అది మార్గశిర మాసం. మాగి పొద్దు. సంక లేపితే చలి ఈడ్సితంతోంది. ముసుగుతన్ని సోయి లేకుండా నిద్రపోతున్న. సెల్ఫోన్ అదే పనిగా మోగుతోంది. ఆగి.. ఆగి.. మళ్లీ రింగ్ అవుతోంది. నిద్రమత్తులోనే ఫోన్ తీసిన. అవతలి నుంచి బాబూ.. అంటూ ఓ స్వరం. ‘ఊ..! చెప్పు’ అని అన్న. ‘దుబ్బాక కొట్టె రామచంద్రంను మాట్లాడుతున్న’ అని అన్నడు అవతలి వ్యక్తి. ఆ గొంతు వణకుతున్నది. పైగా పక్కన ఏడ్పులు వినిపిస్తున్నయి.
రామచంద్రానికి, నాకు పెద్దగా పరిచయం లేదు. కానీ, ఆయన కొడుకు రాజు, కోడలు ఇందిరా సుపరిచితమే. ఆలోచనల నుంచి తేరుకొని ‘ఏమైందే బాపు?’ అని అడిగిన. ‘కాశీకి పోతుంటే మా బస్సు లోయల పడ్డది’ అని రామచంద్రం చెప్పిండు. ‘ఎక్కడా?’ అని అడిగిన ఆందోళనగా. ‘ఏమో! అందరం నిద్రల ఉన్నం. బస్సు బోల్తాపడ్డది’ అని అవతలి నుంచి సమాధానం. ‘బస్సుల జనాలకు ఎట్లుంది’ అని అడిగిన. ‘ఏమో! సిమ్మ సీకటి. ఎవలు బతికిండ్రో? ఎవరు సచ్చిండ్రో? తెలుస్తలేదు’ అని ఆయన కలత పడ్డడు.
అంతకుమించి ఆయన మాట్లాడే పరిస్థితి లేదు. నాగపూర్లో దిగి చాయ్ తాగినట్టు మాటల్లో చెప్పిండు. సమయం చూస్తే అర్ధరాత్రి ఒంటి గంట. ఇంత రాత్రి వేళ వాళ్లకు నేనేం సాయం చేయగలను, ఇందిరకు ఫోన్ చేసి చెప్దామా? వద్దా? అనే ఆలోచనలో పడ్డా. ఎక్కడో ఘటన జరిగింది, వాళ్లు మాత్రం ఏం చేయగలరు, అనవసరంగా వాళ్లను భయపెట్టడమేనని.. తలపోస్తున్న సమయంలో అప్పటి మంత్రి హరీశ్రావు మతిల పడ్డడు. వెంటనే ఆయనకు ఫోన్ చేసిన. ఎత్తిండు. విషయం చెప్పిన. ‘సరే! ఫోన్ మాట్లాడుతున్నడుగా, నాకు నెంబర్ ఇవ్వు’ అని హరీశన్న అడిగిండు. నెంబర్ ఇచ్చి నిద్రలోకి జారుకున్న. మళ్లీ ఫోన్ రింగ్ అయింది. ఈసారి హరీశన్న నుంచి ఫోన్. ‘అన్నా..’ అని చెప్పిన. ‘దేవుని దయ వల్ల అందరూ సేఫ్. నాగపూర్ ఎంపీతో, కలెక్టర్తో మాట్లాడిన. అందరినీ దవాఖానకు తరలించారు. ఇక పొద్దున చూసుకుందాం’ అని చెప్పి ఫోన్ పెట్టేశారు. అప్పుడు సమయం చూస్తే తెల్లవారుజాము 4 గంటలు అవుతోంది.
అంటే, ఈ నాలుగు గంటలు ఆయన నిద్రపోలేదన్నమాట. నాగపూర్ జిల్లా సరిహద్దు గ్రామం రంజోలి వద్ద ప్రమాదం జరిగిందట. ఆ రాత్రి నాగపూర్ నుంచి రంజోలి వరకు ఉన్న పోలీసు స్టేషన్లు, అధికారులను ఏకం చేసిండు హరీశన్న. సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్ జిల్లాల టూరిస్టులు బస్సులో ఉన్నరు. ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లను నిద్రలేపిండు. ఘటనాస్థలాన్ని గుర్తించి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే వరకు ఆయన పరిశ్రమ ఆగలేదన్నమాట. ఈ ఘటన 2018 నవంబర్ 13న జరిగింది. అప్పుడు నేను ఓ పత్రికలో సిద్దిపేట జిల్లా బ్యూరో చీఫ్గా పని చేస్తున్న.
