మేడారం.. మేడిగడ్డ.. ఒకే సానువు మీది రెండు వేర్వేరు సదృశ్యాలు. ఒకటి 700 ఏండ్ల కిందటి రక్త చరిత్ర అయితే.. మరొకటి ఇంకా తడి ఆరని జలధాత్ర. మేడారం కోటి జనాల జాతరైతే.. మేడిగడ్డ శత కోటి ఘనపుటడుగుల జల పాతర. రాష్ట్రంలో ఇప్పుడివే ట్రెండింగ్. పచ్చగున్న మేడారంలో కాలం అడ్డం తిరిగింది. కరువు కాటేసింది.. మేడారం బీడయింది. అయినా ‘కప్పం కట్టు’ అని ఫర్మానా ఇచ్చిండు ప్రతాపరుద్రుడు. ‘కట్టలేం దొర’ అని ప్రత్యుత్తరం పంపిండు పగిడిద్దరాజు. కాకతీయ రాజు కన్నెర్రజేసిండు. కదన రంగానికి రమ్మన్నడు. మదపుటేనుగుల బలుపు ప్రతాపరుద్ర సేనలదైతే.. గెరిల్లా ఒడుపు పగిడిద్దరాజుది. సంపెంగ వాగొడ్డే యుద్ధ భూమి. గిరిజన బిడ్డల నెత్తురు చిందింది. రాచకత్తి కర్కశానికి పగిడిద్దరాజు తల తెగింది. సమ్మక్క, సారలమ్మ, జంపన్న అమరులయ్యారు. ఆనాటి ప్రాణ త్యాగమే ఇవాళ జన మనాది అయింది.. మేడారం జాతరయ్యింది.
Telangana | కాలం గతించింది. కరువు కోరలు తొడిగింది. అది తెలంగాణను అలుముకుంది. కరువు కౌగిలికి ప్రతి ఇల్లు వల్లకాడయింది. ఈ గోస పడలేక సారు పోయి.. సావు నోట్లె తలపెట్టంగ.. తన్లాడినోళ్లు.. తనువులిచ్చినోళ్లు.. పాట పాడినోళ్లు.. రాతలు రాసినోళ్లు.. చేతలు చేసినోళ్లు.. ఇట్లా ఎవరి త్యాగం వాళ్లది. ప్రతీదీ వెలకట్టలేని త్యాగమే. ఎట్టయితే ఏంది! 60 ఏండ్ల కొట్లాట ఫలించి స్వరాష్ట్రం కల సాకారమైంది. ముందుండి కొట్లాడిన సారే కొలువు కూటాల మీదికొచ్చిండు. వస్తూనే కరువు కోరలు పీకే పని పెట్టుకున్నడు. తెలంగాణను విత్తన భాండాగారం చేస్తానని కంకణం కట్టుకున్నడు. కాళేశ్వరం మహాయజ్ఞాన్ని తలంచిండు. కాళేశ్వరం మహా యజ్ఞమంటే! శివుని జటాఝూటాలను మత్తడిగ మలిచి గంగను నేలకు దించే అపర భగీరథ ప్రయత్నమే. నదికి నడకలు నేర్పింది సప్తర్షి మునుల్లో ఒకరైన గౌతముడని అంటరు. నడక నేర్చిన నదికి దిశను చూపి దక్షిణాది గంగను ఉత్తరవాహినిగా మార్చిన ఘనత మాత్రం కేసీఆర్దే. బీడువడ్డ నేలకు గోదారి నీళ్లను మళ్లించి అన్నదాత కాళ్లు కడిగిన అపర రాజర్షి అయిండు.
700 ఏండ్ల కింద అంటే ధర్మయుద్ధం ఉండేది. ఓ యుద్ధ నీతి ఉండేది. ఇప్పుడంత కుటిల రాజకీయాలే. నీతి తప్పిన కయ్యాలే! అందుకే తెలంగాణ ప్రాణధార కాళేశ్వరం కయ్యపు తునకగా మారింది. ఒక్కొక్క ఒర్రె నీళ్లను ఒడిసిపట్టి నెర్రెలు బారిన నేలకు నీళ్లిచ్చిన ఈ ప్రాజెక్టు మీద ఇప్పుడు పర్రెల పంచాయితీ మోపయింది. గోదావరికి ఎదురొడ్డి పారే నీళ్లను మల్పాల్సిన మేడిగడ్డ కుంగటమనేది దురదృష్టకరం. సమర్థనీయం కూడా కాదు. జలయుద్ధంలో గాయపడ్డ మహాయోధునిలాగా కాళేశ్వరం నిలబడ్డది. రోజుకో టీం పర్యటిస్తున్నది. పర్రెల్లో పుర్రెలు దూర్చి ఆలోచనలు చేస్తున్నది. కండ్లు పొడుచుకొని చూస్తున్నది. అక్కడికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిదీ కుంగింది అనే వలపోతే గానీ, మళ్లీ నిలబెడదామనే తలపోత మాత్రం లేదు.
