గతంలో పరిపాలించిన పార్టీలు ముస్లింలను కేవలం ఓటుబ్యాంక్ గానే చూశాయి. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా మైనారిటీల బతుకులు మారలేదు. వెలుగులు కానరాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతికి అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నది. షాదీముబారక్, మైనారిటీ గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, ఇమామ్, మౌజన్కు గౌరవవేతనం, హజ్ యాత్రికులకు ఏర్పాట్లు, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణలాంటి అనేక కార్యక్రమాలు మైనారిటీల ప్రగతికి మైలురాయిగా నిలుస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చినవేగాక ఇవ్వని హామీలు సైతం అమలు చేస్తూ మైనారిటీ జీవితాల్లో వెలుగు నింపుతున్నది. దీంతో ఆ వర్గం నిండు మనసుతో జేజేలు పలుకుతున్నది.
పేదింటి ముస్లిం ఆడపిల్ల పెండ్లికి షాదీ
ముబారక్ ద్వారా రూ.లక్షా 116 సాయాన్ని అందజేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. 2022 డిసెంబర్ నాటికి 2 లక్షల 32వేల 713 మంది పెళ్లిండ్లకు రూ.1903 కోట్లు ఖర్చు చేసింది. 2023-24 బడ్జెట్ లో రూ.150 కోట్లు అదనంగా కేటాయించింది. ఒంటరి ముస్లిం మహిళలకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు మెయింటనెన్స్ అలవెన్సు ఇచ్చేందుకు నిర్ణయించి, లబ్ధిదారులను గుర్తించింది.
రంజాన్ తోఫా
ఏటా రంజాన్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నది. రంజాన్ తోఫాతో పాటు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తూ లౌకిక స్ఫూర్తిని చాటుతున్నది. ఈ ఏడాది 815 మసీదు మేనేజింగ్ కమిటీలకు, ఒక్కో కమిటీకి 500 చొప్పున గిఫ్ట్ ప్యాకెట్లను ఇప్పటికే ప్రభుత్వం సరఫరా చేసింది. మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజన్కు దేశంలో మరెక్కడా లేని విధంగా నెలకు రూ.5 వేలు అందిస్తున్నది.
2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం రూ.8,581 కోట్లను ఖర్చు చేసి ముస్లిం మైనారిటీల అభ్యున్నతి పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నది.
టీఎస్ ప్రైమ్
మైనారిటీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టీఎస్ ప్రైమ్ను తీసుకొచ్చింది. వారికి రాయితీలిస్తూ, ప్రోత్సాహకాలు కల్పిస్తున్నది. ముస్లిం అనాథలకోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో 39 కోట్లతో అనీస్ ఉల్ గుర్భా భవనాన్ని నిర్మించింది. మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం అందించే రుణాల సబ్సిడీని 50 శాతం నుంచి 80 శాతానికి పెంచి పథకం గరిష్ఠ విలువను రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. న్యాక్, ఈసీఐఎల్, సీఐపీఈటీ, సెట్విన్ లాంటి సంస్థల ద్వారా మైనారిటీ యువత నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ ఇస్తున్నది. దీంతో మైనారిటీ యువకులు వివిధ నిర్మాణ, పారిశ్రామిక రంగాల్లో రాణించడానికి అవకాశం కలుగుతున్నది.
హజ్ యాత్ర
హజ్ యాత్రికులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతున్నది. యాత్రికులకు ప్రయాణ ఏర్పాట్లు, యోగక్షేమాలను చూసేందుకు ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ ఏడాది నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ముస్లింల పవిత్ర దర్గా రాజస్థాన్ లోని అజ్మీర్ వద్ద తెలంగాణ నుంచి సందర్శనకు వెళ్లిన భక్తుల సౌకర్యార్థం రుబాత్ (విశ్రాంతి భవనం) నిర్మించేందుకు రూ. 5 కోట్లు కేటాయించింది.
