తెలుగునాట కాకతీయుల కాలంలో సాగునీటి పారుదల వ్యవస్థ, గుళ్లు, గోపురాల నిర్మాణం, ప్రజాపాలన, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ విశేషంగా జరిగింది. వారి విశేష అంశాల వారసత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పుణికిపుచ్చుకున్నారు. స్వయంగా ఆయన కవి, రచయిత, సాహితీవేత్త, అంతకుమించి పరమభక్తుడు, ఆధ్యాత్మిక చింతనాపరుడు. సమాజంలో శాంతిస్థాపనకు, మానసికోల్లాసానికి, దైవ చింతన కోసం ఆలయాలను అభివృద్ధి చేస్తూ ఆధ్యాత్మిక వైభవానికీ ఎంతో కృషిచేస్తున్నారు.
తెలంగాణ మట్టిబిడ్డల ఇలవేల్పు బతుకమ్మ పండుగకు విశ్వఖ్యాతి లభించడానికి కారణం సీఎం కేసీఆరే. బతుకమ్మతోపాటు బోనాలు, గ్రామ దేవతల పండుగలకూ స్వరాష్ట్రంలో ఎంతో ఆదరణ పెరిగింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఎములాడ రాజన్న క్షేత్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కేసీఆర్ సంకల్పించారు. అదేకాక జోగులాంబ అమ్మవారి ఆలయం, బాసర సరస్వతి టెంపుల్, అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారక్కల ఉత్సవాలు, కొమురవెల్లి మల్లన్న.. ఇలా అన్ని దేవాలయాలను అభివృద్ధి చేశారు. తెలంగాణ చరిత్రలోనే యాదాద్రి నిర్మాణం ఓ ఆధ్యాత్మిక అద్భుతం. అనతికాలంలోనే ఆ అద్భుతాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణలోనే ఉన్న మరో దివ్య క్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం. అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దుతామని కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. హిందువుకు, సెక్యులరిస్ట్కు సీఎం కేసీఆరే ప్రత్యక్ష ఉదాహరణ. మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్ల కోసం, ప్రజల మెప్పు కోసం ఇతర పార్టీల్లా ఆయన ఎన్నడూ పాకులాడలేదు. తెలంగాణలో మత సామరస్యాన్ని, పరమత సహనాన్ని గొప్పగా పాటిస్తున్నారు. రంజాన్, క్రిస్మస్ సందర్భంగా ముస్లిం, క్రైస్తవ సోదరీ సోదరులకు ప్రభుత్వం భారీఎత్తున విందును ఏర్పాటు చేయటమేగాక బట్టలు పంపిణీ చేస్తున్నారు. ఇలా ఆధ్యాత్మిక చింతన, సమాజంలో శాంతి స్థాపన, సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నిజంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైతాళికుడే.