లోకంలో భాషలన్నిటికి తల్లి భాష అయిన సంస్కృతంలో ఈ అబద్ధం అన్న పదం చాలా చక్కగా వివరింపబడింది. ‘ఋతం సత్యం తన్న భవతీత్యనృతం.’ అంటే ఋతం అనగా సత్యం; అది కానిది అనృతం అనగా అబద్ధం. సత్యం ఎలా పుట్టింది? ‘సత్యు సాధుషు భవం సత్యం’ అంటే సత్యం సత్పురుషయందు పుట్టినది అని అర్థం. ఇక అబద్ధం గురించి తెలుసుకుందాం. ‘అబద్ధం స్యాదనర్థకమ్, న బధ్యతే హృదయమత్రేత్యబద్ధం’ అంటే అబద్ధం చాలా అనర్థాలు కలిగిస్తుంది, ఎవరి హృదయాన్ని గెలుచుకోలేదు.
అంతేకాక మిక్కిలి నిందార్థకం, పలుకడానికి యోగ్యముకానిది, ఉచ్ఛరించకూడనిది. అంతేకాదు, అనృతం పలికేవాడిని ‘దుర్ముఖుడు’ అని వర్ణిస్తుంది అమరకోశం. ఇంకా వివరించాలంటే అబద్ధం ఎప్పుడూ ప్రియవాక్కు కాదు. కఠినమైనా నిజాన్ని, సత్యాన్ని చెప్పేవాడే సత్పరుషుడు అని కూడా వివరించబడింది. ఇప్పుడు మనకు ఈ అబద్ధం పుట్టుపూర్వోత్తరాలతో ఏం పని ఉంది? చాలా ఉంది. రోజంతా అబద్ధాలు వింటున్నారు భారతదేశంలో ప్రజలంతా. ఇవి ఇప్పుడు మొదలవలేదు.
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానమంత్రి పదవికి సూచింపబడిన నరేంద్ర మోదీ ప్రథమ వాగ్దానం విని ప్రజలంతా పొంగిపోయారు. త్రేతాయుగం తిరిగివచ్చిందా అని అనుకున్నారు. కాంగ్రెస్ అవినీతి పాలనలో నల్ల కుబేరులు విదేశీ బ్యాంకులలో దాచుకున్న ధనాన్నంతా ఒక్క ఏడాదిలో రప్పించి ప్రతివారికి 15 లక్షల రూపాయలు పంచి పెడతానన్న వారి వాగ్దానంతో ఆయనలో గొప్ప పాలకులైన శ్రీరాముడు, జనక మహారాజేకాక, గొప్పదాతలైన శిబి, బలి, కర్ణుడు కనపడ్డారు ప్రజలందరికీ. ఇంకేముంది ఓటు వెయ్యకముందే ప్రతి ఓటరూ, ప్రతి కుటుంబరావూ ఆ పదిహేను లక్షలకు ప్రణాళికలు వేసుకున్నారు. ఓటు బీజేపీకి వేసి గాలిలో తేలిపోయారు.
తర్వాత చాలా రాష్ర్టాలలో ఎన్నికలు వచ్చాయి. ఎక్కడ ఎన్నికలైతే అక్కడ మన ప్రధానమంత్రి వాగ్దానాలు గుప్పించారు. రెండింతలు రైతుల ఆదాయం, నిరుద్యోగులంతా ఉద్యోగాల్లో చేరిపోవడం, ప్రతి ఆడపిల్లా బడిలో చదవడం, ప్రతీ ఇంటికీ మరుగుదొడ్డి- ఇక జరగనిదంటూ దేశంలో ఉండదన్న వారి మాటల ప్రవాహంలో కొట్టుకుపోయి రెండవసారి కూడా ఆ పార్టీనే ఎన్నుకున్నారు కేంద్రంలో. అశనిపాతంలా మీదపడిన పెద్దనోట్ల రద్దును కూడా భరించి, ఉద్యోగ ఉపాధులు కోల్పోయినా కిమ్మనలేదు ఈ శాంతమూర్తులు. ఎందుకంటే, 15 లక్షల రూపాయల ఆశ చావలేదు వారిలో! అయితే ఎవరికైనా సత్యాన్ని దాచడం చాలాకాలం కుదరదు. 2016 నవంబర్ 8న రద్దయిన పెద్దనోట్ల వ్యవహారానికి ఆరు నెలల ముందే ముకేశ్ అంబానీ ‘జియో మనీ’ మే నుంచీ మార్కెట్లోకి వచ్చింద న్న సత్యం బయటపడింది. అంతేకాదు 500, 1000 నోట్లరద్దు సరైన పథకం అయితే మరి 2000 రూపాయల నోట్లు ఎవరి కోసం అన్న మథనం మొదలైంది చాలామందిలో. ఆరు నెలల్లో ఆ నోటుకు కూడా నకిలీ నోట్లు వచ్చేసరికి ఆ పథకం ప్రజల కోసం కాదనీ, విజయవంతం అసలు కాలేదనీ బట్టబయలైంది. ఇక దేశంలో కార్పొరేట్ వ్యాపారస్థుల కోసం 2000 నోట్లు ముద్రింపబడ్డాయని తెలిసిపోయింది.