కాళేశ్వరం అంటే కుంగిన ఆ నాలుగు పిల్లర్లు, ఈ రెండు పర్రెలేనా? మాజీ నీళ్ల మంత్రి హరీశ్రావు చెప్పినట్టు.. కాళేశ్వరం అంటే పవిత్రమైన ఓ శరీరం. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం.. ఈ మూడు నదీగర్భ జలాశయాలు, 16 భూ ఉపరితల రిజర్వాయర్లు, 228 పిల్లర్లు, 21 బాహుబలి మోటార్ల పంప్హౌజ్లు, 20 లిఫ్టులు, 203 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు, 1,531 కిలోమీటర్ల పొడవైన కాల్వలు.. ఇవన్నీ కలిస్తేనే కాళేశ్వరం.
బుద్ధిజీవులు, సృజనకారులు, పాలకులు చూడాల్సింది కాళేశ్వరం కట్ట కింద పర్రెలిచ్చిన పిల్లర్లను మాత్రమే కాదు. అటునుంచి ఎల్లంపల్లి గట్టును తట్టి చూస్తే! అక్కడ వెన్ను విరుచుకున్న వరికంకులుంటయి. ఎగువమానేరు ఎక్కి, దిగువ మానేరు దిగితే! తడిసిన మడికట్ల మధ్య రొమ్ము విరుచుకొని నిలబడ్డ అన్నదాతల విగ్రహం.. నిగ్రహం కనపడతది.
మల్లన్నసాగర్, కొండపోచమ్మ పంట చేల మధ్య బుర్ర మీసం మెలేసి, గుప్పుగుప్పున గుంజిడిసిన మోతుబరి సుట్టకమురు.. కాళేశ్వరం నీళ్ల ఘాటెంతో చెప్తది. అక్కడి నుంచి ఎస్సారెస్పీ కాల్వలు, కట్టుగాల్వలు, గొలుసుకట్టు చెరువులు, పల్లెలు, పంట పొలాలను తడిమి చూడు! నీళ్లున్న చెరువులుంటయ్.. చెరువుల్లో చేపలుంటయ్. జపం చేసే కొంగలుంటయ్. వల విసిరే ముదిరాజులుంటరు. గౌండ్లోళ్ల కాటమయ్య పండుగలుంటయ్. బైండ్లోళ్ల కథలుంటయ్. చిందోళ్ల పాటలుంటయ్. కుల వృత్తులోళ్ల కండ్లల్లో ఆనందం ఉంటది. పీర్లు దూలాడుతయ్. సబ్బండ జాతులు దుంకులాడుతయ్.. ఊరుమ్మడి ఉత్సవాలుంటయ్. బతుకమ్మల వైభోగం. దసరా పండుగ ధూమ్ ధామ్. ఓ డబ్బు ఏండ్ల కిందటి తెలంగాణ ముఖచిత్రం మళ్లీ పునర్జీవం పోసుకుని కండ్లకు కనిపిస్తది.
కాళేశ్వరమే లేకుంటే ఈ నీళ్లెక్కడియి? 25 లక్షల ఎకరాల్లో ఈ పచ్చదనం ఎక్కడిది? మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ఆ ధాన్యపు రాశులెక్కడియి? ఈ సాంస్కృతిక పునర్జీవనం ఎక్కడిది? అచ్చోసుకున్న పిట్ట వాలిన చెట్టు పుస్తకాలెక్కడియి? పుట్టి బుద్దేరిగినప్పటి నుంచే కాదు.. ఓ వెయ్యేండ్ల చరిత్ర తోడి చూసుకున్నా! ఇంత ధాన్యం పండిన ఆనవాళ్లు దొరుకుతాయా? అసెంబ్లీలో చర్చ జరగాల్సింది మళ్లీ అదృశ్యపు అంచునున్న ఇటువంటి అపురూప దృశ్యాలపై కదా! పిల్లర్ల కుంగుబాటుపై ఎన్నడైనా విచారణ చేయవచ్చు.. ఎప్పుడైనా విచారం వ్యక్తపరచవచ్చు. కానీ, అదునుదాటితే తిరిగి రాదు. కుంగిన నాలుగు పిల్లర్లు తిరిగి పునరుద్ధరించడానికి మాత్రం ఇదే అదును.
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నదీ ప్రవాహం ఉండదు. ప్రభుత్వానికి కాళేశ్వరాన్ని కొనసాగించే ఉద్దేశమే ఉంటే ఈ మూడు నెలల్లోనే మరమ్మతులు పూర్తి చేయాలి. ఇప్పుడు చర్చ జరగాల్సింది ఈ అంశంపై కదా! పోనీ బాగు చేయటం సాధ్యం కాదనుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఇక ముగిసిన అధ్యాయమని ప్రకటన చేయాలి కదా. ఇవేమీ చేయకుండా విలువైన సమయాన్ని వృథా చేయడాన్ని తెలంగాణ రైతాంగం చూస్తు ఊరుకోదు.
వర్ధెల్లి వెంకటేశ్వర్లు