కులగణన అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనగణనతో పాటు కులగణన చేపట్టాలనే డిమాండూ ఊపందుకుంటున్నది. ఒక్కో రాష్ట్రం, సమాజంలో అణగారిన ఒక్కో వర్గం తమ గొంతును బలంగా వినిపిస్తున్నది. ముక్తకంఠంతో కేంద్రాన్ని నిలదీస్తున్నది. అయినా కేంద్ర సర్కారులో ఏ మాత్రం చలనం కనిపించని దుస్థితి. ఇక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం బీసీలను మోసం చేయాలని చూస్తున్నది. కులగణన అంశాన్ని ఆ పార్టీ రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నది. కులగణనకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి, తెలంగాణ సామాజిక, రాజకీయ, ఆర్థిక సర్వే నిర్వహిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసింది.
అయినా అందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ కాలయాపన చేస్తున్నది. ఇది అట్టడుగువర్గాల ఆకాంక్షలను, ఆశలను నీరుగార్చే ప్రయత్నమే. అసలు అణగారిన వర్గాలు ఎందుకింతగా పట్టుబడుతున్నాయి? అయినా కేంద్రం ఎందుకు ససేమిరా అంటున్నది? కులగణన ఫలితంగా ఆయా వర్గాలకు ఒనగూరే ప్రయోజనాలేమిటి? కేంద్ర సర్కారుకు వాటిల్లే నష్టమేమిటి? అన్నవే అసలు ప్రశ్నలు. వాటి గురించి ఆలోచించాల్సిన అవసరమే కాదు, లోతుగా తర్కించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. అప్పుడు గానీ కులగణన డిమాండ్ వెనుక ఉన్న ఆంతర్యం, ఆకాంక్షలను చిదిమేయడం వెనుక దాగిన కుట్రలు తేటతెల్లం కావు. వాటిని సంక్షిప్తంగానైనా వివరించాలన్నదే ఈ వ్యాస ప్రధాన ఉద్దేశం.
Caste Census | ఇక నేడు దేశంలోని ఓబీసీల అధ్వాన్నస్థితికి, అవకాశాల లేమికి దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీనే కారణం. ఇప్పటికీ కాంగ్రెస్ అదే మోసపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని ప్రకటించింది. చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ, అధికారం చేపట్టిన తర్వాత మాటమార్చింది. కులగణన చేపట్టకుండా తెలంగాణ సామాజిక ఆర్థిక, రాజకీయ సర్వేను నిర్వహిస్తామని చెబుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలను తప్పుదోవ పట్టిస్తున్నది కాంగ్రెస్ సర్కార్.
ప్రపంచంలో ఎక్కడా లేనిది, భారతావనికి మాత్రమే పరిమితమైనది, పుట్టుకకు ముందే నిర్ణయమయ్యేది, పుడమిలో కలిసినా మారనిది కులం. సమాజ పరిణామ క్రమలో వృత్తుల మూలంగా, శ్రమ విభజన ఫలితంగా పురుడుపోసుకున్నది కులం. భారతీయ సమాజం పురోభివృద్ధికి, స్వయం సమృద్ధి గ్రామీణ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో వెన్నెముకగా నిలిచినది కులం. అదంతా గతం. అయినా అదే చార్రితక సత్యం. యాంత్రిక విప్లవంతో కులవృత్తులు చెదిరిపోయాయి. వాటి ప్రాభవం మసకబారింది. కొత్త పెట్టుబడిదారీ వ్యవస్థలు వేళ్లూనుకున్నాయి. ఈ నయా అభివృద్ధి నమూనాలో ఆర్థికంగా బలోపేతమైన సామాజికవర్గాలదే ఆధిపత్యం. అణగారిన వర్గాలు మరింతగా అణచివేతకు గురవుతుండగా, ఆధిపత్యవర్గాలు సంపదను పోగుచేసుకుంటూ మరింత బలపడుతున్నాయి. ఈ వైరుధ్యమే ప్రస్తుత కులగణన డిమాండ్కు మూలకారణం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, రిజర్వేషన్ ఫలాలను, విద్య, ఉపాధి అవకాశాలను ఓబీసీల్లో ప్రాబల్యం పొందిన వర్గాలే అనుభవిస్తున్నాయనేది చేదు వాస్తవం.