ఉర్దూలో నీట్
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ను ఉర్దూ భాషలో కూడా నిర్వహించాలని 2017లో ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. 2019 విద్యా సంవత్సరం నుంచి నీట్ పరీక్షను ఉర్దూలోనూ నిర్వహించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. నీట్ను ఉర్దూలో నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చొరవ తీసుకున్నది.
గురుకులాలు, కాలేజీలు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనారిటీల కోసం ప్రత్యేకంగా 206 గురుకులాలు ఏర్పాటు చేసింది. నిరుపేద మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద ఒక్కో మైనారిటీ విద్యార్థికి రూ.20 లక్షలకు పైగా ఇస్తున్నది. 2022 డిసెంబర్ నాటికి 2,701 మంది విద్యార్థులకు రూ.435 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. విద్య, ఉపాధి, శిక్షణ లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా 52 షాదీఖానా కమ్ ఉర్దూ ఘర్లను ప్రభుత్వం నిర్మించింది. హైదరాబాద్ జామియా నిజామియా యూనివర్సిటీ అభివృద్ధికి రూ.14.65 కోట్లు, ఫలక్నుమా జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజీగా అప్గ్రేడ్ చేసేందుకు రూ.10 కోట్లు కేటాయించింది.
మైనారిటీ కమిషన్
మైనారిటీ వర్గాల సామాజిక, ఆర్థిక జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి, వారి అభివృద్ధికి సిఫారసులు చేసేందుకు 2015న ప్రభుత్వం మైనారిటీ కమిషన్ను నియమించింది.ఈ కమిషన్ ముస్లిం రిజర్వేషన్లను9-12 శాతానికి పెంచాలని సిఫారసు చేసింది. అలాగే, మైనారిటీల కోసం ప్రత్యేకంగా కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2018 జనవరి 3న ఉత్తర్వులు జారీ చేసింది.
ఓన్ యువర్ ఆటో
మైనారిటీ యువత ఉపాధి కోసం ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఓన్ యువర్ ఆటో అనే వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. డ్రైవర్లుగా పని చేస్తున్న వారిని వాహన ఓనర్లుగా మార్చడం ఈ పథకం ఉద్దేశం. యువతకు 50 శాతం సబ్సిడీపై ఆటోలు అందజేసింది. తెలంగాణ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎఫ్సీ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వాహనాలు అందించింది. గతంలో చిన్నచిన్న వాహనాలను 30 శాతం సబ్సిడీతో అందిస్తే, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి వాహనాలనైనా 60 శాతం సబ్సిడీతో ఇస్తున్నది.
వక్ఫ్ బోర్డు ఏర్పాటు
తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డును 2015లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బోర్డు బలోపేతానికి 2016-17 బడ్జెట్లో రూ.65కోట్లను కేటాయించింది. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయిలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ సమన్వయ కమిటీలను వేసింది. హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇస్లామిక్ సెంటర్ కమ్ కన్వెన్షన్ హాల్ను రూ.40 కోట్లతో నిర్మించింది.
ఉర్దూ భాష పరిరక్షణ, అభివృద్ధి, వికాసం కోసం పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నది. మౌలిక సదుపాయాల అవసరాలు గల ఉర్దూ మీడియం పాఠశాలలకు సహాయం చేయడానికి పథకాలను అమలు చేసింది. ఉర్దూ ఘర్ కం షాదీఖానాల నిర్మాణంతో పాటు ఉర్దూ వార్తా పత్రికలు, జర్నలిస్టులు, పాఠశాలలను ప్రోత్సహిస్తున్నది. ఉర్దూ అకాడమీకి రూ.40 కోట్లు కేటాయించింది. ఆయా రంగాల్లో ప్రతిభ చాటుతున్న మైనార్టీ బిడ్డలకు వివిధ పురస్కారాలు, అవార్డులతోపాటు ఆర్థిక సా యం అందిస్తున్నది. ఈ విధంగా కేసీఆర్ ప్రభు త్వం మైనార్టీలను గుండెల్లో దాచుకొని పరిపాలన సాగిస్తున్నది. ఇది దేశానికే ఆదర్శం.
– షేక్ ఫరీద్
96660 52221