కృత్యం. కోట్లు ఖర్చుచేసినా సాధ్యం కాని కార్యం. పదేండ్లలో సుసాధ్యమైంది. తెలంగాణ జీవ వైవిధ్య మాగాణిగా నిలబడ్డది. అట్లా మళ్లీ ఊపిరి పోసుకున్నయే నార జెల్లలు. ఒక్క నారజెల్ల జాతి మాత్రమే కాదు..! ఎన్కటికి పల్లె చెరువుల్లో కలెదిరిగిన కొడిపెలు, సందమామలు, ఉస్కెదొంతులు, నల్ల పంకిర్లు, సన్న రొయ్యలు, ఎర్ర రొయ్యలు తదితర పది పదిహేను తీర్ల మీన జాతులు తిరిగొచ్చినయి. నీళ్లు లేవని చెరువు మీద అలిగిపోయిన బుడుబుంగలు, ఎరగారు కొంగలు, ఎడ్డికొంగలు, గుడ్డి కొంగలు, ఆలేటి కొంగలు, కారు కొంగలు, సైబీరియా కొంగ జాతులు మళ్లొచ్చి ఒంటికాలు జపం చేస్తున్నయి.
రాబందులు వాలిన నేల మీద తీరొక్క జీవ జాతులు రెక్కలు విప్పటం అనేది ఓ అద్భుతం. దశబంద చెరువులను నింపిన తర్వాత అటువంటి అద్భుత జీవవైవిధ్య దృశ్యాలను చూశాను. కందనూలు.. ఇందూరు.. మెతుకుసీమ.. ఓరుగల్లు.. కరినగరి.. ఖమ్మం, నల్లగొండ జిల్లాల పల్లెల్లో తిరిగి మత్తడి దుంకిన చెరువులను ఎత్తుకున్న. పారే నీళ్లు.. పచ్చటి పొలాలను ముద్దాడిన. పల్లెల్లో పునర్జీవం పోసుకున్న జీవజాలాన్ని కండ్లారా చూసిన. ఆ సదృశ్యాలను ఎత్తిపట్టుకొని పిట్ట వాలిన చెట్టు పుస్తకం రాశాను. అగో.. ఆ పుస్తకావిష్కరణ వేదికే కర్విరాల కొత్తగూడెం. అప్పటి మంత్రులు హరీష్రావు, జగదీష్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, అప్పటి ఎమ్మెల్యేలు దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి, గాదరి కిషోర్తోపాటు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, అల్లం నారాయణ వచ్చారు.. పుస్తకం ఆవిష్కరించారు.
ఉమ్మడి ఏలుబడిలో వరి పరిశోధనలన్నీ గుంటూరు, ఉభయ గోదావరి కేంద్రం చుట్టే సుదరాయించబడ్డయి. తెలంగాణ భౌగోళిక, జీవన వైవిధ్యం సంపూర్ణంగా సురాలించబడ్డది. సముద్ర నిసర్గను తట్టుకొనే వరి వంగడాలే సృష్టించబడ్డయి. ఏపీలోని 13 జిల్లాలలో (ఇప్పుడు 26 జిల్లాలు) మూడు జిల్లాలు మినహా.. మిగిలిన 10 జిల్లాలు సముద్రం ఒడ్డునే ఉన్నయి. సముద్ర వాతావరణంలో 78 శాతం నత్రజని, 21 శాతం ఆక్సిజన్, 0.9 శాతం ఆర్గాన్లు, 90.6 శాతం తేమ ఉంటుంది. ఆ గాలికి తగ్గట్టే వరి విత్తనాలు సృష్టించి.. బలవంతంగా మనకూ అంటగట్టేటోళ్లు. మన గాలిలో తేమ వేరు. ఇక్కడి ప్రకృతి వేరు. భూమి మూలక స్వభావం వేరు. కానీ మనకు తగ్గ విత్తనమేది? గతి లేక మన రైతులు అవే విత్తనాలు సాగు చేసేటోళ్లు. వరి మొలకల కంటే ముందే చీడ పీడలు పుట్టేది. వుల్లికోడు, అగ్గితెగులు, పేనుబంక, దోమకాటు చీడ వ్యాధులు అక్కడినుంచి దాపురించినవే. మొలక అలికింది మొదలు పంట చేతికందే వరకు దిగుబడి దినదిన గండమే ఉండేది.
