సూరత్ కోర్టు రాహుల్గాంధీకి నేరపూరితమైన పరువు నష్టం కేసులో ఇటీవల రెండేండ్ల జైలు విధించింది. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోవటం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఎందుకంటే రాహుల్ మీద మోపిన అభియోగం అవినీతి ఆరోపణలు కాదు, ఆదాయానికి మించిన ఆస్తులుండటం కాదు. ఆయన ఎప్పుడూ అధికారంలో లేడు కావున ఈ రెండూ ఆయనకు వర్తించే ఆరోపణలు కాదు. ఆయన మీద మోపిన ఆరోపణ ఏమంటే 2019లో జరిగిన ఎన్నిక ప్రచారంలో కర్ణాటకలో చేసిన ఒక విమర్శ. అది ఒక వర్గం ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉన్నదని కాలం చెల్లిన ఒక చట్టాన్ని ఉటంకిస్తూ చేసిన అభియోగం. క్రిమినల్ డిఫమేషన్ అనేది భారత శిక్షాస్మృతిలో భాగమే అయినా అది నేటి కాలానికి సంబంధం లేని నిబంధన. అయినప్పటికీ అది చట్టం పరిధి నుంచి తొలగించనంత కాలం చట్టబద్ధమైందే. క్రిమినల్ డిఫమేషన్ అనేది ఇప్పుడు అర్థం లేని చట్టం, దాన్ని చెల్లుబాటుకానిదిగా ప్రకటించాలని కోర్టును ఆశ్రయించినా కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. కాలానికి అనుగుణంగా వ్యవస్థలు మారాలన్నది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం.
భారత శిక్షా స్మృతిలో 499/500 చెందిన నేరపూరితమైన పరువు నష్టం అనే నిబంధన బ్రిటిష్ పాలనారోజుల్లో పరాయి ప్రభుత్వం, పరాయి పాలకుల మీద విమర్శలు చేయటాన్ని నిలువరించేందుకు ఉద్ధేశించినది. దాని అవసరం స్వతంత్ర భారతదేశంలో లేదు. అయితే దాన్ని శిక్షాస్మృతి నుంచి పార్లమెంటు ఎందుకు తొలగించలేదనేది కూడా ముఖ్యమైన అంశమే. దానికి తర్వాత వద్దాం. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణం. విమర్శకు విమర్శతోనే సమాధానం చెప్పాలి. కానీ, న్యాయ ప్రక్రియ ద్వారా చెప్తే కోర్టులకు కేసుల భారం పెరుగుతుంది. సామాన్యులకు న్యాయం జరగకపోవచ్చు. ప్రజాస్వామ్యంలో విమర్శ విధి, విధానాల మీదే ఉండాలి కానీ వ్యక్తుల మీద కాదు. వ్యక్తి కేంద్రంగా సాగే విమర్శల వల్ల వ్యవస్థలో ఉండే లోపాలను విస్మరించే ప్రమాదం ఉన్నది. ఈ సూత్రాన్ని ప్రజా జీవితంలో ఉన్న అందరూ తెలుసుకోవాలి. మరో అంశం ఏమంటే శిక్ష గరిష్ఠంగా రెండేండ్లు అని ఉన్నది చట్టంలో. గరిష్ఠంగా శిక్ష విధిస్తే పార్లమెంటు సభ్యత్వం రద్దవుతుందనేది కూడా విధితమే. తీర్పు పర్యవసానం ఏ విధంగా ఉంటుం దో కోర్టుకు తెలుసు ఈ తీర్పు సరైనదేనా, అంటే నిరూపితమయ్యే నేరమా, గరిష్ఠ శిక్ష విధించదగిన నేరమా అనేది రేపు పైకోర్టులో వేసే అప్పీల్ ద్వారానే తెలుస్తుంది. ఆ అప్పీల్ మీద హైకోర్టుకు ఆపైన సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన తర్వాత చివరికి ఏం తేలుతుందనేది చాలా ఏండ్ల తర్వాత కానీ తెలియదు.
ఇక్కడ ప్రధానంగా పరిశీలించవలసిన అంశా లు రెండు. ఒకటి భారత శిక్షా స్మృతిని సంస్కరించటం. రెండు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సంస్కరించటం. మొదటిది చూద్దాం. మన వ్యవస్థలో ఏటికి ఈవైపు ఉన్నప్పుడు ఒక మాట అవతలివైపు ఉన్నప్పుడు మరో మాట మాట్లాడటం అనే దుష్ట సంస్కృతి బాగా వేళ్లు నాటుకుంది. రాజకీయపార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకవిధంగా, విపక్షంగా ఉన్నప్పుడు మరోవిధంగా వ్యవహరించటం పరిపాటి అయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పదేండ్లు ప్రభుత్వాన్ని నడిపింది. ఆ పదేండ్లలో రాజ్యాంగపరమైన సంస్కరణలు గాని, శిక్షాస్మృతి పరమైన సంస్కరణలు కానీ ఏమైనా చేపట్టారా అంటే సమాధా నం శూన్యం. రేపు కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి బీజేపీ ప్రతిపక్షంలో ఉంటే కూడా జరిగేదిదే. ఎందుకంటే బలమైన చట్టం ఉంటే పాలకులకు బలం చేకూరుతుందన్న ధోరణిలో ఉన్నాం. భారత శిక్షా స్మృతిని సంస్కరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి చట్టాన్ని కూడా ప్రతి పదేండ్లకోసారి సమీక్షించి కాలం చెల్లిన అంశాలను తొలగించి కొత్త అంశాలను చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. పాలకపక్షం గానీ, ప్రతిపక్షాలు గానీ వ్యవస్థను సంస్కరించే దిశగా అసలు ఆలోచించటం లేదు. ఇది మన దురదృష్టం.
భారత శిక్షా స్మృతిలోని ఏ అంశమైనా ప్రాథమిక హక్కులను హరించేదిగా ఉంటే, అలాంటి నిబంధనల అవసరం ఉన్నదా, లేదా అనేది సమగ్రంగా పరిశీలించాలి. ఈ ప్రక్రియ లా కమిషన్ ద్వారా కానీ, మరేదైనా న్యాయనిపుణుల వ్యవస్థ ద్వారా కానీ జరగాలి. ఎందుకంటే మన రాజకీయం ఏ స్థాయికి చేరిందంటే చట్టసభల్లో ఏకాభిప్రాయం సాధించటం చాలా కష్టతరంగా మారింది. పల్స్ పోలియో లాంటి కార్యక్రమాలు తప్పితే ప్రతి అంశం మీద పరస్పరం విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించే వ్యవహరిస్తున్నారు గానీ వ్యవస్థను పటిష్ఠపరిచే ఉద్దేశంతో కాదు. మరో ముఖ్యమైన అంశం ఏమంటే రాజకీయంలో విమర్శ ప్రతి విమర్శ సర్వసాధారణం అనుకున్నా విమర్శ ఏ విధంగా ఉండాలన్న విచక్షణ అందరం కోల్పోయాం.
ప్రత్యర్థి వ్యక్తిత్వం దెబ్బతినే రీతిలో ఉండకూడదు విమర్శ. హుందాగా ప్రజలను ఆలోచింపజేసేదిగా ఉండా లి. కానీ అటువంటి విచక్షణను ఎవరై నా పాటిస్తున్నారా? విచ్చలవిడి విమర్శ అనేది అలవాటైపోయింది. దానితో సామాన్యుడికి ఉన్న తప్పు, ఒప్పు అన్న విచక్షణ సన్నగిల్లుతున్నది ఈ మధ్యకాలంలో. ఇది వారికి, వీరికి అని కాకుండా అన్ని పార్టీలకు వర్తిస్తుంది.
విమర్శ అనేది సహేతుకంగా ఉండాలేగాని వ్యక్తిగత దూషణకు దిగజారగూడదు. కానీ ఇది పాటించేదెవరు? సూరత్ కోర్టు తీర్పు సహేతుకమైనదా కాదా అనేదానిపై భిన్నమైన అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి గానీ విమర్శకు హద్దు ఉండాలి అనేదాన్ని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఇది కూడా చర్చనీయాంశం కావాలి. విమర్శ వల్ల పరువునష్టం జరిగితే దానికి సివిల్ మార్గాలు ఉన్నా కూడా ఐపీసీని ఆశ్రయించటం కూడా చర్చించవలసిన అంశమే. ఐపీసీ కేసులను ఏ స్థాయి కోర్టు విచారించాలి అనేది కూడా చర్చనీయాంశమే. ఇప్పుడు రాహుల్గాంధీ జిల్లా కోర్టును ఆశ్రయించాలి, ఆ తర్వాత హైర్టును, ఆపై సుప్రీం కోర్టునూ. ఇదం తా ముగిసేసరికి ఎన్నేండ్లు పడుతుందో ఎవరు చెప్పగలరు? మొత్తమ్మీద శిక్షాస్మృతిని సంస్కరించవలసిన అవసరం చాలా ఉన్నది.
ఇక ప్రజా ప్రాతినిధ్య చట్టం విషయాన్నీ చూద్దాం. రెండేండ్లు ఆపై జైలు శిక్షకు గురైన ప్రజాప్రతినిధులు చట్టసభలో తమ సభ్యత్వాన్ని కోల్పోతారన్న నిబంధన ఉద్దేశం ఏమిటి? రాజకీయాల్లో నేర ప్రవృత్తిని నిరోధించాలనేది దాని ఉద్దేశం. విమర్శ, ప్రతి విమర్శ అనేది నేర ప్రవృత్తి ఎలా అవుతుంది? చట్టాలు చేసే ప్రక్రియ ప్రభుత్వంతో మొదలవుతుంది. అధికారపక్షానికి చట్టసభలో మెజారిటీ ఉన్నది గనుక దాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డమైన చట్టాలు చేయటం మనం చూస్తున్నాం. సరైన చర్చ జరగదు. హడావుడిగా చట్టాలు చేస్తున్నారు. పైగా క్లిష్టమైన సామాజిక అంశాలపైనా చట్టం చేసి చేతులు దులుపుకొంటున్నారు. వరకట్న నిరోధక చట్టం ఉన్నది. కట్నం తీసుకోవటం తగ్గిపోయిందా? ఉన్నత ఉద్యోగం ఉంటే ఎక్కువ కట్నం అడుగుతారు. అది అందరికీ తెలుసు.
కులవివక్షను నేరంగా పరిగణించే చట్టాలు ఉన్నాయి, కానీ కుల వివక్ష తగ్గిందా? నిర్భయ చట్టం చేశాం, మహిళలపై అఘాయిత్యాలు అరికట్టగలిగామా? రాహుల్గాంధీ కేసులో రెండేం డ్లు శిక్ష ముగిసిన తర్వాత ఆరేండ్ల వరకు ఎన్నికల్లో పోటీకి అనర్హులనేది సమర్థనీయమేనా? ఈ నిబంధనను చేర్చేటప్పుడు పార్లమెంట్లో సరైన చర్చ జరిగిందా? దాని పర్యవసానాలను సరిగ్గా విశ్లేషించారా? అలాంటి అవకాశం, అనుకూల వాతావరణం మన చట్టసభల్లో ఉన్నదా? ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సరిగ్గా అమలుచేస్తే మన చట్టసభలు ఖాళీ అవుతాయి. ఈ చట్టంలోనే కదా ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చుపై పరిమితి ఉన్నది? గరిష్ఠ పరిమితి 25 లక్షలైతే 25 కోట్లు ఖర్చు పెట్టడం లేదా? ఈ విషయంలో ఏం చేస్తుందీ చట్టం? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి? అందరినీ వేధించే ప్రశ్నలివి.
మన న్యాయస్థానాల్లో లక్షల కొద్దీ కేసులు పేరుకుపోతున్నాయి. దీని మీద న్యాయవ్యవస్థలో ఏ స్థాయిలోనూ చర్చ జరగటం లేదు. స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలవుతున్న సందర్భంగా సంబురాలు జరుపుకొనే కన్నా వ్యవస్థను ప్రక్షాళన చేసి దేశాన్ని ప్రగతి దిశగా పయనించేలా చేయటానికి ఏం విధానాలు అవసరం, ఎటువంటి ప్రక్షాళన అవసరం అదెలా సాకారమవుతుందన్న విషయాల మీద యావత్ జాతి దృష్టి పెట్టవలసిన సమయం ఆసన్నమైందనటంలో సందేహం లేదు.
కానీ సమాధానాలు ఎవరికీ తెలియదు. కనీసం చర్చించవలసిన సమయం ఆసన్నమైం ది. చివరగా మన రాజ్యాంగాన్ని కూడా సమీక్షించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. రాష్ర్టాల్లో గవర్నర్లు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అంద రం చూస్తున్నాం. రాష్ట్రపతి కేంద్ర మంత్రివర్గం సలహా మేరకు వ్యవహరించాలన్న నిబంధన వంటిది గవర్నర్లకు ఎందుకు లేదు? దీనిగురించి ఎవరైనా, ఎప్పుడైనా ఆలోచించారా? ఏదైనా సమ స్య వస్తే దాన్నుంచి బయటపడేదెలా అనే చూస్తు న్నాం కానీ వ్యవస్థలను సంస్కరించే దిశగా మనం ప్రయత్నం చేయటం లేదు. అలా చేసినప్పుడే వ్యవస్థలు పటిష్ఠమవుతాయన్న విషయాన్ని విస్మరించకూడదు. మరో అంశం న్యాయవ్యవస్థను, న్యాయ ప్రక్రియను ప్రక్షాళన చేయటం. రాహుల్గాంధీ కేసునే తీసుకుంటే శిక్షా కాలం రెండేండ్లు ఆపై ఆరేండ్లు మొత్తం ఎనిమిదేండ్లు పడుతుంది రాహుల్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయటానికి. కానీ ఎనిమిదేండ్లలో ఈ కేసు విచారణ పూర్తవుతుందని ఎవరైనా చెప్పగలరా?
(వ్యాసకర్త: లోక్సభ సచివాలయం, మాజీ డైరెక్టర్)
గుమ్మడిదల రంగారావు
99590 59041