Harry Brook : దేశం కోసం కోట్లు కురిపించే ఐపీఎల్(IPL)కు దూరమైన హ్యారీ బ్రూక్ (Harry Brook) మనసు మార్చుకునేలా ఉన్నాడు. వేలంలో భారీ ధర పలికినా.. తీరా సీజన్ ఆరంభానికి ముందే వైదొలిగే అలవాటున్న బ్రూక్.. ఈసారి ఆ పొరపాటు చేయకూడదని భావిస్తున్నాడు. ఐపీఎల్లో తనపై రెండేళ్ల నిషేధం పూర్తయ్యాక.. మళ్లీ పునరాగమనం చేయడంపై ఆలోచిస్తానని చెప్పాడీ ఇంగ్లండ్ కెప్టెన్.
ఇంగ్లండ్ వన్డే, టీ20 కెప్టెన్గా రాణిస్తున్న హ్యారీ బ్రూక్ ఐపీఎల్లో పునరాగమనం చేయడంపై ఆలోచిస్తున్నాడు. దేశం తరఫున మూడు ఫార్మాట్లలో అదరగొడుతున్న అతడు.. తాజాగా ఐపీఎల్పై స్పందించాడు. ‘ఐపీఎల్ నిజంగా గొప్ప టోర్నమెంట్. అందులో ఆడడం నిజయంగా మర్చిపోలేని అనుభవం. ఐపీఎల్ ఆడితే మనలోని ఉత్తమ బ్యాటర్ బయటకొస్తాడు. ఐపీఎల్ నిజంగా మంచి పోటీనిచ్చే టోర్నీ. ఈ మెగా ఈవెంట్లో మళ్లీ ఆడడంపై ఆలోచిస్తా’ అని బ్రూక్ వెల్లడించాడు.
Will Harry Brook return to the IPL? 👀 pic.twitter.com/DkadxLqfV2
— Cricinfo (@cricinfo) August 13, 2026
ఏడాది క్రితం ఇదే బ్రూక్ నాకు ఐపీఎల్ కాదు, దేశమే ముఖ్యం అని ప్రకటించాడు. ‘నేను ఇంగ్లండ్ తరఫున ఆడాలని మాత్రమే అనుకుంటున్నా. మా దేశానికి ప్రాతినిధ్యం వహించడమే గొప్ప గౌరవం. ఇంతకుముందు జట్టు విజయం కోసం ఎంతగా తపించేవాడినో.. ఇప్పుడు సారథిగా అంతే తపన కనబరుస్తాను. నా నాయకత్వంలో ఇంగ్లండ్ వైట్ బాల్ క్రికెట్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. ఈమధ్య కాలంలో అందరూ ఫ్రాంచైజ్ క్రికెట్ మీద ఆసక్తి చూపిస్తున్నారు.
నా దృష్టిలో దేశం కంటే ఏ లీగ్ గొప్పది కాదు. ఐపీఎల్ అయినా సరే నా తొలి ప్రాధాన్యం మాత్రం ఇంగ్లండ్కే. అందుకే.. మా దేశం జెర్సీతో మైదానంలోకి దిగిన రోజున నా మనసెంతో ఉప్పొంగిపోతుంది. ఐపీఎల్కు దూరం కావడం వల్ల కోట్లలో డబ్బు కోల్పోతున్నా. ఒకవేళ ఇలాంటి ఫ్రాంచైజ్ క్రికెట్లో భాగమైనా సరే.. దేశం తరఫున ఆడాల్సి వస్తే మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోను’ అని బ్రూక్ వెల్లడించాడు. ఇంగ్లండ్ సారథిగా బ్రూక్కు మే నెలలో తొలి సవాల్ ఎదురుకానుంది. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం ఇంగ్లండ్కు వెస్టిండీస్ జట్టు రానుంది.

గత మూడేళ్లుగా టీ20, టెస్టుల్లో సంచలన ఇన్నింగ్స్లు ఆడుతున్న బ్రూక్ ఐపీఎల్లో భారీ ధర పలికాడు. 18వ సీజన్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.6.25 కోట్లకు కొన్నది. కానీ, బిజీ షెడ్యూల్ కారణంగా వైదొలుగుతున్నాని డీసీకి మెసేజ్ పంపాడు బ్రూక్. దాంతో, నిబంధనలను ఉల్లఘించినందుకు ఈ ఇంగ్లండ్ స్టార్పై రెండేళ్ల నిషేధం విధించింది ఐపీఎల్ పాలకమండలి. 2016వ సీజన్లో రూ.13.5 కోట్లకు సన్రైజర్స్ యాజమాన్యం బ్రూక్ను కొనుగోలు చేసింది. అయితే. కోల్కతాపై సెంచరీతో సరిపుచ్చాడీ బ్యాటర్.