దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. 140 కోట్ల మంది భారతీయులు ఆకలితో అలమటించే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జాతీయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని చూస్తే ఈ భయాలు కలగకమానదు. గోధుమలు, బాస్మతీ, చక్కెర, పారా బాయిల్డ్ బియ్యం ఎగుమతులపై మోదీ సర్కార్ ఆంక్షలు విధించడం ఈ భయానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నది.
India | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవ్యవస్థ 7.6 శాతం వృద్ధి రేటును కనబరిచింది. అయితే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 1.2 శాతం మాత్రమే నమోదవడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వ్యవసాయ రంగం వాటా 3.5 శాతంగా ఉండటం గమనార్హం. దీన్ని బట్టే చెప్పవచ్చు దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని. భారతీయులు ఆహార సంక్షోభం అంచున ఉన్నారనడానికి ఇదే నిదర్శనంగా నిలుస్తున్నది.
వాతావరణ మార్పుల కారణంగా దేశవ్యాప్తంగా ఈ ఏడాది పంటల సాగు లక్ష్యానికి అనుగుణంగా సాగలేదు. ఎల్నినో ప్రభావంతో మొదటి నుంచి వర్షాలు ముఖం చాటేయడం దెబ్బతీసింది. గడిచిన ఖరీఫ్ సీజన్లో చాలా తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. నైరుతీ రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో జూన్, జూలైలో వానలు కురవకపోగా.. ఆగస్టులో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం బిజర్పాయ్ తుపాను పశ్చిమ భారత్లో సాగైన పంటలను తుడిచిపెట్టుకుపోయింది. భారత్లో 4 శాతం వరి సాగు తగ్గిందని అమెరికా వ్యవసాయ విభాగం అంచనా వేయగా.. దీన్ని భారత వ్యవసాయ శాఖ కూడా ధ్రువీకరించింది. మరోవైపు ఖరీఫ్ సీజన్లో వరి ఉత్పత్తిలో 3.7 శాతం క్షీణత కనిపించడం శోచనీయం.
దేశంలో పంట దిగుబడులు తగ్గుముఖం పట్టడంతో ఆహార నిల్వలు ఆరేండ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. ఈ విషయం మరింత ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో నెలకొన్న ఆహార సంక్షోభ పరిస్థితులను అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం గోధుమలు, చక్కెర, బాస్మతీ బియ్యం తదితర ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. పారా బాయిల్డ్ బియ్యంపై కూడా ఆంక్షలు విధించిందంటేనే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మన దేశంలో సుమారు 40 శాతం మంది వ్యవసాయ సంబంధిత రంగాల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా గ్రామీణ భారతం ఉపాధికి దూరమైంది. రానున్న రోజుల్లో అయినా పరిస్థితులు చక్కబడతాయా అంటే కచ్చితంగా చెప్పలేం. రుతుపవనాలు, జాతీయ నీటి నిల్వల డాటాలతో జీడీపీలో వ్యవసాయ రంగం వాటాను పోల్చి చూస్తే ఈ విషయం అవగతం అవుతున్నది. అయితే ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం గోప్యంగా ఉంచడం పరిస్థితిని మరింత ప్రమాదంలోకి నెట్టివేస్తున్నది.
ఇప్పటికే దేశంలో ఆహార ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటాయి. ఇటీవల విడుదలైన క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ రీసెర్చ్ విస్తుపోయే వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చింది. పేద, మధ్య తరగతి కుటుంబాలు భోజనం చేయాలంటే జంకే పరిస్థితులు ఉన్నట్టు ఆ సంస్థ వెల్లడించడం గమనార్హం. నవంబర్ నెలలో శాఖాహార భోజనం ధరలు 10 శాతం మేరకు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. అదే సమయంలో మాంసాహార భోజనం ధరలు 5 శాతం పెరిగాయి. ఈ లెక్కన ఒక నెలలో శాఖాహార భోజనంపై రూ.840 అదనపు భారం పడుతున్నది. అదే సమయంలో మాంసాహార భోజనంపై రూ.900 అదనంగా వెచ్చించాల్సి రావడం మోయలేని భారంగా మారుతున్నది.
ఆకాశాన్నంటుతున్న ధరల కారణంగా మన దేశంలో ఆకలితో అలమటించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఆకలి అనేదే లేకుండా చేస్తున్నామని, పేదలు లేని భారత్ను చూడబోతున్నామని మోదీ సర్కార్ ఊదరగొడుతున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తాజాగా బయటికొచ్చిన బీహార్ కుల గణనను పరికిస్తే విస్తుపోయే విషయాలు తెలుస్తాయి. బీహార్లోని 34.1 శాతం కుటుంబాల ఒక నెల ఆదాయం రూ.6000 కంటే తక్కువ కావడం గమనార్హం. ఈ ఆరు వేల రూపాయలతోనే ఒక కుటుంబం నెల మొత్తం బతుకీడ్చాల్సి రావడం అక్కడి దుర్భర పరిస్థితులను కండ్లకు కడుతున్నాయి. అయితే ఈ వాస్తవాలను విస్మరిస్తూ పేదరికం తగ్గుముఖం పట్టిందని కల్లబొల్లి కబుర్లు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం బీహార్ కూడా మన దేశంలో అంతర్భాగమేనన్న విషయాన్ని తెలుసుకుంటే మంచిది.
– ఎడిటోరియల్ డెస్క్