ప్రభుత్వాల లోపాలను ఎత్తిచూపి ప్రశ్నించటం ప్రతిపక్షాల బాధ్యత. అయితే ఒక విషయంపై విమర్శించే ముందు పూర్వాపరాలను కూడా చూసుకోవాలి. చరిత్ర తెలుసుకొని సత్యాల ఆధారంగా మాట్లాడాలి. లేకపోతే ఆ విమర్శ ‘కువిమర్శ’ అవుతుంది. ఈమధ్య ఉస్మానియా దవాఖాన దుస్థితిపై రాష్ట్ర గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు చేశారు. ఒక రకంగా రాష్ట్రప్రభుత్వ పనితీరుపై విమర్శలుగానే వాటిని భావించాలి. కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయి.
ప్రతిపక్షాలు ఉస్మానియా దుస్థితిపై నోరుమెదపక ముం దే కేసీఆర్ ఆ పురాతన దవాఖానను స్వయంగా సందర్శించారు. అనేక చోట్ల పైకప్పు పెచ్చులూడటం, గోడలు దెబ్బతినటం, వర్షపు నీరు ధారాపాతంగా కారటం, మొత్తంగా దవాఖాన భవనం శిధిలావస్థకు చేరిన విషయాన్ని నిశితంగా పరిశీలించారు. దాన్ని రిపేర్ చేయటానికి అవకాశం ఉన్నదా? అని ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చేముందు ఆ పురాతన కట్టడం పై ఇంజినీరింగ్ నిపుణులతో చర్చించారు. వారి సూచనల మేరకు రిపేర్లకన్నా పాత భవనాన్ని పూర్తిగా కూల్చి నూతన భవనం కట్టాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే, దాని భౌతిక రూపం చెడకుండా పైకి అదే రూపం కనపడేలా నిర్మించి, లోపల నేటి అవసరాలకు తగినట్టుగా వెయ్యి పడకలతో 22 అంతస్తులతో నూతన దవాఖాన భవనాన్ని అన్నిహంగులతో, సౌకర్యాలతో నిర్మిస్తామని చెప్పారు. నిపుణులతో చర్చించి, నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ డిజైన్ రూపొందించి మీడియాకు కూడావెల్లడించారు.
అయితే, కొంతమంది ప్రతిపక్ష నాయకులు హెరిటేజ్ బిల్డింగ్ ఎలా కూలగొడతారంటూ అడ్డు తగిలారు. కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖకు ఫిర్యాదు చేశారు. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తిరిగి అదే ప్రతిపక్ష నాయకులు ఉస్మానియా కూలిపోతుంది దాన్ని పునఃనిర్మించరా? అంటూ మీడియాకు ఎక్కుతున్నారు. హైకోర్టులో కేసు తేలకుండా, తీర్పు రాకుండా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్మాణం ఎలా చేయగలుగుతుంది? కోర్టులో కేసులు వేసేది వీరే, ఇప్పుడు నంగనాచి ఏడ్పులూ, పెడబొబ్బలు పెట్టేది వీళ్లే. కోర్టులో కేసు తేలటానికి సమయం పడుతుంది కనుక ప్రజల తక్షణ అవసరాలకోసం మరో నిర్ణయం తీసుకున్నది.
అందులో భాగంగా వరంగల్లో సెంట్రల్ జైల్ స్థలంలో బహుళ అంతస్తుల దవాఖాన నిర్మాణానికి పూనుకున్నది. అలాగే నిమ్స్లో రెండు వేల పడకలతో మరో ఎక్స్టెన్షన్ బిల్డింగ్ నిర్మాణాలకు కేసీఆర్ భూమి పూజ చేశారు. నూతన భవనాలను, వైద్య అవసరాలకు తగినట్లుగా వివిధ నూతన హంగులతో, సకల సౌకర్యాలు ఉండేలా నిర్మిస్తున్నారు. నిర్మాణాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. అయితే, వాస్తవాలు దాచి, తెలంగాణ ప్రభుత్వంపై ఊరికే అభాండాలు వేయటం దేనికి? కేవలం రాజకీయం కాక మరేమిటి?
అలాగే బీజేపీ గల్లీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తారు. కాంగ్రెసు వారు దానికి వంత పాడుతారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతమాత్రం అవినీతి జరుగలేదని, అన్నిరకాల క్లియరెన్సులు ఉన్నాయని, అద్భుత కట్టడమని, సంబంధిత కేంద్రమంత్రి పార్లమెంటులో తెలంగాణ ప్రభుత్వానికి కితాబు ఇచ్చారు. పైగా! ఈ ఆధునిక కట్టడాలను పరిశీలించి శిక్షణ పొందటానికి కేంద్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లను రాష్ర్టానికి పంపుతామని ప్రకటించాడు. మరి ఇందులో ఏదినిజం?
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఉభయులూ కలిసి, కాళేశ్వర ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డాడంటారు. వారి దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయంటారు..మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? వారిని ఎవరు ఆపా రు?
అలాగే, తెలంగాణలో కేసీఆర్ పాలనలో అభివృద్ధి జరుగలేదని కాంగ్రెస్, బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా సమర్థ్ధతకు మెచ్చి కేంద్ర ప్రభు త్వం అవార్డుల మీద అవార్డులు ఎందుకు ప్రకటిస్తున్నది? ఇప్పటికే 150 కి మించి తెలంగాణ ప్రభుత్వానికి అవార్డులు ఇచ్చింది ఇది నిజం కాదా?.
ఇలా రెండు నాల్కల మాటలెందుకు? ప్రజలను ఎందుకు కన్ఫ్యూజన్ లోకి నెడుతున్నారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఒక్క ఎకరాకు కేసీఆర్ నీళ్లివ్వలేదు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా యి. మరి లక్షల మెట్రిక్ టన్ను ల పంట మన కండ్ల ముందట కనపడటం లేదా? ఈ పంట గాలిలో పండించారా? మన చెరువులు, వాగులు, కుంటలు మండు వేసవిలో సైతం అలుగులు పారుతూ కనిపించటం లేదా? తాగు, సాగు నీటి కొరత మన రాష్ట్రంలో ఉన్నదా? మరి ఎందుకు ఈ చౌకబారు విమర్శలు? ప్రజలు ఆలోచించాలి.
-డాక్టర్కోలాహలం రామ్ కిశోర్
98493 28496