Telangana | దేశంలో అత్యధికంగా వరి పండించిన రాష్ట్రం.. దేశం మొత్తం ఆకలి తీర్చేంత ఆహారధాన్యాల ఉత్పత్తి.. 24 గంటల విద్యుత్తు, ఇంటింటికీ మంచి నీరు.. రుతుపవనాలు ఆలస్యమై ఎండలు మండిపోతున్నా నిండుకుండలా కనిపిస్తున్న చెరువులు…పచ్చగా కళకళలాడుతున్న గ్రామాలు.. దేశంలో అత్యధికంగా పర్ క్యాపిటా ఇన్కమ్.. ఇదీ ప్రస్తుత తెలంగాణ ముఖచిత్రం.
కరువు దృశ్యాల చిత్రీకరణకు, పేదరికానికి సెట్టింగ్ అవసరం లేకుండా సహజంగా చిత్రీకరించవచ్చు అన్నట్టుగా ఉండేది తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం. ఎట్లుండె తెలంగాణ ఇప్పుడెట్లయింది? మంత్రం వేస్తే అయిందా?కాలమే మార్చిందా? 2014కు ముందు నాటి తెలంగాణ, ఇప్పటి తెలంగాణను చూస్తే తొమ్మిదేండ్లలోనే ఇంత మార్పు అయితే, అరవై ఏండ్ల కిందటే ఈ మార్పు మొదలై ఉంటే ఎక్కడ ఉండేవాళ్లమో అనిపిస్తున్నది. అరువై ఏండ్లలో మనం ఎంత అభివృద్ధి కోల్పోయామో? 2014 నుంచి తొమ్మిదేండ్లు గడిచినా, మొదటి ఆరు నెలలు రాష్ట్రం ఏమిటో అర్థం చేసుకోవడానికి, రెండు రాష్ర్టాల మధ్య పంపకాలకే సరిపోయింది. మిగిలిన దానిలో ఒక సంవత్సరం కరోనా మింగేస్తే, మరో సంవత్సరం నోట్ల రద్దు మింగేసింది. నికరంగా మిగిలింది ఆరున్నర, ఏడేండ్లు మాత్రమే. ఆరున్నరేండ్ల కాలంలోనే తెలంగాణ కాళేశ్వరం పూర్తిచేసుకున్నది. మిషన్ కాకతీయ, ఇంటింటికీ మంచినీరు అందించే మిషన్ భగీరథ, 24 గంటల విద్యుత్ ఇవ్వడం ద్వారా తెలంగాణ సగర్వంగా తలెత్తుకొని నిలబడగలిగింది. గ్రామాల అభివృద్ధి, వ్యవసాయరంగం అభివృద్ధి మాత్రమే కాదు. ఐటీ రంగంలో అభివృద్ధి రేటులో దేశంలోనే నంబర్ వన్. తెలంగాణ ఏర్పడితే ఐటీరంగం దెబ్బ తింటుందని ప్రచారం చేసినవారు విస్తుపోయేవిధంగా అప్పటి కన్నా మూడింతలు ఎక్కువ అభివృద్ధి సాధించి చూపించింది.
తెలంగాణ ఏర్పాటుకు ముందు నిత్యం రైతుల ఆత్మహత్యలు, అర్ధరాత్రి పూట నాలుగైదు గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ లభించేది. అర్ధరాత్రి పొలంలోకి వెళ్తే పాముకాటుతో రైతుల మరణ వార్తలు ఏదో ఒక ప్రాంతంలో కనిపించేవి. అర్ధరాత్రి ఇచ్చే విద్యుత్తును పగటిపూట ఇవ్వాలని రైతుల ఆందోళన. మరి ఇప్పుడు రాత్రిపూట, పగటి పూట అని కాదు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా. వ్యవసాయానికి విద్యుత్ చార్జీలు పెంచవద్దని రైతులు ఆందోళన చేస్తే సమైక్యరాష్ట్రంలో కాల్పులు జరిపి ప్రాణాలు తీస్తే, తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తుతో పాటు వ్యవసాయం చేసే రైతులకు అండగా ఉండేందుకు రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు అమలు చేస్తున్నారు. ఏటా రెండు విడుతలుగా ఎకరానికి పది వేల రూపాయల సహాయం అందిస్తున్నారు.
