పండుటాకులపై సర్కారు అదే కక్ష కొనసాగిస్తోంది. చందుర్తి మండలం లింగంపేటలో తమకు కేటాయించిన భూమిని సబ్స్టేషన్కు కేటాయించడంపై చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టేటస్ కో ఉత్వర్వులు జారీ చేసింది. వాటిని సంబంధిత తహసీల్దార్తో పాటు పోలీస్స్టేషన్కు అందించినా ఫలితం లేకుండా పోయింది. అంతే కాకుండా, శనివారం ఏకంగా పోలీసు పహారా, సీసీ కెమెరాల నిఘాలో అధికారులు సబ్ స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగించడం చూస్తే వృద్ధులపై సర్కారు అనుసరిస్తున్న వివక్షపూరిత వైఖరి స్పష్టమవుతోంది. అయితే, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను కూడా ధిక్కరించి పనులు చేపట్టడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : వృద్ధుల నీడపై రాష్ట్ర ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోంది. చందుర్తి మండలం లింగంపేట గ్రామంలోని సర్వే నంబర్ 216లో వృద్ధుల సంక్షేమం కోసం చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘానికి గత ప్రభుత్వం ఐదెకరాల భూమి కేటాయించగా, అందులోని 0.20 గుంటలను ప్రస్తుత ప్రభుత్వం 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం విద్యుత్ శాఖకు కేటాయించిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ చార్వాక సంఘం తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ విచారణ చేపట్టారు.
సంఘం తరపు న్యాయవాది వాదిస్తూ, సర్వే నంబర్ 216లోని భూమిని గతంలో సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం కేటాయించారని, పట్టా సర్టిఫికెట్ కొనసాగుతున్నప్పటికీ సంఘానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 0.20 గుంటల భూమిని 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా ఈ చర్యలు చేపట్టారని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు, సర్వే నంబర్ 216లో వాస్తవంగా అందుబాటులో ఉన్న మొత్తం భూమి ఎంత, సంస్థ క్లెయిమ్ చేస్తున్న భూమి పరిస్థితి ఏమిటి? అనే అంశాలను స్పష్టంగా నిర్ధారించాల్సిన అవసరం ఉందని పేరొంది.
ఈ విషయాలపై అధికారిక ప్రతివాదులు వివరణాత్మక కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 8న చేపట్టనున్నట్లు, అప్పటి వరకు సర్వే నంబర్ 216 భూమికి సంబంధించి యథాస్థితిని కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీఎస్ఎన్పీడీసీఎల్కు సంబంధించిన సబ్ స్టేషన్ నిర్మాణ భూమిలో ప్రస్తుత పరిస్థితికి ఎలాంటి మార్పులు చేయకుండా, తదుపరి చర్యలు చేపట్టకుండా స్టేటస్ కో కొనసాగనుంది. కాగా, ఆ ఉత్తర్వులను సంబంధిత తహసీల్దార్తోపాటు పోలీస్ స్టేషన్కు అందించారు. అయితే, వాటిని కాదని తిరిగి శనివారం సబ్ స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగించారు. న్యాయస్థానం ఉత్తర్వులను కూడా ధిక్కరించి అధికారులు పనులు చేయడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది.
తహసీల్దార్ ఇచ్చిన మెమోనే రికార్డులో లేదట!
చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘానికి గత ప్రభుత్వం కేటాయించిన భూమిలో నుంచి కొంత సబ్స్టేషన్కు కేటాయించడంపై కొన్ని రోజుల కిందట ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు వృద్ధులపై అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యలపై ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ సంచికలో ఈ నెల 14న ‘వృద్ధుల నీడపై పంజా’ శీర్షికన కథనాన్ని ప్రచురించగా, దీనిపై చందుర్తి ఆర్ఐ అదే రోజు వివరణ ఇచ్చారు. అయితే, సాక్షాత్తు తహసీల్దార్ ఇచ్చిన మోమోనే రికార్డుల్లో లేదని ఆర్ఐ తన వివరణలో చెప్పడం హాస్యాస్పదంగా మారింది.
కోర్టు ఆర్డర్ లెక చేయని అధికారులు
ఎన్పీడీసీఎల్ అధికారులు కోర్టు ఉత్తర్వులను లెక్క చేయలేదు. హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ను పక్కకు పెట్టి శనివారం పనులు చేశారు. ఇప్పటికైనా న్యాయస్థానాలను గౌరవించి పనులు నిలిపివేయాలి. స్టేటస్ కో ఆర్డర్ రాగానే తహసీల్దార్, పోలీసులు, సంబంధిత అధికారులకు శుక్రవారం సమాచారం ఇచ్చాం. అయినప్పటికీ పనులు చేపట్టారు. సంబంధిత ఆధారాలు, ఫొటోలు మేం సేకరించాం. శనివారం వీరు పనిచేస్తున్న ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. వాళ్లు పెట్టుకున్న సీసీ కెమెరాల్లోనూ రికార్డయ్యాయి. ఇప్పటికైనా వృద్ధుల నీడను వదిలేయాలి. మా న్యాయ పోరాటానికి సహకరించాలి.
– దప్పుల అశోక్, చార్వాక వృద్ధుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు