‘మెజారిటీ పేదల ఓట్లతో గద్దెనెక్కి, కొద్దిమంది కోటీశ్వరులను కుబేరులుగా మారుస్త్తూ, కోట్లాది పేదలను నిరుపేదలుగా దిగజార్చే పాలక పార్టీ బీజేపీ, కాంగ్రెస్, వగైరా ఏదైనా తిరోగమన పార్టీయే. ఉదా.. బీజేపీనే తీసుకుందాం. ప్రపంచ కుబేరుల్లో 10, 12 స్థానాల్లో ఉన్న అంబానీ, అదానీలను 3, 2 స్థానాలకు తీసుకెళ్లింది.
అంబానీ, అదానీలు న్యాయబద్ధంగా వ్యాపారాలు చేసి ఎదిగితే తప్పుబట్టాల్సిన పనిలేదు. కానీ వాళ్లు అలా ఎదగలేదు, లక్షల కోట్లు ప్రభుత్వ ఆస్తులను, వేల కోట్లకే కట్టబెట్టి మోదీ ప్రభుత్వం ఎదిగేలా చేసింది. ఉదా.. 3 లక్షల కోట్ల విలువైన భూములు, అధునాతన మిషనరీ ఉన్న ‘విశాఖ ఉక్కును 3 వేల కోట్లకు తెగనమ్మేందుకు సిద్ధపడిందని ఆ కంపెనీ స్టాఫ్ బహిరంగంగానే ప్రకటించారు. అంతే కాదు, వేలకోట్ల ప్రజాధనంతో మోదీ ప్రత్యేక విమానంలో తిరిగి అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్ వగైరాలతో అదానీ, అంబానీలకే లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు, వ్యాపార లావాదేవీలను కుదిర్చిపెట్టినట్లు అంతర్జాతీయ నివేదికలు గణాంకాలతో బయటపెట్టినయి. పోనీ అదే ప్రయాణంలో భారత్కు కొత్త పరిశ్రమలను కూడా రప్పించి ఉంటే, పోనీలే స్వామికార్యంతో పాటు, స్వకార్యాన్నీ పూర్తిచేసుకున్నాడులే అనుకునేవారు ప్రజలు. కానీ దేశానికి ఒక్కటంటే, ఒక్క పరిశ్రమను కూడా తేలేకపోయినందునే, జాతీయ అంతర్జాతీయ విమర్శల జడివానలో చిక్కుకున్నది మోదీ ప్రభుత్వం.
మోదీ పాలనలో దేశ వార్షిక ఆదాయం 3.0 ట్రిలియన్ డాలర్లు. ఇది ‘యాపిల్’ కంపెనీ వార్షికాదాయం 3.1 ట్రిలియన్ డాలర్ల కంటే తక్కువ. అదే చైనా ఆదాయం 16.5 ట్రిలియన్ డాలర్లు. గత మూడు దశాబ్దాలుగా చైనా జీడీపీ రెండంకెల్లో కొనసాగుతున్నది. ప్రపంచం తలెత్తి చూసేలా మన జీడీపీని పెంచుతానన్న మోదీ పాలనలో డబుల్ డిజిట్ సంగతి దేవుడెరుగు, సింగిల్ డిజిట్తో పతన మార్గాన జారుతున్నది. ఇందుకు కారణం, మన వంటి వ్యవసాయిక దేశాలు చైనా వగైరాలను కాక, తద్భిన్నంగా పారిశ్రామిక దేశాల, అదీ ఆయా దేశాల విఫ ల నేతల మార్గాన మోదీ పయనించటమే!