అభివృద్ధి అంటే హైదరాబాద్ మాత్రమే కాదు, హైదరాబాద్లో ఆకాశమంత ఎత్తులో భవనాలు కనిపించవచ్చు కానీ గ్రామాలు కళకళలాడుతున్నాయి. రైతుల ముఖాల్లో ఎప్పుడూ లేనంత సంతోషం కనిపిస్తున్నది. బాగా గుర్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి దసరా పండుగ. రైతుల ఆత్మహత్యలు అలా సాగుతూనే ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు సాగుతుంటే దసరా పండుగ ఎలా జరుపుకొంటారు, ఈసారి పండుగ జరుపుకోకండి అని తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినవారు సలహాలు ఇచ్చారు. అసెంబ్లీలో విద్యుత్తుపై చర్చ జరిగితే, విద్యుత్ రంగంలో ఏ సంవత్సరంలో ఏం చేయబోయేది, ఏ సంవత్సరంలో విద్యుత్రంగం పరిస్థితి ఎలా ఉండబోయేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గణాంకాలతో సహా వివరించారు. ‘మూడేండ్ల వరకు విద్యుత్ కష్టాలుంటాయి.
మూడేండ్ల తర్వాత మిగులు విద్యుత్ దశకు చేరుకుంటాం’ అని కేసీఆర్ వివరిస్తే.. సభలో విపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి అదే జరిగితే, తాను టీఆర్ఎస్కు ప్రచారం చేస్తానని సవాల్ చేశారు. మరిప్పుడు విద్యుత్తురంగంలో ఎక్కడున్నాం? దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. పరిశ్రమలకు విద్యుత్తు ఇవ్వలేకపోతుంటే తెలంగాణ మాత్రం మిగులు విద్యుత్తును ఇతర రాష్ర్టాలకు విక్రయించే స్థితిలో ఉన్నది.
ఇది చిన్నప్పటి నుంచి మనం చూసిన తెలంగాణనేనా అని అనిపిస్తున్నది. తొమ్మిదేండ్లు గడిచిపోయి 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తెలంగాణ ఆరున్నరేండ్లలోనే ఇంత ప్రగతి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. కేంద్రం రైతుబంధు పథకం అనుసరిస్తున్నది. మరికొన్ని రాష్ర్టాలు అమలుకు ముందుకువచ్చాయి. ఏపీలో అమలుచేస్తున్నారు. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయని కాదు, తెలంగాణలో ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పథకాల ప్రభావం అనేక రాష్ర్టాల్లో ఉంటుంది. మన సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. దేశానికి ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై ఉన్నది మహారాష్ట్రలో అయినా దేశంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నది మహారాష్ట్రలో నే.. రైతులకు తెలంగాణ అమలుచేస్తున్న పథకాలను మహారాష్ట్ర అమలుచేయడం లేదు. అమలు చేయాలని అక్కడ ఒత్తిడి పెరగడం సహజం. నిజానికి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చకముందే తెలంగాణ ప్రభుత్వ పథకాల ప్రభావం మహారాష్ట్రలో కనిపించింది. తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని ఆందోళన చేశారు.