ఏ ఎండకు ఆ గొడుగులు పట్టే నాయకులు వస్తుంటరు.. పోతుంటరు. జెండా పట్టే కార్యకర్తే స్థిరం. కార్యకర్తకు ప్రమోషన్ ఇస్తే, అతని చేతికి అధికారం వస్తే, హరీశ్రావు తీరు నిలబడుతరు. నిత్యం జనం మధ్యనే ఉంటరు. ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేస్తరు. ఆరాట పడుతరు. అప్పుడు కారుకు బ్రేకెక్కడిది? గులాబీ రంగుకు మరకెక్కడిది?
హరీశ్రావు ఓ సాధారణ కార్యకర్త. బాటా చెప్పులేసుకొని తెలంగాణ ఉద్యమానికి బాటలు దిద్దిన అసలు సిసలు కార్యకర్త. ఉద్యమంలో ఆకలిగొన్న సహచరులకు ఛాయో.. నీళ్లో ఇచ్చి కాపాడుకున్న కార్యకర్త. అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తే తు.చ. తప్పని కార్యకర్త. ముందుచూపుతో కేసీఆర్ తీర్చిదిద్దిన కార్యకర్త. జనం కోసం, జనం మధ్య నిలబడిన కార్యకర్త ఆయన. 2004లో కేసీఆర్ 45,118 ఓట్ల మెజారిటీతో సిద్దిపేటలో గెలిచి అప్పటి టీఆర్ఎస్ కార్యకర్త హరీశ్రావుకు అప్పగిస్తే.. ఇవాళ ఆయన దాన్ని 1,20,650 ఓట్ల భారీ మెజారిటీకి తీసుకుపోయారు. నాయకునికి తన రాజ్యం మీద ప్రేమ ఉండాలే. ప్రజల మీద పాణం తీరు పావురం ఉండాలే. పూటపూట పలవరించాలి.. కలవరించాలి. అట్లా ఉంది కాబట్టే కాళేశ్వరం నిలబడ్డది. కాల్వలకు నీళ్లు మళ్లీనయి. చెరువులు నిండినయి.. తరిమల్లు పారినయి. ఎండిన తెలంగాణ నిండుకుండగా తొణికిసలాడింది. ఆత్మహత్యలు లేని తెలంగాణగా అవతరించింది. అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసిన అపురూప శిల్పి కేసీఆర్.
అట్లా పచ్చబడ్డ తెలంగాణలోకి భ్రమింపజేసే ప్రణాళికలు చొప్పించారు. ప్రజలను భ్రాంతిలోకి నెట్టారు. పాలిచ్చే పాడి బర్రె అనే భ్రమతో ఓటేస్తే అది ఎగిరి తన్నే దున్న అయింది. వంద రోజుల్లోనే దాని విశ్వరూపం చూపిస్తున్నది. కండ్ల ముందే నీళ్లు మాయమైనయి. కరెంటు పోయింది. పంటపొలం సక్కదనమే మారిపోతున్నది. ఇది చాలదు అన్నట్టు ఇప్పుడిక అసూయపరులంతా ఏకమవుతున్నరు. ఒక్క గొడుగు కిందికి మూగుతున్నరు. గద్దల్లా వాలుతున్నరు. రాష్ట్రంలో చిచ్చు పెట్టడానికి సిద్ధమవుతున్నరు. బాగుపడ్డ తెలంగాణ ఈనగాసి నక్కల పాలయింది. ఇంకా ఆగం వద్దు. మనోడు మనకుండాలే. కష్టమొస్తే కండ్లళ్ల పెట్టుకునే నాయకుడు కాదు.. గుండెల్ల పెట్టుకునే హరీశ్ తీరు నాయకత్వం కావాలి. కేసీఆర్ తీరు దార్శనికత ఉన్న మహర్షి కావాలే. ఇప్పుడంతా జాతర సీజన్. జాతర్ల శివాలూగినట్టు.. ఓ నెల, రెండు నెలలు అన్ని పార్టీలూ శివాలు తూలుతాయి. అటెన్క మళ్లీ ఐదేండ్లదాకా.. ఎవర్రారు. లేని భ్రమకు పోయి ఇప్పటి వరకు గోస పడ్డది చాలు.
ప్రతి ఓటరు విజ్ఞతతో ఆలోచన చేయాల్సిన సమయమిది. మాయ, మోహం చూపుతున్న వారి ముసుగులు విప్పించే నిర్ణయం తీసుకోవాలి. మన రాజ్యానికి మనమే నాయకులం కావాలి. ఒక ఎజెండా మనసుల పెట్టుకొని.. దొరికిన జెండా పట్టుకొని వచ్చే ఆయారాం గయారాంలు ఉంటారు. వాళ్లు పోతే పోయిండ్రు. నిఖార్సైన కార్యకర్తగా నిలబడితే భవిష్యత్తు తరం మీదే.
-వర్ధెల్లి వెంకటేశ్వర్లు