వ్యవసాయాధారిత చైనా మనం అందుకోలేనంత ఎత్తుకు ఎలా ఎదిగింది? 1.‘డెంగ్ సియావోపింగ్’ నాయకత్వాన ఐదేండ్ల పాటు బడ్జెట్లో 90 శాతం నిధులను వ్యవసాయాభివృద్ధికి కేటాయించి, దానిపై ఆధారపడిన 60 శాతం మంది ప్రజల కొనుగోలు శక్తిని పెంచుకున్నారు. తత్ఫలితంగా దేశదేశాల పారిశ్రామికవేత్తలు చైనాలో కుప్పలు తెప్పలుగా పరిశ్రమలను నెలకొల్పారు. కోట్లాది మందికి ఉద్యోగాలొచ్చినయ్, కార్మికులకు ఉపాధి లభించింది. దాంతో చదువుకునేవాళ్ల సంఖ్య పెరిగింది. 2. నిరుద్యోగులకు సబ్సిడీలతో, తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలు ఇప్పించి, కుటీర పరిశ్రమల దిశగా విస్తృతంగా ప్రోత్సహించింది. అందువల్ల ప్రపంచ దేశాలకు అతితక్కువ ధరలకే తన ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతున్నది. అందుకే రోజురోజుకు బహుముఖంగా పురోగమిస్తూ అమెరికాను సవాలు చేసే స్థాయికి ఎదిగింది చైనా. చైనా ప్రగతి విధానాన్ని ఎవరో కాదు మన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ వివరించారు.
చైనా అనుసరించిన ఈ విధానాన్ని అనుసరిస్తూ, ఎంతో వెనుకబడి ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని కేవలం ఎనిమిదేండ్లలో దేశంలో అత్యధిక ఆదాయాన్నందించే నాలుగవ రాష్ట్రంగా, అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తీర్చిదిద్దారు సీఎం కేసీఆర్. ‘రాజనీతిజ్ఞత’ అంటే అది కదా మోదీజీ? ప్రజల కొనుగోలు శక్తిని పెంచకుండా, అంబానీ, అదానీలను ఆకాశానికి చేర్చినా దేశం తిరోగమిస్తుందే కానీ, పురోగమించదన్న సత్యానికి మీ పాలన నిదర్శనం కదా మోదీజీ.
ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాల ద్వారా కోట్లాదిమంది పేదలు నిరుపేదలుగా మారుతున్నారనే విషయం బీజేపీకి తెలుసు. కుల, మతాలకతీతంగా పేదలంతా సమైక్యమైతే తాము అధికారంలోకి నిలవటం కష్టమన్న సంగతి బీజేపీకి తెలుసు. అందుకే నాడు విభజించి పాలించిన బ్రిటిష్ పాలకుల ఎత్తుగడనే బీజేపీ పాలకులు మరింత దూకుడుగా పాటిస్తున్నారు. అందుకు ‘మత విద్వేషాన్ని’ ఆయుధంగా మలుచుకుంటున్నారు. ప్రజలు మత విద్వేషానికి సులభంగా లోనవుతున్నారు. ఇది దేశానికి దురదృష్టం, బీజేపీకి అదృష్టం. అందుకేనేమో ‘మతం మత్తుమందు’ అన్నారు కార్ల్ మార్క్స్.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందువుల అభివృద్ధికి, హిందూ మత ఔన్నత్యం కోసం ఏమైనా చేస్తుందా అంటే అదేం లేదు. ఎందుకంటే? కేవలం మత విద్వేషాన్ని రగిల్చినందుకే హిందూ ఓటర్లు తమవైపు మొగ్గుతున్నారు కాబట్టి, సదరు విద్వేష జ్వాలలను చల్లారకుండా చూసుకుంటే చాలు. ఇంకా హిందువుల ప్రగతి కోసం అదనంగా శ్రమించాల్సిన అవసరం ఏముందని అనుకుంటున్నది బీజేపీ. తమ అధికారానికి పనికొచ్చేదేదైనా బీజేపీకి ఎజెండాయే తప్ప హిందువుల, హిందూమత ఉద్ధరణ వారి ఎజెండా కానే కాదన్న నిజాన్ని గ్రహించాలి. అందుకే దయచేసి హిందూత్వ భ్రమల నుంచి బయటపడి, నాడు స్వాతంత్య్ర సంగ్రామాన ‘హిందూ, ముస్లిం క్రిస్టియన్, సిక్కు, జైన భాయీ, భాయీ’-మందిర్, మసీదు, చర్చి, గురుద్వారా హమారా హై’ అంటూ నినదించిన నినాదాలను నేడు మరోసారి భారతీయులు నినదించెదరు గాక! నినదిస్తూనే ఉందురుగాక! తథాస్తు !
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-పాతూరి వెంకటేశ్వరరావు
98490 81889