Anasuya | యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో తాజాగా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సమాజంలో జరిగే ప్రతి విషయాన్నీ సినిమాలతో ముడిపెట్టడం సరైన విధానం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమా అనేది ప్రధానంగా ఒక కల్పిత కథ మాత్రమేనని, సమాజాన్ని మార్చడం లేదా ప్రజలకు విలువలు నేర్పించడం పూర్తిగా సినిమాల బాధ్యత కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు అనసూయ తన సోషల్ మీడియా ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ను పంచుకున్నారు. వ్యక్తులుగా మంచి, చెడులను గుర్తించే బాధ్యత ప్రతి ఒక్కరిపైనే ఉంటుందని పేర్కొన్న ఆమె, పిల్లలకు విలువలు నేర్పించే బాధ్యత కూడా సినిమాలది కాదని అభిప్రాయపడ్డారు. అయితే కథలు చెప్పే రచయితలు, దర్శకులు, నిర్మాతలు, నటులు తమ సృజనాత్మక బాధ్యతను పూర్తిగా విస్మరించకూడదని అన్నారు.
సినిమా ఎంతో శక్తివంతమైన మాధ్యమమని, అది ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయగలదని అనసూయ పేర్కొన్నారు. గతంలో హీరో, విలన్ పాత్రల మధ్య స్పష్టమైన తేడా ఉండేదని, ప్రేక్షకులు ఏది అనుసరించాలో, ఏది అనుసరించకూడదో సులభంగా అర్థం చేసుకునేవారని చెప్పారు. కానీ ప్రస్తుతం కథలు, పాత్రలు మరింత సంక్లిష్టంగా మారడంతో మంచి-చెడు మధ్య ఉన్న గీత కొన్నిసార్లు మసకబారుతోందని అభిప్రాయపడ్డారు. తాను ఇలాంటి అంశాల గురించి మాట్లాడినప్పుడల్లా సెన్సార్షిప్ లేదా మోరల్ పోలీసింగ్కు మద్దతు ఇవ్వడం కాదని అనసూయ స్పష్టం చేశారు. కథలను సృష్టించే ప్రతి ఒక్కరూ వాటి ప్రభావం గురించి అవగాహన కలిగి ఉండాలని మాత్రమే కోరుకుంటున్నానని తెలిపారు. ఇదే ఆలోచనతో గతంలో ఒక టెలివిజన్ షోను కూడా వదిలేశానని, తన అభిప్రాయాలు ఆ కార్యక్రమం సృజనాత్మకతకు అడ్డుగా మారుతున్నాయని భావించి ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
సృజనాత్మక స్వేచ్ఛ ఎంతో అవసరమని, అయితే ఆ స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ఉండాలనే అవగాహన సమాజంలో పెరగాలని అనసూయ అన్నారు. సినిమాలు సమాజానికి తల్లిదండ్రుల్లా మారాల్సిన అవసరం లేదని, అదే సమయంలో అవి ఎలాంటి ప్రభావం చూపవని కూడా అనుకోవద్దని పేర్కొన్నారు. సమాజంలో జరిగే ప్రతి చర్యకు సినిమానే కారణమని తాను నమ్మనని చెప్పిన అనసూయ, సోషల్ మీడియాలో ఇలాంటి అంశాలపై చర్చలు జరగడం, కథనాలను ప్రశ్నించడం, విమర్శనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం సానుకూల పరిణామమని అభిప్రాయపడ్డారు. అవసరమైనప్పుడు ప్రశ్నించడం సృజనాత్మకతపై దాడి కాదని, అది అవగాహన పెంచే ప్రక్రియ మాత్రమేనని ఆమె పేర్కొన్నారు.