లక్నో: సుమారు 27 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును కోర్టు ముగించింది. రోజంతా కోర్టులో నిల్చోవాలని, రూ.1,000 జరిమానా చెల్లించాలని నిందితుడికి ఆదేశించింది. అతడు ఆ మేరకు శిక్ష అనుభవించి జరిమానా చెల్లించడంతో కేసు నుంచి విముక్తి లభించింది. (Court Ends 27 Year Old Case) ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సరూర్పూర్ కలాన్ గ్రామంలో జరిగిన ఒక ఘర్షణలో రాజేంద్ర, మరో ఇద్దరు వ్యక్తులు తనను దూషించారని, చంపేస్తామని బెదిరించారని ధారా సింగ్ అనే వ్యక్తి ఆరోపించాడు. పోలీసులకు అతడు ఫిర్యాదు చేయడంతో 1999 జూన్ 26న కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
కాగా, కోర్టులో విచారణ సమయంలో రాజేంద్ర కేసును ఇతర నిందితుల కేసుల నుంచి వేరు చేసి విడిగా కొనసాగించారు. దీంతో ఈ కేసు వ్యవహారం సుమారు 27 ఏళ్ల పాటు కొనసాగింది. వందకు పైగా విచారణ తేదీలు నిర్ణయించారు. తుది విచారణ, శిక్షలో వెసులుబాటు కోసం కూడా నిందితుడు రాజేంద్ర కోర్టు విచారణకు హాజరుకాలేదు. దీంతో అరెస్ట్ వారెంట్తో పాటు ఆస్తి జప్తు కోసం వారెంట్ను కోర్టు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో జూన్ 6న కోర్టులో రాజేంద్ర లొంగిపోయాడు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా శిక్షలో వెసులుబాటు కల్పించాలని కోరాడు. పదేపదే కోర్టుకు హాజరుకావడం కష్టంగా మారడంతో అదే రోజున కేసును పరిష్కరించాలని అతడు అభ్యర్థించారు. ఈ కేసు విషయంలో గతంలో కొన్ని రోజులు జైలు శిక్ష కూడా అనుభవించినట్లు కోర్టుకు తెలిపాడు.
మరోవైపు రాజేంద్ర చెప్పిన విషయాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. ఆ రోజు కోర్టు కార్యకలాపాలు ముగిసే వరకు కోర్టులోనే నిలబడి ఉండాలని అతడికి శిక్షతో పాటు రూ. 1,000 జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించకపోతే 10 రోజులు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చి ఆ కేసును ముగించారు. దీంతో రాజేంద్ర ఆ రోజంతా కోర్టు హాలులో నిల్చొని శిక్ష పూర్తి చేశాడు. అలాగే జరిమానా మొత్తం చెల్లించడంతో అతడ్ని విడిచిపెట్టారు.
సుమారు మూడు దశాబ్దాలుగా కొనసాగిన కేసును కోర్టు ముగించడంపై రాజేంద్ర సంతోషం వ్యక్తం చేశాడు. నిరంతరం కోర్టుకు వెళ్లాల్సి రావడం, న్యాయపరమైన ఖర్చులు భరించడంతో తీవ్ర ఆందోళన చెందాల్సి వచ్చిందని తెలిపాడు. శనివారం కోర్టు వెల్లడించిన తుది తీర్పుతో 27 ఏళ్లుగా కొనసాగిన న్యాయ పోరాట భారం ఎట్టకేలకు తొలగిపోయిందని హర్షం వ్యక్తం చేశాడు.