నెర్రెలు బారిన తెలంగాణ నేలలను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పచ్చని మాగాణులుగా మార్చిన అపర భగీరథుడు మన కేసీఆర్. ఆయన మదిలో రూపుదిద్దుకున్న కొత్త సచివాలయం నేడు మనందరి కళ్ల ముందు దేదీప్యమానంగా ఆవిష్కృతమైంది. భిన్న సంస్కృతులకు నెలవైన మన సంప్రదాయానికి అద్దం పడుతూ, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణమైన తెలంగాణ సచివాలయం వంటిది దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. మహాద్భుత కట్టడంగా నిర్మితమైన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టటం సీఎం కేసీఆర్ సమున్నత దృష్టికి తార్కాణం.
Telangana Secretariat | తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ మొదటి లక్ష్యం బీడువారిన భూముల్లో సాగు నీరు పారించడం. అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించారు. సాగునీటి ప్రాజెక్టులను తరాలపాటు నిర్మించాల్సిన అవసరం లేదని, పాలకుడికి చిత్తశుద్ధి ఉంటే మూడు నాలుగేండ్లలోనే పూర్తి చేయవచ్చు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆలయాలను, దేవుళ్లను కొందరు రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్న ఈ రోజుల్లో, తెలంగాణ గర్వించదగ్గ గొప్ప పుణ్యక్షేత్రంగా యాదగిరిగుట్టను తీర్చిదిద్దారు. నేడు యాదాద్రిని సందర్శించిన వారంతా ఆలయ వైభవాన్ని చూసి అబ్బురపడుతున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలు తరతరాలపాటు కొనసాగాలనే ఆలోచనతో హైదరాబాద్ నడిబొడ్డున, ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు కేసీఆర్. ఈ క్రమంలోనే నూతన సచివాలయాన్ని అందరూ ఆశ్చర్యపోయేరీతిలో నిర్మించారు.
సువిశాలమైన 28 ఎకరాల ప్రాంగణంలో 10.52 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తులలో సచివాలయం నిర్మాణమైంది. చత్తీస్గఢ్లో 6.75 లక్షల చదరపు అడుగులు, మధ్యప్రదేశ్లో 9 లక్షల చదరపు అడుగుల సచివాలయాలే ఇప్పటి వరకు పెద్దవి. వీటిని తెలంగాణ నూతన సచివాలయం అధిగమించింది. ఎన్నో త్యాగాలకు ఓర్చి తెచ్చుకున్న తెలంగాణను ఎలా బాగు చేసుకోవాలి, దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఎలా నిలపాలనే స్పష్టమైన విజన్ కేసీఆర్కు తొలి నుంచీ ఉంది. ఉద్యమకాలంలో కొన్ని వేల సార్లు ఆయన ఆ విషయం చెప్పేవారు. తెలంగాణను సాధించిన తర్వాత ఈ దిశగా ఆయన ప్రతిక్షణం ప్రయత్నించారు. రాష్ట్ర ఆత్మగౌరవం, అభివృద్ధి విషయంలో ఆయన తపనకు నిదర్శనమే కొత్త సచివాలయ నిర్మాణం. ఇండో-పర్షియన్-అరేబియన్ శైలితో కేవ లం 26 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయడం ఒక చరిత్ర. తొమ్మిదేండ్లలో మనం సాధించిన అభివృద్ధికి ఒక సమున్నత ప్రతీక సచివాలయం. గంగా జమునాతెహజీబ్ అనే మన భావనకు అద్దం.
రూ.610 కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్త సచివాలయ నిర్మాణం రికార్డు వేగంతో పూర్తయ్యింది. 2019 జూన్ 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు జరిగిన అనేక ప్రయత్నాలు ముఖ్యమంత్రి సంకల్పం ముందు ఓడిపోయాయి. 2020 జూలైలో పాత భవనాల కూల్చివేత మొదలైంది. 2021 జనవరి 4న సచివాలయ నిర్మాణ పనులు మొదలయ్యాయి. అంటే కేవలం రెండేండ్లలోనే ఇంత భారీ నిర్మాణం పూర్తయ్యింది. ప్రభు త్వ నిర్మాణాలు ఆలస్యంగా జరుగుతాయనే ఒక అపప్రథ మన దేశంలో ఉంది. ఈ అభిప్రాయాన్ని తెలంగాణ ఇప్పటికే కాళేశ్వరం రూపంలో, యాదగిరిగుట్ట పునర్నిర్మాణం రూపంలో, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ రూపంలో చెరిపివేసింది. ఆ జాబితా లో సచివాలయం కూడా చేరింది.
కొత్త సచివాలయ నిర్మాణానికి ముందు కేసీఆర్ చాలా కసరత్తు చేశారు. మన చరిత్రను గుర్తుకు తెచ్చేలా డెక్కన్, కాకతీయ నిర్మాణశైలిలో సచివాలయం ఉండాలనుకున్నారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా వసతులు ఉండాలనుకున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా సచివాలయ ప్రాంగణంలో దేవాలయం, మసీదు, చర్చి నిర్మించాలని ఆదేశించారు. ఒక ఇంటి పెద్ద సొంతింటి కలను నిజం చేసుకునే క్రమంలో ఇల్లు నిర్మాణానికి ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తారో, కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశంపై కేసీఆర్ అంత శ్రద్ధ చూపించారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా దేశంలోనే ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ ఆస్కాన్ ఆండ్ పొన్ని ఆర్కిటెక్ట్స్ సచివాలయానికి రూపకల్పన చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన షాపూర్జీ పల్లోంజీ మూడు షిఫ్టుల్లో పని నడిపించి వేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్ఆండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి సచివాలయ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్మాణం పూర్తి చేయించారు.
అమెరికాలోని వైట్ హౌస్ను తలపించేంత గొప్పగా సచివాలయం కనిపిస్తున్నది. జాతీయ చిహ్నలను ప్రతిష్ఠించిన రెండు ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలతో మన తెలంగాణ నిర్మాణశైలికి సచివాలయం అద్దం పడుతున్నది. ప్రకృతి విపత్తులను సైతం తట్టుకొనేలా సచివాలయ నిర్మాణం జరిగింది. భవనం చుట్టు, ముందు ఏర్పాటు చేసిన ల్యాండ్స్కేప్ సచివాలయానికి ప్రత్యేక ఆకర్షణ. సెక్రటేరియట్ ప్రాంగణంలో నిర్మించిన గుడి, మసీదు, చర్చి మతసామరస్యానికి ప్రతీకలు. క్లర్కు నుంచి ఐఏఎస్ దాకా ప్రతి ఉద్యోగికి, వివిధ పనుల మీద సచివాలయానికి వచ్చే సందర్శకులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటయ్యాయి. ఇకపై హైదరాబాద్కు వచ్చే పర్యాటకులు తిలకించే స్థలాల్లో మన సెక్రటేరియట్ కూడా ఒకటి కానున్నది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రంగా డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సచివాలయం వెయ్యేండ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
(వ్యాసకర్త: అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ)
డాక్టర్ ఎన్.యాదగిరిరావు