ఓబీసీలోని అనేక ఉపకులాలు మరింత నిరాదరణకు గురవుతున్నాయనేది అనేక కమిటీలు తేల్చి చెప్పిన నిష్ఠూర సత్యం. ఫలితంగానే అవకాశాలు మృగ్యమై.. ఆర్థిక చేయూత కరువై.. అభివృద్ధికి దూరంగా విసిరివేసిన అణగారిన వర్గాలు, ముఖ్యంగా ఇప్పటివరకు కొద్దోగొప్పో అభివృద్ధి ఫలాలను అనుభవించి ఆర్థికంగా ఎదిగిన బీసీల్లోని ప్రాబల్య శక్తులు ఇప్పుడు తమ గొంతు విప్పుతున్నాయి. కొన్ని వర్గాలు సంపదలో తమ వాటా కోసం, మరికొన్ని వర్గాలు అవకాశాల కోసం ముక్తకంఠంతో
నిలదీస్తున్నాయి. కులగణనతోనే తమ ఆకాంక్షలు నెరవేర్చుకోవచ్చని, తమ బలాన్ని చాటుకోవచ్చని ఆశిస్తున్నాయి. అందుకే బీసీ కులగణనకు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఓబీసీల జనాభా గణనపై పూర్తి అధికారాలను రాష్ర్టాలకు కల్పించే బిల్లుకు ఇటీవల పార్లమెంట్ ఆమోదం తెలపడంతో మరోసారి కులగణన అంశం రాజకీయ చర్చగా మారిపోయింది. అనేక జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు సైతం కులాల వారీగా జనగణన చేయాలనే వాదాన్ని బలంగా వినిపిస్తున్నాయి.
దేశంలో తొలిసారిగా స్వాతంత్య్రానికి పూర్వం 1872లో జనాభాను బ్రాహ్మణ, క్షత్రీయ, రాజ్పుత్తో పాటు కులవృత్తుల వారీగా వర్గీకరించడంతో పాటు స్థ్థానిక క్రైస్తవులను, ఆదివాసీ తెగలను గుర్తించారు. 1901 నాటి జనగణనలో 1,642 కులాలను, 1931లో 4,147 కులాలను గుర్తించారు. 1941లో రెండో ప్రపంచ యుద్ధం వల్ల కులగణన మధ్యలోనే నిలిచిపోయింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రతి పదేండ్లకోసారి జనగణనను కేంద్రం చేపడుతున్నా అందులో ఎస్సీ, ఎస్టీ కులాల సమాచారాన్ని మాత్రమే సేకరిస్తూ వస్తున్నాయి. కులగణన చేపట్టే విషయంపై జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఆది నుంచీ ద్వంద్వ వైఖరినే అనుసరిస్తున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం గొంతు విప్పడం.. అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్లను ఏర్పాటు చేసి, ఆపై విస్మరించడం పరిపాటిగా మారింది. ఎట్టకేలకు 2011లో మాత్రం మొత్తంగా 46 లక్షల కులాలు, ఉపకులాలు, గోత్రనామాల ఆధారంగా ప్రాంతాల వారీగా జనాభా లెక్కలను సేకరించినా సాంకేతిక కారణాలతో ఆ నివేదికను తొక్కిపెట్టింది అప్పటి కాంగ్రెస్ సర్కార్. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ఆది నుంచీ కులగణనను, రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నది. ఈ విషయాన్ని గతంలోనూ, ఇప్పుడూ అనేక సందర్భాల్లో బాహాటంగా ప్రకటించింది.
బీసీలకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలను తీసుకుంటున్నది కూడా. నాడు మండల్ కమిషన్ అమలును వ్యతిరేకించింది. నేడు కులాల వారీగా సమగ్ర వివరాలను సేకరిస్తే సమాజంలో చీలికలు ఏర్పడి, ఆయా వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తుతాయని సాకులు చెబుతూ కులగణనను నిరాకరిస్తుండటం గమనార్హం. మరోవైపు ఎస్సీ, ఎస్టీల లెక్కలను సేకరించడం విడ్డూరం.
దేశంలో మొత్తంగా లక్షల సంఖ్యలో కులాలు, ఉపకులాలున్నాయని, ఒక ప్రాంతంలో ఓసీలుగా, ఉన్నవారు మరో రాష్ట్రంలో బీసీలు, ఎస్టీలుగా ఉన్నారని, వాటి జనగణన అసాధ్యమని అసంబద్ధ వాదనలను వినిపిస్తుండటం ఆక్షేపణీయం. అయితే కులగణనకు జాతీయ పార్టీలు ఇంతగా ససేమిరా అనడానికి ప్రధాన కారణం వేరే ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కులాల వారీగా జనగణన నిర్వహించినప్పుడు ఓబీసీల ప్రాబల్యం పెరగడంతో పాటు, తద్వారా ప్రస్తుత రిజర్వేషన్ల పరిమితిని కూడా పెంచాలనే డిమాండ్ వస్తుందని.. విద్య, ఉపాధి, రాజకీయాల్లో అగ్రవర్ణాల అవకాశాలకు గండిపడుతుందనేది వాటి భయం. అదే సత్యం.
