హుస్సేన్సాగర్ తీరం నిన్నటి వరకు హైదరాబాద్లో ఒక పర్యాటక ప్రాంతం. కాంక్రీట్ వనంలో.. ఒంటరిగా.. పరుగుల మయంగా.. గజిబిజిగా సాగే నగరవాసుల జీవితాలకు ఆదివారపు సాయంత్రాల్లో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్న విహార స్థలం. మృదువుగా తనువును తడిమే గాలి తరంగాలు. చిన్నారుల ఆటలు, కేరింతలు. చెట్లనీడన.. గడ్డిపనుపులపై సేదతీరే హైదరాబాదీలు. వృద్ధుల కాలక్షేపపు ముచ్చట్లు. ప్రేమ పావురాలు ఊసులాడుకునే గుసగుసలు. ఫొటోలకు పోజులు పెట్టే యువతీ యువకులు. తారుపై రయ్యిన పరుగులు తీసే వాహనాలు. ఈ హుస్సేన్ సాగరం ఇప్పుడు కొత్త రూపు కట్టింది. మాటల్లో చెప్పలేని ఉత్సాహాన్నేదో ఒంటిలోకి ఒంపుతుంది. అక్కడ కాలుమోపిన తనువు లిప్తకాలమైనా రోమాంఛితమవుతుంది. ఎక్కడో మనసు పుటల్లో అట్టడుగున పదిలంగా ఉన్న జ్ఞాపకాలను తట్టిలేపుతుంది. ఉద్విగ్నత ఏదో ఆవహిస్తుంది.
హుస్సేన్ సాగరాన్ని ఆనుకుని దక్షిణ భారత సంప్రదాయంలో, దక్కన్ కాకతీయుల శైలిలో నిర్మితమైన తెలంగాణ నూతన సమీకృత సచివాలయం. తెలంగాణ సాంస్కృతిక వైభవం. ఈ నేల వేల ఏండ్ల చరిత్రకు, నిష్కల్మషమైన నెనరుకు దర్పణం. వలస సంకెళ్లను తెంచుకుని, దశాబ్దాల జీవన సంఘర్షణల్లోంచి మోసులెత్తి, మొగ్గతొడిగి నేడు నలుచెరుగులా శాఖోపశాఖలుగా సగర్వంగా.. శరవేగంగా నిత్యనూతనంగా విస్తరిస్తున్న తెలంగాణ ఖ్యాతికి.. సాధిస్తున్న ప్రగతికి ప్రతిబింబం ఆ కొత్త సచివాలయం. దానికి ఎదురుగా అఖండ అమరజ్యోతి. తెలంగాణ విముక్తి కోసం 60 ఏండ్లు సాగిన పోరాటంలో ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన వీరుల స్మృతి చిహ్నం. పోరాటస్ఫూర్తికి నిలువుటద్దం. త్యాగాలకు ప్రతిరూపం. సచివాలయానికి మరోపక్క గగనతలం దాకా విస్తరించిన అంబేద్కరుడి విగ్రహం. హక్కుల మూర్తిత్వం. కర్మభూమి కడుపు చీల్చుకుని పురుడు పోసుకున్న విప్లవం. కారుచీకటిగా మారిన బహుజన బతుకుల్లో మెరిసిన క్రాంతిరేఖ. ఆ మూడూ నిర్మాణంలో వేటికవి భిన్నమైనవే కావచ్చు. కానీ వాటి ఆర్తి ఒక్కటే. సాధించాలని నిర్దేశించుకున్న ఆశయాలు ఒక్కటే.
హుస్సేన్ సాగర్ ఇప్పుడొక చైత్యభూమి. స్వరాష్ట్రం తెలంగాణ చాటుతున్న స్ఫూర్తికి.. ఆచరిస్తున్న విలువలకు, అనుసరిస్తున్న మార్గానికి ప్రతీక. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి సార్వజనీన భావాల సంకేత స్థలం. పురోగమన భావాల ప్రసార మాధ్యమం. గతాన్ని తడిమి చూసుకునే జ్ఞాపకం. వర్తమానాన్ని విశ్లేషించుకునే చర్చా వేదిక. భవిష్యత్ నిర్మాణ కేంద్రం. ప్రగతి సంకల్ప దీక్షకు ఆలవాలం. ఆత్మగౌరవ పతాకం. అమరుల త్యాగాలను తలుచుకుంటూ నిత్య నివాళులు, నీరాజనాలు పలికే వేదిక. ఇప్పుడదొక తెలంగాణ మర్సియా. నోస్టాల్జియా.
దశాబ్దాలుగా కాంగ్రెస్ అనుసరించిన కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలు.. అవినీతిమయ రాజకీయాలు.. ఫలితంగా పెరిగిపోయిన నిరుద్యోగం, పేదరికం వంటి వాటితో భారత ప్రజానీకంలో అలుముకున్న అశాంతిని ఆసరా చేసుకుని అభివృద్ధి ఎజెండాను ఎర చూపి 2014లో అధికారం చేపట్టింది బీజేపీ. ఇప్పుడు మోదీపై ఆ భ్రమలు తొలగిపోయాయి. జాతీయవాదం పేరిట, హిందూత్వ సిద్ధాంతాన్ని ముందుకు తెస్తూ తన రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు దశాబ్దాలుగా కాపాడుకున్న ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నది బీజేపీ. ఈ సంక్లిష్ట సమయంలో అంబేద్కర్ మహావిగ్రహ స్థాపనకు సీఎం కేసీఆర్ పూనుకోవడం చరిత్రాత్మకం. తిరిగి భారత జాతిని, ప్రజాస్వామ్య విలువలవైపు జాగృతం చేసేందుకు దోహదపడే అంశం ఇది. భావి తెలంగాణ పాలకులకు, ఎదిగివచ్చే తెలంగాణ తరాలకు ఎల్లవేళలా స్ఫూర్తి నింపేలా అద్భుత స్మారకాలను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు వేనవేల శెనార్థులు.
మ్యాకం రవికుమార్
91827 77621