ఒక రాష్ట్రంలో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వాలకు సాధ్యం కాదనేది గత ప్రభుత్వాల పాలనతో మనకు తెలుస్తున్నది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరంగాలకు సమపాళ్లలో నిధుల కేటాయింపు, పథకాల రూపకల్పన చేసింది.
సీఎం కేసీఆర్.. ఒక పోరాటంలా పథకాల అమలును సాగించారు. కీలక రంగాలైన వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమం తదితర ఆరు రంగాలలో ఊహించని మార్పులు తీసుకువచ్చి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు.
నాడు బీడు భూములు, నేడు పచ్చని భూములు, నాడు కరెంటు కోతలు, నేడు నిరంతర వెలుగులు, నాడు క్షామం, నేడు క్షేమం. ఇదీ తెలంగాణ సాధించిన విజయం. ఒకప్పుడు వ్యవసాయం దండుగన్న చోటే, నేడు పండుగలా మారింది. 24 గంటల ఉచిత విద్యుత్తు మొదలుకొని.. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతులకు అండగా నిలిచారు. వారి ప్రతి అడుగులో తోడయ్యారు. ఫలితంగా వ్యవసాయరంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది తెలంగాణ. సాగు విస్తీర్ణం అమాంతం రెట్టింపైంది. 2014-15లో యాసం గి, వానకాలం కలిపి 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం, 2022-23లో 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది.
ఉమ్మడి రాష్ట్రంలో కరువు, పేదరికంతో అల్లాడిన తెలంగాణ రైతన్నకు కేసీఆర్ కొండంత అండగా నిలిచారు. అందుకోసం రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి ఏటా ఎకరాకు రూ.10 వేలు చొప్పున సాయం అందిస్తున్నారు. రైతు బీమా పథకం ద్వారా రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తున్నారు. ఈ ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తున్నది. ఒకప్పుడు ధాన్యం కొనుగోళ్లలో 14వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు రెండో స్థానానికి చేరింది. సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి చరిత్రలోనే ఒక రికార్డు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాళేశ్వరం, చనాఖా కొరాట బరాజ్, సమ్మక్కసారక్క బరాజ్, భక్తరామదాసు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టి పూర్తిచేసి రైతుల సాగునీటి గోసను తీర్చింది. పెండింగులో ఉన్న కల్వకుర్తి, రాజీవ్ భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, మిడ్ మానేరు, సింగూర్ కెనాల్స్, ఎల్లంపల్లి, కిన్నెరసాని, పాలెంవాగు, కుమ్రంభీం, మత్తడివాగు, నీల్వాయి, జగన్నాథపూర్ ప్రాజెక్టులను ఏడేండ్లలోనే పూర్తి చేసింది. మిషన్ కాకతీయ ద్వారా నాలుగు దశల్లో సుమారు 48 వేల చెరువులకు జీవం పోసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్నది తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామికరంగాలకు 24 గంటల నిరంతరాయ విద్యుత్తును అందించి దేశమే ఆశ్చర్యపోయేలా చేసింది తెలంగాణ. రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనూ విద్యుత్తు కోతలుండేవి. ఇక పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు. వ్యవసాయరంగంలో పేరుకే 6 గంట లు.. కానీ పగలు రెండు, మూడు విడతల్లో 3 గంట లు.. రాత్రిపూట రెండు, మూడు విడతల్లో 3 గంట ల పాటు విద్యుత్తును ఇచ్చేవారు. కానీ నేడు యావ త్తు దేశం ఆశ్చర్యపడేలా 2018 జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయం గా, నాణ్యమైన పూర్తి ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణనే. వైద్యరంగంలో అనేక విప్లవాత్మక మార్పులకు తెలంగాణ మనకు సాక్ష్యంగా కనపడుతుంది. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, ఎన్సీడీ కిట్, తెలంగాణ డయాగ్నోస్టిక్స్, రోగి సహాయకులకు భోజనం, బస్తీ దవాఖానలు, పీహెచ్సీల్లో లైవ్ కెమెరాలు, టిఫా స్కానింగ్, టీమ్ బేస్డ్ ఇన్సెంటివ్, డైట్, శానిటేషన్ చార్జీలు డబుల్, టెలీ కన్సల్టెన్సీ, టెలి మానస్ సేవలు, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పాలసీ, కంటివెలుగు వంటి అనేక పథకాలను అమలుచేస్తున్నది. తెలంగాణ ఏర్పడేనాటికి ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే కొత్తగా 26 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు.
విద్యారంగంలో తెలంగాణ దేశానికే తలమానికంగా నిలిచింది. సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిన గురుకులాల ఏర్పాటుతో పాటు మధ్యాహ్న భోజనం, మన ఊరు-మన బడి, ఉచితంగా బ్రేక్ ఫాస్ట్, విదేశీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం, హాస్టళ్లలో సన్నబియ్యం పథకం, ఇంగ్లిష్ మీడియం చదువులను ప్రారంభించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి కేవలం 293 గురుకుల పాఠశాలలు ఉండగా నేడు 1,005 గురుకులాల్లో 5 లక్షలకుపైగా విద్యార్థులకు అధునాతన సౌకర్యాలతో నాణ్యమైన ఉచిత విద్యాబోధనతో పాటు భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నది.
సంక్షేమరంగంలో ఆసరా పింఛన్ల్లు, ఒంటరి మహిళ, దివ్యాంగులకు పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గొర్రెలు, చేపల పంపిణీ, దళితబంధు, బీసీ, మైనారిటీలకు లక్ష సాయం, గృహలక్ష్మి, పోడు భూములకు పట్టాలు, బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలకు స్థలాలను కేటాయించి, భవన నిర్మాణానికి రూ. కోటి చొప్పున అందించింది. తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణ అనేక అద్భుతాలు, విజయాలను సాధించింది. ఈ విజయాలు భవిష్యత్తులో కూడా కొనసాగాలంటే బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.
-కల్లూరి రామచంద్రారెడ్డి
90524 66668