రైతు సంక్షేమం అని ఎన్నికల ముందు ఊదరగొట్టిన ప్రధాని ఏడాదికిపైగా అన్నదాతలను పెట్టిన క్షోభ, వారికి హాని చేసే చట్టాలు చూశాక దేశంలో చాలామందికి మోదీ గారి ప్రసంగాల్లో ఎన్ని అబద్ధాలు దాగి ఉన్నాయో అర్థమైంది. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అన్నది ‘సాబ్ కా వికాస్, సబ్కా సత్యనాశ్’ అని అర్థమైంది. అంతేకాదు, ఒక్క ఏడాదిలో చిన్నా పెద్ద ప్రయణాలు కలిపి వందల సార్లు ప్రధాని విదేశీ పర్యటనలు ఎందుకు చేశారో అర్థమైంది. ఆయన ఎవరిని ఉద్ధరించటానికి పదవి చేపట్టారో తెలియనివారికి విదేశీ సంస్థల పరిశోధనా ఫలితాలతో, వారు వెలిబుచ్చిన రిపోర్టు లతో జ్ఞానోదయమైంది.
ఇక ‘యథా నాయకా, తథా కార్యకర్తా’ అన్నట్టు బీజేపీ తరఫున పోటీ చేసేవారి అబద్ధాలకు, నెరవేర్చని వాగ్దానాలకు ప్రజలు వారిని ఏం చేయాలి? కేంద్రం నిధులతో దుబ్బాక స్వర్గం అయిపోయిందా? రాష్ర్టానికి నిధులు తేవడంలో ఈ నాయకులు సఫలీకృతం అయ్యారా? నిజామాబాద్ పసుపు బోర్డు, హైదరాబాద్ వరదల సహాయం ఏమయ్యాయి? ఈ చిల్లర నాయకులను ఎందుకు భరించాలి ప్రజలు?
నిజానికి లోతుగా పరిశీలిస్తే ప్రధానమంత్రి ప్రతి మాట అబద్ధమని తేలిపోతుంది. మహిళలను ఉద్ధరించడానికి గ్యాస్ సిలిండర్ అని చెప్పి, 410 రూపాయల ధర 1200 రూపాయలు అవ్వడం ఎవ్వరికి లాభం? నిర్భయ కేసు అప్పుడు ఢిల్లీ వీధులలో గోలగోల చేసిన బీజేపీ కార్యకర్తలు, మహిళామణులు దేశంలో పెరిగిన అత్యాచారాలకు సమాధానం చెప్పగలరా? బీజేపీ సంబంధాలు కలిగిన కార్యకర్తలు, నాయకులు అత్యాచారాలే కాక కారు ఎక్కించి రైతులను చంపిన ఆ అమానవీయతకు ఏ శిక్షలు వేస్తున్నారు? అవినీతి వ్యాపారస్థులు, రాజకీయ నాయకులు బీజేపీలో చేరగానే ప్రక్షాళన అయిపోయినట్లు కేసులు మాఫీ అవడం న్యాయమేనా? మతచిచ్చులు పెట్టి ప్రజలను విడదీస్తే మళ్లీ దేశంలో శాంతి నెలకొనే అవకాశం వస్తుందా?
