రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాదాయ శాఖ అర్చకుల జీవితాల్లో వెలుగులు నిండాయి. ఇచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్ అర్చకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తగిన వేతనాలు అందిస్తున్నారు. అర్చకులకు సమాజంలో తగిన స్థానాన్ని కల్పించారు. ధూప, దీప, నైవేద్య పథకాన్ని పెద్ద సంఖ్యలో విస్తరించి దేవాలయాల మనుగడకు తోడ్పాటునందించారు.
2004లో అర్చకులు తెలంగాణ అర్చక ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ చేపట్టిన ప్రతి ఉద్యమానికి ఆ సంఘం తన మద్దతు తెలిపింది. ఒకానొక సందర్భంలో ఢిల్లీ వరకు మన గళాన్ని వినిపించడానికి రాష్ట్రం లోని గుడులన్నీ సంఘం బంద్ చేసింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకే అర్చక ఉద్యోగుల సంఘాల నేతలతో ప్రగతి భవన్లో సమావేశమై అర్చకులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి వేతనాలు చెల్లించే విధానాన్ని అమలు చేస్తా మని హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా 2017, సెప్టెంబర్ 15న అర్చక ఉద్యోగులందరినీ రాష్ట్ర పభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం కారణంగా 5,625 మంది అర్చకులకు లబ్ధి చేకూరింది. అలాగే ధూప, దీప, నైవేద్య అర్చకులుగా పనిచేస్తున్న వారి జీతాన్ని రూ.2,500 నుంచి రూ.6 వేలకు పెంచారు. ఈ పథకాన్ని 1800 నుంచి 6,500 దేవాలయాలకు విస్తరించారు. బ్రాహ్మణ సంక్షేమ భవన్ ప్రారం భోత్సవం రోజున అర్చకుల వేతనాన్ని రూ.10 వేలకు పెంచారు.
కరోనా సంక్షోభ సమయంలోనూ అర్చకుల జీతాల్లో కోత విధించకుండా సీఎం ఆదుకున్నారు. దీంతో చాలామంది అర్చక ఉద్యోగులు సీఎం కేసీఆర్కు, సంఘ నాయకులకు ధన్యావాదాలు తెలిపారు. కరోనా సమయంలో తమ కుటుంబాలు ఆకలితో పస్తులుండకుండా ఆదుకొన్న సీఎం కేసీఆర్ పట్ల అర్చకులు ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నారు. సీఎం పాల్గొనే అన్ని అధికారిక ప్రారంభోత్సవాల్లో ఆయనకు వేదాశీర్వచనాలు ఇస్తున్నారు. ఇవాళ అర్చక ఉద్యోగుల కుటుంబాలు రెండు పూటలా భోజనం చేస్తున్నాయంటే దానికి కారణం సీఎం కేసీఆర్ పెంచిన జీతాలే! సీఎం కేసీఆర్ అర్చకులకు సమాజంలో తగిన స్థానాన్ని కల్పించి, వారి జీవన ప్రమాణాలను పెంచారు. ఒకప్పుడు యువ అర్చకులకు పెండ్లి కావాలంటే చాలా కష్టంగా ఉండేది. అలాంటిది ఈ రోజు అర్చకులు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఎంతో మంది అమ్మాయిలు అర్చకులను పెండ్లి చేసుకుంటున్నారు! ఇన్ని మంచి పనులకు కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్రంలోని 11 వేల మంది అర్చక ఉద్యోగులు సదా రుణపడి ఉంటారు.
(వ్యాసకర్త: వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ అర్చక ఉద్యోగుల సంఘం)
– అగ్నిహోత్రం చంద్రశేఖర శర్మ