2017లో ఏర్పాటు చేసిన రోహిణి కమిషన్ తన నివేదిక ద్వారా 97 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా రిజర్వేషన్ల ఫలాలు కేవలం 25 బీసీ ఉపకులాలకే చెందుతున్నాయని తేల్చిచెప్పింది. 2,633 ఓబీసీ కులాలు రిజర్వేషన్ల ఫలాలు పొందడం లేదని, 983 కులాలకు అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయిందని నొక్కిచెప్పింది. ఈ నేపథ్యంలోనే ఓబీసీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న 27శాతం రిజర్వేషన్లను మొత్తంగా 4 సబ్ క్యాటగిరీలుగా విభజించాలని చెప్పింది. అప్పుడే న్యాయం జరుగుతుందని స్పష్టం చేసింది.
ఇప్పటికైనా కేంద్రం కులగణన చేపట్టాలె. సబ్బండ బీసీ వర్గాలు ఆ దిశగా డిమాండ్ చేయాలె. కేంద్రం మెడలు వంచాలె. హక్కులను సాధించుకోవాలె. వాటాను తేల్చుకోవాలె. అన్నిటికంటే ముఖ్యంగా సమాజంలో 52 శాతంగా ఉన్న బీసీ కులాల అభ్యున్నతే దేశ ప్రగతి అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలె. కులగణనకు మద్దతు ఇయ్యాలె.
‘అట్టడుగు వర్గాలకు ఏ రూపంలోనూ రిజర్వేషన్లు ఉండకూడదు. అనాదిగా సమాజంలో కొనసాగుతున్న ఈ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ యథాతథంగా కొనసాగాలి. బడుగు, బలహీనవర్గాలు బానిసలుగానే బతుకులీడ్చాలి’.. ఇదీ క్లుప్తంగా బీజేపీ సిద్ధాంతం. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే అగ్రవర్ణ సామాజికవర్గం కాని వారెవరికీ బీజేపీ పబ్బతి పట్టదు. హక్కులను ప్రసాదించదు. ప్రయోజనాలను చేకూర్చదు. గడిచిన పదేండ్ల పాలనే అందుకు నిలువెత్తు నిదర్శనం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పన ఒక సజీవ సాక్ష్యం. ఇక ముందూ కాషాయ పార్టీ పాలన విధానం మారదనేది అక్షర సత్యం.
ఇక నేడు దేశంలోని ఓబీసీల అధ్వాన్నస్థితికి, అవకాశాల లేమికి దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీనే కారణం. ఇప్పటికీ కాంగ్రెస్ అదే మోసపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని ప్రకటించింది. చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ, అధికారం చేపట్టిన తర్వాత మాటమార్చింది. కులగణన చేపట్టకుండా తెలంగాణ సామాజిక ఆర్థిక, రాజకీయ సర్వేను నిర్వహిస్తామని చెబుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలను తప్పుదోవ పట్టిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. వాస్తవంగా కులగణన కేంద్రం పరిధిలోని అంశం. కేంద్ర సర్కారు చేస్తేనే చెల్లుబాటవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కులగణన చేసే అధికారం లేదు. సామాజిక సర్వేలను నిర్వహించుకునే వెసులుబాటు మాత్రమే ఉంది. అయితే ఈ సర్వేల ఫలితాల కచ్చితత్వంపై అనేక అనుమానాలు, అపోహలు ఉండటంతో పాటు, అవకతవకలు జరిగే అవకాశమూ ఉన్నది. ఒక కులాన్ని ఎక్కువగా చూపించుకోవచ్చు, లేదంటే తక్కువగానూ చూపించుకోవచ్చు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలోనే బీహార్ ప్రభుత్వం చేసిన సర్వే అటకెక్కింది. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న సర్వేపైనా అనేక ఆరోపణలున్నాయి. అక్కడి రాజకీయ పార్టీలు, కుల సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అలాంటి సర్వేనే కాంగ్రెస్ సర్కారు చేస్తామని అంటుండటం గమనార్హం. సూటిగా చెప్పాలంటే ఇక్కడ వర్గ స్వభావరీత్యా, పాలనా విధానాల పరంగా, వెనకబడిన వర్గాల ప్రయోజనాలను వ్యతిరేకించడంలో ఒకే రీతిన వ్యవహరించే బీజేపీ, కాంగ్రెస్లను తక్షణం విడనాడాలి.
దేశానికి నూతన అభివృద్ధి నమూనాను చూపి, కొత్త ఎజెండాతో ముందుకువస్తున్న, హక్కుల సాధనకు బీసీలకు బాసటగా నిలుస్తున్న, గొంతు కలుపుతున్న నూతన శక్తులతో ఏకం కావాలె. బీసీ హక్కులకు స్పష్టమైన హామీనిచ్చే ప్రజాస్వామిక, ప్రగతిశీల, ప్రాంతీయ పార్టీల వెంట నడవాలి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలవైపే బీసీలు మొగ్గు చూపాలి. అది బీసీ వర్గాలకు అత్యవసరం. అత్యంత అవశ్యకం.
(వ్యాసకర్త: జనతంత్ర వేదిక అధ్యక్షులు)
-గోసుల శ్రీనివాస్ యాదవ్
98498 16817