Governor | తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిన ఘనత యువతది. అలాంటి యువతకు తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాలు చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అందులో భాగంగానే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో విద్యావ్యవస్థ బలోపేతమైందని ఘంటాపథంగా చెప్పవచ్చు. అణగారిన వర్గాలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు రాష్ట్ర సర్కారు కృత నిశ్చయంతో ముందుకుసాగుతున్నది. అయితే ఎన్నో ఏండ్లుగా విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది లేక ఉన్నత విద్య కుంటుపడుతున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో భర్తీ చేసిన నియామకాల్లో అనేక అవకతవకలు జరిగాయి. వాటిపై పలువురు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాని ఫలితంగా నాటి గవర్నర్, విశ్వ విద్యాలయాల ఛాన్స్లర్ అయిన ఈఎస్ఎల్ నర్సింహన్ సమగ్ర విచారణకు ఆదేశించారు. నియామకాల్లో అనేక అవినీతి అక్రమాలు జరిగాయని నివేదిక స్పష్టం చేసింది. దాని ఆధారంగా హైకోర్టు ఆదేశాల మేరకు కొంతమందిని సర్వీస్ నుంచి తొలగించడం కూడా జరిగింది. మరికొంత మందిపై అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. అయితే నియామకాల్లో గతంలో జరిగిన అక్రమాలు తిరిగి జరగకూడదన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగానే ప్రభుత్వం విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటుచేస్తూ చట్టం తీసుకువచ్చింది. ఈ బోర్డు ద్వారా ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని ప్రభుత్వం భావిస్తున్నది.
అయితే ఈ ఉమ్మడి నియామక బోర్డు చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేయాల్సి ఉన్నది. చట్టం తెచ్చి నెలలు గడుస్తున్నా గవర్నర్ ఆ చట్టానికి ఆమోదం తెలపకుండా రాజకీయం చేస్తూ నాన్చుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి చట్టాన్ని తీసుకువచ్చినా వాటిని ఆమోదించాల్సిన గురుతర బాధ్యత గవర్నర్పై ఉంటుంది. కానీ రాష్ట్ర గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ రాజకీయ కోణంలోనే బాధ్యతలు నిర్వర్తిస్తుండటం అత్యంత బాధాకరం. కేంద్ర ప్రభుత్వం ఎలా చెప్తే అలా గవర్నర్ నిర్ణయాలు తీసుకోవడమనేది రాజ్యాంగ విరుద్ధం.
రాష్ట్రంలో యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా 90 శాతం ఉద్యోగ అవకాశాలు స్థానికులకే లభించే అవకాశాలున్నాయి. దాని ఫలితంగా తెలంగాణలో చదువుకున్న, అర్హులైన విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉన్నది. ఫలితంగా బోధన, పరిశోధన రంగాలు మెరుగుపడే అవకాశాలున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వం విద్యావిధానంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిం ది. ముఖ్యంగా గురుకుల విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం ద్వారా అణగారిన వర్గాల విద్యార్థులు ప్రభుత్వ సాయాన్ని అందిపుచ్చుకొని రాణిస్తున్నారు. అనేకమంది డాక్టర్లుగా, ఇంజినీర్లుగా విశ్వమంతటా సేవలందిస్తున్నారు. మరోవైపు ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రపంచంలో మేటి అయిన విశ్వవిద్యాలయాల్లో చేరుతున్నారు. ఈ ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది.
అయితే ఉన్నత విద్యలో దూసుకుపోతున్న తెలంగాణ విద్యార్థులను కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. ఆ కుట్రలో చిక్కుకున్న రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసేవిధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు, గవర్నర్ నిర్ణయాలు తెలంగాణ విద్యార్థులకు శాపంగా మారాయి. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును సైతం ఆశ్రయించింది. రాజ్భవన్లో పెండింగ్లో ఉన్న బిల్లులపై వివరణ ఇవ్వాలని రాజ్భవన్ అధికారులను ఆదేశించినా వారినుంచి ఎలాంటి స్పందన లేదు. తద్వారా గవర్నర్ పదవిని అప్రతిష్ఠపాలు చేస్తున్నారని నిపుణులు అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ రంగాలను అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అభినందిస్తున్నాయి. కానీ రాష్ట్ర గవర్నర్ మాత్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహిరిస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. గవర్నర్ కుర్చీలో కూర్చొని రాజకీయాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తే సహించేది లేదని ఇటీవలే విద్యార్థి లోకం కన్నెర్ర చేసి రాజ్భవన్ ముట్టడికి యత్నించింది. అయినా గవర్నర్ వ్యవహారశైలిలో ఎలాంటి మార్పు రాలేదు. తెలంగాణ ప్రజలు అన్యాయాన్ని సహించరు. గవర్నర్ను అడ్డుపెట్టుకొని కేంద్రప్రభుత్వం కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకునే స్వభావం ఇక్కడి ప్రజానీకానికి లేదని ఢిల్లీ పెద్దలు గుర్తెరగాలి.
ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని ఉద్యమం ద్వారా స్వరాష్ట్రం సాధించిన ఘనత తెలంగాణ ప్రజలది. ఢిల్లీ పెద్దలపై దండయాత్ర చేయడం తెలంగాణ ప్రజానీకానికి కొత్తేం కాదు. తెలంగాణ ప్రజా సర్కారును ఇబ్బందుల పాలుచేయాలని చూస్త్తే కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సిద్ధమే అనే అంశాన్ని బీజేపీ పెద్దలు తెలుసుకోవాలి. రాజకీయ చదరంగంలో చిక్కుకున్న గవర్నర్ తమిళిసై ఇప్పటికైనా తమ రాజ్యాంగపరమైన అంశాలను అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగపరమైన పదవిలో ఉన్నప్పుడు రాజకీయాలు చేయకూడదని తెలియదుకావచ్చు. అందుకే రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని ప్రజల నుంచి చివాట్లు తింటున్నారు. ఇప్పటికైనా బీజేపీ ఆడే రాజకీయ చదరంగంలో గవర్నర్ బలికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే బిల్లులపై రాజముద్ర వేసి ఆమోదం తెలిపి విద్యార్థుల పక్షాన నిలవాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: రాజేశ్ నాయక్, పరిశోధక విద్యార్థి, ఉస్మానియా విశ్వవిద్యాలయం)