కేంద్రం నుంచి సహకారం లేకపోయినా ఇది తెలంగాణ సాధించిన విజయం. ఒకవేళ కేంద్రం నుంచి సహకారం లభించి ఉంటే? ఆకాశమే హద్దుగా దూసుకెళ్లేది. ఐటీఐఆర్ వంటి ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం రద్దుచేసి ఉండకపోతే తెలంగాణకు ఎంతో మేలు జరిగేది. సహకారం మాట దేవుడెరుగు తెలంగాణను స్వాహా చేయాలనే చూశారు మొదటినుంచి. సాధారణ మెజారిటీతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే అప్పటికి ఇంకా హైదరాబాద్ నుంచే పాలన సాగించిన ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఓటుకు నోటు’ ద్వారా శాసనసభ్యులను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి హైదరాబాద్పై తమ పట్టు కొనసాగించాలనుకున్నారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటం వల్ల బాబు రాత్రికిరాత్రి అమరావతి వెళ్లాల్సివచ్చింది. ఆ తర్వాత బీజేపీ ఇదే పనికి పూనుకున్నది. బీజేపీ తరపున శాసనసభ్యులను కొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం పూనుకొని సన్యాసులను పంపింది. వారు పట్టుపడటంతో దేశవ్యాప్తంగా బీజేపీ వ్యవహారం తెలిసొచ్చింది. ఒకవైపు కుట్రలను ఎదుర్కొంటూనే తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి సామాన్యమైనది కాదు.
తెలంగాణ మేమే ఇచ్చామనేది కాంగ్రెస్ వాదన. నిజమే మరి హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపింది ఎవరు? ఇచ్చామనే దానికి క్రెడిట్ తీసుకుంటే, పచ్చగా ఉన్న హైదరాబాద్ రాష్ర్టాన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపి కరువు కాటకాలతో దెబ్బతీసింది మేమే అని కూడా ఒప్పుకోవాలి. 1969లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమాన్ని 4 వందల మందిని పొట్టనపెట్టుకొని అణచివేసింది కూడా మేమేనని ఒప్పుకోవాలి. మేము ఇచ్చామని చెప్తున్నవారు, మేం ఆంధ్రాలో కలపడం ద్వారా తెలంగాణను ఆరు దశాబ్దాల పాటు వెనుకబాటుతనంతో ముంచెత్తామని కూడా ఒప్పుకోవాలి. 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటును ప్రకటిస్తే రాజీనామాలతో అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ కాదా? అడ్డుకున్నది మేమే అని కూడా ఒప్పుకోవాలి. 2009లోనే తెలంగాణ ఏర్పడి ఉంటే తెలంగాణ మరింత అభివృద్ధి సాధించి ఉండేది కదా?
2014లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. విడిపోతే మేం అభివృద్ధి చెందుతాం అనే వాదన వేరు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చెంది తలెత్తుకొని నిలిచింది. ఆరున్నరేండ్ల కాలంలో ఇంత అభివృద్ధి సాధించి అనేకరంగాల్లో తెలంగాణ నంబర్ వన్గా నిలిచింది. ఇదేస్థాయిలో మిగిలిన అరవై ఏండ్లు అభివృద్ధి చెంది ఉంటే తెలంగాణ ఎక్కడో ఉండేది. అరవై ఏండ్ల వెనుకబాటుకు ఎవరు బాధ్యులు?
‘పద్నాలుగేండ్ల పాటు ఉద్యమం చేశాం, తెలంగాణ సాధించా’మని చెప్పుకొని 2014లో టీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్లింది. ప్రజలు సాధారణ మెజారిటీతో అధికారం ఇచ్చారు. 2018లో తెలంగాణ సాధించాం, నాలుగేండ్లలో చెప్పింది చేసి చూపించామని చెప్పుకొని ఎన్నికలకు వెళ్లారు. అందుకే ప్రజలు ఈసారి భారీ మెజారిటీ ఇచ్చారు. సెంటిమెంట్తో మళ్లీ మళ్లీ గెలువరని కొందరి విమర్శ. 2014 ఎన్నికల్లో కన్నా 2018 ఎన్నికల్లో మెజారిటీ ఎక్కువ వచ్చిందంటే సెంటిమెంట్ 2014లో ఎక్కువ ఉంటుందా? 2018లో ఎక్కువ ఉంటుందా? ప్రజలు అమాయకులేం కాదు. వారికి ఎక్కడినుంచి ఎక్కడికి వచ్చామో తెలుసు. సాధించిన అభివృద్ధిని బేరీజు వేసుకొనే నిర్ణయం తీసుకుంటారు. ఇది తెలంగాణ కాలం. తెలంగాణకు తిరుగు లేదు.
-బుద్దా మురళి