సీఎంకు హరీశ్ బహిరంగ లేఖ
గౌరవ శ్రీ ఎనుముల రేవంత్రెడ్డి గారికి,
ముఖ్యమంత్రి,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,
హైదరాబాద్
విషయం: బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతు లకు తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేయడం గురించి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే రూ.2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా మళ్లీ బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షల రుణాలు తీసుకోవాలని మీరే స్వయంగా పిలుపునిచ్చారు. మీ మాటలు నమ్మి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారు. మీరు ప్రకటించినట్టుగా డిసెంబర్ 9 నాడు రుణమాఫీ జరుగలేదు. మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 4 నెల లు కావస్తున్నది. అయినప్పటికీ ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి రుణమాఫీ కాలేదు.
బ్యాంకులు మాత్రం రైతులకు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నాయి. ప్రభుత్వ హామీతో తమకు సంబంధం లేదని, తీసుకున్న రుణాలకు వడ్డీతో సహా కిస్తీలు చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెద క్ జిల్లాలో వందలాది మంది రైతులకు బ్యాంకు నోటీసులు అందాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నా రు. తీసుకున్న రుణాలకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రైతులపై పెను ఆర్థికభారం పడుతున్నది. బ్యాంకులు రైతులను డిఫాల్టర్ల జాబితాలోకి ఎక్కిస్తున్నాయి. సిబిల్ రేటింగ్ కూడా దారుణంగా పడిపోతున్నది. రైతుల పిల్లలు చదువు కోసం విద్య రుణాలతో పాటు ఇతర రుణాలు పొందలేకపోతున్నారు. ఈ సమస్యలతో రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
కేసీఆర్ నాయకత్వంలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రూ.లక్ష చొప్పున.. రెండు పర్యాయాలు కలిపి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. కేసీఆర్ హయాంలో ఏ ఒక్క బ్యాం కు కూడా రుణాలు చెల్లించాలని ఎప్పుడూ రైతులపై ఒత్తిడి తీసుకురాలేదు. రూ.లక్ష వరకు రైతుల రుణాలను మేమే కడుతామని బ్యాంకర్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు హామీ ఇచ్చింది. దాని ప్రకారమే ప్రభుత్వ ఖజానా నుంచి బ్యాంకులకు చెల్లింపులు చేసిం ది. ఫలితంగా లక్షలాది మంది రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణమాఫీ పొందగలిగారు. కానీ, రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విధానమూ ప్రకటించకపోవడం, ఈ బడ్జెట్లో రుణమాఫీ ప్రస్తావన లేకపోవడం వల్ల రాష్ట్రంలో గందరగోళ పరిస్థి తి నెలకొన్నది. రుణమాఫీపై ప్రభుత్వం నేటివరకు అటు బ్యాంకర్లకు గానీ, ఇటు రైతులకు గానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రుణాలు మేమే చెల్లిస్తామని, రైతులపై ఒత్తిడి తేవద్దని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించలేదు. ఎవరైనా రైతులు వడ్డీ భారం పడకుండా ఉండేందు కు రుణాలు ముందుగానే చెల్లిస్తే వారికి ప్రభుత్వం తిరిగి నగదు ఇస్తుందా? లేదా? అనే విషయంపైనా స్పష్టత లేదు. గ్రామాల్లో రైతులకు, బ్యాంకర్లకు మధ్య ఈ అనిశ్చితి చిచ్చు పెడుతున్నది. స్థానిక బ్యాంకు మేనేజర్లకు వారి ఉన్నతాధికారుల నుంచి లోన్ రికవరీ కోసం నోటీసులు వస్తున్నాయి. దీంతో వారు రైతుల మీద పడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ హామీని కూడా అమలుచేయకపోవడం వల్ల వారు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్తు అందక, పంటలు ఎండిపోయి, సకాలంలో నీళ్లు అందక ఈ నాలుగు నెలల కాలంలో 209 మంది రైతన్నలు చనిపోయారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల ఒత్తిళ్లకు, వేధింపులకు తట్టుకోలేక రైతులు ప్రాణం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
రుణమాఫీ విషయంలో మీరు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను. రూ.2 లక్షల వరకు రుణమాఫీని ఎప్పటిలోగా చేస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలని రైతుల పక్షాన కోరుతున్నాను. రైతుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు హామీ పత్రం రాసివ్వాలని విన్నవించుకుంటున్నాను. దేశానికి అన్నం పెట్టే రైతుకు భరో సా ఇవ్వడం ప్రభుత్వ కనీస బాధ్యత.
తెలంగాణ వ్యవసాయిక రాష్ట్రం. వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు 70 శాతం వరకు ఉంటాయి. అత్యధిక సంఖ్యలో ఉన్న రైతులను గోస పెట్టడం ఏ మాత్రం సమ్మతం కాదు. ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదన్న పెద్దల మాటను నేను మీకు గుర్తుచేయాల్సిన అవసరం లేదు. రైతుల బాధలు, కష్టాలు, కన్నీళ్లు తొలగించేవిధంగా.. మీరిచ్చిన హామీలన్నిటినీ తక్షణ మే అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నాను. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు, పంట మద్దతు ధరపై రూ.500 బోనస్, ఎకరాని కి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం, పంట పొలాలకు నీళ్లు, 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించాలని డిమాండ్ చేస్తున్నాను.
తన్నీరు హరీశ్రావు
సిద్దిపేట శాసనసభ్యులు