ఇక పార్లమెంట్ సాక్షిగా ప్రధాని, ఆయన మంత్రివర్గ సహచరులు చెప్పే అద్భుతమైన అబద్ధాలకు అంతే లేదు. క్షమాపణ కూడా చెప్పి రైతుల చట్టాలు వెనక్కి తీసుకుంటానన్న మోదీ మాట నెరవేర్చారా? సింగరేణిలో ప్రజలముందు తాము ప్రైవేటీకరణ చేయబోవటం లేదని చెప్పి ఢిల్లీ వెళ్లిన మర్నాడు టెండర్లు పిలిచే ప్రధాని మాటలు ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్మాలి? ప్రజాస్వామ్య విలువల గురించి లెక్చర్లిచ్చి, ఎన్నికైన అభ్యర్థులను కొనే ఈ నాయకుడిని ఎవరైనా ఎందుకు గౌరవించాలి? ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ, విపక్షాల ఉనికి సహించలేని భారతీయ జనతా పార్టీ, అందులోని అధినాయకులు ఏం సాధించదలచుకున్నారు? దేశంలోనే సోదిలో లేని మనిషి ఆకస్మికంగా ప్రపంచ కుబేరుడవటం ఎవరికైనా సాధ్యమేనా? 50 వేలతో వ్యాపారం మొదలుపెట్టిన అమిత్ షా కొడుకు రెండేండ్లలో కోట్ల లాభాలు గడించాడంటే, ఆయన మన యువతకు ఆ విషయంలో శిక్షణ ఇవ్వవచ్చు కదా! అవినీతి అంటే ఒకడి చేతిలోంచి అక్రమంగా డబ్బులు తీసుకోవడమే కాదు, వాడికి లాభాన్ని చేకూర్చి తన అవసరాలు తీర్చుకోవటం కూడా! మరి అదానీకి ప్రధాని సహాయానికి ఆయన ఎందరు రాజకీయ నాయకులని కొని ప్రధానికి కానుకగా ఇచ్చాడో బయటపెట్టగలడా? ఇది అబద్ధపు, అన్యాయమైన, అక్రమమైన జీవన విధానం కాదా? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబునాయుడు, రాజశేఖర రెడ్డి చేసినట్టు ఇది క్విడ్ ప్రో కో విధానం కదా!
ఈ అనైతిక సంబంధాలు, వాటితో ముడిపడి ఉన్న ఆర్థిక లావాదేవీలు కాపాడుకోవటానికి మన దేశ ప్రధానికి ఇంకా ఎన్ని అబద్ధాలు అవసరమౌతాయో! ప్రశ్నించే సామాన్యుల దగ్గర నుంచి న్యాయాన్ని అందించవలసిన అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల దాకా అందరినీ నిందించాల్సిన అవసరం ఏముంది? పాలనలో పారదర్శకత ఉన్నవాడికి నిజాలు చెప్పే ధైర్యం ఉంటుంది.
మరి అదానీ వ్యవహారాలు అక్రమాలో, సక్రమాలో తేల్చవచ్చు కదా! అబద్ధాల పునాదుల మీద నిలిచే పథకాలు, వ్యక్తులు కొంతకాలం వెలిగిపోవచ్చు, కానీ ఎల్లకాలం నిలువలేరు. పైకెగసిన కెరటం కిందికి రావటం ఖాయం! అలాగే అబద్ధపు వాగ్దానాలతో పదవులనధిష్టించేవాళ్ళు, మోసపు చేతలు, కుయుక్తులతో కుబేరులైన వాళ్ళు, ఆ పునాదులు కూలి కిందపడటం ఖాయం. ‘అశ్వత్థామ’ అని పెద్దగా అని ‘కుంజరః’ అని చిన్నగా అన్నందుకే ధర్మరాజు లాంటివాడు ముందుగా నరకానికి వెళ్లవలసి వచ్చింది. అన్నది నిజానికి అబద్ధం కాదు, చేసినది మాత్రం కుయుక్తి. మరి ఏండ్ల తరబడి అదేపని చేసి ఒకదాని మీద ఇంకొక అబద్ధం చెప్పే వారి గతి ఏమవుతుందో కాలమే నిర్ణయిస్తుంది. అదీ ఎక్కువ దూరం లేదనిపిస్తోంది. సత్యానికి, ధర్మానికి ఉన్న శక్తిలో అబద్ధాలు కాలి బూడిదవవలసిందే!
జై తెలంగాణ, జై భారత్!
-ప్రొఫెసర్ కనకదుర్గ దంటు
89772 43484