చెరువుల పునరుద్ధరణ జరిగి తెలంగాణ జరంత నిమ్మలపడ్డ తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ మన గాలికి తగ్గట్టుగా వరి వంగడాల సృష్టిపై దృష్టి పెట్టిండు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను పిలిచిండు. మన విత్తనం మనకు ఉండాలన్నడు. విస్తృత పరిశోధనలు జరగాలన్నడు. జీవవైవిధ్య వంగడాలు కావాల్సిందే అని ఆదేశించిండు. శాస్త్రవేత్తలు పూనుకుంటే బతుకమ్మ వంగడాలకు బీజం పడ్డది.. అవి మొలకెత్తితే..! భూమికే బరువయ్యేంత ధాన్యం పండింది. తర్వాత తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్-15048) జీవం పోసుకున్నది. అది ఎదిగి దేశ ధాన్యం మార్కెట్నే షేక్ చేసింది. క్వింటా తెలంగాణ సోనా ధర రూ.3,545 పలికింది.
ఉమ్మడి రాష్ట్రంలో తిప్పితిప్పి కొడితే గోదావరి నుంచి తెలంగాణకు 90 టీఎంసీలు కూడా రాలేదు. కృష్ణా నది నుంచి 25 టీఎంసీలకు మించలేదు. అంతా కలిపి 110-115 టీఎంసీల నీళ్ల కోసం నిత్య కొట్లాటలు.. గొడవలు. చంద్రబాబునాయుడైతే నీళ్ల మీద రాజకీయం చేసే బతికిండు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా.. ఒక్క గోదావరి నుంచే గరిష్ఠంగా 400 టీఎంసీలకు పైగా వినియోగించుకొనే స్థాయికి చేరుకొన్నది. కృష్ణా నది మీది నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్, కల్వకుర్తి పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా రూపం మారి 6.5 లక్షల ఎకరాలకు సాగునీరందింది. అంతా కలిపి 2023 నాటికి 1.4 కోట్ల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది.
అటు జల విప్లవం ఇటు హరిత విప్లవంతో తెలంగాణ వ్యవసాయ రూపురేఖలే మారిపోయినయి. ‘మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’ నివేదిక ప్రకారం.. తెలంగాణలో 2012-13కు ముందు దిగుబడి వరి ధాన్యం విలువ రూ.8,291 కోట్లు కాగా.. 2021-2022కు రూ.22,544 కోట్లకు పెరిగింది. పదేండ్ల కాలంలో దిగుబడి విలువ 150 శాతం మేర పెరిగింది. 2022 రబీ, ఖరీఫ్ సీజన్ కలిపి మూడు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇంత ధాన్యం తాము కొనలేమని ఓ దశలో కేంద్ర ప్రభుత్వమే చేతులెత్తేసింది.
అటువంటి తెలంగాణకు ఇంతలోనే ఎంత వైమత్యం? కాలం అవరోహణమైంది. కాలచక్రం తిరోగమనంలో గిర్రున తిరిగి ఎన్కటి పొద్దుళ్ల ఆగింది. చెరువుల్లకు నీళ్లొస్తయని ఎదురుచూస్తుంటే.. కళ్లల్లకు నీళ్లొస్తున్నయి. కాళేశ్వరం నీళ్లు పోయినయి. పంటకాల్వ ఆగింది. యాళ్ల తప్పిన కరెంటయింది. బిక్కి బోరు కింది కాపురమొచ్చింది. ఎటు జూసినా ఎండుగాలమే.. రైతు ఎవుసం గాసానికే ఎల్లేటట్టు లేదు. కోటి ఎకరాల మాగాణం తడి తప్పుతున్నది.. ముక్కోటి గొంతులు బాపూ.. దూప అంటున్నయి.
వర్ధెల్లి వెంకటేశ్వర్లు